Authorization
Mon Jan 19, 2015 06:51 pm
మీ ఆత్మీయుల పుట్టిన రోజుకో, పెండ్లి రోజుకో ఏదైనా స్పెషల్ గిఫ్ట్ ఇవ్వాలనుకుంటున్నారా? అయితే మీరు వెంటనే పవన్ కుమార్ను కలవండి. మీ వాళ్ళు థ్రిల్గా ఫీలయ్యే గిఫ్టును పంపుతాడు. ఇంతకీ ఏంటా గిఫ్ట్ అనుకుంటున్నారా..? మీ ఆత్మీయుల పుట్టిన రోజు తేదీ ఒరిజినల్ నోటుపై వచ్చేలా సేకరిస్తాడు. దాన్నే ఓ అందమైన గ్రీటింగ్ కార్డుగా మలిచి పంపిస్తాడు. ఇంతకీ ఇతనికి ఇలాంటి ఐడియా ఎలా వచ్చిందో మీకు చెప్పలేదు కదూ..! పాత కాయిన్స్ సేకరణను హాబీగా మొదలుపెట్టిన ఇతను ఇప్పుడు నోటుతో గ్రీటింగ్ కార్డు తయారు చేయడాన్ని ఫ్రొఫెషన్గా మార్చుకోడం వెనుక ఓ పెద్ద కథనే ఉంది. అదేంటో మీరే చదవండి...
పవన్ కుమార్ది మిర్యాలగూడ. చిన్న తనంలోనే తన తల్లి చనిపోవడంతో అమ్మమ్మ వరలక్ష్మి, తాతయ్య నారాయణగార్ల దగ్గర పెరిగాడు. ఇంటర్ వరకు అక్కడే చదువుకున్నాడు. ఆ తర్వాత చదువు మానేసి ఓ ప్రైవేట్ బ్యాంక్లో అటెండర్గా చేరాడు. స్కూల్లో చదువుకుంటున్నప్పుడు తన స్నేహితుడు ఓ పాత కాయిన్ పవన్కు గిఫ్టుగా ఇచ్చాడు. అది చూసి పవన్ ఎంతో సంతోషించాడు. అలాంటి పాత కాయిన్స్ తను కూడా సేకరించాలని అప్పుడే నిర్ణయించుకున్నాడు. అప్పటి నుండి పాత కాయిన్స్ ఎక్కడ కనిపించినా వదలడు. బంధువులు, స్నేహితులు, తెలిసిన వాళ్ళు ఇలా ఎవరి దగ్గర పాత కాయిన్స్ కనిపించినా తెచ్చేసుకుంటాడు.
కొనడం మొదలుపెట్టాడు
పాత కాయిన్స్ సేకరణ మొదలుపెట్టిన తర్వాత పవన్ దగ్గర కొన్ని కాయిన్స్ డబుల్ డబుల్ ఉండేవి. వాటిని ఏం చేయాలో అతనికి అర్థం కాలేదు. దాంతో బెంగుళూరు, చెన్నై, హైదరాబాద్లో ఇలాంటి కాయిన్స్తో ఎక్కడ ఎగ్జిబిషన్స్ పెట్టినా వెళ్ళేవాడు. ఆ ఎగ్జిబిషన్కు వెళ్ళినప్పుడు అక్కడ కొత్త కాయిన్స్ కనిపించినప్పుడు తన దగ్గర ఉన్న అదనపు కాయిన్స్ను వాళ్ళకు అమ్మి తనకు కావల్సినవి కొనుక్కునే వాడు. ఇలా పవన్ రకరకాల కరెన్సీని సేకరించడంతో పలువురి ప్రశంసలు పొందుతున్నాడు. దీంతో అతనిలో పట్టుదల మరింత పెరిగింది. అపురూపమైన నోట్లు, నాణాలను కొనడం మొదలు పెట్టాడు. సీడీ దేశ్ముఖ్, జేబీ టేలర్లు ఆర్బీఐ గవర్నర్లుగా ఉన్న కాలంలో విడుదల చేసిన ఐదు రూపాయల నోట్లను 9 వేల రూపాయలకు, 16వ శతాబ్దపు నాటి నాణాన్ని 5వేల రూపాయలకు కొనుగోలు చేశాడు.
