Authorization
Mon Jan 19, 2015 06:51 pm
లక్షల్లో జీతం.. సమాజంలో మంచి గౌరవం.. సుఖవంతమైన జీవితం... ఇంతకు మించి ఏం కావాలి ఎవరికైనా.. నేటి యువత ఇంతకు మించి ఇంకేం కోరుకుంటుంది.. కానీ అతను మాత్రం ఇంకా ఏదో చేయాలనుకున్నాడు. తను పని చేస్తున్న గల్ఫ్ గడ్డపై స్వదేశీయుల సమస్యలు చూసి చలించి పోయాడు. వారికి సాయం చేయడం మొదలుపెట్టాడు. అతనే నంగి దేవేందర్రెడ్డి. ఒక్క ప్రాంతానికే పరిమితమైన తన సేవలు గల్ఫ్ దేశాలన్నింటికి విస్తరింప చేయాలనుకున్నాడు. మంచి ఉద్యోగాన్ని వదిలేసి ప్రస్తుతం గల్ఫ్ బాధితులకు చేయూత నిస్తున్న అతని గురించి అతని మాటల్లోనే...
మాది మహబూబ్నగర్ జిల్లా, జిన్నారం విలేజ్, మరికల్ మండలం. నాన్న నారాయణరెడ్డి, అమ్మ సరళమ్మ. మాది వ్యవసాయ కుటుంబం. స్కూలింగ్ మొత్తం గ్రామంలోనే. ఆ తర్వాత కొన్ని ఆరోగ్య సమస్యల వల్ల ఇంటర్ డిస్టెన్స్లో చేశాను. డిగ్రీ మాత్రం హౌటల్ మేనేజ్మెంట్ కోర్సు హైదరాబాద్లో చేశా. ఈ కోర్సు పూర్తి చేసిన వెంటనే తాజ్ కృష్ణలో జాబ్ వచ్చింది.
చిన్ననాటి నుండే సేవాభావం
చిన్నప్పటి నుండి బాలవికాస్ కార్యక్రమాల్లో పాల్గొనేవాడిని. ప్రతి ఆదివారం మెడికల్ క్యాంప్లు పెట్టేవాళ్ళం. అప్పటి నుండే సమాజానికి నా వంతు సేవ చేయాలనే భావన వచ్చింది. తాజ్కృష్ణలో జాబ్ చేస్తున్నప్పుడు బొంబయిలో బాంబు పేలుళ్ళు జరిగాయి. అప్పటికే మన దగ్గర గోకుల్చాట్, లుంబినీ పార్కులో పేలుళ్ళు జరిగాయి. వీటన్నింటిపై ఎన్ఐఏ వాళ్ళు ఇన్వెస్టిగేషన్ కోసం ఓ టీమ్ని హైదరాబాద్ పంపించారు. ఆ టీమ్ తాజ్కృష్ణలో ఉన్నారు. వాళ్ళను నేనే రిసీవ్ చేసుకున్నాను. వాళ్ళతో పరిచయమయ్యింది. వాళ్ళ ద్వారానే 2010లో బహ్రెయిన్లో ఇంటిలిజన్స్ డిపార్ట్మెంట్లో జాబ్ వచ్చింది.
ఎన్నో అనుమానాలతో...
జాబ్ ద్వారా గల్ఫ్కు వెళ్ళే అవకాశం వచ్చింది. అక్కడికి వెళ్లక ముందు అందరిలాగే ఏవేవో ఊహించుకున్నా. 'టెర్రరిస్ట్ దేశం, పరిస్థితి ఎలా ఉంటుందో' అని భయపడ్డా. మరీ ముఖ్యంగా మీడియాలో అక్కడి పరిస్థితుల గురించి ఘోరంగా ప్రచారం చేస్తుంటారు. మన మీడియాకి చాలా వరకు షేక్ ఎవరో ఫేక్ ఎవరో తెలియదని ఆ తర్వాతే తెలిసింది. ప్రశాంతమైన వాతావరణం. అన్నీ పద్ధతిగా జరిగిపోతాయి. మరో ముఖ్యమైన విషయం ఏమిటంటే ఇస్లాం మతస్థుల్లో మానవత్వం ఎక్కువ. షేక్ ఖలీఫా దగ్గర నా ఉద్యోగం. కాన్ఫిడెన్షియల్ మీటింగ్స్ కోసం ఇతర దేశాల నుండి డెలిగెట్స్ వస్తుంటారు. వాళ్ళు వచ్చి తిరిగి వెళ్ళే వరకు ఏ చిన్న విషయమైనా మా డిపార్ట్మెంట్ చూసుకోవాలి. మావన్నీ చాలా రహస్యంగా, జాగ్రత్తగా చేయాల్సిన పనులు. అందుకే నేను చేస్తున్న జాబ్ గురించి చాలా మందికి తెలియదు. అక్కడ ఉన్నప్పుడు అరబ్బీ కూడా నేర్చుకున్నా.
