Authorization
Mon Jan 19, 2015 06:51 pm
'కొడుకులతోనే పున్నామనరకమ'నుకునే పితృస్వామిక వ్యవస్థలో తండ్రి చూపించిన అక్షరం... ఆమెకో లక్ష్యాన్ని ఏర్పరిచింది. ''అడపిల్లకు చదువెందుకు..? అనే వారికి ఆమె ఒక సమాధానమై నిలిచింది. ప్రభుత్వ ఉద్యోగం చేస్తున్న... అధ్యయనానికి అవకాశమున్న అధ్యాపక వృత్తి కోసం ఆ ఉద్యోగాన్ని వదులుకొని అధ్యాపక వృత్తి చేపట్టి నేడు కర్నూలు డిగ్రీ కళాశాలలో సహాయ ఆచార్యులుగా పనిచేస్తున్నారు. ఆమే వింధ్యవాసిని దేవి. పరిశోధనలో నిత్య విద్యార్థిని ''సాహిత్య పరిశోధనే నా ఊపిరి అని చెప్పే ఆ ప్రతిభాశాలి పరిచయయే ఈవారం జోష్...
వింధ్యవాసిని దేవి రంగారెడ్డి జిల్లా హయత్నగర్ మండలంలోని, తొర్రూరులో పుట్టారు. తండ్రి వి.ఆర్.యాదవేంద్రారెడ్డి ఉపాధ్యాయులు. అమ్మ రోహిణి గహిణి. ఎనిమిదో తరగతి వరకు తొర్రూరు ప్రభుత్వ పాఠశాలలో చదువుకున్న ఆమె తొమ్మిదవ తరగతి తన తండ్రి పనిచేస్తున్న సరూర్ నగర్ ప్రభుత్వ పాఠశాలలోనూ, పదవ తరగతి చంపాపేట్ ప్రభుత్వ పాఠశాలలో పూర్తి చేశారు. ఇంటర్మీడియేట్ ప్రయివేటుగా చదివిన ఆమె డిగ్రీ దూరవిద్యా విధానంలో పూర్తిచేశారు. ఎం.ఎ తెలుగు కోఠి మహిళా కళాశాలలో పూర్తి చేశారు. బాల వ్యాకరణంలో అత్యధిక మార్కులు తెచ్చుకున్నందుకు ఆచార్య. దివాకర్ల వెంకటావధాని మెమోరియల్ గోల్డ్ మెడల్ అందుకున్నారు. తెలుగు పండిత శిక్షణ (టి.పి.టి) పూర్తి చేశారు.
నాన్న స్ఫూర్తి... అక్క ప్రేరణ
తండ్రి ప్రభుత్వ తెలుగు ఉపాధ్యాయులు...అంతకు మించి పుస్తక ప్రేమికుడు కావడంతో ఇళ్లే ఒక గ్రంథాలయమైంది. ఆమెకు ఊహ తెలిసేనాటికే పుస్తకం నేస్తమయ్యింది. అవే ఆటబొమ్మలయ్యాయి. ఆ పుస్తకాలే ప్రపంచాన్ని పరిచయం చేసాయి. 8,9 తరగతుల్లో ఉన్నప్పుడే గొప్ప సాహితీవేత్తలైన శ్రీ శ్రీ మహా ప్రస్థానం, విశ్వనాథ వేయిపడగలు, గోపీచంద్ నవలలు, మాలపల్లి, గోర్కి అమ్మ నవల వంటి ఉత్తమ సాహిత్యం చదవటంతో వాటి ప్రభావం ఆమెపై పండింది. వాటితో పాటు పత్రికలలో వచ్చే ఆదివారం అనుబంధం, సోవియట్ లాండ్, చతుర,విపుల, రచన సాహిత్య