Authorization
Mon Jan 19, 2015 06:51 pm
కోవిడ్ నేపథ్యంలో మనం ప్రజల జీవనోపాధి, వ్యవసాj ురంగం గురించి పరిశీలిద్దాం. మనం మొదటిసారి లాక్డౌన్ ప్రకటించినప్పుడు రాబోయే పరిస్థితులపై మనకు ఒక ఆలోచన కానీ, ఒక అంచనా కానీ లేవు. ప్రత్యేకించి మార్చి 26, ఏప్రిల్ 30 మధ్య ఏమి జరిగిందనే దానిపై ఎవరికీ ఒక అంచనా లేదు. మే 1 నుండి మాత్రమే ప్రభుత్వాలు అధికారికంగా కొంత స్పష్టంగా జోక్యం చేసుకున్నాయి. అనేక జిల్లాల్లో స్థానిక జిల్లా అధికార యంత్రాంగం అనధికారికంగా అక్కడి ఎన్జిఓలూ, పౌర సంఘాలు మొదలైన వాటితో కలిసి సహాయ కార్యక్రమాలు నిర్వహించాయి. కేరళ దీనికి మినహాయింపుగా ఉంది. కేరళ ప్రభుత్వం లాక్డౌన్ కంటే ముందు నుంచే అప్రమత్తంగా ఉంటూ వచ్చింది. మే 1 నుంచి మాత్రమే మనకు బస్సులు, రైళ్ళకు సంబంధించిన వివరాలు తెలిశాయి. మార్చి 31న కేంద్ర హోం సెక్రటరీ ఇచ్చిన ప్రకటనలో మార్చి 31న 11 గంటల నుంచి ఎవరూ రోడ్లపై లేరని చెప్పారు. దీనినే సుప్రీంకోర్టులో సొలిపిటర్ జనరల్ తిరిగి చెప్తూ తాను రాష్ట్రాలకు ఆదేశాలు ఇస్తూ ఎవరూ రోడ్లపై ఉండరాదని చెప్పానని చెప్పారు. ఎవరైనా రోడ్లపై ఉంటే వారిని అందుబాటులో ఉన్న ఆశ్రయాలకు పంపుతున్నామని చెప్పారు. ఏప్రిల్ 12 నాటికి ఆశ్రయాలలో వున్న వారిలో 69శాతం మంది కేరళలోనే ఉన్నారు. కానీ మార్చి 31న కేంద్ర ప్రభుత్వం కోర్టులో అధికారికంగానే రోడ్లపై ఎవరూ లేరని చెప్పింది. దీనికి 12 రోజుల తరువాత వెలువరించిన ఒక అఫిడవిట్లో ఒక మిలియన్ కంటే ఎక్కువ మంది ప్రజలు రిలీఫ్ క్యాంపులలో వున్నారనీ, వారిని సర్దుబాటు చేసేందుకు ప్రయత్నిస్తున్నామనీ ఒకటిన్నర కోట్లకు పైగా ప్రజలు దేశవ్యాప్తంగా ఆహార క్యాంపులకు ఆకలితో వస్తున్నారని తెలిపారు. 12 రోజుల క్రితం ఇదే హోం సెక్రెటరీ, ఇదే సొలిపిటర్ జనరల్ రోడ్లపై ఎవరూలేరని చెప్పడం విడ్డూరంగా ఉంది. వీరు చెప్పిన మాటలు గిన్నిస్ బుక్లో నమోదు చేయాల్సిన విధంగా ఉన్నాయి. కాబట్టి మనకు నిజంగా సరైన అంచనా లేదు. ఏప్రిల్ నెలలో ప్రజలు పెద్దఎత్తున ప్రవాహాలుగా కదిలారు. తరువాత మే 28న ప్రభుత్వం చెప్పిన లెక్కల ప్రకారం మే 1న శ్రామిక్ రైళ్ళు మొదలైన తరువాత 9.1 మిలియన్ల మంది ప్రజలు ప్రయాణం చేశారని తేల్చారు. కానీ, మార్చి 28 నుంచి ఏప్రిల్ 30 మధ్యలో ఏదోవిధంగా తమ ఇండ్లకు చేరుకునేందుకు రోడ్లపై ప్రజలు అనేకమంది నడిచారనే విషయంపై ఎవరికీ అంచనా లేదు.
దేశంలో అతి ముఖ్యమైన, పురాతనమైన నాగ్పూర్ రైల్వే జంక్షన్ నుంచి అపరిమితమైన సంఖ్యలో ప్రజలు ఉత్తరాదివైపు తరలి వెళ్ళారు. ఈ నాగ్పూర్ ద్వారా అనేక రాష్ట్రాలకు తరలివెళ్ళిన జనసందోహాన్ని చూస్తే ఆశ్చర్యం కలుగుతుంది. ఇక్కడి నుంచి ఉత్తరాది రాష్ట్రాలైన మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్, బీహార్, ఛత్తీస్ఘడ్లకే కాక తూర్పున వున్న ఒరిస్సా, బెంగాల్లకు పెద్ద సంఖ్యలో ప్రజలు రోడ్లపై నడిచారు. అదే సమయంలో బొంబాయిలో కూడా విదర్భ నుంచి వెళ్ళేవారు, విదర్భకు వచ్చే వారు పెద్దసంఖ్యలో కదిలారు. ఒక్క చంద్రపూర్ జిల్లాకే తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ల నుంచి 37వేల మంది ప్రజలు తిరిగి వచ్చారు. అదే విధంగా గోందియా జిల్లాకు చెన్నై లాంటి ప్రాంతాల నుంచి ప్రజలు 17, 18 రోజుల పాటు నడిచి వచ్చారు. ఇది ఎందుకు చెప్తున్నానంటే మనకు నిజంగా ప్రజల కదలికలపై అంచనా లేదు. లాక్డౌన్ ప్రకటించినప్పటి నుంచి ఈ లాక్డౌన్ మొత్తం కాలంలో ప్రజల కదలికలపై ఏ మాత్రం అంచనా లేదు. వీరు వారి, వారి గ్రామాలకు వెళ్ళే ప్రయత్నం చేశారు. కానీ ఎంతమంది క్షేమంగా వారి ఊళ్ళకు చేరుకున్నారు. చాలా గ్రామాల సరిహద్దుల వద్ద గ్రామస్థులు కంచెలు వేశారు. ఎందుకంటే వచ్చే వారికి వైరస్ ఉందేమోనని వారు భయపడ్డారు. దీనిపై కూడా మనకు అంచనా లేదు. ఇలాంటి వారు కూడా లక్షల్లో ఉంటారు. ఇటువంటి వారు తమ గ్రామాల బయట 45డిగ్రీల విపరీతమైన ఎండలో ఆరు బయట గడిపారు. వీరు తమ గ్రామాల బయట తమను గ్రామస్థులు ఎప్పుడులోనికి రానిస్తారా అని ఎదురు చూస్తున్నారు. క్వారంటైన్ సమయం 14రోజులు ఉంటుందో లేక 28రోజులు ఉంటుందో ఎవరికీ తెలియదు. కాబట్టి ఈ పరిస్థితుల్లో కోవిడ్ మృతుల కంటే కోవిడ్ కాని సమస్యలతోనే ఎక్కువమంది చనిపోతారని నేను నిర్మలాసీతారామన్ ప్యాకేజి ప్రకటించిన వెంటనే చెప్పాను.
