Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- యుఏఈలో తొలి విజయం నమోదు
- చెలరేగిన రోహిత్, మెరిసిన బౌలర్లు
- కోల్కత నైట్రైడర్స్పై ఘన విజయం
అబుదాబి(యుఏఈ) : ఐపీఎల్ యుఏఈ వేదికలో పేలవ రికార్డున్న ముంబయి ఇండియన్స్ అక్కడ గెలుపు రుచి చూసింది. 2014 సహా 2020 ఆరంభ మ్యాచ్లో ముంబయి ఇండియన్స్ పరాజయం పాలైంది. బుధవారం అబుదాబి ఎమిరేట్లో కోల్కత నైట్రైడర్స్తో జరిగిన మ్యాచ్లో రోహిత్ శర్మ (80, 54 బంతుల్లో 3ఫోర్లు, 6 సిక్స్లు) ధనాధన్ ఇన్నింగ్స్తో విరుచుకుపడ్డాడు. రోహిత్ శర్మకు తోడు సూర్యకుమార్ యాదవ్ (47, 28 బంతుల్లో 6 ఫోర్లు, 1 సిక్స్), సౌరభ్ తివారి (21, 13 బంతుల్లో 1 ఫోర్, 1 సిక్స్), హార్దిక్ పాండ్య (18, 13 బంతుల్లో 2 ఫోర్లు, 1 సిక్స్) రాణించటంతో తొలుత బ్యాటింగ్ చేసిన ముంబయి ఇండియన్స్ 195/5 పరుగుల భారీ స్కోరు సాధించింది. భారీ ఛేదనలో కోల్కత నైట్రైడర్స్ 146/9కే పరిమితం అయ్యింది. దీంతో ముంబయి ఇండియన్స్ 49 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది.
రోహిత్ శర్మ దూకుడు
టాస్ నెగ్గిన కోల్ కత నైట్రైడర్స్ తొలుత ఫీల్డింగ్ ఎంచుకుంది. ఐపీఎల్ ఆరంభ మ్యాచ్ ఇక్కడే ఆడిన ముంబయి ఇండియన్స్ తెలిసిన పరిస్థితులను సొమ్ముచేసుకుంది. ఓపెనర్ క్వింటన్ డికాక్ (1) ఆరంభంలోనే వికెట్ కోల్పోయినా.. ముంబయి ఇండియన్స్ జోరు తగ్గలేదు. కెప్టెన్ రోహిత్ శర్మతో కలిసి సూర్యకుమార్ యాదవ్ రెండో వికెట్కు 90 పరుగులు జోడించాడు. సూర్యకుమార్ యాదవ్ 28 బంతుల్లోనే 6 ఫోర్లు, ఓ సిక్సర్తో మెరిశాడు. మరో ఎండ్లో రోహిత్ శర్మ దూకుడుగా పరుగులు రాబట్టాడు. దీంతో ఈ జోడీ 9.3 ఓవర్లలోనే 90 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పింది. సూర్యకుమార్ యాదవ్ రనౌట్తో క్రీజులోకి వచ్చిన సౌరభ్ తివారి (21) స్కోరు వేగాన్ని తగ్గనీయలేదు. ఓ సిక్సర్, ఫోర్తో 13 బంతుల్లోనే 21 పరుగులు సాధించాడు. 