పత్రిక మొదలైన వాటిని విరివిగా చదివే అవకాశం లభించింది. అలా ఆమె జీవితంలో పుస్తకాలు ఒక భాగమయ్యాయి. ముఖ్యంగా ఇంటర్,డిగ్రీ దూరవిద్యా విధానంలో చదవటంవల్ల ఆ సమయంలో విరివిగా పుస్తకాలు చదవడానికి అవకాశం లభించింది. సాహిత్య గ్రంథాలతో పాటు ఉద్యోగసోపానం, విజేతాకాంపిటీషన్స్ వంటి పుస్తకాలు చదవడం వలన జీవితం పట్ల ఒక స్పష్టమైన అవగాహన కలిగింది. ఆయా పుస్తకాలలో ప్రచురింపబడే విజేతల కథనాలు ఆమెలో స్పూర్తిని రగిలించాయి. ఎలాగైనా ప్రభుత్వ ఉద్యోగం సాధించాలన్న పట్టుదల కలిగింది. డిగ్రీ తర్వాత ఎంఎ తెలుగు, ఎం.ఎ ఇంగ్లీషు, ఎం.బి.ఎ మూడింటిలోను ర్యాంకు వచ్చినప్పుడు ఎంపిక విషయంలో మనసు తెలుగు సాహిత్యం వైపు మళ్ళింది. ఇందుకు ప్రేరణ ఇచ్చారు ఆమె తండ్రి... అక్క ఇందిరా ప్రియదర్శిని.
గురువుల ప్రోత్సాహం
కోఠీ మహిళా కళాశాలలో ఎం.ఎ తెలుగు చదివేటప్పుడు తెలుగు శాఖ ఆచార్యులు నానీల నాన్న ఆచార్య ఎన్. గోపి, ఆచార్య ఎస్వీ. సత్యనారాయణ, ఆచార్య మాసన చెన్నప్ప, ఆచార్య మాదిరెడ్డి అండమ్మ , ఆచార్య ననుమాస స్వామి, ఆచార్య ఎన్.ఆర్.వెంకటేశం, ఆచార్య వెలుదండ నిత్యానందరావు, ఆచార్య సుమతీనరేంద్ర ఆచార్య సూర్యాధనంజరు లాంటి వాళ్ళు అందించిన ప్రోత్సాహమే సాహిత్యంలో పరిశోధన చేయాలన్న ఆసక్తి కలిగింది. టిపిటి పూర్తయిన వెంటనే ప్రయివేటు స్కూల్, కళాశాలలో ఉద్యోగం చేస్తూనే మరోపక్క అక్కతో కలిసి పోటీ పరీక్షలకు సన్నద్ధమయ్యేవారు. అదే సమయంలో తాను చదివిన కోఠీ మహిళా కళాశాలలో పార్ట్టైమ్ తెలుగు అధ్యాపకురాలుగా పనిచేసే అవకాశం లభించింది. అక్కడ పనిచేస్తు న్నప్పుడే దేవాదాయ ధర్మాదాయ శాఖలో ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ పోస్టులకు నోటిఫికేషన్ వెలువడింది. రంగారెడ్డి జిల్లాకు కేటాయించిన ఒక్కటే పోస్టుకు అక్కచెల్లెలు మాత్రమే రాత పరీక్షలో అత్యధిక మార్కులు సాధించి ఇంటర్వ్యూకు అర్హత సాధించారు..దేవాదాయ ధర్మాదాయ శాఖలో కార్యనిర్వహణాధికారిగా ఉద్యోగంలో చేరడంతో తన ఉద్యోగ ప్రస్థానం ప్రారంభమైంది.
విధి నిర్వహణలో...
