Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అతనికి ఆస్థి వారసత్వంగా వచ్చింది... అంతస్తు తండ్రితో వచ్చింది... చదువు శ్రమతో వచ్చింది.... మార్పు మార్క్సిజంతో వచ్చింది... త్యాగం ఆచరణతో వచ్చింది. అందుకే ఆయన విలువల మాగాణంలో మొక్కై మొలుస్తూనే ఉంటాడు..! పచ్చదనాన్ని లోకమంతా పంచడానికి ఎర్రని స్ఫూర్తిగా ప్రవహిస్తూనే ఉంటాడు.
ఆస్థిని హారతి కర్పూరంలా కరిగించి బీదరికాన్ని పూల మాలలా ధరించిన వాడు... సముద్రమంత నిండుదనంతో ఉద్యమ ప్రవాహమై సాగినవాడు.. ఊరును ఉద్యమం చేసి, ఊరి పేరునే ఇంటిపేరుగా మలుచుకున్నవాడు... అతడే గబ్బెట గోపాల్రెడ్డిగా మారిన గంగసాని గోపాల్ రెడ్డి.
జనగామ తాలూకాలోని గబ్బెట గ్రామానికి చెందిన గంగసాని రాంచంద్రారెడ్డి, రంగమ్మ గార్లకు 1910 సెప్టెంబర్ 7న గోపాల్రెడ్డి జన్మించాడు. నలుగురు సంతానంలో చివరివాడు. తోబుట్టువులు గంగాసాని మంగారెడ్డి, వెంకట నర్సమ్మ మరియు వెంకట రామమ్మ. మంగారెడ్డి ఆంధ్రమహాసభలో చురుకైన కార్యకర్త. జమిందారీ కుటుంబం కావడం వల్ల బాలశిక్ష వరకు చదువు వీరి గడీలోనే సాగింది. 3వ తరగతి నుండి 7వ తరగతి వరకు నల్గొండ పట్టణంలో (1917 నుండి 1921వరకు ఉర్దూ మీడియం), 8వ తరగతి నుండి 10వ తరగతి వరకు హైదరాబాద్ సిటీ కాలేజీలో (1921 నుండి 25 వరకు), ఇంటర్మీడియట్ నిజాం కాలేజీలో (1926 నుండి 1928 వరకు ఇంగ్లీష్ మీడియం) చదివాడు.
ఆనాటి పరిస్థితుల్లో తెలంగాణ ప్రాంతమంతా నిజాం నిరంకుశత్వానికి వ్యతిరేకంగా ఆంధ్రమహాసభ కార్య క్రమాలు జరుగుతున్న కాలం. అప్పటికే వీరి అన్నగారైన గాంగసాని మంగారెడ్డి ఆంధ్రమహాసభలో చురుకైన కార్యకర్త కావడంవల్ల అతని సహా చర్యంతో దేశభక్తి, త్యాగనిరతి చిన్ననాడే అలవడ్డాయి. ఆ భావజాల ప్రభావం ఒక పక్క.. నిజాం కాలేజీలో చదువుతున్నప్పుడు ఆంధ్ర మహాసభ కార్యక్రమాల్లో పాల్గొన్న ప్రత్యక్ష అనుభవం మరో పక్క ... గోపాల్రెడ్డిని నిత్య చైతన్యశీలిగా మలిచాయి. రాజ్యం ప్రమాదకరవ్యక్తిగా భావించి, అరెస్టు చేసి నల్గొండ జైలులో ఆరు నెలలు బంధించింది. విడుదలకాగానే వార్థా వెళ్లి గాంధీని కలిసి అతని పిలుపులో భాగంగా సత్యాగ్రహంలో పాల్గొన్నాడు. ఆర్యసమాజం, ఆపై కాంగ్రెస్ కార్యకర్తగా సత్యాగ్రహాలతో నైజాంను కూలదోయ వచ్చన్న ఆలోచనే తన జీవన తాత్విక పునాదిగా చేసుకున్నాడు. భువనగిరిలో సత్యాగ్రహం చేస్తున్నప్పుడు అరెస్టు చేసి ఒక సంవత్సరం రాజమండ్రి జైలుకు పంపారు.