20 లక్షల విలువ చేస్తాయి
ఇప్పటి వరకు పవన్ సేకరించిన కాయిన్స్ విలువ మొత్తం లెక్కగడితే సుమారు 20 లక్షల వరకు ఉంటుంది. రాజుల కాలం నాటి వెండి, కాపర్ లాంటి రకరకాల నాణాలు ఎన్నో అతని వద్ద జాగ్రత్తగా ఉన్నాయి. విక్టోరియా రాణి, 5వ జార్జ్, ఎడ్వర్ట్ కాలం నాడు విడుదల చేసిన అర, అణా, దమ్మిడీలు, వెండి నాణాలు, చిల్లు రూపాయలతోపాటు రెండు అణాలు, నాలుగు అణాల బిళ్లలు, స్వాతంత్య్రానంతరం గాంధీ బొమ్మతో విడుదలైన పది రూపాయల వెండి నాణాలను అతను సేకరించాడు. 1957లో విడుదల చేసిన ఒక్కపైసా, తూటు పైసా నుంచి 2018 వరకు విడుదల చేసిన అన్ని రకాల నాణాలూ సేకరించాడు. 1950 నుంచి 2018 వరకు ఆర్బీఐ గవర్నర్లుగా కొనసాగిన వారంతా విడుదల చేసిన 1 నుంచి 2000 రూపాయల నోట్ల వరకు సేకరించాడు. వీటితోపాటు చేతితో తయారు చేసిన వెండి, కాపర్ నాణాలు ఇతని దగ్గర ఉన్నాయి. అక్బర్, సికందర్లోడి, షెహర్షా, ఔరంగజేబు, టిప్పుసుల్తాన్, బహుమనీ సుల్తానుల కాలం నాటి వెండి, లెడ్, సీసం, రాగి నాణాలతో పాటు బ్రిటీష్ రాజుల కాలంలో ముఖ్యమైన సంఘటన నేపథ్యంలో విడుదల చేసిన నాణాలు, కరెన్సీ అలాగే ఈస్టిండియా కంపెనీ విడుదల చేసిన నాణాలు అనేకం ఇతని వద్ద మనకు కనిపిస్తాయి.
పదిలపరచాడు...
పురాతనమైన నాణాల కోసం ఆన్లైన్లో సెర్చ్ చేసేవాడు. ఇలా సెర్చ్ చేస్తూ దేశవ్యాప్తంగా 15 వందల మంది 'కాయిన్ కలెక్టెర్స్'తో పరిచయం పెంచుకున్నాడు. పవన్ చేసిన కృషిలో విశేషమైనది ఏమిటంటే.. సముద్రంలో మునిగిన ఓడలోని వాటర్ మార్క్ పేపర్ను కూడా సంపాదించి భద్రపరచడం. లండన్ నుండి ఓడలో మన దేశానికి వస్తున్న వాటర్ మార్క్ పేపర్ సముద్ర గర్భంలో కలిసిపోయింది. ఓడను బయటకు తీసిన తర్వాత పేపర్ మన దేశానికి చేరింది. దానిని ఎగ్జిబిషన్ వారి వద్ద నుండి పవన్కుమార్ సంపాదించాడు. అంతేకాకుండా నోట్లు ముద్రించే సమయంలో పొరపాటుగా ప్రింట్ అయిన నోట్లని 'ఎర్రర్ నోట్స్' అంటారు. అలాంటివి మన పవన్ దగ్గర చాలా పదిలంగా ఉన్నాయి.
అకేషనల్గా...
స్వాతంత్య్ర దినోత్సవం తేదీ ఉన్న (150847), మహాత్మాగాంధీ జయంతి (021069), రిపబ్లిక్ డే (260150), మానిక్ జైన్ (140288), బిస్మిల్లా (000786, 786000, 786786) లాంటి పది రూపాయల నోట్లనూ సేకరించాడు. ఇప్పటికే ఢిల్లీ, ముంబయి, కోల్కతా, చెన్నై ఇలా ఇతర ప్రాంతాల్లో తన పరిచయస్తులు ఎవరు ఉన్నా తన కోసం కొత్త కరెన్సీని తీసుకువస్తారని పవన్ ఆనందంగా చెబుతున్నాడు. అలాగే ఆర్బీఐ వాళ్ళు అకేషనల్గా రిలీజ్ చేసే కాయిన్స్ 25, 50, 60,75, 100, 125,150, 200, 500, 1000 రూపాయల వెండి నాణాలను సేకరించి ఉంచుకున్నాడు. ఇవన్నీ మన చరిత్రకు ఆనవాళ్ళు. అందుకే ఇవేవీ పాడవకుండా జాగ్రత్తగా ఉండేందుకు ప్రత్యేకమైన ప్యాకింగ్ చేయించాడు.
