Authorization
Mon Jan 19, 2015 06:51 pm
కరోనా వైరస్ ఇప్పుడు ప్రపంచాన్ని భయపెడుతున్నది. కరోనా వైరస్ చైనాలోని ఉహాన్ నగరంలో పుట్టింది. ఈ వైరస్ అన్ని చోట్లకు పాకుతుడటంతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. ఈ వైరస్ను అడ్డుకోవడానికి అన్ని చర్యలు తీసుకుంటున్నారు. మొదట ఈ వైరస్ ఎలా పుట్టిందనే విషయం గురించి తెలుసుకునే ప్రయత్నాల్లో అనేక సంచలన విషయాలు బయటపడ్డాయి.
క్రైట్, కోబ్రా ఈ రెండూ విషపూరితమైన సర్పాలు. ఇవి ఎక్కువగా చైనాలో కనిపిస్తుంటాయి. ఈ పాములు కరవడం వలన లేదంటే, వాటిని తినడం వలన వైరస్ సోకి ఉండొచ్చని అంటున్నారు. ఈ వైరస్ సోకిన 28 రోజుల్లోగా మనిషి మరణిస్తాడు. ప్రస్తుతం దీనిపై పరిశోధనలు జరుగుతున్నాయి. దీనిని ఎదుర్కోవడానికి యాంటీ యాక్షన్ మెడిసిన్ తయారు చేసే పనిలో నిమగమైపోయింది చైనా. దీంతో చాలా ప్రాంతాల్లో ప్రజారవాణాను నిలిపివేసింది చైనా ప్రభుత్వం. చైనాలోని ఉహాన్ నగరంలో తొలిసారి గుర్తించిన కరోనా వైరస్ వేగంగా వ్యాప్తి చెందుతూ ప్రపంచ దేశాలను కలవరానికి గురిచేస్తోంది. ఉహాన్లో డిసెంబరు చివరి వారంలో తొలి కేసు నమోదు కాగా, ఇప్పటి వరకు సుమారు 200 మంది ఈ వైరస్ కారణంగా ప్రాణాలు కోల్పోయారు. మరో రెండువేల మందికి వైరస్ సోకినట్టు చైనా ప్రకటించింది. కొత్తగా పుట్టుకొచ్చిన 'కరోనా' వైరస్ ప్రాణాంతకంగా మారుతోంది. ఇది శ్వాసవ్యవస్థపై పంజా విసిరి ప్రాణాలను హరిస్తోంది. ప్రస్తుతం చైనాలో విజృంభిస్తున్న కరోనా వైరస్పై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. ప్రపంచంలోని అనేక దేశాల్లో ప్రాణాంతక వైరస్ విజృంభించి, మన దేశంలోనూ వ్యాప్తి చెందే ప్రమాదమున్న దృష్ట్యా ముందస్తుగా వ్యాధి పట్ల అవగాహన కలిగి ఉండి, జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యులు వెల్లడిస్తున్నారు. భారత దేశంలోని పలు విమానాశ్రయాల్లో 9,156 మంది ప్రయాణికులను పరీక్షించగా ఒకరికి కరోనా వైరస్ సోకినట్టుగా నిర్ధారణ అయ్యింది. ఆ విద్యార్థిని వైద్యుల పర్య వేక్షణలో ఉంచారు. జలుబు, దగ్గు, జ్వరం, శ్వాస తీసుకోవడంతో ఇబ్బందులుంటే వైద్యపరీక్షలు చేయించుకోవాలని వైద్యాధికారులు సూచించారు. మరోవైపు కరోనా వైరస్ కారణంగా ప్రపంచ దేశాలు అప్రమత్తమయ్యాయి. చైనా ముఖ్యంగా ఉహాన్ నుంచి తమ దేశానికి వస్తున్న పర్యాటకులకు అమెరికా, ఆస్ట్రేలియా, జపాన్, దక్షిణకొరియా దేశాలు విమానాశ్రయాల్లోనే హెల్త్ చెకప్లు చేస్తున్నారు. భారత్ కూడా ముందస్తు చర్యలు చేపట్టింది. చైనా నుంచి వచ్చే ప్రయాణికుల కోసం ఢిల్లీలోని ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో థర్మల్ స్క్రీనింగ్ సదుపాయాన్ని ఏర్పాటు చేసింది. ప్రపంచ ఆరోగ్య సంస్థ కూడా అప్రమత్తమై ఈ వైరస్పై అత్యవసరంగా సమావేశమైంది. చైనాతోపాటు జపాన్, కొరియా, థాయ్ లాండ్, అమెరికా దేశాల్లో కొత్త రకం 'కరోనా వైరస్' సోకడం వల్ల మరికొంత మంది మరణించడంతో ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ) అత్యవసర కమిటీ సమావేశమై ఆ దేశాల్లో నెలకొన్న పరిస్థితులపై సమీక్షించింది. అత్యంత ప్రమాదకరమైన ఈ వైరస్ నాలుగు దేశాలకు పాకిందని అందిన సమాచారంతో ప్రపంచవ్యాప్తంగా హెల్త్ ఎమర్జెన్సీ విధించాలనే విషయంపై ప్రపంచ ఆరోగ్య సంస్థ అత్యవసర కమిటీ సభ్యులు చర్చించారు.
