Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఓటు అనే రెండక్షరాలు జాతి ప్రగతినే మార్చేస్తుంది. వ్యక్తి అస్థిత్వాన్ని గుర్తిస్తుంది, వ్యవస్థ మార్పునకు నాంది పలుకుతుంది. అలాంటి మహోన్నత శక్తి ఉన్న ఓటును వినియోగించి చరిత్రను తిరగరాయటంలో యువత పాత్ర కీలకమైంది. అలాంటి ఓటుహక్కు ఐదేళ్ల పాలనకు అవకాశం కల్పించి మార్గదర్శకపాలనకు పునాదులు వేయిస్తుంది. మరి అలాంటి తీర్పు ఇవ్వాలంటే అవకాశం ప్రస్తుతం మన యువత చేతుల్లో ఉంది. నాలుగు రోజుల్లో రాష్ట్రంలో జరిగే ఎన్నికల్లోనూ యువత ఓట్లే ఫలితాన్ని నిర్ణయిస్తాయి. కొత్తగా నమోదైన ఓట్లలో 32 శాతం యువత ఓట్లే. అందులో 19 ఏండ్ల లోపు వారే 5.75 లక్షల మంది ఉన్నారు. మొత్తం ఓటర్లలో ఎక్కువ సంఖ్యలో యువతే ఉండటం వల్ల తీర్పు కీలకం.
పదునుగా ఆలోచించి ఓటేయ్యాలె..
యువతరం పదునుగా ఆలోచించి ఓటెయ్యాలి. వర్తమాన అంశా లను, సంక్షోభ పరిస్థితులను తడిమి చూడాలి. ఎన్నికల వేల రాజకీయ నాయకుల వ్యూహాలను వాస్తవికంగా అర్థం చేసుకోవాలి. నాయకుల ఊకదంపుడు ఉపన్యాసాలు, ఉత్తుత్తి ప్రసంగాలను పసిగట్టాలి. ఎవరి ఆలోచనలు ఆచరణయోగ్యంగా ఉన్నాయి. ఎవరి హామీలు అమలుకు అనుగుణంగా ఉన్నాయో విశ్లేషించాలి. మన భవిష్యత్తుకు ఏ నాయకుడు సుస్థిర హామీని ఇవ్వగలడో చూడాలి. మన విశ్వసనీయతే, మన ఆలోచనే నాయకుల విజయానికి నాంధి. వారి గెలుపే మన భవిష్యత్తునూ నిర్ణయిస్తుంది. సొ... ఓటేసే ముందు మన భవిష్యత్తు గురించి పదునుగా ఆలోచించి ఓటేయాలి.
నచ్చకపోయినా సరే.. హక్కును మాత్రం వినియోగించుకోవాలి..
18 ఏండ్లు నిండిన ప్రతీ పౌరుడికి భాతర రాజ్యాంగం ఓటు హక్కును ప్రసాదించింది. పంచాయతీ మొదలు పార్లమెంటు వరకు ప్రతి నిధులను ఎన్నుకుని పంపే అవకాశమిచ్చింది. కానీ కొందరు నాయకులు ఎన్నికల్లో గెలిచి ప్రజా సమస్యలను విస్మరించటం చూస్తూనే ఉంటాం.. మళ్లీ వారు ఎన్నికల్లో నిలబటమూ ఎరిగి ఉంటాం.. అలాంటి అభ్యర్థులు ఎన్నికల్లో నిలబడినప్పుడు ఎవరికి ఓటేయాలని అనే సందేహం రావొచ్చు. ఎవరూ ఇష్టం లేకపోతే ఎవరికో ఒకరికి ఓటేద్దాం అనుకోవటం తప్పు అయితే అసలు ఓటు వేయకుండా ఉండటం ఇంకా తప్పుడు ఆలోచన.. అందుకే 'నోటా' ఉంది. అభ్యర్థులు ఎవరూ నచ్చకపోతే వెళ్లి నోటా నొక్కి రండి. అంతే కానీ వేయకుండా మాత్రం ఉండొద్దు. ఎందుకంటే ఓటు మన హక్కు. మన హక్కుల్ని మనం సక్రమంగా సద్వినియోగం చేసుకోవాలి. ఆ హక్కులు నిర్వీర్యం అవుతుంటే కొట్లాడి సాధించాలి.
నాయకులారా జాగ్రత్త...
ఎన్నికలు అనగానే... ప్రలోభాలు, విందులు ఇదంతా కొందరికి మాత్రమే.. కానీ ఇక్కడ ఉన్నది యువ ఓటర్లు. వీరిలో ఎక్కువ శాతం మంది ఆలోచించి ఓటుతో గట్టి బుద్ధి చెబుతాం అని కాచుకుని కూర్చుకన్నవారే ఉంటారు. ఏ నాయకుని ప్రసంగం వెనుక ఎలాంటి ప్రయోజనాలున్నాయో పసిగట్టటంలో యువతరం ముందుంటుంది. ఏ నాయకుని ఆలోచనలు, పనులు ఎలాంటి పరిస్థితులకు దారితీస్తాయో అంచనా వేస్తుంది. వీరిని ఎలా అయినా ప్రలోభపెట్టాలని చూస్తే గట్టి షాకిస్తారు. కాబట్టి నాయకులారా జాగ్రత్త....
ఓటుతోనే బుద్ధిచెప్పాలి
ఓటు అనేది నాయకులపై మనం పెట్టుకున్న నమ్మకం. దాన్ని వమ్ముచేసిన వారు మనను పాలించడానికి పనికిరారు. మద్యం, డబ్బు, ప్రలోభాలకు లొంగితే ఓటు వృథా అయినట్టే. నిక్కచ్చిగా నచ్చిన, నమ్మకం ఉన్న నాయకుడికే ఓటు వేయాలి. స్వార్థ రాజకీయ నాయకులకు బుద్ధిచెప్పాలి. అప్పుడే ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించిన వారిమి అవుతాం.
ఓటు వేయకుండా ఉండను
మొదటి సారి ఓటు వేయబోతున్నాను. ఆనందంగా ఉంది. ప్రజాస్వామ్యంలో ప్రజల చేతిలో వున్న శక్తిమంతమైన ఆయుధం ఓటు. ఓటును అమ్ముకోకుండా అభివృద్ది చేసే నాయకుడికి వేసినప్పుడు మాత్రమే మన ఓటు కు సార్థకత వుంటుంది. మంచి నాయకుడికి ఓటు వేస్తాను. లేక పోతే నోటాకు వేస్తాను కానీ ఓటు వేయకుండా మాత్రం ఉండను.
అందరూ ఓటు వేయాలి
ఓటర్లు అందరూ ఓటు హక్కును వినియోగించుకోవాలి. ఎందుకంటే ఇది నెలకొ, రెండు నెలలకోసారి వేసుకునే టీకా కాదు. ఐదేండ్ల కోసారి మన భవిష్యత్తు కోసం నాయకుడిని ఎన్నుకునే ఆయుధం. నేను వేస్తేనే గెలుస్తారా? అని అనుకోవడం భ్రమ. ఒక్క ఓటుతోనే నాయకులు మారిపోతారు. ప్రలోభాలకు లొంగకుండా స్వేచ్ఛయుతంగా ఓటు వేయాలి. నచ్చిన నాయకుడిని ఎన్నుకోవాలి. ఓటు వేసేముందు యువత ఆలోచించాలి. అందరినీ చైతన్యం చేయాలి.