అనంతరం బెనారస్ యూనివర్సిటీలో చదువుకోవడానికి అవకాశమొచ్చింది. పోయింది చదువుకోవడానికైనా, మనసంతా ఉద్యమం పైనే! అక్కడ విద్యార్థులుగా ఉన్న చండ్ర రాజేశ్వరరావు మరియు నండూరి ప్రసాదరావు సహచర్యంలో సమాజాన్ని అర్థం చేసుకొనే విధానం మారింది.. మార్క్సిజం చూపునిచ్చింది.. కమ్యూనిజం బలమునిచ్చింది.
యూనివర్సిటీ చదువు అయిపోయే సమయానికి ఉద్యమ సాహిత్యం మొత్తం కాన్పూర్ నుండి వచ్చేది. రెడ్డిహాస్టల్లో ఉన్నప్పుడు రావి నారాయణరెడ్డి, ఆరుట్ల రామచంద్రారెడ్డి, బద్దం ఎల్లారెడ్డి లాంటి వారు హాస్టల్ బోర్డర్స్గా ఉండేవారు. వారంతా కాంగ్రెస్ తరపున జైలుకి పోయివచ్చినవారే. వీరందరికీ కాన్పూర్ నుండి వచ్చే ఉర్దూ, మార్క్సిస్టు సాహిత్యాన్ని తెలుగులోకి తర్జుమా చేసి అందించేవాడు గోపాల్రెడ్డి. ఉర్దూ మీడియంలో చదవడంవల్ల సాహిత్యాన్ని తెలుగులోకి మార్చి అందించడానికి అవకాశమొచ్చింది. అదే సమయంలోనే హైదరాబాద్ కమ్యూనిస్టు సిటీ కమిటీ ఏర్పడింది. దానికి మొదటి నుండి సాహిత్యపరంగా అడుగడుగునా సహకరించింది గోపాల్రెడ్డే.
1938 జూలైలో హైదరాబాద్ స్టేట్కాంగ్రెస్ నిర్మాణ ప్రకటన వచ్చింది. ఆంధ్రమహాసభ, మహారాష్ట్రపరిషత్ మరియు కర్ణాటక పరిషత్ మూడు కలిపి ఒకటిగా ఏర్పడ్డాయి. ఆ నిర్ణయంలో భాగంగా నైజాం పాలనను వ్యతిరేకిస్తూ శాంతియుత పద్ధతిలో ఆందోళన చేస్తుందని ప్రకటించింది. వెంటనే సెప్టెంబర్ 7న స్టేట్ కాంగ్రెస్ను నిషేధిస్తూ నైజాం ప్రభుత్వం ఉత్తర్వులు వెలువరించింది. దానికి వ్యతిరేకంగా సత్యాగ్రహాలు చేయాలని నిర్ణయించింది. ప్రధమ సత్యాగ్రహ దళం ఊరేగింపుగా కోఠి వైపు వెళ్లి అరెస్ట్ అయితే, స్వామి రామానందతీర్థ నాయకత్వంలో రెండవ దళం సత్యాగ్రహం చేసి అరెస్టయింది. రెండవ దళంలో అరెస్ట్ కాబడ్డ నాయకులలో గోపాల్రెడ్డి ఒకరు. అప్పుడాయన మరోసారి జైలుకెళ్లాల్సివచ్చింది.
