Authorization
Mon Jan 19, 2015 06:51 pm
'నాకు బెర్నార్డ్షాలు, షేక్స్పియర్లూ తెలియదు/ తనకు గుడిపాటి వేంకటాచలం, గురజాడా తెలియదు/ ఇద్దరం ఉత్త పిచ్చివాళ్లం. కానీ, .../ అడుగంటిన కిరసనాయిలు స్టవ్తో/ అన్నం ఎట్లా ఉడికించాలో తనకు తెలుసు/ దగ్గుతెరల నెత్తుటి రెపరెపల ఊపిరితిత్తుల్లో/ కవిత్వమెట్లా రాజేయాలో నాకు తెలుసు/ ఇద్దరం కలిసి ఒక కలగా/ కలగాపులగంగా కలిసిపోయిన రోజుల్లో/ ఇంచుమించు ఒకే కంచంలో/ ఇంద్రధనుస్సుల్ని తుంచుకొని తిన్న రోజుల్లో/ మా గుండెల్లో సమస్యలు మండని రోజుల్లో/ సిగరెట్ పీకలాంటి నన్ను/ సిగలో పువ్వులా తురుముకొని/ గాజుకుప్పెలాంటి నా కళ్లలోనే/ ఆశల అగరొత్తులు వెలిగించుకుందే తప్ప/ తులతూగే ఐశ్వర్యమో/ తులం బంగారమో కావాలని/ ఏనాడూ ప్రాధేయపడలేదు'' అంటూ తన భార్య భాగ్యలక్ష్మికి ప్రేమలేఖ రాసిన కవి అలిశెట్టి ప్రభాకర్. అతడి కవిత్వం గోడల మీద నినాదాలై జ్వలించాయి. అతడి కవిత్వం మంటల జెండాలను ఎగరవేసింది. అతడి కవిత్వం సిటీ లైఫ్ ను పరిచయం చేసింది. తెలుగు మినీ కవిత్వానికి ఉద్యమ రూపం అలిశెట్టి.
అలతి అలతి పదాలతో రూపంలో సంక్షిప్తతనీ, వస్తువులో జీవన విస్తతినీ, సమాజపు లోతులనూ తన కవిత్వం ద్వారా మరింత బాహాటంగా వెలుగులోకి తెచ్చిన కవి అలిశెట్టి. చిత్రకారుడు కూడా కావడంతో తన కవితలకు తానే చిత్రాలను వేసుకుని ఓ కొత్త ఒరవడిని సష్టించారు. ఆధునిక కవిత్వంలో గోడలపై నినాదమై మెరిసిన వ్యక్తి.
అలిశెెట్టి మినీ కవిత్వం
''అందంగా తోకాడించే కుక్కపిల్లలాంటిది కాదు
కుట్టిన ఎర్రతేలు మంటలాంటిది
ఆకలి'' అంటూ మరో కవితలో
''ఆకాశమంత ఆకలిలో
అన్నం మెతుకంత చందమామ
కంటికీ ఆనదు, కడుపు నింపదు'' అని
దేశంలో ఆకలితో ఆలమటించే అభాగ్యుల గొంతై ఆకలి తీవ్రతను తెలియజేస్తాడు.
''తను శవమై
ఒకరికి వశమై
తనువు పుండై
ఒకరికి పండై
ఎప్పుడూ ఎడారై
ఎందరికో ఒయాసిస్సై'' అనే కవితలో వేశ్య పరిస్థితిని ఆరు లైన్లలో అందరికి అర్థమైయే భాషలో రాశాడు.
''కన్నీళ్లని
ఏ భాషలోకి అనువదించినా
విషాదం మూర్తీభవించిన స్త్రీయే
సాక్షాత్కరిస్తుంది'' అంటారు అలిశెట్టి 'విషాద సాక్షాత్కారం' కవితలో.
'మరణం నా చివరి చరణం కాదు
మౌనం నా చితాభస్మం కాదు
నిర్వరామంగా నిత్యనూతనంగా కాలం అంచున చిగురించే నెత్తుటి ఊహను నేను'' అంటూ, కవిత్వమై మళ్లీ పునర్జన్మిస్తానని ప్రకటించిన ధీశాలి.