Authorization
Mon Jan 19, 2015 06:51 pm
పదహారు, పదిహేడేండ్ల ప్రాయం... నూనూగు మీసాల నూత్న యవ్వనం.. ఉరకలెత్తే ఉత్తేజం.. ఊహలకు రెక్కలు కట్టుకుని దూరతీరాలకు ఎగిరిపోవాలనే ఆశ.. సాధించాలనే పట్టుదల.. ఇన్ని కోర్కెలతో అడుగులు వేస్తున్న ఉడుకు రక్తం.. ఒక్కసారిగా చల్లారిపోయింది. ఓ ప్రమాదం అతని కోర్కెలపై నీళ్ళు చల్లింది. కాలు, చెయ్యి పోగొట్టుకుని మంచానికే పరిమితమయ్యాడు. కానీ ఇప్పుడు.. రేసుగుర్రంలా పరుగు మొదలెట్టాడు. ఎక్కడా ఆగకుండా హిమాలయాలకు చేరుకున్నాడు. అంతటితో ఆగిపోకుండా ఇంకా ఏదో సాధించాలనే కసితో పరుగులు తీస్తూ నేటి యువతకు స్ఫూర్తిగా నిలిచాడు. అతనే శేఖర్ గౌడ్. ఆ యువతేజం గురించి మరిన్ని విశేషాలు ఈ వారం జోష్లో...
శేఖర్ గౌడ్... యాదాద్రి జిల్లా, చౌటుప్పల్ మండలం, పీపల్ పహాడ్ గ్రామంలో పుట్టి పెరిగాడు. తల్లి కమలమ్మ, కూలిపనులు చేసేది. తండ్రి వెంకటయ్య లారీ డ్రైవర్. నిరుపేద కుటుంబం. శేఖర్కి ఓ తమ్ముడు. తాము రెక్కలు ముక్కలు చేసుకున్నా పిల్లలను బాగా చదివించాలని ఆ తల్లిదండ్రుల కోరిక. వారు కోరుకున్నట్టే కొడుకులిద్దరు బాగా చదువుకునేవారు. శేఖర్ 2006 వరకు అందరిలా ఆడుతూ పాడుతూ గడిపాడు. ఆ సమయంలో అతను పదో తరగతి పూర్తి చేసి ఇంటర్ ఐటీఐలో చేరాడు. పెద్ద కొడుకు బాగా చదువుకుని మంచి ఉద్యోగం సంపాదిస్తే తమ కుటుంబ కష్టాలన్నీ తీరిపోతాయని ఆ తల్లిదండ్రులు ఎన్నో ఆశలు పెట్టుకున్నారు.
కరెంట్ షాక్ కొట్టి...
జీవితంపై ఎన్నో ఆశలు పెట్టుకున్న శేఖర్ అనుకోని ప్రమాదానికి గురయ్యాడు. కరెంట్ షాక్ తగిలి కాలూ చెయ్యి పోగొట్టుకున్నాడు. అప్పటి వరకు అందరిలా హాయిగా గడిపిన అతన్ని వైకల్యం చుట్టుముట్టింది. తిరిగి కోలుకోడానికి నెలలు పట్టింది. దానికి తోడు ఆర్థిక సమస్యలు. దాంతో తమ్ముడు పని చేస్తూ చదువు కొనసాగించాడు. శేఖర్ మునుపటిలా నడవలేడు. తన పనులు తాను చేసుకోలేడు. ఇంట్లో పెద్ద కొడుగ్గా అన్నీ చూసుకోవాల్సిన తను తల్లిదండ్రులపై, తమ్ముడిపై ఆధారపడడం నిలవనీయలేదు. తన దీనస్థితికి తానే కుంగిపోయాడు. తన నిస్సహాయతకు అల్లాడిపోయాడు. దాంతో చాలా రోజులు డిప్రెషన్లో ఉండిపోయాడు. 'కాలూ, చెయ్యి పని చేయనంత మాత్రానే ఇలాగే ఉండిపోవాలా? అందరూ చేస్తున్నారు నేను మాత్రం ఎందుకు చేయలేను' అనే ప్రశ్న అతన్ని ఓ మూలన కూర్చోనీయలేదు. పట్టుదల, సాధించాలనే కసి అతన్ని మళ్ళీ మనిషిని చేశాయి.
