Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్ విపత్తు ప్రభావ ఫలితంగా జనజీవనం స్తంభించింది. కొంత అస్తవ్యస్తంగా కొనసాగుతుంది, పగలురాత్రి భయం గుప్పెట్లో గడుస్తున్నది. ప్రపంచ జనాభాలో రెండవ స్థానంలోగల భారత్ లాంటి దేశాల్లో మరింతగా కలవరపెడుతోంది. కరోనా వైరస్ ఆరంభదశలో అంతర్జాతీయ సేవలు, విమాన సర్వీసులు రద్దు చేయకుండా, పూర్తిగా కేంద్రం నిర్లక్ష్యం వహించింది. మా దేశంలో ఏ వైరస్ ఏం చేయలేదు అంటూ ప్రగల్భాలు పలికారు. వైరస్ విస్తత వ్యాప్తి నేపథ్యంలో కనీస, ఎలాంటి ముందస్తు ప్రణాళిక, జాగ్రత్తలు ఏవి లేకుండా, అనాలోచిత కేంద్ర ప్రభుత్వం మార్చి 22న జనతాకర్ఫ్యూ కొనసాగింపుగా లాక్డౌన్ విధించింది.
ఆ లాక్డౌన్ కాలంలో వైరస్ వ్యాప్తి ఏమాత్రం తగ్గకపోగా మరింత వ్యాప్తిచెందింది అనేది వాస్తవం. అదేసమయంలో దినసరి కూలీలు, వీధి వ్యాపారులు, రైతులు, కార్మికులు, ఆటోరిక్షాలు, విద్యార్థులు, ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. వలస కార్మికుల దయనీయమైన పరిస్థితినైతే వర్ణించలేం. సుదూరప్రాంతాలకు ఆకలిదప్పులు, నిద్రాహారాలు, మరిచి సాహస నడక యాత్ర చేశారు.
అనేక వ్యయప్రయాసలు పడి సొంత ప్రాంతాలను వెతుక్కుంటూ వెళ్ళినా ఉపాధి కరువై, బతుకు భారమై, కష్టనష్టాలతో జీవనం నెట్టుకొస్తున్న పరిస్థితి నేడు నెలకొని ఉంది. ప్రస్తుత విపత్కర పరిస్థితుల్లో కోవిడ్-19 సాకుతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పెట్రోల్, డీజిల్ ధరలను రోజురోజుకు పెంచుతున్నాయి. మరోవైపు ఆర్టీసీ ఛార్జీలు పెంపు, మద్యం ధరలు కరెంటు చార్జీల మోత మోగించాయి. ఇంకోవైపు కేంద్రం సింగరేణి ప్రయివేటీకరణకు, పనిగంటల పెంపుపై పావులు కదుపుతున్నది.
కోవిడ్-19 ప్రభావం విద్యావ్యవస్థపై కూడా బలంగా పడింది. విద్యాసంవత్సరం అంతిమ దశకాలం కావడంతో పదవ తరగతి, డిగ్రీ, పీజీ, ఇంజినీరింగ్, ఫార్మసీ, వత్తివిద్యా లాంటి విద్యార్థుల పరీక్షలు జరుగుతాయా? జరగవా? అనే అయోమయ గందరగోళ పరిస్థితుల్లోకి విద్యార్థులు నెట్టబడ్డారు. పదవ తరగతి విద్యార్థులు అయితే లాగ్వేజీ పరీక్షలు రాసి రోజులు, వారాల తరబడి నిరీక్షించారు. రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం ఫలితంగా పదవ తరగతి విద్యార్థులు అందరూ పరీక్షలు లేకుండానే పై తరగతి ఉత్తీర్ణత సాధించారు. పదవతరగతి మినహా మిగతా విద్యార్థులందరూ ఇంకా అదే అయోమయ గందరగోళంలో ఉన్నారు. దేశవ్యాప్తంగా జరగాల్సిన నీట్ జేఈఈ మెయిన్స్ లాంటి పరీక్షలు ఇంకా వాయిదా అవుతూనే ఉన్నాయి.
కరోనా ఉధృతి వేగం పెరుగుతూ 24గంటల్లో వందలవేలలో కేసులునమోదు అవుతున్న తరుణంలో విద్యా సంవత్సరం ప్రారంభం అవుతుందా? జీరో అకడమిక్ ఇయర్గా ముగుస్తుందా? అనే అనుమానాల్లో ఉంటే కార్పొరేట్ ప్రయివేట్ విద్యాసంస్థలు మాత్రం ఎలాంటి పట్టింపు లేకుండా తమ పిల్లలు చదువుకోవాలనే తల్లిదండ్రుల బలహీనతను ఆధారంగా చేసుకొని ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పష్టమైన ఆదేశాలు రాకున్నా, ఆన్లైన్ క్లాసుల దందాకి తెరలేపింది.
