Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ప్రతి జీవితం వెనుక ఒక కథ ఉంటుంది. ప్రతి కథలో బాధ, సంతోషం, కష్టం, నష్టం, గెలుపు, ఓటమి సహజం. అయితే జీవితంలో జరిగే ప్రతి విషయాన్నీ, సంఘటనను అనుభవంగా తీసుకోవాలి. ఓటమి అనేక పాఠాలు నేర్పిస్తుంది. ప్రతి విజయం వెనుక అనేక ఓటములు ఉంటాయి. అవే విజయానికి బాటలు వేస్తాయి. కవిగా, రచయితగా, విమర్శకుడిగా, అనువాదకుడిగా, భారతదేశంలో నెంబర్ వన్ స్వీయ ప్రచురణ వేదికైన ప్రతిలిపి తెలుగు విభాగాధిపతిగా సేవలు అందిస్తూ.. ఇప్పటికే 14 పుస్తకాలను రచించిన యువ కవి జాని తక్కెడశిల (అఖిలాశ) తెలుగు సాహిత్యంలోకి ఎలా వచ్చారు? 2016 నవంబర్ తొమ్మిదవ తేదిన తెలుగు సాహిత్యంలోకి వచ్చి స్వల్ప వ్యవధిలోనే 14 పుస్తకాలను ఎలా ముద్రించగలిగారు? కవిత్వం, కథ, నవల, విమర్శ, అనువాదం ఇలా ప్రక్రియ ఏదైనా తనదైన శైలిలో సాహిత్యాన్ని సృష్టిస్తూ... తెలుగు సాహిత్యానికి విశేష కృషి చేస్తున్న ''అఖిలాశ'' పరిచయం వారి మాటల్లోనే..
ఎవరి బాల్యం అయినా అత్యంత అమూల్యమైనది, స్వార్థాలు లేనిది, స్పటికం లాంటిది. కాని నా బాల్యం అలా కాదు.. కష్టాలు, బాధలు.. ఘోరమైన అవమానాలు, హేళనలు, చులకన, వివక్ష, బహిష్కరణ.. ఇలా చెప్పుకుంటూ పోతే... నా బాల్యం నాకు వద్దనిపిస్తుంది. ఎవరికీ అలాంటి బాల్యం రాకూడదు కూడా. బహుశ అక్కడే నా సాహిత్య జీవితానికి పునాదులు పడి ఉంటాయి. మాది కడప జిల్లా పులివెందులలో... రాజారెడ్డి వీధి. ప్రాధమిక విద్య మా ఇంటికి చేరువలోనే నాగార్జున హైస్కూల్ లో చదివాను. చిన్నప్పటి నుండే పుస్తకాలు అంటే చాలా ఇష్టం... అలా అని గంటలు గంటలు చదవడం కాదు కానీ... చదివేది కొద్దిసేపే అయినా బాగా చదువుకునే వాడిని. గ్రూప్స్ కంటే భాషలనే ఎక్కువగా ఇష్టపడేవాడిని. హిందీ అంటే చాలా ఇష్టం. అందుకే పదవ తరగతి పూర్తి కాక ముందే హిందీలో డిగ్రీ చేశాను. 2006 పదవ తరగతి పూర్తి అయితే 2004లోనే దక్షిణ భారత హిందీ ప్రచార సభ నుండి హిందీ ప్రవీణ డిగ్రీ పట్టా తీసుకున్నాను. అది నాకు చాలా విలువను ఇచ్చింది. చదువుకుంటే మంచి గుర్తింపు వస్తుందని అప్పుడే తెలుసుకున్నాను.