ఏప్రిల్ నెలలో మిరపతోటలలో పనిచేస్తున్న మోరియా ఆదివాసీ తెగలకు చెందిన జమలో అనే బాలిక తెలంగాణ నుంచి తన స్వస్థలమైన ఛత్తీస్ఘడ్కు మూడు రోజుల పాటు 140కిలో మీటర్లు నడిచింది. ఇది చాలా ఆశ్చర్యం కలిగిస్తుంది. నేను ఒక మంచి వాకర్ని అని నేననుకుంటున్నాను. కానీ నేను ఎప్పుడూ అంతదూరం నడిచే కల కూడా కానలేదు. కానీ ఆ బాలిక మూడు రోజులలో 140కిలో మీటర్లు నడిచింది. ఇంకొక 60కిలోమీటర్లు నడిస్తే తన ఇంటికి చేరి తన తల్లిదండ్రులను కలిసేది. కానీ తీవ్రమైన నిస్సత్తువతో అలసటతో ఆమె చనిపోయింది. ఆమె ఇంకొంత మంది కూలీలతో కలిసి పని కోసం వలస వచ్చింది. ఆమె తల్లిదండ్రులు ఆమెతో తెలంగాణకు వెళ్ళలేదు.
మే 17న హోం మంత్రిత్వశాఖ అన్ని రాష్ట్రాలకూ, కేంద్ర పాలిత ప్రాంతాలకూ కొన్ని ఆదేశాలు జారీ చేసింది. ఆ ఆదేశాల ప్రకారం అత్యవసర సర్వీసులకు సంబంధించిన వారు మినహా ఎవ్వరూ రాత్రి 7గంటల నుంచి ఉదయం 7గంటల వరకూ బయట కనిపించరాదని కర్ఫ్యూ ప్రకటించారు. హైవేలపైన నడుస్తున్న ప్రజలు మాత్రం అత్యవసరమైన విషయంగా వారికి కనిపించలేదు. దీనిద్వారా హైవేలపైనున్న లక్షల మంది ప్రజలకు ఈ నిబంధనలు వర్తింపచేశారు. దీనితో మే 17 నుండి ప్రజలు తీవ్రమైన వేసవి కాలంలో వేడి ఎక్కువగా ఉండే సమయంలో ఉదయం 7గంటల నుంచి రాత్రి 7గంటల వరకూ నడిచారు. నిర్ధాక్షిణ్యమైన ఇటువంటి ధోరణి ఏ స్థాయిలో ఉందో దీనిద్వారా మనకు తెలుస్తోంది. మనం తెలుసుకోవలసిన ఇంకొక విషయమేమిటంటే ముంబయి మహానగరాన్ని లక్షలాదిమంది విడిచి వెళ్ళడమనేది ఇది మొదటిసారి కాదు. 1896-1897 మధ్య కాలంలో మనం బైబానిక్ ప్లేగ్ వ్యాధిని చూశాం. అప్పుడు 50శాతం జనాభా నగరాన్ని విడిచి వెళ్ళారు. అప్పుడు ఆ నగర జనాభా 8.5లక్షలు కాగా, 4లక్షల మంది నగరం విడిచి వెళ్ళారు. వారిలో చాలామంది మిల్లు కార్మికులు. 1896-2014 మధ్య కాలంలో ఈ బైబానిక్ ఫ్లేగ్ వలన 8మిలియన్ల మంది చనిపోయారు. నగరం విడిచి వెళ్ళిన వారిలో కొంతమంది తిరిగి వచ్చారు. అది వేరే విషయం. రోగాలకు దూరంగా, నగరాలకు దూరంగా ప్రజలు తరలి వెళ్ళడనేది క్రొత్త విషయం కాదు.
నగరాల నుంచి ప్రజలు తరలివెళ్ళడం ఇది మొదటిసారి కూడా కాదు. ఇది చరిత్రలో ఒక భాగమని మనం గుర్తించాలి. దేశంలో గతంలో కూడా పెద్దఎత్తున ప్రజలు నగరాల నుంచి గ్రామాలకూ, గ్రామాల నుంచి వేరే గ్రామాలకూ వెళ్ళడం జరిగింది. మన దేశంలో వలస విధానం ఎలా ఉంది, వలసల పరిస్థితి ఎలా ఉంది అని తెలుసుకోవడం కోసమే నేను ఇది చెప్తున్నాను. భారతదేశంలో జనాభా పట్టిక అనేది (సెన్సెస్) మన దేశానికీ, మన సమాజానికీ సంబంధించిన ఒక అద్భుతమైన సమాచార గని లాంటిది. కానీ దేశంలోని వలసలను లెక్కించడంలో అది చాలా వెనుకబడింది. జనగణనలో వలసలను సరిగా గుర్తించడంలేదు. ఉదాహరణకు ఒక వ్యక్తి 'ఎ' అనే నగరం నుంచి 'బి' అనే నగరానికి వచ్చాడనుకోండి, ఆ 'బి' అనే నగరంలో ఆ వ్యక్తి కనీసం 6నెలలు అంతకంటే ఎక్కువ కాలం నివసిస్తేనే అతనిని వలస వచ్చిన వ్యక్తిగా జనాభా పట్టికలో నమోదు చేస్తారు. నయా ఉదారవాద సంస్కరణల ఫలితంగా విపరీతంగా పెరిగిపోయిన ఇటువంటి వలస కార్మికులు లెక్కలోనికి రావడం లేదు. వీరిని లెక్కించడం కూడా కష్టమే. కొంతమంది వారిని యదేచ్ఛగా సంచరించే కార్మికులు (ఫుట్లూజ్ కార్మికులు) అని పిలుస్తారు. వారికి ఒక స్పష్టమైన గమ్యం ఉండదు. వారు ఎక్కడ ఎన్ని రోజులు ఉంటారో వారికే స్పష్టత ఉండదు. ఒక్కోసారి ఒక్కో దగ్గర 3 లేక 4 నెలలు మాత్రమే ఉంటారు. ఉదాహరణకు కలహండి ఇటుక బట్టీలలో వారికి 40రోజుల పని దొరకవచ్చు. టూరిస్టు సీజన్లో రారుపూర్ లాంటి చోట్ల 20రోజుల పాటు రిక్షా తొక్కే పని దొరకవచ్చు. వారికి పని దొరకవచ్చు, దొరకకపోవచ్చు. అది అక్కడి కాంట్రాక్టర్ దయాదాక్షిణ్యాలపై ఆధారపడి ఉంటుంది. నిర్మాణ రంగంలో కూడా ఎప్పుడు పనులు ఉంటాయో ఎప్పుడు ఉండవో స్పష్టత ఉండదు. కొన్నిచోట్ల లాక్డౌన్కు 2, 3రోజుల ముందు కొంతమందిని నిర్మాణ పనులకు నియమించారు. వారి పరిస్థితి ఇప్పుడు ఎలా ఉందో చెప్పలేం. మీడియాకు మాత్రం వలస కార్మికులపై ఎప్పుడూ శ్రద్ధ లేదు. కానీ మేము మా పీపుల్స్ ఆర్కైవ్ ఆఫ్ రూరల్ ఇండియా (పారీ) అనే మా జర్నలిజం వెబ్సైట్లో మాత్రం సంవత్సరంలో 365రోజులూ వలసలు, వలస కార్మికులకు సంబంధించిన కధనాలు పెడుతుంటాం. గ్రామీణ భారతంపై కథనాలకు అందులో ఎక్కువ భాగం కేటాయిస్తుంటాం. అది రూరల్ ఇండియా ఆన్లైన్ డాట్ ఒఆర్జి అనే లింకు ద్వారా చూడవచ్చు.
