Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- 9న చే వర్ధంతి
చే అంటే టీషర్ట్ మీద ప్రింటైన బొమ్మ కాదు
క్యాప్ల మీద కనిపించే ఎంబ్రయిడరీ కాదు
చే అంటే ఒక ప్రవహించే ఉత్తేజం
ఉద్యమ కంఠానికి ఉత్ప్రేరకం
సామ్రాజ్యవాదంపై ఎత్తిన పిడికిలి
అసమానతను ఎదిరించిన ధీశాలి
అణచివేతపై మార్మోగే నినాదం
నియంతృత్వాన్ని ఎదిరించిన ధిక్కార స్వరం
విప్లవ మార్గాన పయనించిన స్వాప్నికుడు
మరణాన్ని ముద్దాడిన ప్రపంచ మానవుడు
అందుకే చే అందరికీ ఓ స్ఫూర్తి...
-వినోద్ మామిడాల
ఎందుకంత అవస్థ పడుతున్నావ్! నన్ను చంపటానికొచ్చావని తెలుసు. చంపరా పిరికిపందా! ఓ మనిషిని చంపబోతున్నావు అంతే కదా '' అని గర్జించాడతను.
కాళ్లలో రెండు.. మోకాళ్లలో రెండు.. చాతిలో రెండు.. పక్కటెముకల్లో రెండు, గుండెలో ఒకటి మొత్తం తొమ్మిది బుల్లెట్లు శరీరంలోకి దిగడం వల్ల మరణం సంభవించిందని అతని
పోస్ట్ మార్టం రిపోర్ట్ తెలిపింది.
అలా 1967, అక్టోబర్ 9 మధ్యాహ్నం 1:10 నిమిషాలకు, బొలివియా సేనలకు చిక్కిన విప్లవ పోరాటయోధుని హత్య జరిగింది. మరణం దేహానికే కానీ ఆలోచనలకు కాదని చరిత్ర నిరూపించింది.
చే గువేర (జనజు) ఈ పేరు వినగానే అతని ఫొటో ఉన్న టీ షర్ట్లు, టోపీలు, బైక్ స్టిక్కర్లు ఇలా ఏవేవో వస్తువులు మదిలో మెదులుతాయి. అతనెవరు? అంత అభిమానం దేనికి? అతన్ని హీరోగా ఎందుకు కొనియాడుతున్నారు? ఎందుకంటే అతను వ్యక్తి కాదు.. ఉప్పొంగే రక్తానికి ఉత్ప్రేరకం, అతని పేరు యువతకు ఓ ప్రేరణ... నిరంకుశత్వం, సామ్రాజ్యవాదం నుంచి విముక్తి కోసం యుక్త వయస్సులోనే మరణాన్ని ముద్దాడిన విప్లవకారుడు ..అందుకే నేటికీ అతని గురించి ప్రపంచం ఇంకా చర్చిస్తూనే ఉంది.. ప్రజల్లో అతను తెచ్చిన మార్పులు, నింపిన పోరాట స్ఫూర్తి నేటికీ ఈ ప్రపంచం పదిలంగా యాదిలో ఉంచుకుంది.
ఎర్నెస్టో గువేరా ది లాసెర్నో... ''చె గువేరా'' గా ప్రపంచానికి తెలుసు.. 1928 జూన్ 14న అర్జెంటీనాలోని రుసారియోలో ఓ మధ్య తరగతి కుటుంబంలో జన్మించాడు. ఇంజనీరింగ్ విద్యనభ్యసిస్తున్నప్పుడు ప్రజల ఆరోగ్య సమస్యల గురించి తెలుసుకున్న అతను మెడిసిన్లో చేరాడు. అదే సమయంలో దక్షిన, మధ్య అమెరికాలో పర్యటించాడు. అక్కడి పేదరికాన్ని, అణచివేతను చూసి ప్రభావితుడైన 'చేె' మార్పు కోసం పని చేయాలనుకున్నాడు. 1954 మెక్సికో వెళ్లి తర్వాత క్యుబా విప్లవ నాయకుడైన ఫిడెల్ క్యాస్ట్రోను కలిసాడు. క్యాస్ట్రోతో కలిసి క్యూబా నియంత ప్రభుత్వం 'బతిస్టా'ను కూలదోసి, ప్రజలను నియంతృత్వం నుంచి విముక్తి చేయటంలో కీలక పాత్ర పోషించాడు చేెగువేరా.. 