బాల్యం విషయానికి వస్తే... తినడానికి తిండి ఉండేది కాదు. స్కూల్ కి వెళ్ళడానికి యూనిఫారం సరిగా ఉండేది కాదు. చినిగిన బూట్లు, ఏడవ తరగతి వరకు తొడలపై వరకు నిక్కర వేసుకునే పోయేవాడిని... నిక్కర వేసుకు వెళ్తున్నానని టీచర్ క్లాస్స్ లో బెంచ్ పైన నిలబెట్టేవారు, బెల్ట్ లేదని, టై లేదని క్లాసులోకి రానిచ్చేవారు కాదు, స్కూల్ ఫీజు కట్టలేదని నెలలు... నెలలు ఇంట్లోనే ఉండేవాడిని.. ఇదంతా ఒకెత్తు అయితే నేను పొట్టిగా ఉంటానని ప్రతి ఒక్కరు గేలి చేసేవారు... చాలా అవమానకరంగా ఫీల్ అయ్యేవాడిని, కుమిలిపోయేవాడిని. పిల్లవాడు బాధలో ఉంటే తల్లిదండ్రులు దగ్గరగా ఉండాలి ,అక్కున చేర్చుకోవాలి, ప్రేమను పంచాలి... నా విషయంలో అలా జరగలేదు. బతుకు తెరువుకోసం మా అమ్మ, నాన్న నాకు దగ్గరగా లేరు. నేను సాధించాలి, అందరికంటే ప్రత్యేకంగా ఉండాలి, అవమానించిన చోటే అభినందించాలి అనే పంతం, పట్టుదల ఉండేది. ఎవరైనా... నీకు అది చేత కాదు... నువ్వు చేయలేవు అంటే... దాన్ని చేసే వరకు వదిలేవాడిని కాదు, సాహిత్యం కూడా అంతే.
డాక్టర్ కావాలని నా ఆశ. ఇంటర్ లో జాయిన్ అవ్వడానికి డబ్బు లేదు. డాక్టర్ చదివించే స్తోమత కుటుంబానికి లేదు. కనీసం అలాంటి ఆలోచన కూడా చేయలేరు. అయినప్పటికీ ఇంటర్ జాయిన్ చేశారు. ఫీజులు కట్టలేక ఆరు నెలలు గడిచేలోపే ఇంటికే పరిమితం అవ్వాల్సి వచ్చింది. డబ్బు లేదు, తినడానికి తిండి లేదు. అప్పుడే మా అమ్మకి వచ్చిన ఆలోచన ఏదైనా కంప్యూటర్ కోర్స్ నేర్పించి సౌదీలో ఉన్న... మా పెద్దమ్మ దగ్గరికి పంపాలనుకున్నారు. అయిష్టంగానే పులివెందులలో కంప్యూటర్ కోర్స్ లో జాయిన్ అయ్యాను. సంవత్సర కాలంలోనే ఏం.ఎస్ ఆఫీస్, సి, ఊప్స్, ఒరాకిల్, హర్డ్ వేర్, ట్యాలి నేర్చుకున్నాను. ఆ తర్వాత అక్కడే సి. లాంగ్వేజ్ భోదించేవాడిని. పదవ తరగతి పూర్తి చేసి కంప్యూటర్ కోర్సులు భోదిస్తున్నాడని వార్త జిల్లా ఎడిషన్ లో రావడంతో అది చూసి వై. ఎస్ వివేకానంద రెడ్డి ఇంటికి పిలిపించారు.
ఉద్యోగం చేస్తావా? చదువుకుంటావా? అని అడిగారు. చదువుకుంటాను అన్నాను. వెంటనే పులివెందులలో లయోలా డిప్లొమా కాలేజ్ లో జాయిన్ చేశారు. మొదటి సంవత్సరం ఫీజు వారే కట్టారు. ఆ తర్వాత వై.ఎస్.రాజశేఖర్ రెడ్డి ప్రవేశ పెట్టిన ఫీజు రీయింబర్స్మెంట్ పథకమే ఏం.టెక్ వరకు చదువుకునే అవకాశాన్ని ఇచ్చింది. అమ్మ తక్కెడశిల ఆశ మొదట ఒక ఫ్యాక్టరీలో పని చేసేవారు. ప్రస్తుతం ఇంటి పని చేసుకుంటూ నా సాహిత్యాన్ని చదువుకుంటూ ఆనందంగా ఉన్నారు. తమ్ముడు తక్కెడశిల జాకీర్ భాష ఏం.బి.ఏ పూర్తి చేశారు. డిజిటల్ మార్కెటింగ్ విభాగంలో అమెజాన్, ఫ్లిప్ కార్ట్ కి పని చేస్తున్నారు. చెల్లి అఖిల డిగ్రీ పూర్తి చేసి ఫ్యాషన్ డిజైనింగ్ చేస్తున్నారు. స్వశక్తితో ఎవరి మీద ఆధరపడకుండా ఎదుగుతున్నారు.