వలస జీవులపై ఎన్నడూ దృష్టి పెట్టని మీడియా ఇప్పుడు అకస్మాత్తుగా ఒక కరెస్పాండెంట్ను ఈ వలసల కోసం కేటాయించడం మొదలుపెట్టింది. పట్టణ ప్రాంతాలలో ఈ వలస కార్మికుల సేవలు నిలిచిపోవడంతో మార్చి 28కి అకస్మాత్తుగా ఒక స్తబ్దత పరిస్థితి వచ్చింది. దీనితో మీడియా ఈ వలస కార్మికులను గుర్తించడం, వారితో సంభాషించడం, వారి పరిస్థితుల గురించి తెలుసుకోవడం మొదలు పెట్టారు. వారు ఎక్కువగా చేసింది వారి ఫొటోలు తీయడం, వారి గురించి కొంత రాయడం మాత్రమే చేయగలిగారు. అసలు వీరు ఎవరు వీరి పరిస్థితి ఎందుకిలా తయారయింది అనే విషయాలు స్వల్పంగానే రాశారు. మీడియా వాళ్ళు ఎక్కువమంది వేసిన ప్రశ్నలు ఏమిటంటే వీరు ఎందుకు వెనక్కి వెళ్ళిపోతున్నారు. వీళ్ళు తిరిగి వస్తారా రారా? అనేవి చాలా తక్కువమంది మాత్రమే అసలు ఇంతకుముందు మీరు మీ ఊళ్ళను వదిలి ఎందుకొచ్చారు అని అడిగారు. ఇదే అసలు సమస్య. మనం గత 28, 29ఏండ్ల నుంచి అనుసరిస్తున్న ఆర్థిక విధానాల ఫలితమే ఇదంతా. 2011 జనాభా లెక్కలను పరిశీలిస్తే గత 30ఏండ్లలో రికార్డు స్థాయిలో వలసలు పెరిగాయని మనకు అర్థువుతుంది. మనం 1991 నుంచి 2011 వరకూ మధ్య కాలంలో చూస్తే 15మిలియన్ల మంది రైతులు వలసలు వెళ్ళారు. వ్యవసాయరంగం క్షీణించ డంతో ఆ రంగంలో ఉన్న రైతులు రోజుకు 2000మంది చొప్పున వలస వెళ్ళడం జరిగింది. వలసలు పెద్ద ఎత్తున జరిగాయి. అవి గ్రామాల నుంచి పట్టణా లకూ, గ్రామాల నుంచీ గ్రామాలకూ, పట్టణాల నుంచి పట్టణాలకూ, అతి తక్కువ స్థాయిలో పట్టణాల నుంచి గ్రామాలకూ వలసలు జరిగాయి. అంతర్ రాష్ట్ర వలసలు కూడా పెరిగాయి. 2011 జనాభా లెక్కల ప్రకారం అంతర్ రాష్ట్ర వలసలు 54 మిలియన్లు. ప్రభుత్వ లెక్కల ప్రకారం దేశంలోని మొత్తం వలసల సంఖ్య 454 మిలియన్లు. కానీ వీరిలో చాలామంది అంతర్ రాష్ట్ర వలసలు కాదు. వీరిలో ఇతర జిల్లాలకు వెళ్ళిన వారూ, వివాహం వలన ఇతర చోట్లకు వెళ్ళిన మహిళలూ అలాంటి వారు ఎక్కువ మంది ఉన్నారు. కానీ 1991 నుంచీ వ్యాపార ఉపాధి అవకాశాల కోసం క్రొత్త ప్రాంతాలకు తరలివెళ్ళిన అంతర్ రాష్ట్ర వలస కార్మికుల సంఖ్య విపరీతంగా పెరిగింది. కాబట్టి 2011 వచ్చేసరికి పెద్దఎత్తున వలసలు జరిగాయి. వలసలకు సంబంధించిన పూర్తి సమాచారం ఇంకా మనకు రావలసి ఉంది. కానీ మిలియన్ల కొద్దీ వలసలు మన దేశంలో జరిగాయనేది తెలుస్తోంది.