1959లో బతిస్టా పై విజయం సాధించిన క్యాస్ట్రో, క్యూబా దేశపు అధికారాలను చేపట్టాడు. ఈ సమయంలో గువెరా ''క్యూబా నేషనల్ బ్యాంకు'' అధ్యక్షుడిగా,పరిశ్రమల శాఖ మంత్రిగా కొనసాగాడు. అప్పుడే క్యూబా అంబాసిడర్గా ప్రపంచ దేశాలు పర్యటించాడు. పేదలకు భూ పంపిణీ, పరిశ్రమల జాతీయికరణల కోసం విస్తృత ప్రణాళికలు చేపట్టాడు. క్యూబాలో ప్రజా అనుకూల పరిస్థితులు ఏర్పడ్డ్డ తర్వాత ప్రపంచంలో నియంతృత్వాన్ని, అమెరికా ఆధిపత్యాన్ని ఎదుర్కుంటున్న దేశాల్లో విముక్తి కోసం పోరాడాలనుకున్నాడు. 1965లో గువెరా క్యూబాని వదిలినట్టు క్యాస్ట్రో అధికారిక ప్రకటన చేశాడు. తర్వాత కొన్ని నెలలు ఆఫ్రికాలో తిరుగుబాటు దళాలకు గెరిల్లా యుద్ధతంత్రంలో శిక్షణ ఇచ్చాడు. అనంతరం బొలివియా బయల్దేరి ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాడుతున్న తిరుగుబాటుదారులకు నాయకత్వం వహించాడు. కానీ అప్పుడే బొలివియా ప్రభుత్వం, అమెరికా సాయంతో చేగువెరాను, అతని మిత్రులను బంధించింది. 1967 అక్టోబర్ 9న బొలివియాలోని ఓ గ్రామంలో సైన్యం చేతిలో గువేరా మరణించాడు.
క్యూబా - భారత్ భాయి - భాయి''
క్యూబాలో క్యాస్ట్రో అధికారం చేపట్టిన తర్వాత మంత్రి హోదాలో చే గువెరా ఇండియాకు వచ్చారు. 1959లో ఆయన తన భారత్ పర్యటనపై నివేదిక రాసి ఫిడెల్ కాస్ట్రోకు అందించారు. ''మేము కైరో నుంచి భారత్కు వెళ్ళాం. 39 కోట్ల జనాభా, 30 మిలియన్ చదరపు కిలోమీటర్ల విస్తీర్ణమున్న దేశమది. మేమీ పర్యటనలో భారత అగ్రశ్రేణి రాజకీయ నాయకులను కలిశాం. జవహర్ లాల్ నెహ్రూ మాపై ఎంతో అభిమానం చూపారు. క్యూబా ప్రజలతో మేమున్నామని, వారు చేస్తున్న పోరాటానికి మద్దతు పలుకుతున్నామని'' నెహ్రూ చెప్పినట్లు చే గువేరా ఆ నివేదికలో పేర్కొన్నారు.
'' నెహ్రూ మాకు ఎన్నో విలువైన సలహాలిచ్చారు. క్యూబా ప్రజా ప్రయోజనాల కోసం చేస్తున్న ఉద్యమానికి ఎటువంటి షరతులు లేకుండా మద్దతు ప్రకటించారు. భారత పర్యటనలో ఎన్నో విషయాలు మేం నేర్చుకున్నాం. అందులో ముఖ్య విషయమేమిటంటే ఒక దేశ ఆర్థిక అభివృద్ధి దాని సాంకేతిక అభివృద్ధిపౖౖె ఆధారపడి ఉంటుంది. అందుకోసం ఎక్కువగా
పరిశోధనా సంస్థలు ఏర్పాటు చేయాలి. ప్రత్యేకంగా ఫార్మస్యూటికల్స్, రసాయన, భౌతికశాస్త్ర, వ్యవసాయ రంగాల్లో సంస్థలను ఏర్పాటు చేయాలనే విషయాన్ని నేర్చుకున్నాం'' అని ఆయన తన రిపోర్టులో పేర్కొన్నారు.
భారత్ నుంచి వీడ్కోలు సమయంలో తన జ్ఞాపకాల్ని గుర్తు చేసుకుంటూ ''భారత్ నుంచి తిరిగి వస్తున్నప్పుడు స్కూలు పిల్లలు మాకు 'క్యూబా - భారత్.. భాయి - భాయి' అంటూ వీడ్కోలు పలికారు. నిజంగానే క్యూబా - భారత్ భాయి - భాయి'' అని చేగువేరా రాశారు.