1938 నుండి 42వరకు ఆంధ్రమహాసభ జనగామ తాలూకా అధ్యక్షుడిగా ఉన్నారు. జోగిపేట్లో జరిగిన ప్రథమాంధ్ర మహాసభకు వెల్లినప్పటి నుండి కమ్యూనిస్టుగా పరిణామం చెందే వరకు ప్రతీ సామాజిక దశలో కీలకంగా వ్యవహరించారు. పదవ ఆంధ్రమహాసభలో అనేకులకు మితవాదులతో బేధాభిప్రాయాలు ఏర్పడ్డాయి. మితవాదులు భూస్వామ్య వ్యతిరేక కార్యక్రమాలను అంగీకరించక పోవడంతో ఆంధ్ర మహాసభ చీలికకు దారితీసింది. 11వ ఆంధ్రమహాసభ భువనగిరిలో జరిపినప్పుడు రెండు పక్షాలుగా చీలిపోయి రెండు మహాసభలు జరుపుకొన్నారు. అప్పుడు మితవాదులకు వ్యతిరేకంగా మహాసభ జరిపిన కీలక నాయకుల్లో రావి నారాయణరెడ్డి, బద్దం ఎల్లారెడ్డి, దేవులపల్లి వెంకటేశ్వరరావు, ఆరుట్ల సోదరులతో పాటు గబ్బెట గోపాల్రెడ్డి ఒకరు. మితవాదులకు వ్యతిరేకంగా ఆంధ్రమహాసభలో జరిగిన అంతర్గత పోరాటంలో గోపాల్రెడ్డి ప్రతి మూల మలుపులో కీలకంగా వ్యవహరించారు.
వ్యక్తిగత సత్యాగ్రహాలతో సమాజం మారదని, నిజాం నిరంకుశత్వాన్ని కూలదోయాలంటే ప్రజా ఉద్యమాలు నిర్మించాలన్న పార్టీ పిలుపులో సాయుధ పోరుకు ఆయుధమెత్తాడు గోపాల్రెడ్డి. జనగామ తాలూకాలో లేవిగల్లాకు వ్యతిరేకంగా రైతాంగాన్ని పోరాటబాట పట్టించాడు. ఆ చైతన్యమే కాలానుగుణంగా సాయుధపోరాట రూపం తీసుకోవడానికి కారణమయ్యింది. తెలంగాణలో దళాల నిర్మాణం మొదలైంది... ఉద్యమం తీవ్రమైంది.. విచ్చుకత్తులపై నిలబడి కమ్యూనిస్టు రాజ్యంకై కలగనడమేకాదు.. ఆ కల కోసం ఎంతమంది తమ నెత్తురు ధారపోసారో! ఆ నెత్తుటి ధారల్లో విప్లవదారులు నిర్మించిన వ్యక్తి గబ్బెట గోపాల్రెడ్డి.
గోపాల్రెడ్డిది సంపన్న కుటుంబం. ఇంటినిండా నౌకర్లు.. పొలాల్లో పని చేయడానికి జీతగాల్లు.. 20వేల ఎకరాల భూములు.. అందరు దొరల్లాగే దర్జాగా బతుకొచ్చు... కానీ దండు కట్టిందెందుకు..? దళమై నడిచిందెందుకు..?! ఎందుకంటే ఆయన కమ్యూనిస్టు గనుక. తన కుటుంబం.. తన అన్న కుటుంబం... అందరూ ఎర్రజెండాలను భుజాల కెత్తుకున్నారు.. మరోప్రపంచాన్ని కలగన్నారు.. కదనమై గెలిచారు!! కమ్యూనిస్టులై నిలిచారు..!
గోపాల్రెడ్డి భార్య ఆండాలమ్మ ఆయుధ సేకరణ, కీలక నాయకుల డెన్ల ఏర్పాటులో ఉంటే, గోపాల్రెడ్డి అన్న మంగారెడ్డి గ్రామ నాయకుడుగా, అతని కొడుకులైన తిరుమల రెడ్డి చీఫ్ దళకమాండర్గా, మోహన్రెడ్డి దళకమాండర్గా, సత్యపాల్రెడ్డి కొరియర్గా బాధ్యతలు నిర్వర్తించారు. నేటికీ జానపదులు గానం చేసే తిరుమలరెడ్డి అమరత్వం ఒక వీరోచిత గాధ. ఆరోగ్యం క్షీణించి జొన్న చేలల్లో షెల్టర్ తీసుకుంటుంటే 300 మంది కంపెనీ సైన్యం చుట్టుముట్టింది. వారిపై కాల్పులు జరుపుదామంటే సైన్యం తమ ముందు రైతులను నిలబెట్టుకొని చుట్టుముట్టింది. కాల్పులు జరిపితే రైతులు చనిపోతారు. ఏమీ చేయలేని పరిస్థితి. ఆయుధం శత్రువు చేతికి చిక్కకూడదని భావించి చేతిలోని రైఫిల్ను కనిపించని దూరాలకు విసిరేసి వీరుడై నిలబడ్డాడు. సైన్యం అతన్ని పట్టుకొని తల గొరిగించి గ్రామాలు తిప్పుతూ జనం కండ్ల నీళ్లు పెట్టుకుంటుండగా చెట్టుకు కట్టేసి కాల్చి చంపింది. నేటికీ జానపద గాథల్లో తిరుమలరెడ్డి అమరత్వం పాటల ప్రవాహమై మ్రోగుతూనే ఉంది.
