Authorization
Mon Jan 19, 2015 06:51 pm
మంచి ఉపాధ్యాయున్ని కలిగి ఉన్న విద్యార్థులు గొప్పవారా ? లేక మంచి విద్యార్థుల్ని కలిగి ఉన్న ఉపాధ్యాయుడు గొప్పవాడా ? అనే ప్రశ్నకు జవాబు కొంచెం కష్టమే కానీ ఒక్కో సారి ఇద్దరూ గొప్పవారే అని నిరూపించే సందర్భాలు మన హృదయాల్ని కట్టిపడేస్తాయి. ఎన్ని పాఠాలు చెప్పినా, ఎన్ని నీతి కథలు వల్లె వేయించినా ఒక విద్యార్థికి, ఉపాధ్యాయునికి ఉండే స్నేహపూరిత బంధం ఇద్దరికీ జీవితంలో గుర్తుండిపోతుంది. నిజంగా ఒక ఉపాధ్యాయునికి నెల జీతం వచ్చినప్పుడో, బోనసులు చేతికందినప్పుడో కలిగే ఆనందం కంటే తమ విద్యార్థి ఉత్తమ మార్కులు సాధించినప్పుడు కలిగే ఆనందం వేరు. అలాంటి విద్యార్థుల్ని కలిగి ఉండే ఉపాధ్యాయులు అంతకు మించి ఇంకేం కోరుకుంటారు. విద్యార్థులో స్నేహపూరితంగా ఉండి, ఒక స్నేహితుడిలా, ఒక అన్నలా నడిపించి, పాఠ్యపుస్తకాలతో పాటు జీవిత పాఠాలు నేర్పించే ఉపాధ్యాయుడు ఎక్కడ దొరుకుతాడు. పాఠాలు అంటే భయం పోగొట్టి ఆసక్తిని పెంచే ఉత్తమ ఉపాధ్యాయులు ఎక్కడ ఉంటారు. పిల్లల ప్రేమను సంపాధించి వాటిని వెల కట్టలేని ఆదర్శవంతులు చిరునామా ఎక్కడ ? ఖచ్చితంగా అది ప్రభుత్వ పాఠశాలల్లోనే అని చెప్పాలి. ఇంగ్లీష్ భాష అంటే భయం పోగొట్టి, చదువుకు అంటే అర్థం నేర్పిన గురువు బదిలీ సంగతి తెలుసుకున్న ఆ బడి పిల్లలు కన్నీరు మున్నీరయ్యారు. వెళ్లొద్దంటూ ఆయన కోసం బడి ఏడ్చింది. ఈ న్యూస్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఇంతకీ ఆ టీచర్ ఎవరు? ఏం చేశారు ?
భగవాన్ ఇరవై ఎనిమిదేండ్ల యువకుడు .. 2014లో తమిళనాడులోని వెలియగరమ్ ప్రభుత్వ పాఠశాలలో ఇంగ్లీష్ టీచర్ గా చేరాడు. పేద కుటుంబం నుంచి కష్టపడి వచ్చాడు. దీంతో చదవు విలువ బాగా తెలుసు. విద్యార్థులకు నాణ్యమైన విద్యను, విలువలను నేర్పాలనుకున్నాడు. అతని సబ్జెక్ట్ ఇంగ్లీష్. అయినా వీలయినప్పుడల్లా అన్ని సబ్జెక్టుల డౌట్లు తనదైన శైలిలో తీర్చేవాడు. సాయంత్రం కాగానే పిల్లలతో కలిసి ఆటలాడేవాడు. భాష అంటే భయం పోగొట్టేశాడు. ఆటలతో ఆత్మవిశ్వాసాన్ని నింపాడు. విద్యార్థులెవరైనా ఆకలితో పాఠశాలకు వస్తే కనుక్కొని మరీ సొంత డబ్బులతో ఆకలి తీర్చేవాడు. పేరుకు టీచరే అయినా ఫ్రెండ్లీగా, అన్నయ్యలాగా మెదిలేవాడు. కానీ ప్రభుత్వ పరిధిలో పని చేస్తున్న టీచర్. బదిలీలు తప్పనిసరి. ఆ రోజు భగవాన్కు కూడా వచ్చింది. ట్రాన్స్ఫర్ సంగతి తెలుసుకున్న విద్యార్థులు ఆయన చుట్టూ చేరారు. వెళ్లద్దూ అంటూ కన్నీరు పెట్టారు. బడి అంతా ఏడ్పులే అతని కోసం. విషయం తెలుసుకున్న అధికారులు ఆయన బదిలీ పది రోజుల పాటు నిలిపేశారు. తర్వాత ఏం జరుగుతుందో తెలీదు. ఇలాంటి స్వచ్ఛమైన, విలువైన ఉపాధ్యాయులు, విద్యావిలువలకు ప్రభుత్వ పాఠశాలలు కేరాఫ్ అడ్రస్. అలాంటి పాఠశాలలను, ఉపాధ్యాయులను బతికించుకోవటం మన కర్తవ్యం.