వీరిలో చాలామంది వ్యవసాయరంగం క్షీణించడంతో నిరాశ చెంది వలసలు వెళ్ళిన వారే వున్నారు. 3,15,000 మంది రైతులు ఆత్మహత్యలకు పాల్పడ్డారు. ఇవి నా లెక్కలు కాదు. ప్రభుత్వ లెక్కలే. ఇప్పుడు మనందరం దృష్టి పెట్టిన ఇంకొక విషయం పట్టణాల నుంచి గ్రామాలకు జరుగుతున్న ఈ అపసవ్య వలసలు. పట్టణాలలో నివసిస్తున్న వారు వెనుకకు తిరిగి వెళ్ళిపోతున్నారు. అభ్యుదయ రాజకీయ భావాలు గల మనం ఇది ఎందుకు జరుగుతుందో ఆలోచించాలి. ఇది ఒక ముఖ్యమైన అంశం. 20ఏండ్ల క్రితం గ్రామాలలో తుడిచి పెట్టుకుపోయిన ఉపాధి అవకాశాలను వెతుక్కుంటూ ఇప్పుడు ఈ వలస స్త్రీ, పురుషులు ఆయా గ్రామాలకు తిరిగి వెళ్తున్నారు. ఉదారవాద విధానాల ద్వారా మనం ఆ అవకాశాలనన్నింటినీ తుడిచి పెట్టేశాం. రెండవ విషయం ఈ వలసలతో ఇప్పుడు అక్కడ వున్న భూములపై వ్యవసాయంపై తీవ్రమైన ఒత్తిడి పెరుగుతుంది. మూడవ విషయం 2008 నుంచీ వున్న వాల్స్ట్రీట్ సంక్షోభంతో అమెరికా తదితర దేశాల నుంచి వస్త్ర పరిశ్రమలకు వచ్చే లక్షలాది ఆర్డర్లు అన్నీ రద్దయిపోయాయి. గుజరాత్లో అతిపెద్ద ఉత్పత్తి జరిపే పవర్ లూమ్ సెక్టార్ మూతపడింది. దీనితో సూరత్లో వున్న లక్షమంది ఒరిస్సా వలసలకు ఉపాధి కరువైంది. ఒరిస్సా, సూరత్ రాష్ట్రాల మధ్య వలసల ప్రయాణ రద్దీ చాలా తీవ్రంగా ఉంటుంది. దీనికోసం అక్కడ బారక్పూర్ ఎక్స్ప్రెస్ అనే రైలు కూడా ఉంది. బారక్పూర్ నుంచి సూరత్కూ, బారక్పూర్ నుంచి అహ్మదాబాద్కూ నడిచే రైళ్ళలో ఎక్కువగా వలస కార్మికులే ఉంటారు. ఎందుకంటే ఒరిస్సా నుంచిసూరత్కూ, అహ్మదాబాద్కూ చాలామంది వెళ్ళి పనిచేస్తుంటారు. ఈ పవర్లూమ్ పరిశ్రమలు మూతపడిన వెంటనే వేలాది మంది తమ గ్రామాలకు తిరిగి వచ్చారు. ఈ విధంగా ఒరిస్సాలోని గంజామ్ జిల్లాకు 40,000 మంది తిరిగి వచ్చారు. దీనితో అక్కడ అనేక సమస్యలు వచ్చాయి. అనేక ఆస్తి తగాదాలు వచ్చాయి. గతంలో ఒక ఇంట్లో తండ్రీ, పెద్ద కొడుకు పొలం పనులు చూసుకుంటూ ఉంటే మిగిలిన ముగ్గురు నలుగురు అన్నదమ్ములు సూరత్కు కానీ, అహ్మదాబాద్కు కానీ వెళ్ళి అక్కడ టెక్స్టైల్ మిల్లులలోనూ, వజ్రాలూ, నగల కంపెనీలలోనూ పని చేసేవారు.
కానీ ఇప్పుడు అందరూ తిరిగి వచ్చేసి ఇంట్లో పని చేయకుండా ఉండే పురుషుల సంఖ్య పెరిగింది. దీనితో భూ తగాదాలూ, ఆస్తి తగాదాలూ పెరగడమే కాక ఇండ్లలో హింస పెరిగి మొత్తంగా నేరాల శాతం పెరిగింది. 30,000 లేక 40,000 మంది తిరిగి వెళితేనే ఇన్ని సమస్యలొచ్చాయి. కానీ ఇప్పుడు మిలియన్ల కొద్దీ ప్రజలు తిరగి వెళ్తుంటే ఎటువంటి పరిస్థితులు ఎదురవుతాయో ఊహించడం కూడా కష్టమే. ఇప్పటికే గ్రామాలలో వున్న వారి పరిస్థితులు కూడా దిగజారాయి. ఉదారవాద విధానాల వలన ఇప్పటికే వారు దెబ్బతిని ఉన్నారు. ఈ పరిస్థితులలో క్షౌరవృత్తిలో వున్న వారి ఉపాధి పరిస్థితి ఏమిటి అనేది చూద్దాం. ఇది కొంత హాస్యాస్పదంగా ఉండవచ్చు. కానీ మన దేశంలో ఈ వృత్తి చేసే వారు కూడా అనేకమంది ఉన్నారు. దురదృష్టవశాత్తూ వారు నివసిస్తున్న ప్రతి గ్రామంలోనూ వారు మైనారిటీలుగానే ఉన్నారు. ఒక్కో గ్రామంలో 12, 20, 30 మొదలైన సంఖ్యలో ఉంటారు. వీరు ఏ గ్రామంలోనూ పెద్దసంఖ్యలో ఉండరు. కానీ దేశంలోని ప్రతి గ్రామంలోనూ ఉంటారు. వారు తమను ఎస్సీ జాబితాలో చేర్చాలని పోరాడుతున్నారు. కానీ సఫలం కాలేకపోతున్నారు. ఈ వృత్తిలో భౌతికదూరం పాటించడమనేది అసాధ్యమైన పని. వీరి గురించి ఎవరు ఆలోచిస్తారు. వారు తమ షాపులన్నీ తెరవలేకపోవచ్చు. వారు ఇప్పటికే అప్పుల పాలై, తమ షాపుల అద్దెలను కూడా చెల్లించలేకపోతున్నారు. వారు కరువు అంచుల్లో ఉన్నారు. నా స్వరాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్లోని తూర్పుకోస్తాలోని మత్స్యకారులు కూడా అనేక సమస్యలు ఎదుర్కొంటున్నారు. చేపల ఉత్పత్తిలో రుతుపవనాలకు రెండు నెలల ముందు చేపలు గ్రుడ్లు పెట్టే సమయం. కాబట్టి ఆ సమయంలో మత్స్యకారులెవ్వరూ సముద్రంలో చేపల వేటకు వెళ్ళరాదనే నిబంధనలు ఉంటాయి. ఎవరూ ఆ సమయంలో సముద్రంలోకి వెళ్ళరు. ఈ సమయం ముగిసే రెండు వారాల ముందు మాత్రం మత్స్యకారులకు అధిక ఆదాయం వచ్చే సమయం. సరిగ్గా ఈ రెండు వారాల సమయం లాక్డౌన్లో ఉండిపోయింది. అయినా వారి ప్రాణాలకు ప్రమాదకరమైనా కూడా వారు సముద్రంలోకి వెళ్ళి చేపలు పట్టుకొచ్చి అమ్మాలని ప్రయత్నిస్తే వారు సరిగా అమ్మకాలు చేయలేకపోయారు. ఎందుకంటే వినియోగదారులు ఆ చేపలు చైనా తీరం నుంచి వస్తాయనీ, వాటికి కరోనా వైరస్ ఉంటుందనీ భయపడ్డారు. ఈ విధమైన తప్పుడు ప్రచారాలు వాట్సాప్ మెసేజ్ల ద్వారా దేశమంతా వ్యాపించాయి. మత్స్యకారులు తాము తెచ్చిన చేపలను ఎక్కువ సమయం నిలువ ఉంచలేరు. కాబట్టి వారు తాము తెచ్చిన చేపలను తిననైనా తినాలి లేక అమ్మనైనా అమ్మాలి. కాబట్టి వారు ఎక్కువ ట్రిప్పులలో చేపలు పట్టడానికి వెళ్ళాల్సి వస్తోంది.
