Authorization
Mon Jan 19, 2015 06:51 pm
స్మార్ట్ ఫోన్ చేతిలో ఉంటే చాలు... ఎక్కడకు వెళ్ళినా ఓ సెల్ఫీ తీసుకోవడం అలవాటుగా మారిపోయింది. మరీ ముఖ్యంగా యువతలో ఈ సెల్ఫీ మోజు బాగా పెరిగిపోయింది. మీకు కూడా సెల్ఫీలు ఎక్కువగా తీసుకునే అలవాటు ఉందా? నిత్యం సెల్ఫీ ప్రపంచంలో విహరిస్తున్నారా? అయితే జాగ్రత్త... మీకు తెలియకుండానే ఓ కొత్తరకం వ్యాధిబారిన పడొచ్చు. భరించలేని నొప్పితో ఆసుపత్రిపాలు కావచ్చు. డాక్టర్లు దీన్ని 'సెల్ఫీ వ్రిస్ట్' వ్యాధి అని తేల్చేశారు. గత కొన్నాళ్ళుగా ఈ వ్యాధితో బాధపడుతున్నవారి సంఖ్య క్రమేపీ పెరుగుతున్నది. ఇప్పటికే పలు కేసులు నమోదయ్యాయని 'ఫాక్స్ న్యూస్' సంస్థ చెబుతున్నది.
ఒకే స్థితిలో ఉంచినప్పుడు
వైద్య పరిభాషలో దీన్ని 'కార్పాల్ టన్నెల్ సిండ్రోమ్' అంటారని తెలిపింది. చేతిని పదే పదే ఒకే స్థితిలో ఉంచినప్పుడు కార్పాల్ ఎముకల నుంచి వెళ్లే ప్రధాన నరాల వ్యవస్థ ఒత్తిడికి లోనవ్వుతుంది. ఫలితంగా మణికట్టు, చేతి వేళ్లు తీవ్రంగా నొప్పి పెడతాయి. దీనివల్ల జలదరింపు, తిమ్మిరిలు, నొప్పి వంటివి ఏర్పడతాయని వైద్యులు తెలిపారు.
దీర్ఘకాల సమస్యగా...
సెల్ఫీ తీసుకున్నప్పుడు మొబైల్ లేదా సెల్ఫీ స్టిక్ను ఎక్కువ సేపు పట్టుకోవడం, పదే పదే అటూ కదల్చడం వల్ల ఈ సమస్య ఏర్పడుతున్నట్లు పరిశోధనల్లో తేలింది. దీనివల్ల రోగులు మణికట్టు నొప్పితో బాధపడతారని, సెల్ఫీలతో ఎక్కువ సేపు గడిపేవారికి ఇది దీర్ఘకాలిక సమస్యగా మారే అవకాశం కూడా ఉందని వైద్యులు చెబుతున్నారు.
తీవ్ర గాయాలతో...
ఇదిలా ఉండగా.. సెల్ఫీల మోజులో కొంతమంది కాళ్లు, చేతులను పోగొట్టుకుంటున్నారని ఐరిష్కు చెందిన ఓ వైద్య పరిశోధనల పత్రిక వెల్లడించింది. రాళ్ల మీద నుంచి దూకడం లాంటి సాహస కృత్యాలు, సెల్ఫీ తీసుకునే ప్రయత్నంలో చేతులతో బలమైన వస్తువులను ఢకొీట్టడం వల్ల తీవ్రంగా గాయపడుతున్నారని తెలిపింది.
కాస్త జాగ్రత్త...
గత ఏడాది నిర్వహించిన ఓ సర్వే ప్రకారం.. 2011 నుంచి 2017 నవంబరు వరకు 259 సెల్ఫీ మరణాలు సంభవించాయి. వీటిలో అత్యధిక మరణాలు ఇండియా, అమెరికా, రష్యా, పాకిస్తాన్ల లో చోటుచేసుకున్నాయి. కాబట్టి, సెల్ఫీలు తీసుకునేప్పుడు కాస్త జాగ్రత్తగా ఉండండి. అలాగే ఈ విషయాన్ని మీ స్నేహితులు, బంధువులు, ఆప్తులతోనూ పంచుకోండి.