కరోనా వైరస్ను 1937లో గుర్తించారు. ఈ వైరస్ ఎక్కువగా కోళ్లు, చుంచు ఎలుకలు, ఎలుకలు, కుక్కలు, పిల్లులు, గుర్రాలు, పందులు, ఆవులు, గేదెలు, ఒంటెలు, గబ్బిళాల ఊపిరితిత్తుల వ్యాధులకు కారణమవుతోంది. కొన్ని రకాల కరోనా వైరస్లు మానవుల్లో కూడా సాధారణ జలుబు, ఫ్లూ ఫీవర్ వంటి స్వల్ప కాలిక వ్యాధులకు కారణమవుతున్నాయని 1960లో గుర్తించారు. కాలక్రమేణా ఈ వైరస్ల్లో ఉత్పరివర్తనలు జరిగి మనిషికి ప్రాణాంతక వైరస్లుగా మారాయని వైద్య పరిశోధకులు భావిస్తున్నారు. ఇప్పటివరకు ఆరు రకాల హ్యూమన్ కరోనా వైరస్లను గుర్తించారు. వీటినే 229 ఈ-ఆల్ఫాకరోనా వైరస్, ఓసీ 43, బీటా కరోనా వైరస్, హెచ్కేయూ 1 బీటా కరోనా వైరస్, సార్స్ కరోనా వైరస్, మెర్స్ కరోనా వైరస్, నోవెల్ కరోనా వైరస్లుగా పేర్కొంటున్నారు. ప్రస్తుతం చైనాలోని ఉహన్ నగరంలో విజృంభిస్తున్న వైరస్ను నోవెల్ కరోనా వైరస్గా గుర్తించారు.
లాటిన్ భాషలో కరోనా అంటే క్రౌన్ అని అర్ధం. క్రౌన్ లేదా, హేలో ఆకారం లో వైరస్ ఉండటం వల్ల దీనికి ఆపేరు పెట్టారు. ఈవైరస్ మానవుల్లో ఊర్ధ్వ శ్వాస కోశ వ్యాధులకు (అప్పర్ రెస్పిరేటరీ ట్రాక్ట్), జీర్ణాశయ వ్యాధులకు కారణమవుతోం ది. ఈ వైరస్ సోకిన వారిలో జలుబు (రన్నింగ్ నోస్), గొంతు నొప్పి, జ్వరం వంటి లక్షణాలు ఉంటాయి. శీతాకాలంలో, వేసవి ప్రారంభంలో ఎక్కువగా ఈ వైరస్ ప్రబలుతోంది. కొందరిలో బ్యాక్టీరియల్ బ్రాంకైటీస్, న్యూమోనియాకు ఈ వైరస్ కారణమై ప్రాణాంతకమవుతోంది. 2003లో ప్రపంచ వ్యాప్తంగా అలజడి సృష్టించిన ఈ వైరస్ బారిన 8,098 మంది పడగా అందులో 774 మంది మృ తిచెందినట్టు ప్రపంచ ఆరోగ్య సంస్థ గణాంకాలు వెల్లడిస్తున్నాయి. 2012 సౌదీ అరేబియాలో, మళ్లీ 2013లో సౌదీ అరేబియాలో 124 మందికి వైరస్ సోకి వారిలో 52 మంది మృతిచెందినట్టు గుర్తించారు. 2014లో అమెరికాలో, 2015లో కొరియాలో వ్యాధిని గుర్తించారు. 2019 డిసెంబరు వరకు ప్రపంచవ్యాప్తంగా 2,468 కేసులు నమోదు కాగా, వారిలో 851 మంది మరణించినట్టు అధికారులు తెలిపారు.
- వాసిలి సురేష్
సెల్ : 9494615360