దేశ వ్యాప్తంగా నేత కార్మికులు, చేతివృత్తుల వారు తీవ్ర సమస్యలెదుర్కొంటున్నారు. నేత కార్మికులకు, ఇతర చేతివృత్తుల వారికి పట్టణ మార్కెట్లతో వున్న కొన్ని సంబంధాల వలన వారికి కొంత ఆదాయం వచ్చేది. ప్రతి యేటా ఫిబ్రవరి, మార్చి, ఏప్రిల్ నెలల్లో ఢిల్లీ తదితర ప్రాంతాలలో నేత బట్టలు, బొమ్మలు మొదలైనవి అక్కడ జరిగే ఎగ్జిబిషన్లలో అమ్మడం ద్వారా వారికి ఈ సమయంలోనే అధిక ఆదాయం వచ్చేది. కానీ ఈ ఎగ్జిబిషన్లు రద్దు కావడంతో రాజస్థాన్, ఉత్తరప్రదేశ్ తదితర రాష్ట్రాలలోని నేత పని వారందరూ అమ్ముడు కాని తమ సరుకులతో గ్రామాలలోనే ఇండ్లలో ఉంటున్నారు. ఆంధ్రప్రదేశ్లోని చీరాలలో వున్న నేత పనివారు, కాంచీవరమ్ చీరలు నేసే కాంచీపురం నేత పనివారూ ప్రస్తుతం కరువు అంచుల్లో ఉన్నారు. అనేక వృత్తులూ, జీవనోపాధులు తీవ్రంగా దెబ్బతింటున్నాయి. మన దేశంలో అభద్రతకూ, ఆకలికీ, కరువుకూ మధ్య ఎంతో దూరంలేదు. కోవిడ్ -19 మనకు పెట్టుబడిదారీ వ్యవస్థలోని ఉదారవాద విధానాల యొక్క తీవ్ర దుష్ఫరిణామాలు ఏ విధంగా ఉంటాయో పరిచయం చేసింది. ఈ విధానాల దుష్ప్రభావాలు గతం నుంచి పెరుగుతూ వచ్చి, ఇప్పుడు ఈ సంక్షోభం రూపంలో బయటపడుతున్నాయి. ఇప్పుడు మహావిపత్తు రూపంలోకి వచ్చింది. ఇప్పుడు రకరకాల వృత్తులూ, జీవనోపాధులూ దెబ్బతింటున్నాయి. రైతుల పరిస్థితీ, వ్యవసాయ కూలీల పరిస్థితీ దయనీయంగా మారింది. ఇప్పుడు మనం భౌతిక దూరం గురించి మాట్లాడుతున్నాం. భౌతికదూరం నిబంధనలు పాటిస్తూ ఉపాధి హామీ పనులు మొదలు పెడుతున్నట్లు నోటిఫికేషన్లు వచ్చాయి.
మేము నిన్న రాత్రి మా పీపుల్స్ ఆర్కైవ్ ఆఫ్ రూరల్ ఇండియా (గ్రామీణ భారత ప్రజల సమాచారం) వెబ్సైట్లో ఒక కథనం వేశాం. తెలంగాణలోని నల్లగొండ జిల్లాకు చెందిన ఒక వరి సేకరణ కేంద్రానికి సంబంధించిన సమాచారాన్ని మా కరస్పాండెంట్ హరినాధరావు నాగవర్చుల మాకు అందించారు. అక్కడ ఒక వరి సేకరణ కేంద్రానికి వెళ్ళి పరిశీలించితే పలు విషయాలు తెలిశాయి. ఆ వరి కేంద్రంలో 48మంది కూలీలు రోజుకు 10గంటల పాటు పని చేస్తున్నారు. అందులో 4గంటల సమయం వారు విపరీతమైన ఎండలో పని చేయాల్సి వస్తోంది. వారు ఉదయం 3గంటలకే పని మొదలు పెడతారు. కానీ ఉదయం 9నుంచి మధ్యాహ్నం వంటి గంట వరకూ విపరీతమైన ఎండలో వారు పని చేస్తున్నారు. వారు వరిని కట్టలు కట్టడం, తూకం వేయడం, శుభ్రం చేయడం, ట్రక్కులలోకి లోడ్లను ఎత్తడం చేస్తున్నారు. అలా వారు 128టన్నుల వరిని ట్రక్కులలోకి ఎత్తారు. ఇదంతా వారు గ్రూపులుగా చేయాలి. దూరం పాటించాలి. వారు మాస్కులు ధరించాలి. కానీ ఆ మాస్కులు వేసుకున్న మొదటి 20 సెకండ్లలోనే మొత్తం చెమటతో తడిచిపోతున్నాయి. అక్కడ ప్రక్కవారికి కనీసం 2మీటర్ల దూరం పాటించడం అనేది సాధ్యం కాని పని. వీరిలో చాలామంది జీవన విధానం ఈ విధంగానే ఉంది. భారతదేశంలో సరళీకరణ ఆర్థిక విధానాల ఫలితాలు ఈ విధంగా ఉన్నాయి. అసమానతలకు సంబంధించిన ఒక మైండ్సెట్ను కూడా ఈ వ్యవస్థ తయారు చేసింది. మనం గత 28 ఏండ్లుగా ధనికులను మరింత ధనికులుగా అణగారిన వారిని మరింత అణగారే వారిగా చేస్తూనే ఉండటం చూస్తున్నాం. కాబట్టి సంక్షోభం వచ్చినప్పుడు అది అందరిపై ఒకేలా ప్రభావం చూపదు. కోవిడ్ చాలా సమానత్వం పాటిస్తోంది అని చెప్పడం చాలా చెత్తవాదన. ఆకలితో వున్న వారిపై, కరువు పరిస్థితులకు దగ్గరగా ఉన్నవారిపై, అనారోగ్యంతో ఉన్నవారిపై, ఆరోగ్య సదుపాయాలు అందుబాటులో లేనివారిపై, కనీస సదుపాయాలు అందుబాటులో లేనివారిపై ఈ కోవిడ్ చాలా తీవ్ర ప్రభావం చూపుతోంది. నాలాంటి మధ్యతరగతి హౌసింగ్ సొసైటీలలో నివసించే వారికంటే ఇది వారిపైనే ఎక్కువ ప్రభావం చూపుతోంది. కచ్చితంగా ఉన్నతవర్గాల వారికంటే ఇది వీరిపైనే తీవ్ర ప్రభావం చూపుతోంది. ఈ ఉన్నతవర్గాల సంపద 1991 తరువాత బాగా పెరిగింది. భారతదేశంలో అంతకుముందు ఒక్క డాలర్ బిలియనీరు కూడా లేని స్థితి నుంచి 2019 వచ్చే సరికి 121 డాలర్ల బిలియనీర్లకు చేరుకున్నాం. వీరి మొత్తం సంపద దేశ స్థూల జాతీయ ఉత్పత్తిలో 22శాతానికి సమానం. వీరిలో ఒక్కొక్కరికి అప్పటికే 23బిలియన్ డాలర్ల పైనున్న సంపదకు 12నెలల కాలంలో అదనంగా 16బిలియన్ డాలర్ల సంపద వచ్చి చేరుతోంది. వ్యవసాయ కార్మికులు, రైతులు మొదలైన వారి సంపద ఏమి పెరిగింది.
