Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నేటి యువత కోర్కెలకు రెక్కలు కట్టుకొని విదేశాలకు ఎగిరిపోతుంటే ఈ యువకుడు మాత్రం హలం పట్టి పొలం దున్నుతున్నాడు. బార్డర్లో ఐదేండ్లు దేశానికి సేవ చేశాడు. ఇప్పుడు ప్రజలకు అన్నంపెట్టే రైతన్నగా మారిపోయాడు. అతనే మాజీ జవాన్ సింగతి చంద్రశేఖర్. 'ఉద్యోగం చేయచేతగాక పొలంపని చేస్తున్నాడు' అంటూ ఎగతాళి చేసిన వారితోనే ఇప్పుడు శభాష్ అనిపించుకుంటున్న ఆ యువరైతు పరిచయం...
చంద్రశేఖర్ సొంత ఊరు మంచిర్యాల జిల్లా, తాండూర్ మండలం, మాదారం టౌన్షిప్. తల్లి లక్ష్మీ, తండ్రి లింగయ్య. వీరికి ముగ్గురు కొడుకులు. వారిలో అందరికంటే చిన్నవాడు చంద్రశేఖర్. లింగయ్యకు సింగరేణిలో ఉద్యోగం. పెద్ద కొడుకు కానిస్టేబుల్. రెండో కొడుకు సాఫ్ట్వేర్. చంద్రశేఖర్కి చిన్నప్పటి నుండి బార్డర్లో పని చేయాలని కోరిక. ఎందుకంటే ఆ ఊళ్ళో ఇంటికో జవాన్ ఉన్నాడు. అందుకే అతను కూడా పదో తరగతి పూర్తికాగానే ఆ ఉద్యోగం కోసం ట్రై చేశాడు. 2010లో బీఎస్ఎఫ్(బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్) లో చేరాడు.
రిస్క్తో కూడుకున్నదైనా...
స్మగ్లింగ్ చేసే దొంగలను పట్టుకోవడం, మాల్ సీజ్ చేయడం అతని ఉద్యోగం. యువకుడైన చంద్రశేఖర్ చాలా ఉత్సాహంగా తన కర్తవ్యాన్ని నిర్వర్తించేవాడు. తను చేస్తున్న పని చాలా రిస్క్తో కూడుకున్నది. అందుకే ఇంట్లో వాళ్ళు కాస్త భయపడ్డారు. అయినా దేశ రక్షణ కోసం పని చేయడం అతనికి చాలా తృప్తినిచ్చింది. అలా ఐదేండ్లు దేశ సరిహద్దుల్లో తన సేవలు అందించాడు.
తల్లి కోసం వెనక్కి...
బార్డర్లో ఎంతో ఉత్సాహంగా పని చేస్తున్న అతన్ని తల్లి అనారోగ్యం ఇబ్బంది పెట్టింది. స్పాండిలైటిస్ కారణంగా లక్ష్మి పూర్తిగా మంచానికే పరిమితమయ్యింది. ఇంట్లో చూసుకోడానికి ఆడపిల్లలు లేరు. చిన్నవాడైన చంద్రశేఖర్కి తల్లిపై మమకారం. తల్లి ఆనారోగ్యంతో బాధపడుతుంటే చూస్తూ ఉండలేకపోయాడు. అందుకే ఉద్యోగం మానేసి తల్లికి సాయంగా వచ్చేశాడు. మూడు నెలల్లో తల్లి ఆరోగ్యం కాస్త స్థిమితపడింది. ఆ తర్వాత ఏం చేయాలనే ఆలోచన ఆ యువ జవాన్లో మొదలయింది.
కొత్తగా ప్రయత్నించాలని
వీరికి 13 ఎకరాల పొలం ఉంది. అయితే తండ్రి ఉద్యోగరీత్యా పొలం చూసుకోలేక కౌలుకిచ్చాడు. 'ఇంత పొలం ఉండి నేనే ఎందుకు పండించ కూడదు' అనే ఆలోచన అతనికి వచ్చింది. సాగుచేయాలనే ఆశ ఉంది. కానీ ఏం పండించాలి. ఊళ్ళో అందరూ పత్తి మాత్రమే పండిస్తున్నారు. అందరిలా కాకుండా ఏదైనా కొత్తగా సాగుచేయాలనుకున్నాడు. యువరైతు వ్యవసాయం పట్ల ఆసక్తి చూపడంతో మండల వ్యవసాయ అధికారి సహకరించారు. వారు ఇచ్చే సూచనలు, సలహాలు ఇతనికి బాగా ఉపయోగపడ్డాయి. అలాగే చిన్నప్పుడు నాయనమ్మ ఊరికి వెళ్ళినప్పుడు సరదాగా పొలం వెళ్ళిన అనుభవం కూడా అతని సాగుకి అక్కరకొచ్చింది. ఇంకా ఇంటర్నెట్, యూట్యూబ్లో అధ్యయనం చేశాడు. వ్యవసాయంపై కాస్త అవగాహన వచ్చిన తర్వాత హార్టీకల్చర్వైపు దృష్టిపెట్టాడు. ఖాళీగా ఉండటం కంటే తన పొలంలో పండించడమే మంచిదని నిర్ణయించుకున్నాడు.
