Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఫ్రాన్స్ దేశంలోని వివిధ రంగాల కార్మికులు జరుపుతున్న సమ్మె నేటికి 44వ రోజుకు చేరింది (డిసెంబ ర్ 5న సమ్మె ప్రారంభమయింది.)
సమ్మె ఎందుకు? మాక్రాం ప్రభుత్వం నూతన పెన్షన్ పథకాన్ని రూపొందించి 2019 డిసెంబర్ 25 నుంచి అమలు చేస్తామని ప్రకటించింది. నూతన పథకాన్ని అధ్యయనం చేసిన కార్మిక సంఘాలు ఇది కార్మికులకు తీవ్ర నష్టం చేస్తుందని ధృవీకరించుకొని తమ భిన్నాభిప్రాయాన్ని ప్రభుత్వానికి తెలియచేసి దాన్ని ఉపసంహరించుకోవాలని విజ్ఞప్తి చేశాయి. సహజంగానే ప్రభుత్వం కార్మిక సంఘాల విజ్ఞప్తులను తోసిపుచ్చింది. దాంతో కార్మిక సంఘాలు సెప్టెంబర్ 13న ఒక రోజు నిరసన సమ్మెకు పిలుపునిచ్చాయి. సమ్మె అద్వితీయంగా జరిగింది. ప్రభుత్వం ఇప్పటికైనా తన ప్రతిపాదనను ఉపసంహరించుకోవాలని లేనిచో నిరవధిక సమ్మెకు వెళ్లాల్సి వస్తుందని ప్రభుత్వాన్ని హెచ్చరించాయి. ప్రభుత్వం ఈ హెచ్చరికను సహితం పెడచెవిన పెట్టింది. చివరకు డిసెంబర్ 5 నుంచి నిరవధిక సమ్మె ప్రారంభించాలని కార్మిక సంఘాలు అక్టోబర్ నెలలో నిర్ణయించి ప్రభుత్వానికి తెలియజేసి బహిరంగంగా ప్రకటించి సమ్మె సన్నాహాలు ప్రారంభిచాయి. ఆ విధంగా సమస్య పరిష్కారానికి చేసిన అన్ని ప్రయత్నాలు, విజ్ఞప్తులు, నిరసనలు విఫలమైన తర్వాత కార్మిక సంఘాలు నిరవధిక సమ్మె ప్రారంభించాయి.
నూతన పెన్షన్ పథకంలో ఏముంది? ప్రధానంగా రిటైర్మెంట్ వయసు పెంచి పెన్షన్ మొత్తం తగ్గించడం ప్రధాన అంశం. ఫ్రాన్స్లోనే కాదు, మొత్తం యూరప్, యునైటెడ్ కింగ్డమ్ దేశాలలో ప్రతి ఒక్క కార్మికుడు పెన్షన్కి అర్హుడు. ప్రభుత్వ, ప్రయివేట్, సంఘటిత, అసంఘటిత రంగ కార్మికులు, ఉద్యోగులు చివరకు చిన్న చిన్న దుకాణాలు, హౌటల్స్లో పనిచేసేవారికి కూడా పెన్షన్ వర్తిస్తుంది. ఇందుకు ఉద్యోగి/ కార్మికుడి సంపాదనలో వారి సంపాదనను బట్టి కొంత మొత్తం పెన్షన్కి జమ అవుతుంది. యాజమాన్యాలు, ప్రభుత్వం కొంత మొత్తాన్ని జమ చేస్తాయి. ఆ విధంగా ప్రతి ఒక్కరికి పెన్షన్ వర్తించే పద్ధతి అమలులో ఉంది. అయితే సంస్కరణల నేపథ్యంలో, అనేక దేశాలు పెన్షన్లో కోతలకు రకరకాల మార్గాలు మొదలుపెట్టాయి. అందులో భాగంగానే ఫ్రాన్స్లో కూడా పెన్షన్ మీద దాడికి ప్రభుత్వం ఉపక్రమించింది. అయితే గతంలో కూడా ఫ్రాన్సులో ప్రభుత్వాలు ఇలాంటి ప్రయత్నాలు చేశాయి. కానీ కార్మిక సంఘాల దెబ్బకు తోక ముడిచాయి. కానీ కరుడుగట్టిన మాక్రాన్ ప్రభుత్వం మాత్రం మొండిగా అమలు జరపాల్సిందేనని భీష్మించుకు ంది. రిటైర్మెంట్ వయసు పెంచడం ద్వారా పెన్షన్కు కార్మికులు చెల్లించే కాలం, మొత్తం ఎక్కువ అవుతుంది. తిరిగి పెన్షన్ తగ్గుతుంది. ఒక దెబ్బకు రెండు పిట్టలు అన్న