Authorization
Mon Jan 19, 2015 06:51 pm
బిజీ లైఫ్లో అందరితో ఉన్నట్టే ఉంటారు. ఒంటరిగా జీవిస్తుంటారు. ఉదయం లేచినప్పటి నుండి రాత్రి నిద్రపోయే వరకు యువత సోషల్మీడియాలో మునిగిపోతున్నారు. ప్రస్తుతం యువత నుండి ఈ అంటువ్యాధి చిన్నా పెద్దా తేడా లేకుండా అందరికీ సోకింది. రోజుకు రెండు గంటల కంటే ఎక్కువ సోషల్ మీడియా ఉపయోగిస్తున్నవారు మానవసంబంధాలకు దూరమవుతున్నారనేది అక్షర సత్యం. ఒంటరి జీవితానికి అలవాటు కావడం, కుంగుబాటు, చిన్న చిన్న సమస్యలను పరిష్కరించు కోలేకపోవడం వంటి మానసిక అవలక్షణాలకు చేరువవుతున్నారు.
ముచ్చట్లు పెట్టుకోవడానికి ముగ్గురు దోస్తులు లేరు. కష్ట సుఖాలు పంచుకోవడానికి తోబుట్టువులు లేరు. ప్రేమానురాగాలు, అప్యాయతలు అగుపిం చడం లేదు. ప్రస్తుతం నోటి మాటలు, చేతి స్పర్శను మరిచిపోయి ఎన్నాళ్లవుతుందో... కష్టసుఖాలు, నవ్వడం, ఏడవడం, అరవడం, కొరకడం అన్నీ సోషల్ మీడియాలోనే. జీవితంలో ఇంతగా అలుముకు పోయిన సోషల్ మీడియా ఏం చేస్తుందంటే కొడుకు వచ్చి ఓదారుస్తాడు అని కన్నవారు 'కష్టం ఉందిరా' అని ఫోన్ చేస్తే వీడియో కాల్ చేసి 'నాన్నా నాకు సెలవు దొరకడం లేదు' అంటే ఆ తల్లిదండ్రులను ఓదార్చే వారు ఎవరు చెప్పండి.
మానవత్వం ఎక్కడా..?
పని చేసి అలసిపొయాం. శారీరక శ్రమను మరిచిపోవడానికి కాసేపు ఒంటరిగా కూచుంటే ప్రశాంతత దొరుకుతుంది. కానీ ఒంటరితనం మనిషిలోని మనసుకు సంబంధించినది. ఉరుకుల పరుగుల జీవితంలో కాసేపు ఏకాంతం దొరికితే అపు రూపంగా ఆస్వాదిస్తాం. కానీ ఎప్పుడూ ఒంటరిగానే ఉండాల్సి వస్తే... మనిషిని అది భయపెడుతుంది. ప్రస్తుతం మానవాళి ఎదుర్కొంటున్న కొత్తకొత్త రోగాలకు, ఉద్వేగాలకు, ఉన్మాద చర్యలకు, విద్రోహ చర్యలకు, ఆత్మహత్యలకు పురికొల్పబడటం ఇలాంటివ న్నింటికి ప్రధాన కారణం అన్ని ఉండీ కూడా ఒంటరి జీవితం అనుభవించడం. ఆధునిక టెక్నాలజీతో దూసుకుపోతున్న ప్రపంచంలో విహారిస్తూ తనకు తానుగా అన్నింటికీ దూరంగా ఉంటూ అందరికి దూరం అవుతూ మనసుకు సంబంధించిన భావా లను పంచుకోవడానికి ఎవరూ లేకుండా జీవనాన్ని వెల్లదీస్తున్నారు. ఒంటరితనం అనేది ప్రాణాలను తీస్తుంది, ప్రాణాలను తీసుకునేలా చేస్తుంది.
ఒంటరితనం పలు కారణాలు
బాల్యదశలో తల్లిదండ్రులు మరణించడం, పెంచుకున్నవారు సరిగా అప్యాయంగా చూసుకోక పోవడం, తల్లిదండ్రులు పదే పదే ఇతరులతో పోల్చుతూ మాటలనడం, తల్లిదండ్రుల నుండి సరైన ప్రేమ లభించకపోవడం వల్ల చిన్నప్పటి నుండే ఒంట రితనంలోకి వెళ్లే ప్రమాదముంది. పిల్లవాడు హైస్కూల్కి వచ్చాడంటే చాలు హాస్టల్లో వేయడం. ఇక్కడి నుండి ప్రారంభమవుతుంది తల్లిదండ్రుల, తోబుట్టువుల ప్రేమ అప్యాయతలకు దూరంగా పెరగడం. యుక్త వయసు వచ్చేసరికి ఉద్యోగరీత్యా ఉన్న ఊరినీ, కన్న తల్లిదండ్రులనీ వదిలి పట్నాలకు వలస వెళ్తుంటారు. దానివల్ల మనసుపై తీవ్ర ప్రభావం కనిపిస్తుంది. ప్రేమించిన అమ్మాయి దక్కకపోవడం, కుటుంబ సమస్యలు, విడాకులతో విచ్ఛిన్నమైన వివాహబంధం, దగ్గరి వాళ్ల అకాలమరణం లాంటివి ఒంటరి జీవితానికి పురికొలుపుతాయి. ప్రతీ రోజు పనులతో బిజీగా ఉండే మనం హైదరాబాద్లో అయితే ట్రాఫిక్ సమస్యతో ఇంటికి చేరేందుకు నానా అవస్థలు పడుతున్నాం. చివరకు ఇంటికి చేరుకొని కొంచెం టీ తాగడం పూర్తయిన తర్వాత ఇంట్లో ఉన్న వాళ్లతో మాట్లాడే నాలుగు మాటల సమయం కూడా సెల్ఫోన్లలో, వాట్సాప్, ఫేస్బుక్లతోటే సమయాన్ని గడిపేస్తున్నాం. ఇక ఇంటి చుట్టుపక్కల వాళ్లతో మాట్లాడానికి సమయమెక్కడుంది. ప్రస్తుత జీవన విధానం ఇలా తగలడింది. సోషల్ మీడియా పుణ్యమా అని ఎక్కడెక్కడి వారినో కలిపేస్తున్నది. కానీ మనుషుల మనసుల్ని మాత్రం దూరం చేస్తూ వారిని మరింత ఒంటరివాళ్లను చేస్తున్నది ఈ సోషల్ మీడియానే. ట్విట్టర్, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, వాట్సప్ లలో.. ఫ్రెండ్స్, ఫాలోయర్స్ లైక్లు, కామెంట్లు పెరుగుతున్న కొద్దీ మనలో ఒంటరితనం మరింత పెరుగుతున్నట్టేనని గమనించండి. మనుషులలో ఉండే ఆత్మీయతకు దూరమై యంత్రాలలో ప్రేమాను రాగాల కోసం, అప్యాయతల కోసం ఒంటరితనంతో పరుగులు తీస్తున్నారు ఈ జనం.