పాప కోసం చేసుకుంటే
పవన్ తన బిడ్డ పుట్టిన రోజు నాడు పాప పుట్టిన తేదీతో కూడిన ఓ నోటును తెప్పించి దాన్ని అందమైన గ్రీటింగ్ కార్డులా తయారు చేసుకున్నాడు. ఆ గ్రీటింగ్ని ఎగ్జిబిషన్లో పెట్టినప్పుడు దాన్ని చూసిన వాళ్ళు తమకు చేసివ్వమని అడిగేవారు. అలా అడిగిన ప్రతి వాళ్ళకు పవన్ నోటుతో గ్రీటింగ్ కార్డు తయారు చేసి ఇచ్చే వాడు. చూసిన వాళ్ళందరికి ఇది అకట్టుకోవడంతో దీనికి డిమాండ్ బాగా పెరింగింది. ఇప్పటి వరకు సుమారు 1000 మందికి ఇలాంటి గ్రీటింగ్ కార్డులు తయారు చేసి ఇచ్చాడు. పెండ్లి రోజు, పుట్టిన రోజు, గృహప్రవేశం ఇలా అకేషన్ ఏదైనా సరే ఆ తేదీకి సంబంధించిన ఓరిజినల్ నోట్ను తను తెప్పించుకుంటాడు. ఈ పద్ధతి చాలా కొత్తగా అనిపించడంతో చాలా మంది తన వద్ద నుంచి ఇలా భిన్నమైన నోట్లను కొనగోలు చేస్తున్నారని పవన్ అనందంగా చెప్తున్నాడు. వీటితో పాటు ఒకటి నుండి తొమ్మిది వరకు సీరియల్ నెంబర్లున్న 500 రూపాయల నోట్ల నుంచి 10 రూపాయల నోటు వరకు సేకరించాడు.
లిమ్కా బుక్ ఆఫ్ రికార్డు కోసం
పవన్ సేకరించిన నాణాలను కేవలం తన వద్దనే ఉంచుకోకుండా మిర్యాలగూడ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉన్న పాఠశాలల్లో ఎగ్జిబిషన్ ఏర్పాటు చేస్తున్నాడు. అతను ఎగ్జిబిషన్ పెడితే ఆ కాయిన్స్ మొత్తం చూడటానికి కనీసం 45 నిమిషాలు పడుతుంది. నాణాలతో పాటు 150 దేశాల కరెన్సీతో పాటు, ఆయా దేశాల రాజధానులు, వైశాల్యం ఇలా ఆ దేశాలకు సంబంధించిన అన్ని వివరాలను తెలియజేసే విధంగా ఎగ్జిబిషన్లో ఏర్పాటు చేశాడు. అలాగే మన రూపాయి విలువ ఆయా దేశాలలో ఎంత విలువ ఉంటుందనే విషయాలు కూడా తెలియజేస్తాడు. గత చరిత్రను ఇంత ప్రచారం చేస్తున్న పవన్కు లిమ్కా బుక్ ఆఫ్ రికార్డుకు ఎక్కాలని పట్టుదల. అయితే దాని కోసం ఇప్పటి వరకు సేకరించినవి కాక ఇంకా వెయ్యి రకాల నాణాలను సేకరించాల్సి వుందట.ఇప్పుడు అతను అదే పనిలో ఉన్నాడు.
చరిత్రను తెలపాలని
'ఇప్పటి పిల్లలకు చాలామందికి ఒక పైసా ఎలా ఉంటుందో తెలియదు. అందుకే నేను సేకరించిన వాటితో ఎగ్జిబిషన్లు ఏర్పాటు చేస్తున్నాను. మన గత చరిత్ర ఇప్పటి వాళ్ళకు తెలియజేయాలి. అదే నా లక్ష్యం. ఇప్పటి వరకు మిర్యాలగూడతో పాటు చుట్టుపక్కల గ్రామాల్లో మాత్రమే ఎగ్జిబిషన్లు ఏర్పాటు చేయగలిగాను. ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా ఈ ఎగ్జిబిషన్లు ఏర్పాటు చేయాలనకుంటున్నాను. నేను చేస్తున్న ఈ ఎగ్జిబిషన్స్కు నా భార్య స్రవంతి కూడా ఎంతో సహకరిస్తుంది' అంటూ ఆనందంగా చెబుతున్నాడు పవన్.