ఈ అసమానత్వానికి వ్యతిరేకంగా పోరాడకుండా మనం రాబోయే కొన్ని నెలల్లో ఎదురయ్యే పరిస్థితులను ఎదుర్కొనలేం. ఖరీఫ్ సీజన్లో ఎదురయ్యే ప్రమాదకర పరిస్థితుల గురించి నేను ఎప్పుడూ చెప్తూనే ఉన్నాను. రబీ సీజన్లో వాణిజ్య పంటల పరిస్థితి ఏ విధంగా ఉందో ఇప్పుడు చూస్తున్నాము. మిలియన్ల కొద్దీ పుచ్చకాయలు అమ్ముడుపోకుండా పొలాల్లోనే పడి ఉన్నాయి. వాటికి రవాణా సదుపాయం కూడా లేక వాటిని కోయడం కూడా లేదు. 70, 80 లక్షల క్వింటాళ్ళ ప్రత్తి అమ్ముడుపోకుండా పడి ఉంది. లక్షల క్వింటాళ్ళ చెరకు అమ్ముడుకాక పడి ఉంది. అయినా కూడా తెలంగాణ, హర్యానా, పంజాబ్ లాంటి రాష్ట్రాలలో రైతులను తిరిగి వాణిజ్య పంటలు వేయాల్సిందిగా తప్పుడు సలహాలు ప్రభుత్వాలు ఇస్తున్నాయి. ఇది ఆత్మహత్యా సదృశ్యమే అని నేను చెప్పదలచుకున్నాను. ఇది చాలా ప్రమాదకరం. మనం ప్రతి ఒక్కరినీ మొత్తంగా ఆహార ధాన్యాలే పండించమని చెప్పాలి. కనీసం కొంత భాగమైనా వారి కుటుంబ అవసరాల కోసమైనా వ్యవసాయ కూలీల కోసమైనా పండించాలని చెప్పాలి. ఆహార ధాన్యాలు పండిస్తేనే అదనపు ఉపాధి కూడా లభిస్తుంది. ఇంకా ఎక్కువ పని దినాలు కల్పించగలుగుతాం. మనందరం గ్రామీణ ఉపాధి హామీ పథకానికి మద్దతు ఇస్తాం. తగినన్ని పనిదినాలు కల్పించాలని కూడా కోరుతుంటాం. ఈ ఆహార ధాన్యాల ఉత్పత్తి 10రెట్లు పెరిగితే గానీ రాబోయే పరిస్థితులను ఎదుర్కోవడం సాధ్యం కాదు. మనం వాణిజ్య పంటల వైపు మళ్ళితే రాబోయే ఆహార సంక్షోభం మరింత తీవ్రతరమవుతుందని అర్ధం చేసుకోవాలి. అంతేకాక వాణిజ్య పంటలను ఎవరూ కొనే పరిస్థితి ఉండదు. ప్రభుత్వాలు, రైతులు తమ పంటలను అమ్ముకోలేని పరిస్థితులు ఏర్పడతాయి. ఎందుకంటే ప్రపంచ వ్యాప్తంగానే ఆదాయాలూ, వినిమయాలూ తగిన పరిస్థితులో ఎగుమతులు జరుగుతాయనే హామీ లేదు. ఇప్పటికే 70, 80 లక్షల టన్నులు ప్రత్తి అమ్ముడుకాక మిగిలిపోయాయనేది చూస్తున్నాం.
ఆహార పంటలు పండించకపోతే మనం తీవ్ర సమస్యలు ఎదుర్కొనక తప్పదు. కానీ ఇంకోవైపు ప్రభుత్వం గత ఏప్రిల్ 15నే పెద్ద మొత్తాలలో వరి ధాన్యాన్ని ఇథనాల్గా మార్చడానికి అనుమతులు ఇచ్చింది. ఎందుకంటే దానితో మనం హ్యాండ్ శానిటైజర్లు తయారు చేయాలని చెప్తున్నారు. ఈ హ్యాండ్ శానిటైజర్ల తయారీ కోసం కొన్ని మిలియన్ల టన్నుల ఆహార ధాన్యాలను దుర్వినియోగం చేస్తున్నారు. ఒకవైపు కొంతమంది ప్రజలు రోజుకు మూడుసార్లైనా చేతులు కడుక్కున్నేందుకు సరిపడా నీరు కూడా లేని పరిస్థితిలో ఉన్నారు. పశ్చిమకోస్తాలోను, తూర్పు కోస్తాలోనూ తుఫానులు కూడా ఈ సమయంలో వచ్చే అవకాశం ఉంది. దేశంలోని చాలా జిల్లాల్లో ప్రతి సంవత్సరం ఎదుర్కొనే నీటి సమస్య కూడా ఉంది. ఒకవైపు ఇంత తీవ్రమైన సమస్యలు ఉన్నా కూడా ఆహార నిల్వలను ఇథనాల్గా మార్చుతున్నారు. దీన్ని ఇంధనంలో కలపడానికి కూడా వాడుతుంటారు. సారాయి బట్టీలకు పని కల్పించాలనే ఉద్దేశ్యం కూడా దీని వెనుక ఉంది. ఇంకొక ముఖ్య విషయం మీడియా గురించి మనం చూడాలి. మీడియా పట్ల అభ్యుదయ వాదులకు రెండు రకాలైన అభిప్రాయాలున్నాయి. ఒక అభిప్రాయం ప్రకారం మీడియా అనేది పాలకవర్గాల చేతిలో పాలకులలోని కీలకవ్యక్తుల చేతిలో ఉంటుందనేది. ఇంకొక అభిప్రాయం ప్రకారం మనం మీడియా పనితీరునూ, దాని స్వభావాన్నీ కొంతవరకు మన జోక్యం ద్వారా మార్చవచ్చని. నేను గత 40ఏండ్ల నుంచీ అదే విధంగా జోక్యం చేసుకుంటున్నాను. అవును. గత 30ఏండ్ల క్రితంతో పోల్చుకుంటే మనం ఇప్పుడు చాలా తక్కువగా మాత్రమే ఆ పని చేయగలుగుతున్నాం. మీడియానూ, జర్నలిజాన్ని మనం వేరువేరుగా చూడాలి. మీడియాకు చాలా పెద్ద నిర్మాణమే ఉంది. 20, 30ఏండ్ల క్రితం మనం మీడియాను అది వ్యాపార వర్గాలకు అనుకూలంగా ఉంటోందని విమర్శించే వాళ్ళం. కానీ ఇప్పుడు అవి వ్యాపార వర్గాలకు అనుకూలంగా ఉండడం మాత్రమే కాదు అవే వ్యాపార రంగాలుగా మారాయి.
