Authorization
Mon Jan 19, 2015 06:51 pm
తెలంగాణలో ఎరువుల కోసం రైతులు రోడ్డెక్కారు. రైతులకు ఎరువులను, విత్తనాలను ఇతర సబ్సిడీ పరికరాలను ప్రభుత్వం ప్రభుత్వ సహకార సంఘాల ద్వారా సరఫరా చేయడం ఆనవాయితీ. గత వారం పది రోజుల నుంచి రైతులు ప్రభుత్వ సహకార సంఘాల వద్ద యూరియా కోసం పడిగాపులు కాస్తున్నారు. నిజామాబాద్ జిల్లాలో ఒక సహకార సంఘం సరఫరా చేసిన యూరియా పూర్తిగా గడ్డకట్టి గట్టి రాయిలాగా మారడంతో దానిని మరో బలమైన బండరాతితో కొడుతున్న దృశ్యాలు పత్రికలలో కనిపించాయి. ఈ నెల 5న ఒక చోట రైతు క్యూలో నిలబడి స్పృహతప్పి చివరకు ప్రాణాలు కోల్పోయాడు. చాలా చోట్ల ఎరువుల కొరత ఉందని సంబంధిత సహకార సంఘాల అధికారులు చేతులు పైకెత్తేసి రైతులను వాపసు పంపిస్తున్న దృశ్యాలు ప్రతి రోజూ నిత్యకృత్యమయ్యాయి. ఒకరికోసం అందరూ... అందరికోసం ఒక్కరు... అనే సహకార లక్ష్యం ఎప్పుడో గాలికెళ్లిన విషయం గురించి వేరే చెప్పవలసిన పనిలేదు. ప్రజలకు బ్యాంకులంటే ఏమిటో తెలియని రోజుల్లోనే ప్రజల సంఘ జీవనాన్ని మెరుగుపరుచుకోవడం కోసం ఈ సహకార సంఘాలు ఆవిర్భవించాయి. బ్రిటీష్ ప్రభుత్వ హయాంలోనే 1905లో ఈ సంఘాల ప్రాధాన్యతను గుర్తించి మొట్టమొదటిసారి సహకార చట్టం ఏర్పడింది. స్వాతంత్య్రోద్యమకాలంలో సహకార సంఘాలు కూడా ఓ ఉద్యమస్థాయిలో అ భివృద్ధి చెందాలని మహాత్మాగాంధీ పిలుపునిచ్చారు. కానీ ఆచరణలో ఆ స్ఫూర్తిని అందరూ తుంగలోనే తొక్కారు. ప్రత్యేకించి నేడు తెలుగు రాష్ట్రాలలో ఈ సహకార సంఘాలు పక్కదోవ పట్టడం ఆందోళన కలిగించే పరిణామం. సహకార సంఘాల స్ఫూర్తిని పూర్తిస్థాయిలో ఆచరణలో పెట్టే నాయకులు నేడు లేనందున సహకార సంఘాలు స్వాహా సంఘాలుగా మారాయి. ఏడు సంవత్సరాలు గడుస్తున్నా సహకార సంఘాలకు ఎన్నికలు జరగకపోవడం చాలా బాధాకరం. ఇప్పుడైనా పాలకులు మేల్కొని సహకారసంఘాలకు వెంటనే ఎన్నికలు జరిపించి వీటిని రైతులకు సేవ చేసే నిఖార్సయిన సంఘాలుగా తీర్చి దిద్దాలి.
- తిప్పినేని రామదాసప్ప నాయుడు
సెల్ : 9989818212