Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఇంట్లో ఉండలేం, బయటికెళ్లలేం..పైసా సంపాదన లేదు, కానీ ఖర్చుమాత్రం రోజురోజుకీ పెరిగిపోతున్నది.. కావాల్సినంత సమయం దొరికింది, కానీ ఒక్క గంట కూడా ఎంజారు లేదు.. దోస్తులు, చుట్టాలు, పక్కాలు జాన్తానై.. ప్రయాణాలు, షికార్లు, గికార్లు అస్సల్లేనే లేవు. లాక్డౌన్ విధించిన నాటి నుంచి నిన్న మొన్నటి వరకూ అందరి మనసుల్లోనూ గూడుకట్టుకున్న ఆందోళనలివి. రెండు నెలలకు మించి కాలు కదపకుండా.. తినటం, తొంగోటం, లేవటమనే రీతిలో ఒక్కొక్కరూ 'యమబోర్ ఫీలింగ్'ను అనుభవించారు. ఇంతటి విపత్కర సమయంలోనూ అధునాతన సాంకేతిక పరిజ్ఞానం ఎంతోకొంత వారికి ఉపశమనాన్ని కలిగించిదంటున్నారు హైదరాబాద్కు చెందిన ఓ మానసిక విశ్లేషకులు. ఇప్పుడు ప్రతి ఇంట్లోనూ కలర్ టీవీలున్నాయి. లాక్డౌన్ పుణ్యమా అని జీడిపాకం లాంటి ధారవాహికల(సీరియల్స్)కు తెరపడ్డా.. సీనియర్ ఎన్టీఆర్ నుంచి జూనియర్ ఎన్టీఆర్ వరకూ అందరి హీరోల పాత, కొత్త సినిమాలు ప్రసారమవుతున్నాయి. దీంతో ఇండ్లలో నుంచే పనిచేస్తున్న (వర్క్ ఫ్రమ్ హోమ్) మహిళా ఉద్యోగులు మొదలు సాధారణ గృహిణుల వరకూ వాటిని చూస్తూ కాలక్షేపం చేశారు. ఇకపోతే ఇప్పుడు అందరి చేతుల్లోనూ స్మార్ట్ ఫోన్లున్నాయి. వాటిలో వాట్సాప్, ట్విట్టర్, యూట్యూబ్.. ఇలా అన్ని రకాల ఫీచర్లనూ మనం వాడుకోవచ్చు. కరోనా వల్ల ఇండ్లకే పరిమితమైన పురుషులకు.. వీటి పుణ్యమాని బోలెడంత టైం పాసయింది. వీరేకాదు.. మూడేండ్ల బుడతలు ఫోన్లో గేమ్స్ ఆడితే.. డెబ్బయి ఏండ్ల తాతలు చాగంటి వారి ప్రవచనాలు, అందమే ఆనందమనే ఆపాత మధురాలను ఆస్వాదిస్తూ లాక్డౌన్ కాలాన్ని గడిపేశారని చెప్పుకొచ్చారు సదరు మానసికవేత్త. ఇదంతా బాగానే ఉన్నా.. స్మార్ట్ ఫోన్, టీవీ కొనుక్కునే సామర్థ్యం లేని, రెక్కాడితేగానీ డొక్కాడని పేదలు, బీదా బిక్కీ మాత్రం.. లాక్డౌన్ కాలంలో బిక్కుబిక్కుమంటూ గడిపారన్నది నగ సత్యం.
-బి.వి.యన్.పద్మరాజు