మొదటి అనుభవంగా...
మొదటిసారి 2016లో కంది పంట వేసి అందులో అంతర్ పంటగా జొన్న, మక్కజొన్న వేశాడు. బాస్మతి 1509 వెరైటీ పండించాడు. అలాగే మూడు కుంటల్లో బంతిపూలు కూడా సాగుచేశాడు. బంతి మొదటి ప్రయత్నం కాబట్టి శాంపిల్ కోసం అంత తక్కువ స్థలంలో పండించాడు. అప్పటి వరకు ఊళ్ళో ఏ రైతూ పూలు పండించలేదు. దాంతో చంద్రశేకర్ పండించిన బంతిపూలకు మంచి డిమాండ్ వచ్చింది. అయితే పంట మొత్తం వర్షాధారమే. దాంతో కంది, జొన్న, మక్కజొన్నకు లాభమేమీ రాలేదు. అయితే నష్టం కూడా రాలేదు. మొదటి సారి అనుభవంతో ఈ సారి బోర్ వేయించాడు. పూలకు డిమాండ్ ఎక్కువ ఉండటంతో ఈ సారి రెండెకరాల్లో బంతిపూలు వేశాడు.
ఖర్చులు తగ్గించాడు
2017లో భారీ వర్షాల వల్ల మిగిలిన పంటలు దెబ్బతిన్నాయి. పూలల్లో మాత్రం లాభం వచ్చింది. దాంతో పూలపంటపైనే తన దృష్టి పెట్టాడు. తన అనుభవం, నైపుణ్యంతో పంటకు అయ్యే ఖర్చు తగ్గించే ప్రయత్నం చేశాడు. పూలకు
బాగా పురుగుపట్టేది. వాటిని నివారించడానికి ఏడాదికి కనీసం పదిసార్లు పురుగు మందులు కొట్టేవాడు. పురుగు మందుకు బదులుగా నాటు కొళ్ళను తెచ్చి పూలు పూసే సమయానికి తోటలో వదిలేవాడు. ఆ కోళ్ళ వల్ల పురుగు తగ్గిపోయేది. ఇలా మందు కొట్టే శ్రమ అతనికి తగ్గిపోయింది. ఇప్పుడు ఏడాదికి ఒకటి, లేదా రెండు సార్లు మాత్రమే మందు కొడుతున్నాడు. తోట కోసం మొదట్లో 10 నాటు కోళ్ళను తీసుకొచ్చాడు. అవి పెరిగి ప్రస్తుతం 60, 70 అయ్యాయి. ఇలా పూలతో పాటు కోళ్ళ నుండి కూడా ఆ యువరైతు లాభం పొందుతున్నాడు. పూలతో పాటు మిర్చి, టమాటా, క్యాప్సికం కూడా పండిస్తున్న చంద్రశేఖర్ గత ఏడాది కర్బూజ సాగు చేశాడు. అయితే తుఫాను వచ్చి పంట మొత్తం పోయి నష్టం వచ్చింది. అయినా కొత్తగా ఆలోచించాలనే అతని ఆలోచన మాత్రం ఆలాగే ఉంది. అందుకే ఈసారి కోల్కతా నుండి డ్రాగెన్ ఫ్రూట్ అనే పండ్ల మొక్కలను 200 తీసుకొచ్చి నాటాడు. ఇప్పుడిప్పుడే అవి ఎదుగుతున్నాయి.
వెబ్ సైట్ క్రియేట్ చేసి
చంద్రశేఖర్ పండించిన కూరగాయలు మంచిర్యాల మార్కెట్కి తరలిస్తాడు. పూలనైతే చాలా మంది పొలం దగ్గరకు వచ్చి కొనుక్కొంటుంటారు. వేస్ట్ డీ కంపోజ్తో తాను స్వయంగా తయారు చేసిన సేంద్రియ ఎరువునే అతను ఉపయోగిస్తాడు. ఈ సంవత్సరం బంతిపూలతో పాటు గులాబీ, చామంతి వేయాలని ఆలోచిస్తున్నాడు. ప్రస్తుతం ఇతన్ని చూసి ఒకరిద్దరు పూలు పండించేందుకు ముందుకు వస్తున్నారు. 'జై జవాన్, జై కిసాన్ ఆర్గానిక్ ఫామ్ చంద్రశేఖర్' అనే పేరుతో వెబ్సైట్ కూడా క్రియేట్ చేశాడు. అందులో అతను పండించిన పంటల వివరాలను అప్లోడ్ చేస్తుంటాడు.