ఒంటి చేత్తో మొబైల్ రిపేరింగ్
తెలిసిన వారు ఎవరో సలహా ఇస్తే ఆర్టిఫిషల్ కాలు పెట్టించుకున్నాడు. తండ్రి స్నేహితుడికి మొబైల్ షాప్ ఉంటే అందులో పనికి కుదిరాడు. చెయ్యి లేకపోవడంతో ఫోన్ రిపేర్ చేయడం కష్టం. అందుకే మొదట్లో కంప్యూటర్ ద్వారా పాటలు డౌన్లోడ్ చేసే పని చేసేవాడు. మెల్లమెల్లగా గూగుల్లో సర్చ్ చేస్తే ఒక్క చేత్తోనే మొబైల్ రిపేరింగ్ నేర్చుకున్నాడు. శేఖర్ ఒక్క చేత్తో సెల్ ఫోన్ రిపేర్ చేస్తుంటే అందరూ ఆశ్చర్యపోయేవారు. అలా మొదలైన అతని ప్రయాణం ఇప్పుడు సొంత మొబైల్ షాప్ పెట్టుకునే స్థాయికి ఎదిగాడు. ఇక్కడితో ఆగిపోతే శేఖర్ గురించి చెప్పుకునేందుకు ఇక ఏమీ ఉండేది కాదు. కానీ అతని అసలు ప్రయాణం ఇప్పుడే మొదలయింది.
మొదటి మారథాన్
ఫేస్బుక్లో శేఖర్ యాక్టివ్గా ఉండేవాడు. చెన్నైలో ఉండే దస్తగిరి అనే వ్యక్తి ఫేస్బుక్లో పరిచయమయ్యాడు. అతని ద్వారా తన లాంటి వారు ఈ ప్రపంచంలో ఎలాంటి విజయాలు సాధిస్తున్నారో తెలుసుకున్నాడు. మొదటి సారి 2014లో గచ్చిబౌలిలో జరిగిన ఐదు కిలో మీటర్ల మారథాన్లో పాల్గొన్నాడు. అక్కడే శేఖర్ మొదటి సారిగా తనలాంటి వాళ్ళను ఎందరినో చూశాడు. అయితే అందరి కాలుతో పోల్చితే తను పెట్టుకున్న కాలు వేరేగా ఉంది. వారందరికీ అడ్వాన్స్ టెక్నాలజీతో తయారు చేసిన ఆర్టిఫిషల్ కాలు. దాని గురించి ఎంక్వైరీ చేస్తే అది చాలా ఖర్చుతో కూడుకున్నది. అంత ఖర్చు పెట్టి అలాంటి అధునాతనమైన కాలు పెట్టించుకోలేకపోయాడు. అయినా తన పరుగును మాత్రం ఆపలేదు.
దక్షిణ్ రిహేబిటేషన్ సంస్థ సహకారంతో
శేఖర్ కృషి, పట్టుదలను చూసి చాలా మంది మెచ్చుకునేవారు. ఎన్నో మారథన్ కార్యక్రమాల్లో పాల్గొనడం మొదలుపెట్టాడు. దాంతో పరిచయాలు కూడా బాగా పెరిగాయి. అప్పుడే 'దక్షిణ్ రిహేబిటేషన్ ఆర్గనైజేషన్' వారు శేఖర్కి పరిచయమయ్యారు. ఆ ఆర్గనైజేషన్ వాళ్ళు అడ్వాన్స్ టెక్నాలజీ లెగ్ను శేఖర్కి అమర్చారు. ఇక ఆ తర్వాత 10, 15, 20 ఇలా కిలో మీటర్ల కొద్ది పరిగెడుతూనే ఉన్నాడు. జాతీయ స్థాయిలో డెహ్రాడూన్లో జరిగిన మారథాన్లో కూడా పాల్గొన్నాడు. స్విమ్మింగ్, బ్యాడ్మింటెన్ కూడా నేర్చుకున్నాడు.
12 గంటల్లో 200 కిలో మీటర్లు
అక్కడితో తృప్తి చెందలేదు శేఖర్. తన లాంటి వాళ్ళు సైక్లింగ్ చేయడం చూశాడు. అది కూడా నేర్చుకోవాలని తపించాడు. కానీ చెయ్యి లేదు. ఒక్క చేత్తో హాండిల్ పట్టుకోవడం, బ్యాలెన్స్ చేయడం కష్టం. కానీ ప్రయత్నించాడు. ప్రాక్టీస్ చేసేటప్పుడు ఎన్నో సార్లు కింద పడ్డాడు. అమ్మా నాన్న కోప్పడేవాళ్ళు. ఇంకా ఏమైనా జరిగితే తట్టుకునే శక్తి తమకు లేదని బాధపడ్డారు. కానీ అవేవీ అతని చెవికి ఎక్కలేదు. పట్టుదలతో సైక్లింగ్ నేర్చుకున్నాడు. 12 గంటల్లో 200 కిలో మీటర్లు సైక్లింగ్ చేసి రికార్డు సృష్టించాడు.