ప్రస్తుతం మార్చి 2019 నాటికి మన దేశంలోని మీడియా, వినోద పరిశ్రమల విలువ 26బిలియన్ డాలర్లుగా ఉంది. రూపాయలలో చూస్తే అది మార్చి 2019 నాటికి రెండు ట్రిలియన్లుగా ఉంది. దేశంలో అత్యంత లాభాలు ఆర్జిస్తున్న కంపెనీలలో కొన్నిగా ఇవి వున్నాయి. సెన్సెక్స్లో మొదటి ర్యాంకులో 30కంపెనీల లాభాలతో ఇవి పోటీ పడుతున్నాయి. కానీ గత 2నెలల కాలంలో ఇవి 1000మందికి పైగా జర్నలిస్టులను ఉద్యోగాల నుంచి తొలగించాయి. హిందూస్థాన్ టైమ్స్ తన స్టాఫ్లో 150మందిని అంటే 27శాతం మందిని తొలగించగా తమిళనాడులోని వికటిన్ అనే పత్రిక 175మంది సిబ్బందిని తొలగించింది. రెండు పత్రికలకు సంబంధించిన 300 మందికిపైగా జర్నలిస్టులు రోడ్డున పడ్డారు. ఈ విధమైన తొలగింపులకు వారు ఏదో ఒక విధంగా పాల్పడుతూనే ఉంటారని మనం అర్థ చేసుకోవాలి. ఎటువంటి పెద్ద విపత్తులొచ్చినా ఎటువంటి వాతావరణ మార్పులొచ్చినా వారు ఉద్యోగాల తొలగింపులకు పాల్పడతారు. 2008లో వాల్స్ట్రీట్ సంక్షోభం తరువాత 2009 ఎన్నికలకు కొద్దిగా ముందుగా 1000మంది జర్నలిస్టులను తొలగించారు. నోట్లరద్దు తరువాత ఒక వార్తా పత్రిక తన ఆరు ఎడిషన్లను మూసివేసింది. ఆ విధంగా సిబ్బందిని తొలగించింది. ఇవి పూర్తిగా లాభాల కోసమే పని చేస్తున్నాయి కాబట్టి ఇటువంటి విపత్తులనన్నిటినీ సాకుగా తీసుకొని తొలగింపులకు పాల్పడుతున్నాయి. చిన్న సంస్థలు తమ ఉనికిని కాపాడుకోవడానికి ఈ విధంగా చేస్తే మనం అర్థం చేసుకోవచ్చు. కానీ ప్రతి సంవత్సరం జర్నలిస్టుల ఉద్యోగాలు పలు సాకులతో పోతున్నాయి. ప్రస్తుతం ప్రచురణా సంస్థలూ, విద్యా సంస్థలూ కలగలిశాయి. మీడియా, పెద్ద వ్యాపారస్తులూ వారికి సంబంధించిన భాగస్వాములూ ఆన్లైన్ విద్యా మార్కెట్లను అందుకునే పోటీలో ఉన్నారు. మీడియాకు ఇప్పుడు అదే పెద్ద పనిగా ఉంది. పెద్దపెద్ద మీడియా సంస్థలు, ఇప్పుడు యూవర్సిటీలను నడుపుతున్నాయి. ఇప్పుడు అన్ని ప్రయివేటు యూనివర్సిటీలూ అదే చేయబోతున్నాయి. ప్రభుత్వ పాఠశాలలో వున్న మిలియన్ల కొద్దీ పిల్లలకు ఇది ఏవీ అందుబాటులో లేకుండాపోతాయి. వారికి స్మార్ట్ ఫోన్లు ఉండవు. కాబట్టి వర్చువల్ క్లాస్ రూమ్లు ఏర్పాటు చేసినా అవి వారు అందుకోలేరు. ఇప్పుడు విద్యలో, ఆరోగ్యంలో, మీడియాలో, మన భావాలను వ్యక్తపరచడంలో అన్నింటిలో అసమానతలు తీవ్రంగా పెరగడంతో పాటు పార్లమెంటరీ ప్రజాస్వామ్యం అనేది గత ఎమర్జెన్సీ రోజుల కంటే తీవ్రంగా దెబ్బతింటుంది. ప్రస్తుతం ఏ చట్టసభలూ జరగడం లేదు. పార్లమెంటు సమావేశాలూ జరగడం లేదు. ఆన్లైన్ మీటింగ్లు తప్పితే ఏవీ జరగడం లేదు. క్యాబినెట్ పరిస్థితి కానీ, క్యాబినెట్ సమావేశం పరిస్థితి గానీ హాస్యాస్పదంగా మారాయి. ఎందుకంటే దేశ ప్రజలకు ఇద్దరు మనుషుల గురించి మాత్రమే తెలుసు. అది ఒకరు నరేంద్రమోడీ ఇంకొకరు అమిత్ షా మాత్రమే. మిగిలిన క్యాబినెట్ మంత్రులెవరూ మాట్లాడటం గానీ పత్రికా సమావేశాలు జరపడంగానీ చేయరు. ఈ రోజు వారు ఏదో ప్రయత్నం చేస్తున్నారు. నిర్మలా సీతారామన్ తన కోసం రాసి ఉంచిన స్క్రిప్ట్ను చదువుతారు. అందులోని చాలా విషయాలు ఆమెకు అర్థం కావు.
