Authorization
Mon Jan 19, 2015 06:51 pm
డిగ్రీ వరకు సరిగ్గా తెలుగు మాట్లాడటం కూడా రాదు ఆ పిల్లోడికి. ఇప్పుడు గంటల కొద్దీ లెక్చర్లు ఇస్తున్నాడు. సీరియస్గా ప్రయత్నిస్తే ఈ పాటికి ప్రభుత్వ ఉద్యోగం సంపాదించేవాడు. కానీ తాను పడిన ఇబ్బందులు మరెవరూ పడకూడదని తపిస్తున్నాడు. అందుకే సివిల్స్కు ప్రిపేరయ్యే వారికి స్ఫూర్తి దాయకమైన క్లాసులు చెబుతూ ఎందరినో పోటీ పరీక్షలకు సిద్ధం చేస్తున్నాడు. అంతే కాదు అలాంటి విద్యార్థుల కోసం స్వయంగా నాలుగు పుస్తకాలు కూడా ప్రచురించాడు. అతడే మహమ్మద్ ముసావీర్ అలీ. 'అధ్యయనం అనేది ఓ పోరాటంలా సాగాలి' అంటున్న అతని గురించి మరిన్ని వివరాలు మీకోసం...
ముసావీర్ది కొమరంభీం జిల్లా, చింతలమానిపల్లి మండల పరిధిలోని గూడెం అనే ఓ మారుమూల గ్రామం. తండ్రి ఇర్షాద్ అలీ, తల్లి అఫ్రోజ్బేగం. ఆరుగురు సంతానంలో ముసావీర్ చిన్నవాడు. సాధారణ వ్యవసాయం కుటుంబం. రెక్కలు ముక్కలు చేసుకుంటే గాని రోజు గడవదు. గూడెంలో ఐదో తరగతి వరకు మాత్రమే ఉండేది. సొంత గ్రామంలో ఐదో తరగతి పూర్తి చేసి ఆరు, ఏడు తరగతులు చింతలమానిపల్లిలో చదివాడు. మిగిలిన తరగతులు సిర్పూర్ బీసీ హాస్టల్లో ఉండి పూర్తి చేశాడు.
మధ్యలో ఆగిపోయేది...
పదో తరగతి తర్వాత ఇంటర్లో చేరడం కష్టమయింది. ముసావీర్కి చదువుకోవాలని కోరిక. ఇంట్లో కూడా కొడుకును చదివించాలనే అనుకున్నారు. కానీ ఆర్థిక పరిస్థితి సహకరించలేదు. అప్పట్లో మైనార్టీలకు హాస్టల్ సౌకర్యం లేదు. దాంతో మూడు నెలలు ఇంట్లోనే ఉండిపోయాడు. ఇక తన చదువు కొనసాగదని తండ్రితో పాటే కిరాణా షాప్ చూసుకునేవాడు. చదువులో ముందుండి, ఎంతోచురుకైన వాడిగా ఊళ్ళో గుర్తింపు పొందిన ముసావీర్ గురించి స్థానిక ఎమ్మెల్యే కోనేరు కోనప్పకు తెలిసింది. అలాంటి అబ్బాయి చదువు మధ్యలో ఆగిపోకూడదని తన స్పెషల్ రికమెండేషన్తో సోషల్వెల్ఫేర్ హాస్టల్లో సీటు ఇప్పించాడు ఎమ్మెల్యే. ఆ సహకారంతో ఇంటర్ పూర్తి చేశాడు ముసవీర్. ఇంటర్లో సీఈసీ తీసుకుని 75 శాతం మార్కులతో పాసయ్యాను.
టాపర్గా నిలిచాడు
ఇంటర్ తర్వాత కాగజ్నగర్లోని ఎస్కే డిగ్రీ కాలేజీలో డిగ్రీ చేసి కాలేజ్లోనే టాపర్గా నిలిచాడు. ఉస్మానియా యూనివర్సిటీకి ఎమ్మే ఎకనామిక్స్ కోసం ప్రవేశ పరీక్ష రాశాడు. తన కాలేజీ నుండి ఎంట్రన్స్ పరీక్ష రాసిన వారిలో ముసావీర్ ఒక్కడికి మాత్రమే క్యాంపస్లో సీటు వచ్చింది. అలా ఉస్మానియా యూనివర్సిటీలో అడుగుపెట్టి ఎమ్మే పూర్తి చేశాడు.
భారం కాకూడదని
తన చదువు తల్లిదండ్రులకు భారం కాకూడదని పీజీ చేసేటప్పుడే సాయంత్రం పూట క్లాసులు చెప్పేవాడు. అప్పుడప్పుడు క్యాటరింగ్ కూడా చేసేవాడు. ఇలా తన చిన్న చిన్న ఖర్చుల కోసం ఇంట్లో వారిపై ఆధారపడకుండా కష్టపడి సంపాదించుకున్న డబ్బుతోనే చదువు పూర్తి చేశాడు. పీజీ పూర్తి చేసిన తర్వాత కొంత కాలం డిగ్రీ కాలేజీలో ఫ్యాకల్టీగా పని చేశాడు. 2013లో పీహెచ్డీ సీటు వచ్చింది. ''స్టాక్ మరియు బంగారం ధరల సంబంధాలు'' అనే అంశంపై పీహెచ్డీ చేసి 2018లో డాక్టరేట్ అందుకున్నాడు.
ఉద్యోగ అవకాశాలు ఉన్నా...