''బెబ్బులి రూపుకాడా- నర బెబ్బులీ వైతివా
గబ్బెట యందు జన్మనొంది..
ఘనకార్యం లెన్నియో చేసి
గొబ్బున దేశ ద్రోహులను
కొంచెం యంచక రూపు మాపి
వీరుడై నిలిచిన ఓహౌ యోధుడా !
తిరుమలా జోహారులివిగో..! ఇలా జానపదుల పాటల్లోనే కాదు జనం గుండెల్లో కూడా ఆయన చిరంజీవిగా నిలిచాడు. అందుకే వీరి కుటుంబాన్ని తలచుకున్నప్పుడల్లా రోమాంచితమవుతాము.
సాయుధపోరాటం ఉదృతంగా సాగుతున్న దశలో పార్టీ కేంద్రం విజయవాడలో ఉండేది. ఇక్కడి సాయుధదళాలకు పార్టీ కేంద్రానికి సమన్వయం చేయగల సమర్ధుడి కోసం పార్టీ వెతుకుతున్నప్పుడు అందరూ ఏకగ్రీవంగా ఎన్నుకొన్న నేత కామ్రేడ్ గబ్బెట గోపాల్రెడ్డి.
అక్కడున్నప్పుడు ప్రజాశక్తి ఎడిటోరియల్ బోర్డు సభ్యుడిగా కూడా పని చేసాడు. అక్కడే అరెస్ట్ కాబడి మూడేళ్లు కల్లూరు జైల్లో నిర్బంధంలో ఉన్నాడు. 1952 ఎన్నికల తర్వాత విడుదలయ్యాడు. అతని జీవితకాలంలో మొత్తం పద్నాలుగేళ్లు అజ్ఞాతవాసం, ఆరుసార్లు అరెస్టయి, ఐదున్నర సంవత్సరాలు జైలు జీవితం గడిపాడు.
పోరాట విరమణ తరువాత 1957 ఎన్నికల్లో జనగామ శాసనసభ్యుడిగా గెలిచి తనదైన ముద్రవేశాడు. కులపరమైన అంతరాలు దరి చేరకుండా నిరంతర అప్రమత్తంగా వర్గపోరాటాన్ని ముందుకు తీసుకొని పోవడంలో గోపాల్రెడ్డి పాత్ర అమోఘం. 1962లో కూడా నిలబడి ఓడిపోయినా, మూడవసారి 1967లో సీపీఐ అభ్యర్థిగా పోటీ చేసినపుడు, అతనికి పోటీగా సీపీఐ(ఎం) తరపున ఏసిరెడ్డి నరసింహారెడ్డి నిలబడ్డాడు. ఈ ఎన్నికలు జరిగినప్పుడు కలిగిన ఒక అనుభవం పార్టీలో పనిచేసే వారికి సిద్ధాంత ప్రాముఖ్యత గురించి తెలియజేస్తుంది. వారిద్దరు తండ్రీ కొడుకులే.. నివసించే ఇల్లు ఒకటే.. కానీ ఆచరణలో సిద్ధాంతం ఇద్దరినీ వేరు వేరు పార్టీల్లో ఉంచింది. ఒకే ఇంటి నుండి ఇద్దరు బయలుదేరి ఎవరి పార్టీ ఆఫీస్కు వారెళ్లేవారు. తండ్రి గోపాల్రెడ్డి అయితే కొడుకు రఘుపాల్. రఘుపాల్ సీపీఐ(ఎం) తరుపున నిలబడ్డ ఏసిరెడ్డి నరసింహరెడ్డి తరుపున ప్రచారం చేశాడు... ఎలక్షన్ ఏజెంట్గా పనిచేశాడు. ఆ సమయంలో కాంగ్రెస్ తరుపున కాసం నారాయణ గెలిచినా, చర్చ జరిగింది మాత్రం తండ్రీ కొడుకులు నడిచిన దారులు... వ్యక్తిగత బంధాలు..! సిద్ధాంత సంభదాల గురించే..! రఘుపాల్ తరువాత కాలంలో సీపీఐ(ఎం) హైదరాబాద్ నగర కార్యదర్శిగా కూడా కొనసాగాడంటే... అది అభిప్రాయాలకు విలువనిచ్చే గోపాల్రెడ్డి గొప్పదనం. దారులు వేరైనా భావాలను గౌరవించగలిగిన విశాలత్వం గోపాల్రెడ్డిది.