2015లో ఏం. టెక్ పూర్తి చేసిన తర్వాత ఇక చదువు వద్దనుకున్నాను. కానీ పీహెచ్.డి చేయాలన్నది నా కల. నా సంపాదన ఇంటికి అవసరం. అందుకే రిలయన్స్ లైఫ్ ఇన్సూరెన్స్ ఆఫీస్ లో ఐదు వేలకు ఉద్యోగంలో జాయిన్ అయ్యాను. నలభై రోజులు ఉద్యోగం చేసిన తర్వాత 2800 ఇచ్చారు. మిగతాది రెండు నెలల తర్వాత వస్తుంది అన్నారు. ఆ తర్వాత సాఫ్ట్వేర్ ఇంజనీర్ గా ఒక ఐ.టి కంపెనీలో జాయిన్ అయ్యాను. అక్కడ కూడా మూడు నెలల కంటే ఎక్కువ ఉండలేకపోయాను. ఒక ఇంజనీరింగ్ కాలేజ్ లో లెక్చరర్గా జాయిన్ అయ్యి... మూడు రోజులకే వదిలేసాను. ఇలా ఎక్కడా ఇమడలేక పోయాను. కారణం అది నా గమ్యం కాదు కానీ డబ్బు కావాలి. ఏదో ఒకటి చేయాలని ఇంట్లో చెప్పడంతో ఏదో ఒక ఉద్యోగంలో జాయిన్ అవ్వడం వదిలేయడం. ఉద్యోగం లేదు ఇంట్లో ఖాళీగా ఉన్నాను. ఆ బాధలో నాలుగు వాక్యాలు రాసుకొని ఫేస్ బుక్లో పోస్ట్ చేసేవాడిని. విపరీతమైన ప్రోత్సాహం లభించింది. అలా రాసుకుంటూ ఉండగా సౌదిలో ఉద్యోగం వచ్చింది. ఇంటిని వదిలి వెళ్ళడం నాకు ఇష్టం లేదు. అన్ని ఏర్పాట్లు పూర్తి అయినా తర్వాత వెళ్లకూడదని నిర్ణయం తీసుకున్నాను . నా నిర్ణయాన్ని మా అమ్మతో సహా అందరూ వ్యతిరేకించారు.
2016లో 324 అనే ఒక ప్రేమ కథను రాసి ప్రతిలిపి కథల పోటీకి పంపాను.
అందులో రెండవ బహుమతి లభించింది. అప్పటికే మాస పత్రికల్లో కవితలు ప్రచురణ అయ్యేవి. ప్రతిలిపి తెలుగు విభాగానికి హెడ్గా పని చేస్తున్న ప్రముఖ రచయిత 'బాబు కోయిలాడ' ప్రతిలిపిలో ఉద్యోగం ఉన్నది అని ప్రకటన ఇచ్చారు. ఆ ప్రకటనకు స్పందించి వారిని అడిగాను. వెంటనే బెంగుళూరు రమన్ని పిలిపించారు. 2016 నవంబర్ 7న ఇంటర్వ్యూకి వెళ్ళాను. తొమ్మిదవ తేదిన ప్రతిలిపిలో జాయిన్ అయ్యాను. బాబు కోయిలాడ కు అసిస్టెంట్గా వెళ్ళాను అనుకున్నా కాని... అక్కడికి వెళ్ళిన తర్వాతే తెలిసింది బాబు గారికి వేరే ఉద్యోగం రావడంతో నన్ను వారి స్థానంలో నియమించారని. మొదట్లో అనేక ఒడిదుడుకులు ఎదుర్కున్నాను. ప్రతిలిపి తెలుగులో 2016లో 100 మంది రచయితలు, అతి తక్కువగా సాహిత్యం ప్రచురణ అయ్యేది. రచయితలను పెంచాలి అదొక పెద్ద సవాలు ప్రతి పత్రికను చదివిౌ ప్రతి రచయితకు ఫోన్ చేసి ప్రతిలిపి గురించి వివరించి వారి సాహిత్యాన్ని ప్రతిలిపిలో ప్రచురణ చేయమని అడిగేవాడినిౌ ఎన్నో ప్రశ్నలు అడిగేవారు ప్రతిలిపిలో పోస్ట్ చేస్తే మాకేంటి? అనేవారుౌ అన్నింటికీ చాలా ఓపికగా సమాధానం ఇచ్చేవాడిని. ప్రతిలిపి ఒక స్వీయ ప్రచురణ వేదికౌ ఎవరైనా వారి సాహిత్యాన్ని ప్రతిలిపి యాప్ ద్వారా స్వీయ ప్రచురణ చేయవచ్చు. ప్రతిలిపి మూడు లక్ష్యాలతో ముందుకు వచ్చింది.
