Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- 50 బంతుల్లో 106 బాదిన మయాంక్ అగర్వాల్
- కెఎల్ రాహుల్ అర్ధ సెంచరీ
- కింగ్స్ ఎలెవన్ పంజాబ్ 223/2
మయాంక్ అగర్వాల్ (106, 50 బంతుల్లో 10 ఫోర్లు, 7 సిక్స్లు) ఐపీఎల్లో తొలి శతకం బాదాడు. ఢిల్లీ క్యాపిటల్స్తో మ్యాచ్లో శతకానికి చేరువగా వచ్చిన మయాంక్.. షార్జాలో సిక్సర్ల తుఫాన్ రేపాడు. 45 బంతుల్లోనే శతకబాదిన మయాంక్ అగర్వాల్ రాజస్థాన్ రాయల్స్ బౌలర్లలో ఎవరినీ విడిచిపెట్టలేదు. కెప్టెన్ కెఎల్ రాహుల్ (69) జోరు కొనసాగటంతో కింగ్స్ ఎలెవన్ పంజాబ్ 223/2 పరుగుల భారీ స్కోరు సాధించింది.
షార్జా (యుఏఈ) : కింగ్స్ ఎలెవన్ పంజాబ్ పరుగుల దాహం కొనసాగుతూనే ఉంది. ఐపీఎల్ 2020లో ఆ జట్టు వరుసగా రెండో మ్యాచ్లో 200 ప్లస్ పరుగులు సాధించింది. ఆదివారం షార్జాలో రాజస్థాన్ రాయల్స్పై మయాంక్ అగర్వాల్ (106) పంజా విసిరాడు. గత మ్యాచ్లో కెఎల్ రాహుల్ బెంగళూర్పై విరుచుకుపడగా.. తాజాగా మయాంక్ శతక షోతో చెలరేగాడు. కన్నడ స్టార్స్ మయాంక్ అగర్వాల్, కెఎల్ రాహుల్ (69, 54 బంతుల్లో 7 ఫోర్లు, 1 సిక్స్) తొలి వికెట్కు 183 పరుగుల భారీ భాగస్వామ్యం నెలకొల్పారు. దీంతో కింగ్స్ ఎలెవన్ పంజాబ్ నిర్ణీత ఓవర్లలో 223 పరుగులు చేసింది. చిన్న బౌండరీల షార్జాలో 224 టార్గెట్ ఛేదించదగినదే. జోశ్ బట్లర్, సంజు శాంసన్ మెరిస్తే రాయల్స్కు ఇది పెద్ద విషయం కాబోదు!.
మయాంక్ మెరుపుల్
టాస్ నెగ్గిన రాయల్స్ తొలుత ఫీల్డింగ్ ఎంచుకుంది. గత మ్యాచ్ అజేయ శతక హీరో కెఎల్ రాహుల్ (69) జతగా మమాంక్ అగర్వాల్ (106) పంజాబ్ ఇన్నింగ్స్ను ఆరంభించాడు. చిన్న బౌండరీల షార్జాలో అందరి చూపులు రాహుల్పైనే ఉన్నాయి. విధ్వంసానికి అగర్వాల్ నాయకత్వం వహించాడు. రాహుల్ తోడుగా రాయల్స్ బౌలర్లను చీల్చి చెండాడాడు. ఐదు సిక్సర్లు, నాలుగు ఫోర్లతో 26 బంతుల్లోనే అర్ధ సెంచరీ సాధించిన మయాంక్ అగర్వాల్.. ఏడు సిక్సర్లు, తొమ్మిది ఫోర్లతో 45 బంతుల్లోనే శతకాన్ని సాధించాడు. జోఫ్రా ఆర్చర్కు హ్యాట్రిక్ బౌండరీలతో స్వాగతం పలికిన కెఎల్ రాహుల్.. ఐదు ఫోర్లు, ఓ సిక్సర్తో 35 బంతుల్లో అర్ధ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. ఓ ఎండ్లో మయాంక్ అగర్వాల్ ఆకాశమే హద్దుగా చెలరేగుతుండగా రాహుల్ చక్కగా సహకరించాడు. ఓపెనర్లు ఇద్దరూ పంజాబ్కు 183 పరుగులు రికార్డు భాగస్వామ్యం నమోదు చేశారు. రాయల్స్ బౌలర్లందరినీ సిక్సర్లు బాదిన మయాంక్ అగర్వాల్ ఐపీఎల్లో తొలి సెంచరీ పూర్తి చేసుకున్నాడు. సెంచరీ అనంతరం మయాంక్, స్కోరు వేగం పెంచే క్రమంలో రాహుల్ నిష్క్రమించారు. ఆఖర్లో నికోలస్ పూరన్ (25 నాటౌట్, 8 బంతుల్లో 1 ఫోర్, 3 సిక్స్లు), గ్లెన్ మాక్స్వెల్ (13 నాటౌట్, 9 బంతుల్లో 2 ఫోర్లు) జట్టు స్కోరును 223కు చేర్చారు. రాయల్స్ బౌలర్లలో అంకిత్ రాజ్పుత్, టామ్ కరన్లు చెరో వికెట్ పడగొట్టారు.
స్కోరు వివరాలు
పంజాబ్ ఇన్నింగ్స్ : కెఎల్ రాహుల్ (సి) శ్రేయాష్ గోపాల్ (బి) అంకిత్ రాజ్పుత్ 69, మయాంక్ అగర్వాల్ (సి) సంజు శాంసన్ (బి) టామ్ కరన్ 106, గ్లెన్ మాక్స్వెల్ నాటౌట్ 13, నికోలస్ పూరన్ నాటౌట్ 25, ఎక్స్ట్రాలు : 10, మొత్తం : (20 ఓవర్లలో 2 వికెట్లకు) 223.
వికెట్ల పతనం : 1-183, 2-194.
బౌలింగ్ : జైదేవ్ ఉనద్కత్ 3-0-30-0, అంకిత్ రాజ్పుత్ 4-0-39-1, జోఫ్రా ఆర్చర్ 4-0-46-0, శ్రేయాష్ గోపాల్ 4-0-44-0, రాహుల్ తెవాటియ 1-0-19-0, టామ్ కరన్ 4-0-44-1.