ఇప్పటికే కొన్ని సీబీఎస్ఈ సిలబస్ అనుబంధ స్కూల్స్ ఆన్లైన్ క్లాసులు నిర్వహిస్తున్నాయి. రాష్ట్ర సిలబస్ అనుబంధ కార్పొరేట్, ప్రయివేట్ స్కూల్స్, ఇంటర్ కాలేజీలు ఆన్లైన్ క్లాసులు పేర తల్లిదండ్రుల నుంచి మునుపటీ కంటే అదనంగా స్మార్ట్ ఫోన్స్, ట్యాబ్స్, నెట్ కనెక్టివిటీతో వేల, లక్షల ఫీజులు వసూలు చేస్తున్నారు. ఒక వైపు కరోనావైరస్, లాక్డౌన్ కారణంగా ఉపాధికరువై బతుకు భారంగా నెట్టుకొస్తున్న తల్లిదండ్రులపై ఫీజుల భారంతో ''మూలిగే నక్కపై తాటికాయ పడ్డ చందం''గా మారింది పరిస్థితి. ఇదిలా ఉండగా సామాజికంగా, సాంఘికంగా, ఆర్థికంగా, విద్యా వైజ్ఞానికంగా, అంతరాల, అసమాన భారత సమాజ, స్వాతంత్య్ర దేశంలో సాంకేతిక పరిజ్ఞానం వాడుతున్న, వాడుకోగల వారి సంఖ్య చాలా తక్కువ. ఒక సర్వే ప్రకారం ఇంటర్నెట్ సౌకర్యం అందుబాటులో ఉన్న వారి సంఖ్యా 8శాతం మాత్రమే. తెలంగాణ లాంటి రాష్ట్రంలో కూడా 20శాతం మించిలేదు. ఇలాంటి పరిస్థితుల్లో సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులోలేని అధిక శాతంగల గ్రామీణ, పేద, గిరిజన, ఆదివాసి, మైనార్టీ, విద్యార్థులు ఆన్లైన్ విద్యను ఎలా అందిపుచ్చుకోగలరని ఆలోచించాల్సిన అవసరం ఉంది.
మరోవైపు (రేషనలైజేషన్ )విద్యార్థులు లేరనే సాకుతో సుమారు 1600 పాఠశాలలను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మూసివేసిన విషయం తెలిసిందే. సంఖ్యలో తక్కువ గల పట్టణ ఉన్నత వర్గాల పిల్లలందరికీ క్లాసులు స్పష్టంగా కనపడి, వినపడాలంటే ఇంటర్నెట్ టెక్నాలజీ స్పీడు, స్మార్ట్ ఫోన్, కంప్యూటర్ సామర్ధ్యం ఎక్కువగా ఉండాలి. అది అందరికీ కష్టసాధ్యమ వుతుంది. ఇంట్లో ఇద్దరు, ముగ్గురు పిల్లలు ఉంటే కంప్యూటర్స్, సెల్ ఫోన్స్ అదే సంఖ్యలో ఉండాల్సిందే. ఆన్లైన్ ద్వారా క్లాసులను బోధించగల ఐసీటీ సామర్థ్యం ఉపాధ్యాయులందరికీ ఉండే అవకాశం తక్కువ. ఆన్లైన్ క్లాస్ల కోసం వాళ్ళకి ఏమైనా ట్రైనింగ్ ఇచ్చారా అంటే అది తెలియదు.
ఉపాధ్యాయుడి పర్యవేక్షణ లేకుండా విద్యార్థి క్రమశిక్షణ ఎలా సాధ్యమవుతుంది. 6-15ఏండ్ల వయస్సుగల ఎదుగుతున్న విద్యార్థులకి ఫోన్ ఇచ్చి తల్లిదండ్రులు వారి దినసరి పనులకు వెళ్ళగలిగే పరిస్థితి లేదు. ఆన్లైన్ క్లాస్ల సమయంలో తల్లి, తండ్రి అవసరం ఉంటుంది. గంటల తరబడి కంప్యూటర్స్, ఫోన్స్ ముందు కూర్చో గల మానసిక పరిపక్వత, పరిస్థితి పిల్లల్లో లేదు. కూర్చుంటే నడుమునొప్పి, కంటి, ఆరోగ్య సమస్యలు తలెత్తే స్థితి.
వీటికి ప్రత్యామ్నాయ మార్గాలు వెతకకుండా, పరిష్కార మార్గాలు ఆలోచించకుండా, కేంద్ర ప్రభుత్వం నవోదయ స్కూల్స్కి ఆన్లైన్ అడ్మిషన్ ప్రక్రియను కొనసాగించడం పేద విద్యార్థులకు విద్యను దూరం చేయడమే అవుతుంది. పట్టణ ప్రజల విద్యార్థులను మోసగించడం అవుతుంది. రాష్ట్ర ప్రభుత్వం ఈ విద్యా సంవత్సర ఆరంభం, అంతం అయ్యేవరకూ ఆఫ్లైన్, ఆన్లైన్ విద్యపై తక్షణమే స్పష్టమైన, అదేశాలు జారీచేయ్యాలి. అంతవరకు కోర్పొరేట్, ప్రయివేటు స్కూల్స్, కళాశాలల ఆన్లైన్ క్లాసుల నిర్వహణను, అడ్డుగోలు దోపిడీని అరికట్టాలి.
గడ్డం శ్యామ్
సెల్:9908415381