గోపాల్రెడ్డికి నలుగురు పిల్లలు. రఘుపాల్, మనోహర్, రవీందర్, సంపత్, అమ్మాయిలు హేమలత, ప్రేమలత. వీరిలో రఘుపాల్ సీపీఐ(ఎం) పార్టీలో ప్రత్యక్ష రాజకీయాల్లో ఉంటే మిగిలినవారంతా సానుభూతి పరులుగా ఉన్నారు. ఆండాలమ్మ పోరాట కాలం నుండి ప్రత్యక్ష రాజకీయాల్లో ఉండి ఒకసారి గ్రామ సర్పంచ్గా పనిచేశారు. మహిళా నాయకురాలిగా చివరికంటా తన సేవలనందించారు.
ఈ వ్యాసం రాయడానికి నేను కలిసిన వ్యక్తులు, నేను చదివిన పుస్తకాల తర్వాత, అంత చరిత్ర కలిగిన గోపాల్రెడ్డి గురించి పుస్తకాల్లో దొరికిన సమాచారం మూడంటే మూడు వాక్యాలు. నిజాంకు వ్యతిరేకంగా సాగిన పోరాటంలో ఎంత మంది త్యాగం చరిత్రకెక్కక అనామకులుగా మిగిలిపోయారో కదా?! ప్రజలే చరిత్ర నిర్మాతలని మార్క్స్ అన్నది ఎంత సత్యమో..! ఈ భూమిపై సాగిన అనేకానేక మార్పులలో ఒక్కొక్క అడుగై సాగి.. అనేక మార్పులకు కారణమైన ఎంత మంది త్యాగ ఫలితమో ఈ ప్రపంచ గమనమంతా..! రాజులైనా, ప్రజలైనా అందరినీ సమంగా చూసేది అందరూ నడయాడే మట్టే. ఇంత చరిత్ర కలిగిన ఇతనికే ఇంత కష్టమైతే ఎంతమంది జీవిత చరిత్రలను మనం వెలికి తీయాల్సి ఉందో కదా?! అందరినీ కలిసి వెనుదిరిగి వస్తుంటే... 1967 డిశెంబర్ 20న కన్నుమూసిన గోపాల్రెడ్డి పోరాటానికి చిరునామాగా ఎదురుగా నిలిచాడు. అతనికి ఆస్థి వారసత్వంగా వచ్చింది... అంతస్తు తండ్రితో వచ్చింది... చదువు శ్రమతో వచ్చింది.... మార్పు మార్క్సిజంతో వచ్చింది... త్యాగం ఆచరణతో వచ్చింది. అందుకే ఆయన విలువల మాగాణంలో మొక్కై మొలుస్తూనే ఉంటాడు..! పచ్చదనాన్ని లోకమంతా పంచడానికి ఎర్రని స్ఫూర్తిగా ప్రవహిస్తూనే ఉంటాడు.
స్ఫూర్తి
సెల్ : 9490098694