పీహెచ్డీ చేసేటప్పుడు కాంపిటీటివ్ పరీక్షలు ప్రిపేరై సివిల్స్లో ర్యాంక్ తెచ్చుకోవాలని అనుకున్నాడు. అయితే ఆ సమయంలో అతను ఎన్నో ఇబ్బందు ఎదుర్కొన్నాడు. గ్రామీణ ప్రాంతం నుండి వచ్చిన ముసావీర్కి పోటీ పరీక్షలను ఎలా ఎదుర్కోవాలి, ఎలా ప్రిపేర్ కావాలి, ఎలాంటి పుస్తకాలు చదివితే ర్యాంక్ కొట్టవచ్చు అనే విషయాలపై గైడెన్స్ ఇచ్చే వారు లేరు. దాంతో ప్రిపరేషన్ కోసం అతను ఎంతో ఇబ్బంది పడ్డాడు. అయితే కాస్త సీరియస్గా ప్రయత్నిస్తే ఉద్యోగం తెచ్చుకునేవాడు. కానీ తను పడిన ఇబ్బంది మరెవరో పడకూడదని అప్పుడే అనుకున్నాడు. ఉద్యోగం సంపాదిస్తే తనకు మాత్రమే ఉపయోగం. అదే తనలా ఇబ్బంది పడే వారికి గైడ్గా ఉంటే ఎంతో సహకరించవచ్చని నిర్ణయించుకున్నాడు. మరీ ముఖ్యంగా గ్రామీణ విద్యార్థులకు తన సహకారం అందించాలనుకున్నాడు. అప్పటి నుండి కాంపీటీటివ్ పరీక్షలకు ప్రిపేర్ అయ్యే వారికి క్లాసులు చెప్పడం మొదలుపెట్టాడు.
నాలుగు పుస్తకాలు...
ప్రస్తుతం ముసావీర్ రెండు తెలుగు రాష్ట్రాల్లోని ప్రతి జిల్లాలో తన క్లాసులను వినిపిస్తున్నాడు. రాష్ట్రంలో పోలీస్ డిపార్ట్ వారు నిర్వహించే క్లాసులకు కూడా హాజరై డిపార్ట్మెంట్ క్లాసులు కూడా చెబుతున్నాడు. అలాగే రాజ్యాంగంలో ఎప్పటికప్పుడు వస్తున్న మార్పులను గమనిస్తూ దీన్ని తన స్పెషల్ సబ్జెక్టుగా ఎంచుకుని క్లాసులు చెబుతున్నాడు. ఇంకా ఎస్సీ స్టడీసర్కిల్, బీసీ స్టడీ సర్కిల్స్లో కూడా చెబుతుంటాడు. అంతే కాకుండా ఈ సబ్జెక్టుపై పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న విద్యార్థుల కోసం స్వయంగా నాలుగు పుస్తకాలను ముసావీర్ పబ్లికేషన్ పేరుతో ప్రచురించాడు. ఇప్పటికే మన రాష్ట్రంలో ఆ పుస్తకాలు పది వేల కాపీలకు పైగా అమ్ముడు పోయాయి.
నిరుత్సాహ పడొద్దు
సివిల్స్లో ర్యాంక్ రావాలంటే వంద పుస్తకాలు చదవాల్సిన అవసరం లేదు. సరైనవి ఎంచుకుంటే కొన్ని పుస్తకాలు చాలు. అయితే చదవడంలో ఓ ప్లాన్ ఉండాలి. అప్పుడు ఏదీ కష్టం కాదు. ప్రయత్నం చేస్తే సులభమే. ప్రస్తుతం చాలా మంది ఒకే ఒక నోటిఫికేషన్కు పరిమితమవుతున్నారు. సక్సెస్ కాకపోతే నిరుత్సాహానికి గురవుతున్నారు. ఏవేవో ఆలోచనలు చేస్తున్నారు. ఇది సరి కాదు. లక్ష్యాన్ని చేరే వరకు అధ్యయనం అనేది పోరాటంలా ఉండాలి. నిరుత్సాహ పడకుండా ఓపిగ్గా ప్రయత్నించాలి. సాధించాలనే పట్టుదల ఉండాలి. పోటీ పరీక్షల ద్వారా కేవలం ప్రభుత్వ ఉద్యోగమే కాదు బతకడం కూడా నేర్చుకోవచ్చు. ఏ రంగంలో ఉన్నా భవిష్యత్కు ఉపయోగపడుతుంది. ఒక వేళ ఈ రంగంలో సక్సెస్ కాకపోతే ఇక్కడితో జీవితం ఆగిపోయినట్టు కాదు. ప్రత్యామ్నాయాలు వెదుక్కొంటూ ముందుకు సాగిపోవాలి.
ఎస్ఎఫ్ఐ నేర్పిన వాక్చాతుర్యమే
''మాది ముస్లిం కుటుంబం కావడంతో డిగ్రీ వరకు నాకు తెలుగు మాట్లాడడం సరిగ్గా వచ్చేది కాదు. ఎస్కే డిగ్రీ కాలేజీలో చదివేటప్పుడు ఎస్ఎఫ్ఐతో పరిచయం అయ్యింది. అప్పటి నుండి ఎస్ఎఫ్ఐ క్లాసులకు, మీటింగ్లకు రెగ్యులర్గా వెళుతుండేవాడిని. అక్కడ సమావేశాల్లో మాట్లాడడం అలవాటు కావడంతో ఇప్పుడు తెలుగు ఇంత బాగా మాట్లాడగలుగుతున్నాను. పోటీ పరీక్షల వారికి క్లాసులు బాగా చెబుతున్నానని పేరువచ్చిందంటే అది కేవలం ఎస్ఎఫ్ఐ నాకు నేర్పిన వాక్చాతుర్యమే. నా అంతిమ లక్ష్యం మాత్రం ఉస్మానియా యూనివర్సిటీలో ప్రొఫెసర్గా చేరాలి. ఎంతో మంది విద్యార్థులను తీర్చిదిద్దాలి'' అంటు న్నాడు ముసావీర్.