Authorization
Mon Jan 19, 2015 06:51 pm
సామాజిక మాధ్యమాలు తొందరపడుతున్నాయి. ముఖ్యంగా ధవీకరించుకోని సమాచారాన్ని వాట్సప్ సందేశాలు శరవేగంగా ఎల్లెడలా వ్యాప్తి చేస్తున్నాయి. ముఖ్యంగా ప్రముఖులు, సెలబ్రిటీలకు సంబంధించి ఇలాంటి తప్పులు పలుమార్లు దొర్లుతున్నాయి. విషమ పరిస్థితుల్లో చికిత్స పొందుతున్న వారు చనిపోయినట్టుగా ప్రచారం చేస్తుండడం ఆయా వ్యక్తుల కుటుంబీకులకు ఇబ్బంది కలిగిస్తున్నాయి. తాజాగా చిత్తూరు మాజీ ఎంపీ ఎన్.శివప్రసాద్ తీవ్ర అనారోగ్యంతో చెన్నై ఆస్పత్రిలో చికిత్స పొందుతుండగా, ఆయన మరణించినట్టు శుక్రవారం వాట్సప్ సందేశాలు ఆయా గ్రూప్లకు షేర్ చేశారు. తీరా ఆయన పరిస్థితి విషమంగా ఉందని, ఇంకా మరణించలేదని వైద్యులు, కుటుంబ సభ్యులు మీడియాకు వివరణ యిచ్చుకోవాల్సిన పరిస్థితి నెలకొంది. గతంలోనూ తెలుగు సినిమా కమెడీయన్స్ ఎం.ఎస్.నారాయణ, ఏవీఎస్ లు చికిత్స పొందుతున్న సమయంలోనూ ఇలాంటి సందేశాలు వారి బంధువులను, అభిమానులను ఆందోళనకు గురి చేశాయి. కొన్నిసార్లు వాట్సప్ సందేశాలే నిజమనుకుని కొన్ని ప్రసార మాధ్యమాలు కూడా మరణించినట్టుగా ప్రసారం చేయడంతో చికిత్స సంగతి దేవుడెరుగు గాని ముందు మరణించలేదని చెప్పి వివరణ ఇచ్చుకోవాల్సి వస్తున్నది. వార్తకు విశ్వసనీయత ప్రాణం లాంటిది.
- ప్రియకుమార్