1.ఎవరైనా ఎవరి రచన అయినా స్వీయ ప్రచురణ చేసుకునే సౌలభ్యం ఇవ్వడం.
2.ప్రచురణ చేసిన సాహిత్యాన్ని పాఠకులకు చేరువ చేయడం.
3.ప్రతిలిపి నుండి రచయితలు సంపాదించుకోవడం.
మొదటి రెండు విషయాల్లో విజయం సాధించాము. ప్రతిలిపిలోని కొంతమంది రచయితల రచనల కాపి హక్కులను బ్లాక్ చేసుకొనిౌ వారికి డబ్బులు ఇవ్వడం జరుగుతోంది. రాబోయే రోజుల్లో ప్రతిలిపి అనేక సంస్థలతో పని చేయబోతోంది. ప్రతిలిపి రచయితల సాహిత్యాన్ని సినిమాలు, సీరియల్స్, షార్ట్ ఫిలిమ్స్, వెబ్ సిరీస్ లాంటి అనేక రంగాల్లో విస్తరించేందుకు కృషి చేస్తున్నాము. ప్రతిలిపిలో కథలను, నవలలను స్వీయ ప్రచురణ చేస్తే రచయితలు లక్షల్లో సంపాదించుకునే అవకాశం కోసంౌ మా ప్రతిలిపి టీం మొత్తం రాత్రి పగలు పని చేస్తున్నాము.
2017లో అఖిలాశ కవితా సంపుటిని విడుదల చేశాను. విపరీతమైన ప్రోత్సాహం లభించింది. దాదాపు యాభైకి పైగా సమీక్షలు అన్ని దిన, వార, మాస పత్రికల్లో వచ్చాయి. ఆ తర్వాత వెంట వెంటనే విప్లవ సూర్యుడు, నక్షత్ర జల్లులు పుస్తకాలను ముద్రించాను. అప్పటి వరకు అందరూ రాసే మాములు వస్తువులపైనే కవిత్వాన్ని రాసేవాడిని. ఆ తర్వాత జరిగిన కొన్ని సంఘటనలు నన్ను కలచివేశాయి. కొత్త వస్తువులపై కవిత్వం రాయాలి.. కవితా శిల్పం మారాలి అనుకున్నాను. అప్పటి వరకు.. నేను సాహిత్యాన్ని పెద్దగా చదవలేదు. ఆ తర్వాత సాహిత్య పుస్తకాలను ఎక్కువగా చదవడం మొదలు పెట్టాను.
2018, 2019 దాదాపుగా మూడు వందల వ్యాసాలు పత్రికల్లో వచ్చాయి. పుస్తకం చదివిన తర్వాత వ్యాసం రాయడం పత్రికలకు పంపడం జరిగింది. అన్ని పత్రికలు చాలా ప్రోత్సహించాయి.
