Authorization
Mon Jan 19, 2015 06:51 pm
-ఇంగ్లాండ్ టూర్పై శాంత రంగస్వామి
ముంబయి : ఓ అంశంపై అభిప్రాయం తాము కూర్చొనే సీటును బట్టి మారుతుందని రాజకీయాల్లో నానుడి. క్రికెట్లోనూ ఇది వర్తిస్తుందని మహిళల జట్టు మాజీ కెప్టెన్ శాంత రంగస్వామి నిరూపించారు!. భారత క్రికెటర్ల సంఘం (ఐసీఏ)లో సభ్యురాలైన శాంత రంగస్వామి.. బీసీసీఐ అపెక్స్ కౌన్సిల్లో సైతం సభ్యురాలు. మార్చి 8, 2020 టీ20 వరల్డ్కప్ ఫైనల్స్ తర్వాత టీమ్ ఇండియా అమ్మాయిలు మళ్లీ మైదానంలో కనిపించలేదు. మూడేండ్లలో రెండుసార్లు ఐసీసీ వరల్డ్కప్ ఫైనల్స్కు చేరిన అమ్మాయిలు జనాదరణ భారీగా పెంచుకుంటున్నారు. ఈ తరుణంలో కోవిడ్-19 కారణంగా మహిళల క్రికెట్ మళ్లీ మరుగునపడే ప్రమాదం కనిపిస్తోంది. భారత మహిళల జట్టు మాజీ కెప్టెన్గా మహిళలను తక్షణమే ట్రాక్లో పెట్టేందుకు రోడ్మ్యాప్ డిమాండ్ చేయాల్సిన శాంత రంగస్వామి.. అందివచ్చిన సిరీస్లను రద్దు చేయడాన్ని సమర్థించటం విమర్శలకు తావిస్తోంది. దక్షిణాఫ్రికాతో కూడిన ముక్కోణపు సిరీస్కు ఇంగ్లాండ్ నుంచి భారత్కు ఆహ్వానం అందింది. కానీ బీసీసీఐ ఈ ఆఫర్ను తిరస్కరించింది. ఇంగ్లాండ్కు వచ్చేందుకు ప్రత్యేక విమానం, బస ఇతర ఖర్చులు భరించటం సహా శిక్షణ శిబిరానికి సైతం ఏర్పాట్లు చేసేందుకు ఈసీబి ముందుకొచ్చింది. ఈ విషయంలో బీసీసీఐ నిర్ణయాన్ని శాంత రంగస్వామి సమర్థిస్తోంది. ' ఇంగ్లాండ్ పర్యటనకు నో చెప్పటం మహిళల క్రికెట్ పట్ల నిర్లక్ష్యం కాదు. మ్యాచ్ ఫిట్నెస్ సాధించేందుకు కనీసం ఆరు వారాల సాధన అవసరం. దేశవ్యాప్తంగా కరోనా వైరస్ ప్రభావం ఉన్నప్పుడు క్రికెటర్లకు శిక్షణ శిబిరం ఎలా సాధ్యపడుతుంది? దీనికి తోడు ఇంగ్లాండ్లో 14 రోజుల క్వారంటైన్లో ఉండాలి' అని రంగస్వామి వ్యాఖ్యానించింది. 2021 వన్డే వరల్డ్కప్ విజయాన్ని ఆశిస్తోన్న టీమ్ ఇండియా.. ఆ దిశగా ఎటువంటి ప్రణాళికలు రచించటం లేదు. బీసీసీఐ అత్యున్న నిర్ణయాక కమిటీలో ఉన్న శాంత రంగస్వామి వంటివారు సైతం క్రికెట్ ప్రయోజనాలు పక్కనపెట్టి, బోర్డు పెద్దలకు వత్తాసు పలకటం విడ్డూరంగా మారింది. ఐపీఎల్ 2020 యుఏఈలో నిర్వహించనుండటంతో ఈ ఏడాది మహిళల చాలెంజ్ ట్రోఫీకి సైతం మంగళం పాడేసినట్టే అనిపిస్తోంది. మహిళల బిగ్బాష్ లీగ్ సమమంలోనే మహిళల చాలెంజ్ ట్రోఫీ షెడ్యూల్ ఉండనుండటంతో రద్దు నిర్ణయం తప్పటం లేదనే వ్యాఖ్యానాలు బీసీసీఐ నుంచి వినిపిస్తున్నాయి.