సమస్యలకు కారణం
అక్కడకు వెళ్ళిన తర్వాత గల్ఫ్కు వచ్చిన వాళ్ళు సమస్యల్లో ఎందుకు చిక్కుకుంటున్నారో అర్థమయింది. చాలా వరకు కార్మికులే సమస్యల్లో ఇరుక్కుంటారు. ఒకరి ద్వారా కాంట్రాక్ట్ కుదుర్చుకుని వీసా తీసుకొని పనికి వెళతారు. అక్కడికి వెళ్ళిన తర్వాత తక్కువ డబ్బులు ఇస్తున్నారనో, పని కష్టంగా ఉందనో, మరో దగ్గర ఆదాయం బాగా వస్తుందని ఎవరైనా చెబితే వాళ్ళ మాటలు నమ్ముతారు. వాళ్ళ మాటలు నమ్మి వేరే దగ్గర పనిలో చేరతారు. దాంతో పనిలో కుదుర్చుకున్న వారు 'అతనితో మాకు ఎలాంటి సంబంధం లేదు' అని పేపర్ స్టేట్మెంట్ ఇస్తారు. దానివల్ల కొంత మందికి వీసాలు రిజెక్ట్ అవుతాయి. అక్కడి నుండి సమస్యలు మొదలు. పని దొరకదు. తిరిగి రావడానికి టిక్కెట్కి కూడా డబ్బులు ఉండవు. ఇలాంటి సమస్యలు చాలా గమనించాను.
స్వేచ్ఛగా వెళ్ళగలను
ఇలాంటి వారికి సహకారం అందించాలని అనుకున్నా. నేను వెళ్ళినప్పటి నుండి గల్ఫ్ బాధితులకు ఏదో రూపంలో సాయం చేసేవాడిని. అప్పటికే మనవాళ్ళు కొందరు అక్కడ ఇలా పని చేసేవారు. మేమందరం కలిసి చాలా మందికి టిక్కెట్లు ఇప్పించి దేశానికి పంపించే వాళ్ళం. నా జాబ్ కాన్ఫిడెన్షియల్ కాబట్టి నేను మాత్రం వెనక ఉండేవాడిని. నా దగ్గర ఆఫీషియల్ ఐడీ కార్డు ఉంటుంది. దాంతో పోలీస్స్టేషన్, జైలు, హాస్పిటల్ ఇలా ఎక్కడికైనా స్వేచ్ఛగా వెళ్ళే అవకాశం ఉండేది. అలాంటి పనులు నేను చూసుకునేవాడిని. తెలంగాణ ఏర్పడిన తర్వాత 2015లో 'నవతెలంగాణ సమాజం' అనే సంస్థను ప్రారంభించాం. దీని ఆధ్వర్యంలో చాలా కార్యక్రమాలు చేశాం. 2016 లో ఇండియా వచ్చేశాను.
ఎందరినో కాపాడగలిగాం
ఇండియా వచ్చిన తర్వాత 2017లో 'తెలంగాణ గల్ఫ్ వర్కర్ అసోసియేషన్' ఏర్పాటు చేశాం. దీని ఆధ్వర్యంలో ఎంతో మంది బాధితులను మన దేశానికి రప్పించాం. 2018లో దుబారులో చిక్కుకున్న కార్మికులను ఓ టీవీ ఛానల్ సహకారంతో రక్షించగలిగాం. 150 మందికి టిక్కెట్లు ఇప్పించాం. దీనికి చాలా మంది వ్యక్తిగతంగా సహకరించారు. మేం ఈ పని మొదలుపెట్టిన తర్వాత ప్రభుత్వం స్పందించింది. అప్పుడు ప్రభుత్వం 500 మందికి టిక్కెట్లు ఇప్పించింది. తెలంగాణ ఏర్పడిన తర్వాత సుమారు 2000 డెడ్బాడీలను దేశానికి రప్పించాం. ఇంకా వందల సంఖ్యలో అక్కడే ఉన్నాయి. బహ్రెయిన్, దుబారు, కువైట్, మలేషియా ఇలా చాలా దేశాలలో సుమారు వెయ్యి మంది బాధితులను మా ద్వారా దేశానికి రప్పించగలిగాం.
