Authorization
Mon Jan 19, 2015 06:51 pm
కోహ్లిసేన చివరి ద్వైపాక్షిక సిరీస్ రద్దు అయ్యింది. ఐపీఎల్ నిరవధిక వాయిదా పడింది. అయినా బయో బబుల్లో ఐపీఎల్కు రంగం సిద్ధమవుతోంది. ఏడాది చివర్లో ఆస్ట్రేలియా పర్యటన ఖరారు. మెన్స్ క్రికెట్కు సింపుల్గా కాస్త విరామం వచ్చిందంతే. కానీ మహిళల క్రికెట్ పరిస్థితి పూర్తి భిన్నం. ఎక్కడ ఆగిందో, ఎప్పుడు మొదలైతుందో ఎవరికీ తెలియన దుస్థితి!. అసలు మన మహిళల క్రికెట్ పయనం ఎటు? నవతెలంగాణ క్రీడావిభాగం
మార్చి 8, 2020 టీ20 మహిళల ప్రపంచకప్ ఫైనల్స్. టైటిల్ పోరులో టీమ్ ఇండియా ఓడినా.. భవిష్యత్పై భరోసా కల్పించింది. మూడేండ్లలో రెండు ఐసీసీ వరల్డ్కప్ల ఫైనల్లోకి ప్రవేశించిన భారత జట్టు ప్రపంచ క్రికెట్లో సరికొత్త పవర్హౌస్గా ఎదిగేందుకు గట్టి పునాది వేసుకుంది. నిజానికి 2020 భారత మహిళల క్రికెట్కు ఎంతో బిజీగా ఉండాల్సిన ఏడాది. ఏడాది ఆరంభంలో టీ20 వరల్డ్కప్, అనంతరం నాలుగు జట్లతో కూడిన మహిళల చాలెంజ్ ట్రోఫీ, ఇంగ్లాండ్లో ముక్కోణపు వన్డే సిరీస్, ఐసీసీ వన్డే వరల్డ్కప్ సన్నాహకంలో భాగంగా మరికొన్ని ద్వైపాక్షిక వన్డే సిరీస్లతో మహిళల క్రికెట్ జట్టు ఎన్నడూ లేనంత బిజీగా గడిపేది. ఇప్పుడిప్పుడే ప్రజాదరణ పట్టాలెక్కుతున్న మహిళల క్రికెట్కు కరోనా వైరస్ మహమ్మారి అడ్డుగా నిలిచింది. ఇంగ్లాండ్ పర్యటనకు బీసీసీఐ నో చెప్పింది. సీనియర్ సెలక్షన్ కమిటీపై స్పష్టత లేదు. అసలు అమ్మాయిలు మళ్లీ ఎప్పుడు మైదానంలోకి వస్తారనే అంశంపై స్పష్టత లేదు. కరోనా కష్టకాలంలో భారత మహిళల క్రికెట్ ఏ దిశగా పయనిస్తోంది!.
మహిళల టీ20 చాలెంజ్ ఉందా? : పూర్తి స్థాయి మహిళల ఐపీఎల్పై డిమాండ్లు పెరుగుతున్నా 2-3 ఏండ్లు నాలుగు జట్లతో కూడిన ఐపీఎల్కే ఓటేయాలని బీసీసీఐ భావించింది. ఎగ్జిబిషన్ మ్యాచుల తరహాలో కాకుండా నాలుగు జట్లతో మినీ ఐపీఎల్కు ప్రణాళిక రచించింది. గతంలో మాదిరి ఆరంభంలో కాకుండా, ప్రేక్షకులు ఎక్కువగా చూసేందుకు వీలుగా నాకౌట్ దశలో మహిళల చాలెంజ్ ట్రోఫీ మ్యాచులను షెడ్యూల్ చేశారు. కరోనా కారణంగా ఐపీఎల్ 2020 భారత్ నుంచి తరలిపోతుంది. బయో సెక్యూర్ బబుల్ వాతావరణంలో యుఏఈలో నిర్వహించేందుకు అనధికారికంగా అంతా సిద్ధమైపోయింది. కానీ ఎక్కడా మహిళల చాలెంజ్ ట్రోఫీ ప్రస్తావన రాలేదు. బయో బబుల్ వాతావరణంలో మహిళల చాలెంజ్ ట్రోఫీ నిర్వహణకు బీసీసీఐ ఆసక్తిగా ఉన్నట్టు కనిపించటం లేదు. త్వరలో జరుగనున్న ఐపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్ సమావేశంలో దీనిపై మరింత స్పష్టత వచ్చే అవకాశం కనిపిస్తోంది. మహిళల బిగ్బాష్ లీగ్ షెడ్యూల్తో మహిళల చాలెంజ్ ట్రోఫీ ఢకొీట్టే అవకాశం సైతం ఉంది. దీంతో బీసీసీఐ పలు కారణాల సాకుతో ఈ ఏడాది మహిళల చాలెంజ్ ట్రోఫీకి మంగళం పాడేందుకు సదా సిద్ధంగా ఉంది.
