Authorization
Mon Jan 19, 2015 06:51 pm
యవ్వనంలో అతిగా మద్యం తాగినా ఏం కాదని చాలా మంది అనుకుంటారు. వయసులో ఉన్నప్పుడు ఫుల్లుగా మద్యం తాగి ఆ తర్వాత మానేద్దాంలే అనే భావన చాలా మందిలో ఉంటుంది. అయితే యవ్వనంలో అతిగా తాగితే మెదడుపై శాశ్వతంగా ప్రభావం పడుతుందని ఓ పరిశోధనలో తేలింది.
మద్యం తాగడంపై ప్రపంచవ్యాప్తంగా అనేక రకాల వార్తలు ప్రచారంలో ఉన్నాయి. కొన్ని పరిశోధనల్లో రోజుకు రెండు పెగ్గులు తాగితే మంచిదని తేలితే, మరొకొన్ని పరిశోధనల్లో చుక్క మందు తాగినా ప్రభావం తప్పకుండా పడుతుందని చెప్తుంటారు. అయితే కొందరు ఒకటి.. రెండు పెగ్గులతో ఆపరు. మందుకు బానిసలుగా మారుతున్నారు. ఒకప్పుడు తాగుడు అలవాటు 30 ఏండ్లు దాటినవారిలోనే కనిపించేది. ఒకవేళ కుర్రతనంలో తాగినా తల్లిదండ్రులకు, పెద్దవాళ్లకు, సమాజానికి భయపడుతూ ఒకటి రెండు పెగ్గులు పుచ్చుకునేవారు. కానీ ఇప్పుడు పరిస్థితి మారింది. కుర్రకారు మద్యం మత్తులో కూరుకుపోతున్నారు. ఇలాంటివారికి హెచ్చరికగా ఇప్పుడో పరిశోధన వెలుగులోకి వచ్చింది. యవ్వనంలో విపరీతంగా మద్యం తాగితే అది మెదడుపై శాశ్వత ప్రభావం చూపుతుందని దాంతో మానసిక సమస్యలు వచ్చే ప్రమాదం అధికంగా ఉంటుందని తేలింది. అమెరికాలోని ఇలియన్స్ యూనివర్సిటీ పరిశోధకులు ఈ విషయాన్ని వెలుగులోకి తెచ్చాయి.
అతిగా మద్యం తాగడం వల్ల మెదడులో శాశ్వతంగా మార్పులు కలుగుతాయి.
నాడీవ్యవస్థ దెబ్బతింటుంది.
నిర్ణయాలు తీసుకోవడం, స్వీయనియంత్రణ కలిగి ఉండటాన్ని ప్రభావితం చేసే మెదడు భాగాలు దెబ్బతింటాయి.
భావవ్యక్తీకరణ సమస్యలు ఏర్పడతాయి. మాటలు తడబడతాయి. ఇతరులతో సంభాషించలేకపోవడం వంటి సమస్యలు వస్తాయి.
ఒత్తిడి, ఆందోళన పెరుగుతాయి.
అందుకే వయసులో ఉండగా మద్యం తాగాలనుకోవడం... తాగడం సహజమే అనే అభిప్రాయాన్ని యువతీయువకులు, తల్లిదండ్రులు మార్చుకోవాలి. జీవితంలో ఏ దశలో అయినా మద్యపానం క్షేమం కాదని తెలుసుకోవాలి. మద్యం ఎంత మోతాదులో తాగినా దాని తాలూకు ప్రభావం శాశ్వతంగా పడుతుందని గ్రహించాలి.
ఇలా చేయండి:
తాగుడు మానేసినవారు తమ జీవనశైలి విషయంలో మార్పులు చేయాలి.
తగినంత వ్యాయామం చేయాలి.
మంచి ఆహారాన్ని తీసుకోవాలి.
ఇతరత్రా వ్యసనాల జోలికి పోకుండా ఉండాలి.