Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- బీసీసీఐకి ఈసీబీ ప్రతిపాదన
అబుదాబి : దశాబ్ద కాలంగా పాకిస్థాన్ జట్టుకు యుఏఈ ఆతిథ్య వేదికగా వ్యవహరిస్తోంది. సొంతగడ్డపై అంతర్జాతీయ క్రికెట్ను పునరుద్ధరించేందుకు పీసీబీ యుఏఈలో మ్యాచులను నెమ్మదిగా తగ్గిస్తూ వస్తోంది. కరోనా వైరస్ మహమ్మారి కారణంగా భారత్లో ఇప్పుడిప్పుడే క్రికెట్ మ్యాచులు నిర్వహించే అవకాశం కనిపించటం లేదు. బయో సెక్యూర్ బబుల్ సృష్టికి ఏ స్టేడియంలోనూ అంతర్గత హౌటల్ సదుపాయం లేదు. దీంతో భారత క్రికెట్కు ఆతిథ్య వేదికగా నిలిచేందుకు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యుఏఈ) ఆసక్తి వ్యక్తపరుస్తోంది.
ఐపీఎల్ 2020 శనివారం అబుదాబిలో ఆరంభమైంది. ఈ సందర్భంగా బీసీసీఐ, ఈసీబీ (ఎమిరేట్స్ క్రికెట్ బోర్డు) ఒప్పందం కుదుర్చుకున్నాయి. ఐపీఎల్ 13 సీజన్ ఆతిథ్యానికి సంబంధించిన పత్రాలపై బీసీసీఐ కార్యదర్శి జై షా సంతకం చేసినట్టు ఆయన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేశారు. ఇదే సమయంలో వచ్చే ఏడాది ఆరంభంలో ఇంగ్లాండ్తో పరిమిత ఓవర్ల సిరీస్, వచ్చే ఏడాది ఏప్రిల్లోనే ఆరంభం కానున్న 2021 ఐపీఎల్ నిర్వహణకు సైతం యుఏఈ సిద్ధంగా ఉన్నట్టు ఈసీబీ ఆసక్తి వ్యక్తపరిచినట్టు తెలుస్తోంది. ప్రస్తుత పరిస్థితుల్లో భారత క్రికెట్కు ఆతిథ్య వేదికగా నిలిచి, సొమ్ము చేసుకునే యోచనలో ఈసీబీ కనిపిస్తోంది. రెండు క్రికెట్ బోర్డుల నడుమ ద్వైపాక్షిక క్రికెట్ అభివృద్దికి సంబంధించిన ఒప్పందం సైతం కుదిరినట్టు బీసీసీఐ వర్గాలు వెల్లడించాయి.