Authorization
Mon Jan 19, 2015 06:51 pm
రాష్ట్రంలోని మీడియా సంస్థల్లో అత్యధిక భాగాన్ని తమ చెప్పుచేతుల్లో ఉంచుకుని ఆటాడిస్తున్న అధికార పార్టీ నాయకులకు ఇప్పుడో వింత అలవాటు వచ్చి పడింది. ఆ పార్టీకి చెందిన పలువురు ఎమ్మెల్యేలు ఇప్పుడు గోడ దూకేందుకు రెడీ అయ్యారనే వార్తలొస్తున్నాయి. టీఆర్ఎస్లో ఉంటే లాభమా..? లేక బీజేపీలోకి జంప్ చేస్తే ప్రయోజనమా..? అనే లెక్కలేసుకుంటున్నారు వాళ్లు. ఈ క్రమంలో ఎవరో ఒకరు ఎమ్మెల్యే బీజేపీకి చెందిన జాతీయ నాయకులను కలవటం, ఆ విషయం ఇటు సామాజిక మాధ్యమాల్లోనూ, అటు మీడియాలోనూ రావటంతో.. కేసీఆర్ వారిపై అగ్గిమీద గుగ్గిలమైపోతున్నారు. వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అలాంటి వారికి స్పెషల్గా ఫోన్ చేసి.. క్లాస్ పీకటం ఆనవాయితీగా మారింది. దీంతో మొదట గులాబీ పార్టీపై అసంతృప్తి వ్యక్తం చేస్తున్న ఎమ్మెల్యేలు.. క్లాస్ పీకిన తర్వాత... 'అబ్బే మేం పార్టీ మారే ఆలోచనే లేదు. కేసీఆరే మా బాస్. తూచ్.. మీడియాలో వచ్చినవన్నీ అవాస్తవాలు...' అంటూ నెపాన్ని సామాజిక మాధ్యమాల మీదికి, టీవీలు, పేపర్ల మీదికి నెట్టేస్తున్నారు. సెప్టెంబరు 17న బీజేపీ.. హైదరాబాద్లో పెద్ద సభ నిర్వహించబోతున్నది. ఈ నేపథ్యంలో ఇప్పుడు మీడియాను దోషిగా చూపెడుతున్న ఈ గులాబీ పులుల్లో.. ఎంతమంది ఆ రోజు బీజేపీకిలోకి చేరతారా? లేక నిజంగా కేసీఆర్ భక్తులుగా ఉంటారా? అనేది వేచి చూద్దాం.
-కెఎన్ హరి