కాశ్మీర్ టు కన్యాకుమారి
సైకిల్ పై లాంగ్ జర్నీ చేయాలనే ఆలోచన వచ్చింది శేఖర్కి. అంతే... అక్టోబర్ 25, 2016 హిమాచల్ ప్రదేశ్ లోని లడక్లో అతని సైకిల్ యాత్ర ప్రారంభమయింది. 'ఇలాంటి పరిస్థితుల్లో ఇవన్నీ నీకు అవసరమా? హాయిగా ఏదైనా ఉద్యోగం చేసుకుంటూ ఇంట్లో ఉండొచ్చుగా' అంటూ ఎంతో మంది శేఖర్ని నిరుత్సాహపరిచారు. ఎంత మంది ఎన్ని మాటలు అన్నా, ఎగతాళి చేసినా అతని ప్రయాణం ముందుకే సాగింది. అనుకున్న గమ్యాన్ని చేరాడు. డిసెంబర్ 28 కన్యాకుమారిలో తన ప్రయాణాన్ని ముగించాడు. 64 రోజులు, 4100 కిలో మీటర్లు విజయవంతంగా పూర్తి చేశాడు. ఎన్నో రాష్ట్రాలు, ఎన్నో ప్రాంతాలు, ఎన్నో సంస్కృతులను అధ్యయనం చేశాడు. ఈ ప్రయాణం మొత్తంలో ఎక్కడా ఎవరి సపోర్ట్ లేకుండా అన్నీ తనే చూసుకున్నాడు.
టీం మొత్తం సహకరించారు
హిమాలయాలు అధిరోహించాలనేది నా కోరిక. దీని కోసం చాలా ప్రాక్టీస్ చేశా. చిన్న చిన్న కొండలు ఎక్కాను. ఎప్పటిలా ఇంట్లో వాళ్ళు మాత్రం భయపడ్డారు. నేను మాత్రం సాధించాలనే పట్టుదలతో వెళ్ళా. గతంలో ఎవరెస్ట్ బేస్ క్యాంప్ అధిరోహించాను. ఈ ఏడాది భరత్ (బూట్స్ అండ్ క్రాంపన్స్ ప్రైవేట్ లిమిటెడ్) సారథ్యంలో మేం ఆరుగురం టీంగా కలిసి యూరప్ ఖండంలోని ఎత్తైన శిఖరమైన మౌంట్ ఎల్బ్రస్ అధిరోహించాం. అక్కడమేందరం ఓ కుటుంబంలా ఉన్నాం. ఎక్కే క్రమంలో కొంత ఇబ్బంది పడ్డాను. నా టీం సభ్యులందరూ చాలా సహకరించారు. చాలా ఎంజాయ్ చేశాం. ఎలాగైనా సెవన్ సమ్మిట్స్ పూర్తి చేయాలి.
ప్రభుత్వం సహకరిస్తే
ఎంత మంది ఎన్ని అన్నా నాకు ఇష్టమైన పనులు మాత్రమే చేస్తున్నా. అది ఎంత కష్టమైనా భరిస్తున్నా. 'ఏదైనా నేనెందుకు చేయలేను' అని మాత్రమే ఆలోచిస్తా. ఇంట్లో అమ్మా, నాన్న, తమ్ముడు అన్ని విధాలుగా సహకరిస్తున్నారు. అయితే నాకు ఉన్నది ఒకటే సమస్య. అది ఆర్థిక సమస్య. ఇన్ని విజయాలు సాధించినా ప్రభుత్వం నుండి ఎలాంటి సహకారం లేదు. రెండు తెలుగు రాష్ట్రాలలో ఇలాంటి స్థితిలో ఉండి కూడా భారతదేశం నుండి శిఖరాగ్రానికి చేరిన మొట్ట మొదటి ట్రిపుల్ ఐటీ విద్యార్థిని నేనే. ప్రభుత్వం అన్ని విధాల సహకరిస్తే మన తెలుగు రాష్ట్రాలకు మంచి పేరు తీసుకువస్తాననే నమ్మకం నాకు ఉంది. 'దక్షిణ్ రిహాబిటేషన్ ఆర్గనైజేషన్' వారి ద్వారా ఇన్ని విజయాలు సాధించగలిగాను. వాళ్ళు సహకరించకపోతే ఇన్ని చేయగలిగేవాడిని కాదు.