చందంగా ఫ్రాన్స్ ప్రభుత్వం ప్రతిపాదించింది. ఆ విధంగా ప్రస్తుతం ఫ్రాన్స్లో జరుగుతున్న సమ్మె కేవలం పెన్షన్ సమస్యగానే చూడకూడదు. ఇది సుసంస్కరణల పేరున కార్మిక, ప్రజలపై ప్రభుత్వాలు చేస్తున్న దాడికి వ్యతిరేకంగా జరుగుతున్నదిగా విశాల దక్పథంతో చూడాలి. ఇది కేవలం ఒకరంగంలో, ఒక ప్రాంతంలో జరుగుతున్న సమ్మె కాదు. రైల్వే, విమానయానరంగ ఉద్యోగులు, ఉపాధ్యాయులు, వైద్యరంగ ఉద్యోగులు, తదితర అన్ని రంగాల కార్మికులు ఉద్యోగులు దేశవ్యాపితంగా జరుపుతున్న సమ్మె.
సంఘీభావం : ప్రపంచ వ్యాపితంగా అనేక దేశాల కార్మిక, ఉద్యోగ సంఘాలు ఫ్రాన్స్ కార్మికుల సమ్మెకు సంఘీభావం ప్రకటించాయి. కొన్ని సంఘాలు నిధిని కూడా అందించాయి. ప్రపంచ కార్మిక సంఘాల సమాఖ (డబ్ల్యూఎఫ్టీయూ) ప్రత్యక్షంగా ఒక ప్రతినిధి బృందాన్ని నవంబర్ 26న పారిస్కు పంపింది. రష్యన్ కార్మిక సంఘం మాస్కో నగరంలోని ఫ్రాన్స్ రాయబార కార్యాలయం వద్ద నిరసన ప్రదర్శన చేసి సంఘీభావం ప్రకటించింది. అయితే ప్రపంచ వ్యాపితంగా ప్రభుత్వాలు ఒక్కటై కార్మికవర్గం మీద అన్ని వైపులా నుంచి దాడి చేస్తున్న నేటి పరిస్థితులలో సంఘీభావం ఇంకా పెద్ద ఎత్తున వ్యక్తం కావాల్సి ఉంది.
సమ్మె విచ్ఛిన్నానికి ప్రభుత్వం కుట్ర: సమస్య పరిష్కారం కంటే సమ్మె విచ్ఛిన్నానికే ప్రభుత్వాలు ప్రయత్నిస్తాయి. ఫ్రాన్స్ ప్రభుత్వం కూడా అలాంటి ప్రయత్నాలే చేసింది. పెద్ద ఎత్తున అరెస్టులు, భాష్ప వాయు గోళాల ప్రయోగం, కొన్ని చోట్ల భయంకర లాఠీచార్జి లాంటి తీవ్ర నిర్బంధాలకు ప్రభుత్వం ఒడిగట్టింది. అయినా కార్మికుకుల మనో ధైర్యం చెక్కు చెదరలేదు. పైగా కసి మరింతగా పెరిగింది. చివరకు ''చీలించి పాలించు'' అస్త్రాన్ని ప్రయోగించింది. అందుకు కూడా ప్రభుత్వం తానూ కొంత వెనక్కి తగ్గినట్టు నటించి కొన్ని తాయిలాలు ప్రకటించింది. 1975 తర్వాత పుట్టిన వారికి కొత్త పెన్షన్ వర్తించదని, రైల్వే కార్మికులు 1985 తర్వాత పుట్టిన వారికి వర్తించదని ప్రకటించింది. దీంతో ఆ తరగతుల వారు సమ్మెకు దూరం అవుతారని ఊహించింది. కానీ ''డామిట్ కథ అడ్డం తిరిగింది'' అన్న చందం అయింది. కార్మికులలో పట్టుదల మరింత పెరిగింది. ఉద్యోగం పోతుందనే భయంతో కొంతమంది అసంఘటితరంగ కార్మికులు సమ్మెలో పాల్గొనకపోయినా ఇతర కార్యక్రమాలలో పాల్గొంటున్నారు. కొందరైతే తమ నెల సంపాదన మొత్తం సమ్మె నిధికి విరాళంగా ఇస్తున్నారు. సమ్మెలో ఉన్న కార్మికులు రక్తదాన శిబిరాలు, పేదలకు అన్న దాన కార్యక్రమాలు లాంటి ప్రజాహిత కార్యక్రమాలు చేపట్టడం ప్రజలను సహితం ఆశ్చర్యచకితులను చేస్తున్నది. ప్రతి నిత్యం దేశవ్యాపితంగా అనేక నగరాలలో ప్రదర్శనలు, ధర్నాలు ఇంకా అనేక రూపాలలో కార్యక్రమాలు జరుగుతున్నాయి.
