Authorization
Mon Jan 19, 2015 06:51 pm
మనిషి చేసిన ప్రకృతి విధ్వంసం వల్ల కావచ్చు. మానవ తప్పిదాల వల్ల కావచ్చు. కరోనా వైరస్ నేడు ప్రపంచాన్ని వణికిస్తుంది. కొన్ని దేశాల్లో తక్కువ స్థాయిలో కావచ్చు, మరికొన్ని దేశాల్లో ఎక్కువ స్థాయిలో ఉండొచ్చు కాని ఇది ప్రపంచ స్థాయి విపత్తై కూర్చుంది. చైనాలో ప్రారంభమై యారోపు ఖండంలో విస్తరించి, అగ్రరాజ్యం అమెరికాను భయపెడుతూ 200 దేశాల్లో దీని ఉధృతి కొనసాగుతుంది. ఏ ఖండం, ఏ వ్యవస్థ, ఏమతం, ఏ జాతిని వదిలిపెట్టకుండా మరణ మృదంగం మోగిస్తుంది. ఆలస్యంగానైనా సరే ప్రభుత్వాలు మేల్కొని దీని కట్టడికి ఏకీభావం ప్రదర్శిస్తున్నాయి. దీన్ని గురించి వాస్తవావస్తవాలు రాయబడుతున్నా ఎవరి వ్యక్తిగత విశ్వాసాలు, మత విశ్వాసాలు వారికున్నా కలిసికట్టుగా ఎదుర్కోకుంటే మానవజాతి ఘోరమైన మూల్యాన్ని చెల్లించాల్సి ఉంటుంది. ఇప్పటికే ప్రపంచయుద్ధాలు, వాతావరణ కాలుష్యం, తీవ్రవాదం, ప్రకృతి వైపరీత్యాలతో లక్షల ఏండ్లుగా నిర్మించుకున్న మానవ నాగరికత కొన్ని వందలేండ్లలో జీవరాశుల ఆనవాలు కూడా లేనిదిగా మారుతుందని శాస్త్రవేత్తలు హెచ్చరించారు. ఇలాంటి ఉపద్రవాలను సరైన సమయంలో, సరైన రీతిలో ఎదుర్కోకుంటే ఆ ప్రమాదం మరింత ముందుకు జరిగే అవకాశముంది.
అనేక ఆవిష్కరణలతో జీవితాన్ని సుఖమయం చేసుకోవడమే కాకుండా సృష్టికి ప్రతిసృష్టి చేయగల స్థాయికెదిగిన మనిషి ఇలాంటి ఉపద్రవాలనెదుర్కోవడంలో సంయమనం పాటించాలి. విభిన్న సంస్కృతులు, విభిన్న జాతులు, భిన్నమతాలు, విభిన్న అభిప్రాయాలున్న ప్రపంచంలో ఆయా విషయాల జోలికి పోవద్దు. ప్రపంచమెంత విభిన్నంగా ఉన్నా మానవజాతిని కలిపి ఉంచేది మానవత్వం, మనిషితనం అనే సాధారణీకరణ అభిప్రాయంతో ముందుకెళ్తే ఇలాంటి సమస్యలకు పరిష్కారం లభిస్తుంది. అది సైన్సు ద్వారా మాత్రమే సాధ్యమవుతుందని అర్థమవుతుంది. సైన్సుకు కానీ, ప్రకృతి సంబంధమైన విషయాలకు కానీ, కరోనా లాంటి వైరస్లకు కానీ, కుల, మత, జాతి, దేశ, భాష, ఖండ భేదాలు లేవని అర్థం చేసుకుంటే వైరస్లు రాకుండా చూసుకోవచ్చు. వచ్చినా సమర్థవంతంగా ఎదుర్కొని మానవజాతిని రక్షించుకోవచ్చు. సైన్సుతో పొందిన సత్ఫలితాలను మానవజాతంతా అనుభవిస్తుంది. సైన్సును మానవజాతి పురోగమనానికి, మనిషిని కాపాడే ప్రకృతి రక్షణకు మాత్రమే ఉపయోగించు కుంటే విధ్వంసాలకు చోటుండదు. కరోనా వైరస్ విధ్వంసం ఈ జ్ఞానాన్ని ప్రపంచమంతటికీ అందజేసి కండ్లు తెరిపిస్తుందనడంలో సందేహం లేదు.