కవిత్వం కంటే నా వ్యాసాలను ఎక్కువగా ఇష్టపడేవారు. ఆ తర్వాత కథలు, నవల, అనువాదాలు కూడా రాయడం మొదలు పెట్టాను. కేంద్ర సాహిత్య అకాడమి వారు ట్రావెల్ గ్రాంట్ మంజూరూ చేయడంతో.. కేరళ రాష్ట్రాన్ని సందర్శించాను. అనువాద సాహిత్యమై కేరళ రాష్ట్ర అధ్యక్షలు ''వైశాఖన్'' తో, ఉపాధ్యక్షులు ''కె.పి మోహనన్''తో చర్చలు జరిపాను. కేరళ రాష్ట సందర్శనానికి వెళ్ళినప్పుడే అక్కడి దశ్యాలను కవిత్వంగా మలిచి మట్టినైపోతాను అనే కవితా సంపుటిని విడుదల చేశాను.అయితే కవిత్వ పరంగా నాకు మంచి గుర్తింపును ఇచ్చింది.. హిజ్రాలపై నేను రాసిన దీర్ఘ కావ్యం ''వై'' ఆ పుస్తకమే సాహిత్యాకాశంలో నన్ను నిలబెట్టింది. ఆ తర్వాత మహిళా మర్మాంగంపై ''ఊరి మధ్యలో బొడ్రాయి'' దీర్ఘ కావ్యాన్ని విడుదల చేశాను. వైవిధ్యభరితమైన వస్తువులను ఎంపిక చేసుకోవడం.. ఎవరూ రాయని అంశాలపై సాహిత్యాన్ని రాయడం వల్ల స్వల్ప కాలంలోనే సాహిత్య లోకం నన్ను గుర్తించింది. అనేక పురస్కారాలు, అవార్డులు లభించాయి. ఇక వెనుతిరిగి చూసుకోలేదు. ''బురద నవ్వింది'' కవితా సంపుటి, ''వివేచని'' సాహిత్య విమర్శ, ''జిందగీ కే హీరే'' తెలుగులో ఉన్న నానో అనే మినీ కవితా ప్రక్రియను హిందీకి పరిచయం చేసిన తొలి పుస్తకం. ''గాయాల నుండి పద్యాల దాక'' 530 పేజీల కవితా సంపుటిని విడుదల చేయడం.. కవితా దిగ్గజాలు సైతం ఆ పుస్తకాన్ని కొనియాడటం నాకు మరింత ప్రోత్సాహాన్ని ఇచ్చింది. కేంద్ర సాహిత్య అకాడమి అవార్డులు వచ్చిన 17 పుస్తకాలపై వ్యాసాలను రాసి ''అకాడమి ఆణిముత్యాలు'' పేరుతో పుస్తకాన్ని వెలువరించాను. ''మది దాటని మాట'' (గే కమ్యూనిటీపై తొలి తెలుగు నవల) నవల రాయడానికి దాదాపు రెండు సంవత్సరాల సమయం పట్టింది. వస్తువు కొత్తది కావడం విషయ సేకరణ చేయడంలో ఆలస్యం అవ్వడం.. సేకరించిన తర్వాత మననం చేసుకోవడం... అనుమానాలు ఉంటే ''గే'' కమ్యూనిటీ వారిని అడిగి తెలుసుకోవడం... కత్తి మీద సామే అనిపించింది. మొత్తానికి నవల పూర్తి చేసి పుస్తకంగా వచ్చిన తర్వాత మంచి రెస్పాన్స్ వచ్చింది. రాయలసీమ మాండలికంలో ముస్లిం మైనారిటీ కథలను రాసి ''షురూ'' పేరుతో పుస్తకాన్ని తీసుకువచ్చాను. ముస్లిం మహిళల వ్యథలపై రాసిన కథలే అవి. బాల సాహిత్యం ఒకే మూస ధోరణిలో వస్తున్నాయన్నది నా విమర్శ. అందుకే ఈ మధ్య బాల సాహిత్యంపై వరుసగా వ్యాసాలు రాస్తున్నాను. రాబోయే రోజుల్లో బాల సాహిత్య విమర్శ పుస్తకం రాబోతోంది. ''కె.శివారెడ్డి'' కవిత్వం ఒక పరిశీలన, ''ఎన్. గోపి'' కవిత్వం ఒక పరిశీలన, ''రాచపాళెం చంద్రశేఖర్ రెడ్డి'' విమర్శ ఒక పరిశీలన పేరుతో మూడు పుస్తకాలను రచించాను మూడు పుస్తకాలు ఒకేసారి విడుదల చేయబోతున్నాను. రాయలసీమ మాండలికంలో పిల్లల సమస్యలపై బాల సాహిత్య కథలను ''పాపోడు'' పేరుతో ముద్రణ చేయబోతున్నాను.
ఇప్పటివరకు 1000 రచనలకు పైగా పత్రికల్లో ముద్రణ అయ్యాయి. నలభైకి పైగా అవార్డులు పొందాను. ప్రస్తుతం రంకు శీర్షికతో ఒక నవలను రాస్తున్నాను. ఐదు విమర్శ గ్రంధాలు రాసి ఉంచాను. అన్ని పుస్తకంగా తీసుకురావాలి.