39 బంతుల్లో నాలుగు సిక్సర్లు, ఓ ఫోర్తో అర్ధ సెంచరీ సాధించిన రోహిత్ శర్మ.. శతకం దిశగా సాగాడు. కానీ అబుదాబి పరిస్థితుల్లో నీరసించిన రోహిత్ శర్మ.. తనదైన శైలిలో బంతిని బాదలేకపోయాడు. ఆ క్రమంలోనే శివం మవి ఓవర్లో క్యాచౌట్ అయ్యాడు. నరైన్ బౌలింగ్లో తివారి నిష్క్రమించగా.. హార్దిక్ పాండ్య (18) తొలుత నరైన్ ఓవర్లో నాలుగు బంతులు డిఫెండ్ చేసుకున్నాడు. ఆ తర్వాతి ఓవర్లో పాట్ కమిన్స్పై వరుసగా రెండు ఫోర్లు, సిక్సర్తో విజృంభించాడు. క్రీజులోపల నిలబడి ఆడిన పాండ్య.. రసెల్ బౌలింగ్లో హిట్ వికెట్గా వెనుదిరిగాడు. ఆఖర్లో కృనాల్ పాండ్య (1 నాటౌట్), కీరన్ పొలార్డ్ (13 నాటౌట్) ముంబయి ఇండియన్స్ స్కోరును 195కు చేర్చారు. రోహిత్ శర్మ క్రీజులో ఉండగా.. ముంబయి 230 స్కోరు దిశగా సాగింది. కానీ వరుస వికెట్లతో వేగానికి కళ్లెం వేసిన కోల్కత.. రోహిత్సేనను 200 పరుగుల లోపు నిలువరించారు. కరీబియన్ స్టార్ ఆల్రౌండర్ కీరన్ పొలార్డ్కు ఇది ఐపీఎల్లో ముంబయి ఇండియన్స్ తరఫున 150వ మ్యాచ్ కావటం విశేషం.
కోల్కత చతికిల
196 పరుగుల ఛేద నలో కోల్కత చతికిల పడింది. ఇయాన్ మోర్గాన్, అండ్రీ రసెల్ ఉండటంతో ముంబయి స్కోరు సురక్షితం కాదనే భావన ఉన్నది. కానీ ముంబయి బౌలర్లు సమష్టి కృషితో కోల్కతను చిత్తు చేశారు. ట్రెంట్ బౌల్ట్, జేమ్స్ పాటిన్సన్, జశ్ప్రీత్ బుమ్రా, రాహుల్ చాహర్లు తలా రెండు వికెట్లతో రాణించారు. ఓపెనర్లు శుభ్మన్ గిల్ (7), సునీల్ నరైన్ (9) విఫలం కాగా.. దినేశ్ కార్తీక్ (30), నితీశ్ రానా (24) చిన్నపాటి భాగస్వామ్యం నమోదు చేశారు. బిగ్ హిట్టర్లు ఇయాన్ మోర్గాన్ (16), అండ్రీ రసెల్ (11)లు వికెట్ పారేసుకోవటంతో కోల్కథ ముగిసింది. ఆఖర్లో పాట్ కమిన్స్ (33) ఓటమి అంతరాన్ని తగ్గించే ప్రయత్నం చేశాడు.
సంక్షిప్తస్కోరు వివరాలు :
ముంబయి ఇండియన్స్ : 195/5 ( రోహిత్ శర్మ 80, సూర్యకుమార్ యాదవ్ 47, శివం మవి 2/32)
కోల్కత నైట్రైడర్స్ : 146/9 ( పాట్ కమిన్స్ 33, దినేశ్ కార్తీక్ 30, పాటిన్సన్ 2/25, రాహుల్ చాహర్ 2/26)
ఏడు బంతులే ఎదుర్కొని, పరిస్థితులపై అంచనాకు రాలేను. మాది మంచి ప్రదర్శన. ఆరంభంలోనే డికాక్ అవుటైనా.. రోహిత్, సూర్యకుమార్ రాణించారు. రోహిత్ శర్మ క్లాస్ ఆటను కనబరిచాడు. 195 చాలా మంచి స్కోరు. ఐపీఎల్లో ఏండ్లుగా క్రికెటర్లు ఓ ప్రాంఛైజీ నుంచి మరో ప్రాంఛైజీకి మారుతున్నారు. కానీ నేను 11 ఏండ్లుగా ఒకే జట్టుతో ఉంటున్నాను. ఓ చిన్న పట్టణం నుంచి క్రికెటర్ ఐపీఎల్లో 150 మ్యాచులు ఆడటం పెద్ద ఘనతే'
- కీరన్ పొలార్డ్. (ముంబయి తరఫున 150వ మ్యాచ్).