ఉధృతం కానున్న సమ్మె: ప్రభుత్వం ప్రకటించిన తాయిలాలతో ప్రయోజనం లేకపోగా సమ్మె రోజు రోజుకు కొత్త పుంతలు తొక్కడంతో దిక్కుతోచని ప్రభుత్వం వారం రోజుల క్రితం మరికొన్ని రాయితీలు ప్రకటించింది.ముఖ్యంగా రిటైర్మెంట్ వయసుకు సంబంధించి. దీంతో ఒకటి రెండు ప్రభుత్వ అనుకూల చిన్న సంఘాలు తమ సంతృప్తిని వ్యక్తం చేశాయి. ఈ పరిస్థితులలో ప్రధాన సంఘాలు జనవరి 16న పారిస్లో భారీ ప్రదర్శనకు పిలుపునిచ్చాయి. దీనికి అనూహ్యంగా కార్మికవర్గం తరలివచ్చింది. ఆ సభలో భవిష్యత్ కార్యాచరణకు సంబంధించి కార్మికుల అభిప్రాయాన్ని నాయకత్వాలు కోరాయి. ఇంతకాలం చేసిన త్యాగాలు బూడిదలో పోసిన పన్నీరు కానివ్వం-తాయిలాలకు లోంగే ప్రసక్తిలేదు-నూతన పెన్షన్ పథకం మొత్తంగా ఉపసంహరించుకోవాల్సిందే- సమ్మె కొనసాగాల్సిందేనని కార్మికవర్గం ముక్త కంఠంతో తీర్పు నిచ్చింది. అంతే కాదు నూతన తరగతులు తాము కూడా సమ్మెలోకి వస్తామని తెలియజేశాయి. చివరకు సమ్మె కొనసాగించాలనే నిర్ణయం జరిగింది. పోరాటం కొనసాగింపుగా ఈ నెల 22, 23, 24 తేదీలలో మళ్లీ భారీ ప్రదర్శనలు చేయాలని కూడా 16 నాటి సభ నిర్ణయించింది.
మొత్తంగా ఫ్రాన్స్ కార్మిక వర్గం చేస్తున్న సమ్మె పోరాటం ప్రపంచ కార్మిక వర్గ పోరాట చరిత్రలో ఒక ప్రధాన మైలు రాయి కానుంది. ఇప్పటికే ప్రభుత్వం కొన్ని తాయిలాలు కొంత మందికైనా ప్రకటించింది అంటే అది కార్మివర్గ పోరాట విజయమే. పైగా కార్మికవర్గాన్ని దేశవ్యాపితంగా ఇన్ని రోజులు ఐక్యంగా సమ్మెలో ఉంచడం, రోజు రోజుకి కార్మికులలో పట్టుదల, ప్రభుత్వంపై కసి పెరగడం కార్మికవర్గం సాధించిన విజయాలు. అంతేకాదు, ప్రపంచ వ్యాపితంగా సంస్కరణల పేరున ప్రజలు, కార్మికులపై దాడి చేస్తున్నా ప్రభుత్వాలకు కార్మికవర్గం తలవంచదు, తీవ్రంగా ప్రతిఘటిస్తుంది, ప్రపంచ కార్మికవర్గం మొత్తం పోరాడుతున్న కార్మికవర్గానికి అండగా ఉంటుంది అని ఫ్రాన్స్ కార్మికుల సమ్మె రుజువు చేస్తున్నది.
- ఆర్.లక్ష్మయ్య
సెల్: : 9971511954