Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అసెంబ్లీ మీడియా పాయింట్.. ఒకప్పుడు దీని ప్రత్యేకతే వేరు. మంత్రులు, ప్రధాన ప్రతిపక్ష నేతలు, విపక్ష సభ్యులూ ఇండిపెండెంట్లు.. ఇలా ఒక్కరేమిటి, సభలో మాట్లాడ్డాల్సిన అవకాశం రానప్పుడల్లా వీరందరూ మీడియా పాయింట్ ఉపయోగించుకునేవారు. ప్రజా సమస్యలను లేవనెత్తటం ద్వారా ప్రభుత్వంపై విమర్శనాస్త్రాలను ఎక్కుపెట్టేవారు. ఒక్కొక్కరు పదిహేను నిమిషాలకు తక్కువగాకుండా మీడియాతో మాట్లాడేవారు. దీంతో ఇటు విలేకర్లకు పెన్ను నిండా, అటు ఫొటో జర్నలిస్టులకూ, వీడియో జర్నలిస్టులకూ కెమెరాల నిండా పని. బ్రేకింగ్ న్యూస్లూ, షాకింగ్ న్యూస్లతో వారు చేసే హంగామా మామూలుగా ఉండేది కాదు. ఇది ఒకప్పటి చరిత్ర. తెలంగాణ వచ్చిన తర్వాత మీడియా పాయింట్.. అనేది నామమాత్రంగా మిగిలిపోయింది. అధికార పార్టీ పెద్దలు.. ప్రతిపక్ష ఎమ్మెల్యేలను లాగేసుకునేటప్పటికి ప్రధాన ప్రతిపక్షం సంఖ్య తగ్గి.. తన ప్రభను కోల్పోయింది. ఆ స్థానంలో ఉన్న ఎంఐఎం నేతలకు అసలు మీడియా పాయింట్వైపు వచ్చే ఆచారమే లేదు. వామపక్ష సభ్యులు కూడా సభలో లేకపోవటంతో ప్రజల గురించి మాట్లాడేవారు లేక మీడియా పాయింట్ వెలవెలబోతున్నది. దీంతో పాత్రికేయులూ, ఫొటో, వీడియో జర్నలిస్టులూ ఎవరన్నా.. వస్తే బాగుండు, ఏదైనా మాట్లాడితే బావుండు... అని ఎదురు చూపులు చూస్తుండటం పరిపాటిగా మారింది. -కెఎన్ హరి