సెలక్షన్ కమిటీ నియామకం ఎప్పుడు? : కె. హేమలత సారథ్యంలోని ఐదుగురు సభ్యుల సీనియర్ సెలక్షన్ కమిటీ పదవీ కాలం ముగిసిపోయింది. గత అక్టోబర్లోనే ఈ కమిటీ పదవీ కాలం ముగిసినా.. బీసీసీఐ పొడగింపు ఇచ్చింది. భారత్లో జరిగిన భారత్-ఏ, భారత్-బి, బంగ్లాదేశ్, థారులాండ్లతో కూడిన టోర్నీ అనంతరం హేమలత కమిటీ సమావేశం కాలేదు. ఆ అవసరం రాలేదు. మహిళల సీనియర్ సెలక్షన్ కమిటీ కోసం బీసీసీఐ గతంలోనే దరఖాస్తులు ఆహ్వానించింది. మాజీ బ్యాటర్ జయ శర్మ వంటివాళ్లు సెలక్షన్ ప్యానల్ రేసులో ఉన్నారు. అయినా, బీసీసీఐ ఈ దరఖాస్తులపై ఇప్పటివరకు ఎటువంటి నిర్ణయం తీసుకోలేదు. కరోనా కారణంగా ముంబయి కార్యాలయానికి ఆఫీస్ బేరర్లు, అధికారులు రాలేకపోతున్నారు. ముఖాముఖి ఇంటర్వ్యూలు లేకుండా సెలక్షన్ కమిటీ సభ్యులను ఎంపిక చేయలేమని బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ అన్నాడు. షెడ్యూల్ ప్రకారమైనా మహిళల క్రికెట్ అక్టోబర్ వరకూ ఇండ్లకే పరిమితం కానుంది. 2021 వన్డే వరల్డ్కప్కు ముందు సన్నాహకంగానైనా బీసీసీఐ మహిళా క్రికెటర్ల క్యాంప్ నిర్వహించక తప్పదు. ఆ లోగా సెలక్షన్ ప్యానల్ను ఎంపిక చేస్తామని దాదా వెల్లడించాడు.
ఇంగ్లాండ్కు ఎందుకు వద్దన్నారు? : దక్షిణాఫ్రికా, భారత్లతో ఇంగ్లాండ్ ఆగస్టులో ముక్కోణపు వన్డే సిరీస్కు ప్రణాళిక వేసింది. కానీ బీసీసీఐ నుంచి ఈసీబీకి తిరస్కారం ఎదురైనట్టు సమాచారం. బయో బబుల్ సిరీస్కు వెస్టిండీస్, పాకిస్థాన్లకు పంపినట్టే భారత మహిళల జట్టుకూ ప్రత్యేక విమానం ఏర్పాటు చేసేందుకు ఈసీబీ ఆఫర్ చేసింది. ఇంగ్లాండ్లో బస, ప్రయాణ ఖర్చులు సైతం భరించేందుకు సిద్ధమని తెలిపింది. అయినా, భారత క్రికెట్ బోర్డు ఎందుకు విముఖత వ్యక్తం చేసిందో అర్థం కావటం లేదు. సుదీర్ఘ విరామం వచ్చిన మహిళల క్రికెటర్లకు బీసీసీఐ, ప్రత్యేకంగా శిక్షణ శిబిరం ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంటుంది. దీనికి బీసీసీఐ సిద్ధంగా ఉన్నట్టు లేదు. మిథాలీరాజ్, జులన్ గోస్వామి వంటి వన్డే క్రికెటర్లు క్రికెట్కు దూరమై చాలా కాలమైంది. 2021 వన్డే వరల్డ్కప్ సన్నాహకానికి ఇంగ్లాండ్ పర్యటన భారత్కు గొప్పగా ఉపయోగపడేది. కానీ గంగూలీ సారథ్యంలోని బీసీసీఐ ఆలోచనలు ఏ విధంగా ఉన్నాయో తెలియటం లేదు. ఇక మహిళల క్రికెట్ పర్యవేక్షణకు బీసీసీఐ యంత్రాంగంలో ప్రత్యేక అధికారి సైతం లేడు. ఎం.వీ శ్రీధర్, రత్నాకర్ శెట్టిలు అనంతరం సబా కరీం మహిళల క్రికెట్ వ్యవహరాలను చూశారు. ఇప్పుడు సబా కరీం వైదొలిగాడు. క్రికెట్ అభివృద్దికి జనరల్ మేనేజర్గా బీసీసీఐ తాజాగా దరఖాస్తులు ఆహ్వానించింది. మహిళల క్రికెట్ పురోగతికి తీసుకోవాల్సిన నిర్మాణాత్మక చర్యలపై ఆలోచన చేసేందుకు ఈ విరామం ఉపయోగపడాలని ఆశిద్దాం.