స్లో పాయిజన్
జీవితంలో ఒంటరిగా ఉంటే మొత్తం మనమే ఎంజారు చేయవచ్చు అనుకుంటారు. నలుగురితో కలువలేకపోవడమనేది, కలివిడిగా మాట్లాడలేకపో వడం కూడా మానసిక సమస్యే. చిన్న కుటుంబాలతో ఈ ఒంటరితనం మరింత ఎక్కువగా మారింది. ఒకప్పుడు ఉమ్మడి కుటుంబ వ్యవస్థ ఉండేది. దానివల్ల పిల్లలను తల్లిదండ్రులు కోపంగా ఏమైనా అంటే వెంటనే అమ్మమ్మ, నాన్నమ్మ, తాతయ్యలు పిల్లలను దగ్గరకు తీసుకొని ఓదార్చేవారు. పిల్లలు అన్నం తినమని మారాం చేస్తే అమ్మ పెరుగన్నం కలిపి చంద మామను చూపిస్తూ, పాట పాడుతూ అన్నం తినిపిం చేది. ప్రస్తుతం పరిస్థితి భిన్నంగా మారిపోయింది. అన్నం తినమంటే సెల్ఫోన్లో గేమ్ పెట్టించి అన్నం తినిపించడం మూలంగా చిన్నప్పటినుండే పిల్లలు ఫోన్లకు బానిసలుగా మారుతున్నారు. మన జీవన విధానాలలో మార్పు వల్లనే ఒంటరితనం వస్తుంది. ఈ ఒంటరి తనం అనేది మానసికంగానే కాకుండా శారీరకంగా బలహీనపరుస్తుంది. ఒంటరితనం వల్ల ఒత్తిడి పెరుగుతుంది. ఈ ఒత్తిడి కారణంగా విడుదలయ్యే నెగెటివ్ హార్మోన్స్ మెల్లమెల్లగా అనారోగ్యాలకు దారితీసేలా చేస్తాయి. ఒంటరితనమనేది మెల్ల మెల్లగా మన జీవితాన్నే అంతం చేస్తుంది. ఇది స్లో పాయిజన్లా పనిచేస్తుంది.
జయించండిలా...
ఆత్మన్యూనతా భావం జీవితాన్ని అస్థవ్యస్తం చేస్తుంది. మిమ్మల్ని సుఖంగా నిద్ర పోనివ్వదు. శాంతంగా బతకనివ్వదు. కాబట్టి స్వేచ్ఛగా జీవించండి. ఇతరుల కన్నా మీరు ఎందులోనూ తక్కువ కాదన్న భావనలో ఉండండి. నవ్వాలనుకుంటే మనస్ఫూర్తిగా నవ్వండి. దుఃఖం కలిగితే భారం దిగిపోయేంత వరకు ఏడ్చేయండి. దీనివల్ల మనసు తేలికవుతుంది. నలుగురిలో ఉన్నప్పుడు ఏం మాట్లాడాలో, ఎలా మాట్లాడాలోనన్న ఆలోచన రానివ్వద్దు. ఎదుటి వారి అభిప్రాయాలు, మాటలను గౌరవించడం నేర్చుకోండి. ప్రతి విషయాన్ని భూతద్దంలో కాకుండా పాజిటివ్గా ఆలోచించడం అలవాటు చేసుకోండి. ఒంటరిగా జీవించే ప్రతి ఒక్కరూ అక్కర్లేని, అవసరం లేని ఆలోచనలకు తావియ్యకండి. వృత్తిరీత్యా ఎంతోమందిని కలుస్తాం. ఎన్నో సంఘటనలు ఎదురవుతాయి. వాటన్నింటినీ గుర్తు పెట్టుకోవాల్సిన పనిలేదు. ఎప్పుడూ ఇతరుల కోసం కష్టపడుతున్నామన్న భావనతో ఉండొద్దు. ఈ జీవితం మీది. మీకోసం మీరు జీవించండి. ఈ ఆలోచనే మీకు ఎక్కడ లేని శక్తినిస్తుంది. ఎప్పుడూ తెలిసిన వారినే కలవడం కాకుండా అప్పుడప్పుడూ కొత్తవారినీ కలవండి.