కరోనా వైరస్ గాలితో వ్యాపించే అంటువ్యాధి కాదు. పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవడం, చేతులు అనేకసార్లు సబ్బుతో కడుక్కోవడం, మనుషుల మధ్య దూరాన్ని పాటించడం, మనుషులుగా గుంపులుగా ఉండకపోవడం, నోటికి ముక్కుకు అడ్డంగా మాస్క్ లేదా బట్టకట్టుకోవడం, తుమ్ము దగ్గులు రాకుండా చూసుకోవడం, అవి వచ్చినప్పుడు నోరు, మూతికి అడ్డంగా బట్టపెట్టుకోవడం, డాక్టర్లను సంప్రదించడం లాంటి పనులతో దీని వ్యాప్తిని అరికట్టవచ్చు. వైరస్ను ఒంటరిని చేయడం, వ్యాపించడానికి చోటులేకుండా చేయడం ద్వారా కొన్ని రోజుల్లో ఇది నశిస్తుంది. ఇది సైన్సు, ఏ మంత్రాలకూ, మాయలకూ ప్రార్థనలకూ, నమ్మకాలకూ అది లోంగదు.
మనిషిని మనిషి కాంటాక్టు నుంచి దూరం చేయడం ద్వారా ఇలాంటి వైరస్ను నిర్మూలించవచ్చన్న వైజ్ఞానిక ఆచరణను అమలు చేయడానికే భారత ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వాలు, కొన్ని ప్రపంచదేశాలు సరిహద్దులను మూసి వేసాయి. జాతీయ, అంతర్జాతీయ, రాష్ట్ర ప్రయాణాలను కూడా ఆపివేసాయి. ఎవరి ఇండ్లలో వాళ్లు ఉండాలని శాసించాయి. మనిషిని మనిషి కలువకూడదని శాసనాలు చేసాయి. అత్యవసరమైతేనే, నిత్యావసర వస్తువుల కోసం, వైద్యుని కోసం మాత్రమే బయటకెళ్ళాలని నిబంధనలు విధించాయి. ప్రతిమనిషి భౌతిక, సామాజిక దూరాలు పాటించాలని నెత్తీనోరు కొట్టుకొని చెబుతున్నారు. పోలీసులు, నర్సులు, డాక్టర్లు, వీధులూడ్చేవాళ్లు, స్వచ్ఛంద కార్యకర్తలు ప్రాణాలకు తెగించి సేవలు చేస్తున్నారు. అన్నార్తులకు అన్నమందిస్తూ కొందరు తమ దాతృత్వాన్ని చాలుకుంటున్నారు. కఠిన హృదయాలు కలవారు కూడా కరిగి ఆపత్సమయంలో ఆర్థిక సాయం చేస్తున్నారు.
సామాజిక దృక్పథంలేని సామాజిక కారుల మధ్య వైరుధ్యాలు అలాగే ఉన్నాయి. ఈ రెండింటి మధ్య సమన్వయం లేకపోవడం వల్లనే పరస్పర విమర్శలు, అవాస్తవాలు ప్రచారంలో కొస్తున్నాయి. దీనికితోడు వివిధ మతాల వారి మధ్య శాస్త్రీయ, సామాజిక దృక్పథలోపం సమన్వయ కఠినతరం చేస్తున్నాయి. ఏదేమైనా దేశాలు, సరిహద్దులు, మతాలకతీతంగా ఎలాంటి సందర్భంలోనైనా సరే మానవజాతి భౌతిక, సామాజిక దూరాన్ని కొంతకాలం పాటిస్తే తప్ప ఈ మహమ్మారిబారి నుంచి తప్పించుకోవడం సాధ్యంకాదు. సంఘజీవియైన మనిషికి ఇది కష్టతరమైనందే కావచ్చు. కానీ తాత్కాలిక కష్టం శాశ్వత సుఖాన్నిస్తుంది. కొందరు భావిస్తున్నట్టు ఈ సామాజిక దూరం, శ్వేతజాతి నీగ్రోలను, భారతజాతి అతిశూద్రులను టచ్మీ నాట్గా ఉంచిన తరహా సామాజిక దురన్యాయం కాదు. మానవజాతి సామాజిక దూరం యొక్క తీవ్రతను, ఆనాటి సామాజిక దురన్యాయాన్ని అర్థం చేసుకొని పశ్చాత్తాప పడటానికి ఈ సామాజిక దూరం సంఘటన ఉపయోగపడుతుంది. మానవజాతంతా ఈ తాత్కాలిక భౌతిక, సామాజిక దూరాన్ని నేటి వైజ్ఞానికావసరంగా భావించి పాటిస్తే కరోనా వైరస్ను జయించవచ్చు.
డాక్టర్ కాలువమల్లయ్య
సెల్: 9182918567