మన ప్రజాస్వామ్యం ఒక్క వ్యక్తికే పరిమితమైంది. ఆ వ్యక్తి కొన్ని వారాలకు ఒకసారి వచ్చి రియాలిటీషోలో చెప్పినట్టు దేశ ప్రజలు ఏమి చేయాలో చెప్తుంటారు. మోడీ చేసిన 5 ఉపన్యాసాలలో మొదటి 4 ఉపన్యాసాలలో ఆయన వలస కార్మికుల గురించి గానీ, కార్మికుల గురించి గానీ ఒక్కమాట కూడా మాట్లాడలేదు. అనేక విమర్శల తరువాత (వారు విమర్శలను ఎలాగూ పట్టించుకోరు) ఆయన 5వ ఉపన్యాసంలో ఒక్కసారి మాత్రం వలస కార్మికుల పదం వాడారు. ఒక్కసారి మాత్రమే. బీజేపీని కూడా మర్చిపోయి మనం ఒక్క వ్యక్తిని మాత్రమే చూస్తున్నాం. దీనినే చిన్న ప్రభుత్వం, పెద్ద పాలన అంటారేమో. 1.3 బిలియన్ల జనాభాను ఉద్దేశించి ఒక్క వ్యక్తి మాత్రమే ఉపన్యసిస్తూ ప్రజలు ఏమి చేయాలి, ఏమి చేయవద్దు అని చెప్తూ గిన్నెలూ, పళ్ళాలూ మోగించండి, దీపాలు వెలిగించండీ, పూలను చల్లండి కానీ వలస కార్మికుల గురించి గానీ మరెవరి గురించి గానీ ఆలోచించకండి అని చెప్తున్నారు. కానీ మనం ముందు ముందు చేయాల్సిందీ చాలావుంది. కార్మికుల పరిస్థితి ఇప్పటికే దిగజారింది. ముందుముందు ఇంకా తీవ్రంగా దెబ్బతినే ప్రమాదముంది. గుజరాత్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ మొట్టమొదటిగా ఇక్కడ యూనియన్ల ఏర్పాటుపై నిషేధం విధించాలని ముఖ్యమంత్రిని కోరింది. తరువాత 5 రాష్ట్రాలలో పనిగంటలను 8 గంటల నుంచి 12 గంటలకు పెంచారు. ఇది గత వందేండ్లుగా వున్న కార్మిక చట్టాలను ప్రమాణాలను తుంగలో తొక్కడమే. నిజానికి పెట్టుబడిదారీ వ్యవస్థ కానీ, పెట్టుబడిదారులు కానీ 8గంటల పని విధానాన్ని తమ ప్రయోజనాల కోసమే ఒప్పుకున్నారు. గతంలో ఫోర్ట్ కంపెనీ, ఇతర కంపెనీలు చేసిన పలు అధ్యయనాల ద్వారా తెలుసుకున్నదేమిటంటే వరుసగా ఎక్కువ గంటలు పనిచేస్తే కొన్ని రోజుల తర్వాత కార్మికుల ఉత్పాదక శక్తి తగ్గిపోతుందని తెలిసింది.
మూడు రాష్ట్రాలలో కార్మిక చట్టాలను రద్దు చేశారు. వారిలో కొంతమంది మూడు సంవత్సరాల పాటు లేక 1,000 రోజుల పాటు రద్దు చేశారు. ప్రస్తుతం ఆన్లైన్ విద్య ద్వారా టీచర్ల యూనియన్లను తదితర యూనియన్లను దెబ్బతీస్తున్నారు. ఇది వారి ధ్యేయం, వారి ఎజెండా. మన ముందున్న ప్రశ్న ఇప్పుడు మనమేం చేయాలి అనేది. భవిష్యత్లో మన పోరాటాలూ, ఆందోళనలూ మన హక్కుల కోసం, న్యాయం కోసం చేసేవిగా ఉండాలి. దీనికి మన దేశంలో అనేక అద్భుత ఉదాహరణలున్నాయి. ఇప్పుడు నాకు కేరళ గురించి చెప్పే సమయం లేదు. కానీ అక్కడ వున్న కుటుంబ శ్రీ పథకం ద్వారా మనం అనేక విషయాలు నేర్చుకోవచ్చు. దీనిని మనం ఆహార భద్రతకు, ఆహార స్వావలంబనకు ఒక ఉత్తమమైన పథకంగా చెప్పుకోవచ్చు. కేరళలో ఆరోగ్యానికీ, ఆహారానికీ సంబంధించిన న్యాయపరమైన విధానాలున్నాయి. ఈ విధమైన న్యాయమైన విధానాల కోసం మన పోరాటాలు ఉండాలి. మన దేశాన్నీ మన సమాజాన్నీ నడిపిస్తూ, ప్రధాన స్రవంతిలో ముందు పీఠిన పనిచేస్తున్న వారి కోసం ముందుగా మన డిమాండ్లు ఉండాలి. మనం ఈ ముందు పీఠిన పనిచేస్తున్న కార్మికులపై పూలు కూడా చల్లాం. మన దేశంలో 5 మిలియన్ల పారిశుధ్య కార్మికులూ ఒక మిలియన్ ఆరోగ్య కార్యకర్తలైన ఆషాలూ ఉన్నారు. వీరికి నెలకు రూ.4,000 మాత్రమే వేతనం అందుతోంది. లెక్కలేని అంగన్వాడీ వర్కర్లు ఉన్నారు. వీరందరినీ శాశ్వత ప్రభుత్వ ఉద్యోగులుగా తీసుకోవాలని మనం పోరాడాల్సి ఉంది. రెండవది మనం ఒక పెద్ద జాతీయ ఆరోగ్య వ్యవస్థ కోసం పోరాడాలి. అటువంటి వ్యవస్థలోకి ఈ మొత్తం ఆరోగ్య కార్యకర్తలనూ, పారిశుధ్య కార్మికులనూ, ఆషాలనూ అంగన్వాడీలను తీసుకొచ్చి వీరందరినీ ఆరోగ్య కార్యకర్తలుగా గుర్తించే విధంగా పోరాడాలి. ఆ విధంగా ఆరోగ్య వ్యవస్థను క్రింది స్థాయి వరకూ విస్తరించే విధంగా పోరాడాలి. ఆ విధంగా దేశ రాజ్యాంగానికి సంబంధించిన న్యాయపరమైన ప్రాధమిక హక్కులు అందరికీ అందుబాటులోకి తెచ్చే కృషి చేయాలి. అటువంటి సమాజం కోసం ప్రయత్నించాలి. మనం ఒక విధానం నుంచి తిరిగి అదే విధానంలోకి వెళ్ళే ప్రయత్నాల నుంచి బయటపడి అసలైన న్యాయం కోసం పోరాడాలి. ఒకసారి ప్రభాత్ పట్నాయక్ మాట్లాడుతూ గాల్బ్రేతియన్ వృద్ధి గురించి చెప్పారు. ఆయన న్యాయంతో కూడిన అభివృద్ధి కావాలని చెప్పారు. మన రాజ్యాంగంలో చెప్పిన విధంగా సామాజిక, రాజకీయ, ఆర్ధిక న్యాయం కావాలి. మన పోరాటాలలో ఈ విధమైన దృక్పధంతో మనం ముందుకు సాగాలి.
- జూన్ 1న - పి. సాయినాధ్ గారి ప్రసంగ పాఠం
అనువాదం : కె. నాగలక్ష్మి, సెల్: 9440952110