దేవాదాయశాఖలో కార్యనిర్వహణాధికారిగా కూకట్పల్లి ద్వాదశ జ్యోతిర్లింగ భువనేశ్వరి దేవాలయం ,రామాలయం, శివాలయం, సుమిత్రా నగర్ కనకదుర్గ దేవాలయం, నాచారంలోని శివాలయం, జగద్గిరిగుట్టలో శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయం, గండిపేట గండిమైసమ్మ దేవాలయం, ఇలా పలు దేవాలయాలకు కార్యనిర్వాహణాధికారిగా విధులు నిర్వహించారు. దేవాదాయ శాఖలో ఉద్యోగబాధ్యతలు నిర్వహిస్తున్నప్పుడే ఎపీపీఎస్ డిగ్రీ కళాశాల అధ్యాపకుల ఉద్యోగానికి నోటిఫికేషన్ ఇచ్చింది. అధ్యయన అధ్యాపనల పట్ల ఉన్న అమితాసక్తితో అధ్యాపక ఉద్యోగాన్ని సాధించాలన్న పట్టుదలతో అటు ఉద్యోగ బాధ్యతలు నిర్వహిస్తూనే అధ్యాపక పోస్టు కోసం తీవ్రంగా శ్రమించారు. ''ఎలాంటి కోచింగ్ లేకుండా అక్క ఇందిరా ప్రియదర్శిని మార్గదర్శనంలో చదివి ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో అధ్యపకురాలుగా ఉద్యోగం సాదించడమంటే నా జీవితంలో ఒక నూతన అధ్యాయం అని అంటారు'' ఆవిడ. ఎందుకంటే విద్యార్థిగా డిగ్రీ కాలేజీ మెట్లెక్కకపోయినా , అధ్యాపకురాలుగా డిగ్రీ కాలేజీ లో చేరడం ఒక గొప్ప అనుభూతి. కర్నూలు నగరంలోని కె.వి.ఆర్ ప్రభుత్వ కళాశాల (స్వయంప్రత్తి)లో అధ్యాపకురాలుగా గత 9 సంవత్సరాలుగా విధులు నిర్వహిస్తున్నారు.
సాహిత్య అభిలాష
చిన్నప్పటి నుంచి సాహిత్య వాతావరణంలో పెరిగినందువల్ల సాహిత్యం ఆమెను అమితంగా ప్రభావితం చేసింది. అంతేకాకుండా అనేక సాహిత్య కార్యక్రమా లకు తండ్రి, అక్కలతో కలిసివెళ్లడంతో ఆ ఆసక్తి అధికమైంది. చిన్నతనం నుండే సాహిత్యం చదవడంతో రాయాలన్న తపనకూడా ఉండేది. ఇంటర్, డిగ్రీ చదివేటప్పుడు చిన్న, చిన్న కథలు,కవితలు రాసే అలవాటు ఉన్న వాటిని ఎవరికీ చూపించలేదు. పీజీలో ఉండగా కళాశాలలో నిర్వహించే కవిసమ్మేళనాలలో పాల్గొన్నారు. అదే కాలంలో ఆమె రాసిన కథ ఆచార్యుల అభినందనలు అందు కుంది. నానీల దశమవార్షికోత్సవం జరుగుతున్న సమయంలో దానికి హాజర్వడంవలన నాలుగు చిన్న పాదాలలో అనల్పమైన భావాన్ని చెప్పగలిగే నానీలు బాగా ఆకర్షించాయి. వారంరోజులలోనే వంద వరకు నానీలు రాసి 'నానీల నాన్న'ఆచార్య. ఎన్ గోపి గారికి చూపించడంతో ఆయన అభినందిస్తూ ఇంకా కొన్ని నానీలు రాసి పుస్తకం ప్రచురించమని సూచించారు. అయితే వ్యక్తిగత, ఉద్యోగ జీవితంలో తలమునకలైన ఆమె ఆ పుస్తకం ప్రచురించలేకపోయారు. ఈ మధ్యనే ''నానీలసింగిడి'' పేరుతో తొలి కవిత్వ సంపుటిని ప్రచురించారు. అంతేకాకుండా ''డా.