ప్రభుత్వం నుండి స్పందన లేదు
మేము ఇన్ని చేస్తున్నా ప్రభుత్వం నుండి సరైన సహకారం లేదు. ప్రస్తుతం మన ఒక్క రాష్ట్రం నుండే విదేశాల్లో పది లక్షల మంది వరకు ఉంటారు. వారి ద్వారా టాక్సుల రూపంలో మన ప్రభుత్వానికి కోట్లల్లో ఆదాయం వస్తుంది. కానీ వారికి ఏదైనా సమస్య వస్తే మాత్రం ప్రభుత్వం నుండి సాయం అందడం లేదు. అందుకే 500 కోట్ల రూపాయలతో కార్పొరేషన్ ఏర్పాటు చేయాలి. అక్కడి నుండి వచ్చిన బాధితులకు ఉపాధి చూపించాలి. అక్కడ చనిపోయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. 25 నుండి 40 ఏండ్ల లోపు వారే ఎక్కువగా అక్కడికి వెళుతుంటారు. వాళ్ళ పిల్లలు చాలా చిన్నగా ఉంటారు. అప్పులు చేసి వెళుతుంటారు. అక్కడ వారికి ఏమైనా జరిగితే ఆ కుటుంబ సభ్యులు అనాథలుగా మిగలాల్సిందే. అందుకే అలాంటి కుటుంబాలకు 5 లక్షలు ఎక్స్గ్రేషియా ఇవ్వాలి.
ఇలాంటి వారు ఎందరో...
ఖమ్మంకు చెందిన ఓ మహిళ ఇప్పుడు దుబారు జైల్లో ఉంది. ఆమె ముంబయికి చెందిన మాఫియా వలలో చిక్కుకుంది. ఫ్రీ వీసా, టికెట్ ఇస్తాం దుబారులో జాబ్ అన్నారంటా. ముంబయి నుండి ఫ్లయిట్ అని చెబితే వాళ్ళ మాటలు నమ్మి ఆమె ముంబయి వెళ్ళింది. అక్కడ వాళ్ళు ఓ పది కిలోల బాక్స్ ఇచ్చి 'ఇది మటన్ పికిల్, అక్కడ మీరు దిగగానే మా వాళ్ళు వచ్చి తీసుకుంటారు' అని చెప్పి ఆమెతో పంపించారు. అక్కడ దిగిన వెంటనే ఎయిర్పోర్ట్లో స్కానింగ్ చేస్తుంటే ఆమె పట్టుబడిపోయింది. అందులో పికిల్ కాదు గంజాయి పెట్టి పంపించారు. దాంతో ఆమెను అరెస్టు చేసి జైల్లో పెట్టారు. వాళ్ళ తమ్ముడు మా దగ్గరకు వచ్చి విషయం చెప్పాడు. అప్పుడు మేం ఓ ఛానల్ సహకారంతో స్ట్రింగ్ ఆపరేషన్ చేశాం. ఈ విషయంలో ఆ ఛానల్ వాళ్ళు చాలా కష్టపడ్డారు. మహారాష్ట్ర పోలీసులు కూడా చాలా సహకరించారు. ఇలా అందరి సహకారంతో ఆ మాఫియాని పట్టుకోగలిగాం. ఆ మహిళ మాదిరిగా సమస్యల్లో చిక్కుకున్న అమాయకులు చాలా మంది ఉన్నారు.
త్వరలో గ్రామగ్రామానికి
గల్ఫ్కు వెళ్ళేవారు ఎలాంటి సమస్యల్లో చిక్కుకోకూడదు. దీనికోసమే అవగాహన కల్పించేందుకు మా సంస్థ ఆధ్వర్యంలో త్వరలోనే గ్రామ గ్రామానికి వెళ్ళబోతున్నాం. మరీ ముఖ్యంగా లేబర్కి అవగాహన కల్పించాలి. సాధ్యమైనంత వరకు లేబర్ అక్కడికి వెళ్లకుండా చేయాలి. ఇదే మా లక్ష్యం. అధికారం ఉంటే ఇలాంటివి ఇంకా ఎన్నో చేయవచ్చు. అందుకే ఎప్పటికైనా ఎమ్మెల్యే కావాలనేది నా లక్ష్యం.
లేబర్ పని కోసం వెళ్లొద్దు
మన రాష్ట్రం నుండి నిజామాబాద్, కరీంనగర్ నుండి లేబర్ గల్ఫ్కు ఎక్కువగా వెళుతుంటారు. ఇక ఓల్డ్ సిటీ నుండి అయితే 2,3 లక్షల మంది ఉంటారు. వీరిలో ఎక్కువ మంది లేబర్ పని కోసమే వెళుతుంటారు. మంచి ఉద్యోగం చేసుకునేందుకు అక్కడకు వెళితే ఎలాంటి సమస్యా ఉండదు. కానీ కార్మికులు మాత్రం చాలా సమస్యలు ఎదుర్కొంటున్నారు. మన దగ్గర పని దొరక్క అంత దూరం పోతున్నారు. అలాంటి వారికి ఇక్కడే పని చూపిస్తే అసలు సమస్యలే ఉండవు. ఆ పని ప్రభుత్వం చేయడం లేదు.