Authorization
Mon Jan 19, 2015 06:51 pm
మహేశ్బాబు నటించిన శ్రీమంతుడు సినిమా గుర్తుంది కదా? అందులో హీరో తన సౌకర్యాలన్నింటినీ వదులుకొని సొంత ఊరు కోసం శ్రమిస్తాడు. గ్రామంలో కనీస వసతులు కల్పిస్తాడు. అచ్చం అదే తరహాలో పశ్చిమగోదావరి జిల్లాలో ఓ 'శ్రీమంతురాలు' ఉంది. ఆమే పశ్చిమ గోదావరి జిల్లా కొవ్వలికి చెందిన వెలమాటి మనోహరి. ఆమె ఢిల్లీలోని జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీలో పీహెచ్డీ చేశారు. అదే సమయంలో లోక్సత్తా అధినేత జయప్రకాశ్ నారాయణ ఆధ్వర్యంలో జరిగిన స్వరాజ్ ఉద్యమంలో పాల్గొన్నారు. ఆక్కడ కొంత కాలం పనిచేశారు. ఆ స్పూర్తితో తన తర్వాతి ప్రయత్నానికి సొంత గ్రామాన్ని ఎంచుకున్నారు. ఊరిని అభివృద్ధి చేయాలని నిర్ణయించుకొని.. కొవ్వలికి వచ్చేశారు. 'గ్రామ దీపం' అనే సంస్థను స్థాపించారు. అందులో స్థానిక మహిళలను, బాలబాలికలను భాగస్వాములను చేశారు. బహిరంగ మలవిసర్జన నుంచి గ్రామానికి విముక్తి కల్పించారు. ఒకప్పుడు బహిరంగ మలవిసర్జన చేసే ప్రదేశాల్లో పచ్చటి మొక్కలు, బెంచీలు వెలిశాయి. రచ్చబండలుగా మారాయి. ఆ తర్వాత మనోహరి బాలికా విద్య కోసం 'బాలిక విద్యా నిధి' ఏర్పాటు చేశారు. దీనికోసం గ్రామానికి చెందిన ఎన్నారైలు, పారిశ్రామికవేత్తలు, వ్యాపారులు విరాళాలు ఇచ్చారు. ఆ నిధులతో ఆమె గ్రామానికి చెందిన బాలికలను ఉన్నత చదువులు చదివిస్తున్నారు. గ్రామంలో పారిశుద్ధ్యం విషయంలోనూ గ్రామదీపం సంస్థ పోరాడుతోంది. అంతేకాదు మహిళలకు స్వయం ఉపాధి కల్పించేందుకు ఏర్పాట్లు చేస్తోంది. మనోహరి చేస్తున్న పనులను అడ్డుకునేందుకు ఎందరో ప్రయత్నించారు. కానీ ఆమె వాటన్నింటినీ గ్రామస్థుల సాయంతో ఎదురించారు. కుటుంబ హింస, వరకట్న వేధింపులు వంటి సమస్యలపైనా పోరాడుతున్నారు. ఎంతో మంది మహిళలకు, యువతకు స్ఫూర్తిగా నిలుస్తున్నారు.