రావూరి భరద్వాజ సాహిత్య సమాలోచనం'' పేరుతో జాతీయ సదస్సు పరిశోధన పత్రాలను తన సంపాదకత్వంతో పుస్తకంగా తీసుకొచ్చారు. నేటి తరానికి ముఖ్యంగా విద్యార్థులకు సాహిత్యం పట్ల ఆసక్తి కలిగించాలన్న ఉద్దేశ్యంతో, ఆయా సాహిత్యాంశాల పట్ల స్పష్టమైన అవగాహన కలిగించడానికి, అలాగే ప్రాచీన, ఆధునిక సాహిత్యాలపై లోతైన చర్చలు జరిగి ఒక నూతన సందేశం సమాజానికి అందించాలన్న సంకల్పంతో కళాశాల వేదికగా జాతీయ, అంతర్జాతీయ సదస్సులను తానే స్వయంగా కన్వీనర్గా ఉండి నిర్వహిస్తున్నారు. ఇది ఒక ఆనందానుభూతి అంటారు. తెలుగు సాహిత్యం, చరిత్ర, సంస్కతి- సమాలోచన అంశంపై చరిత్ర అధ్యయన శాఖతో కలిసి అంతర్జాతీయ సదస్సును, డా.రావూరి భరద్వాజ సాహిత్య సమాలోచనం అనే అంశంపై UGC జాతీయ సదస్సును, కేంద్ర సాహిత్య అకాడమీ వారి సౌజన్యంతో వివిధ అంశాలపై లిటరరీఫోరమ్స్ నిర్వహించి, తెలుగు భాషా సాహిత్యాల పట్ల విద్యార్థులను చైతన్యపరుస్తూ, సాహిత్య అధ్యయనం వైపు ప్రేరణ కలిగించడానికి ప్రయత్నిస్తున్నారు వింధ్య. ఎందుకంటే ఒక వ్యక్తిని నైతికత వైపు పయనింపచేసేది సాహిత్యం.మానవీయ విలువలను పాదుకొల్పేది సాహిత్యమే అని ఆమె ప్రగాఢ విశ్వాసం.
సంతప్తి
కళాశాల విద్యార్థిని డిగ్రీ పూర్తిచేసి ఆర్థిక సమస్యల వల్ల పై చదువులకు వెళ్ళలేని పరిస్థితుల్లో ఉన్నప్పుడు ఆమె కు ఆర్థికంగా చేయుతనిచ్చి ఎం.ఎ తెలుగు, టి.పి.టీ చదివించారు. ఆమె కూడా ప్రభుత్వ ఉద్యోగం సాధించి తన కాళ్ళ మీద తను నిలబడింది. ' ప్రార్థించే పెదవులకన్నా సాయం చేసే చేతులే మిన్నా' అన్న నానుడిని గట్టిగా విశ్వసించే వింధ్య ఎందరికో సాయం చేసింది. మరో ఇద్దరు అమ్మాయిలకు ఆర్థిక సహాయం అందిస్తున్నారు. కొందరు పేద విద్యార్థులకు మెస్ ఫీజు చెల్లిస్తూ ఆర్థిక కారణాల వలన ప్రతిభావంతులైన విద్యార్థులు చదువు ఆగకూడదని ఆమెకు తోచిన చిన్న చిన్న సహాయాలు చేస్తున్నారు.
సత్కరాలు...
- దేవాదాయ శాఖలో పని చేస్తున్నప్పుడు విశ్వాసాయి సేవాసమితి వారిచే
ఉత్తమ కార్యనిర్వహాణధికారిగా పి.వి. రమణాచారిగారి నుండి పురస్కారం
- కూకట్పల్లి నియోజకవర్గ ఎమ్మెల్యే డా. జయప్రకాశ్ గారి నుండి సత్కారం
- తెలుగు భాష వికాసా సమితి వారి నుండి రాజావాసిరెడ్డి మల్లీశ్వరి సాహిత్య పురస్కారం
- దేశభక్తుల సంక్షేమ సంఘం మంచిర్యాల వారిచే దేశభక్తి సాహిత్యసేవా భాస్కర పురస్కారం