ఖర్చులు తగ్గించుకోవాలి
'వ్యవసాయంలో నష్టం రాకూడదనుకుంటే ఖర్చులు తగ్గించుకోవాలి. ప్రస్తుతం రైతులకు ఖర్చు ఎక్కువ అయ్యేది ఎరువులకోసం. గతంలో ఒక డీఏపీ బస్తా 900 రూపాయలు ఉండేది. అది ఇప్పుడు 1450 రూపాయలు అయ్యింది. ఒక్క ఎకరానికే చాలా ఖర్చు అవుతుంది. అదే ఎరువులు మనం స్వయంగా తయారు చేసుకుంటే ఆ ఖర్చు తగ్గుతుంది. దీని తయారీ కూడా చాలా తేలిక. వెయ్యిరూపాయల్లో డ్రమ్ వస్తుంది. వేస్ట్ డీ కంపోజర్ బాటిల్ 20 రూపాయలు మాత్రమే. దానిలో బెల్లం, శనగపిండితో పాటు అవసరాన్ని బట్టి కేజీ, రెండు కేజీల చేపలు వేసి మురగబెట్టి ఎరువు తయారు చేసుకోవచ్చు. దీని వల్ల భూమి కూడా బలంగా తయారవుతుంది. ప్రజలకు మంచి ఆహారం అందించినట్టు ఉంటుంది. అయితే దీని వల్ల మొదట్లో క్రాప్ కాస్త తక్కువగా ఉంటుంది. భూమి బలం పెరిగే కొద్దీ కాపు పెరుగుతుంది' అంటున్నాడు చంద్రశేఖర్
చేతగాక చేస్తున్నా అన్నారు 'మొదట్లో నేను ఉద్యోగం మానేసి వ్యవసాయం చేస్తుంటే అందరూ పని చేయడం చేతగాక వ్యవసాయం చేస్తున్నానన్నారు. ఎగతాళి చేశారు. కానీ నేను ఉద్యోగం ఎందుకు మానేశానో, మా ఇంటి పరిస్థితి ఏమిటో వాళ్ళకేం తెలుసు. నా ఇంట్లో పరిస్థితి నాకు తెలుసు వాళ్ళకు తెలియదు కదా. అయితే కొత్తగా పండించడం, అందులోనూ మా తోట రోడ్డు పక్కనే ఉంటుంది. చూసే వారందరినీ ఇట్టే ఆకర్షిస్తుంది. దాంతో అందరూ మెచ్చుకుంటున్నారు. వ్యవసాయం చేస్తున్నానని అమ్మానాన్న మొదట్లో ఇబ్బంది పడ్డా ఇప్పుడు మాత్రం ప్రోత్సహిస్తున్నారు' అంటూ తన ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నాడు మన యువరైతు.
ప్రభుత్వం సబ్సిడీ ఇస్తే
'సింగరేణిలో ఉద్యోగం చేస్తున్న నాన్న అన్ఫిట్ అయ్యాడు. కారుణ్య నియామకం ద్వారా ఆ ఉద్యోగం నాకు వచ్చింది. అయితే ఉద్యోగం చేస్తూనే వ్యవసాయం కొనసాగిస్తాను. ప్రభుత్వం సబ్సిడీ ఇస్తే పాలీహౌజ్ ఏర్పాటు చేయాలని కోరిక. పెద్ద పెద్ద ఫంక్షన్లకు పూల కోసం హైదరాబాద్ వెళ్ళాల్సి వస్తుంది. అంత దూరం నుండి పూలను ఊరికి తెచ్చే సరికి సగం నలిగిపోతాయి. ఆ పరిస్థితి లేకుండా ఊళ్ళోనే సరిపడా పూలు పండించాలన్నదే నా లక్ష్యం. ఇంకా కొత్త రకం పూలు పండించాలి' అంటున్నాడు చంద్రశేఖర్.
మార్కెట్లను అభివృద్ధి చేయాలి
తన అనుభవం నుంచి ఎంతో నేర్చుకున్న చంద్రశేఖర్ ''ప్రభుత్వం డ్రిప్ ఇరిగేషన్ కోసం అప్లికేషన్ పెట్టుకున్న వారందరికి మంజూరు చేస్తుంది. అయితే చాలా మంది రైతులకు దీనిపైన అవగాహన లేదు. అందుకే ముందు డ్రిప్పై రైతులకు అవగాహన పెంచాలి. అలాగే యువత కొత్తగా ఆలోచించి వ్యవసాయంపై దృష్టి పెడితే వ్యవసాయంలో నష్టాలు రాకుండా చేయవచ్చు. సాఫ్ట్వేర్లో కొత్త వెబ్సైట్లకు, యాప్లకు ఎలాగైతే ఆదరణ ఉంటుందో అలాగే వ్యవసాయంలో కూడా కొత్తగా ఆలోచిస్తే ఆదరణ ఉంటుంది. ముఖ్యంగా రైతులు పండించిన పంటను అమ్ముకోడానికి మార్కెట్ సౌకర్యం ఉండాలి. మార్కెట్లను అభివృద్ధి చేయాలి'' అంటున్నాడు