Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఛేదనలో రాహుల్, గేల్, మయాంక్ జోరు
- ఉత్కంఠ మ్యాచ్లో బెంగళూర్పై గెలుపు
షార్జా (యుఏఈ) : 7 మ్యాచుల్లో ఒక్క విజయం. చివరి ఏడు మ్యాచుల్లో ఏడింటా నెగ్గితేనే ప్లే ఆఫ్స్ అవకాశాలు. ఈ పరిస్థితుల్లో క్రిస్ గేల్ (53, 45 బంతుల్లో 1 ఫోర్, 5 సిక్స్లు)ను రంగంలోకి దింపిన కింగ్స్ ఎలెవన్ పంజాబ్ ఫలితం రాబట్టింది. ఉత్కంఠ మ్యాచ్లో రాయల్ చాలెంజర్స్ బెంగళూర్పై పంజాబ్ 8 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఓపెనర్లు కెఎల్ రాహుల్ (61 నాటౌట్, 49 బంతుల్లో 1 ఫోర్, 5 సిక్స్లు), మయాంక్ అగర్వాల్ (45, 25 బంతుల్లో 4 ఫోర్లు, 3 సిక్స్లు) రాణించటంతో 172 పరుగుల లక్ష్యాన్ని పంజాబ్ ఇన్నింగ్స్ ఆఖరు బంతికి పూర్తి చేసింది. అంతకముందు విరాట్ కోహ్లి (48, 39 బంతుల్లో 3 ఫోర్లు), శివం దూబె (23, 19 బంతుల్లో 2 సిక్స్లు) బాధ్యతాయుత ఇన్నింగ్స్లతో రాణించటంతో రాయల్ చాలెంజర్స్ బెంగళళూర్ 171/6 పరుగుల మెరుగైన స్కోరు చేసింది.
ఆ ముగ్గురు ఛేదించారు : 172 పరుగుల ఛేదనలో పంజాబ్కు అంత సులువుగా పరుగులు రాలేదు. ఆరంభంలో ఓపెనర్లు కెఎల్ రాహుల్, మయాంక్ అగర్వాల్లు ఇబ్బంది పడ్డారు. యుజ్వెంద్ర చాహల్ వేసిన ఇన్నింగ్స్ నాల్గో ఓవర్లో ఓ సిక్సర్, రెండు ఫోర్లతో మయాంక్ అగర్వాల్ ఛేదనను మొదలుపెట్టాడు. మూడు సిక్సర్లు, నాలుగు ఫోర్లతో 25 బంతుల్లోనే 45 పరుగులు చేసిన మయాంక్ అగర్వాల్ వేగంగా పరుగులు పిండుకున్నాడు. అర్థ సెంచరీకి ముంగిట చాహల్ బౌలింగ్లో బౌల్డ్ అయ్యాడు. మరో ఓపెనర్ కెఎల్ రాహుల్ మరో ఎండ్లో నిలకడగా రాణించాడు. సీజన్లో తొలి మ్యాచ్ ఆడుతున్న క్రిస్ గేల్ (53) తోడుగా రాహుల్ సిక్సర్ల వర్షం కురిపించారు. రాహుల్, గేల్ ఇద్దరూ కలిసి పది సిక్సర్లు కొట్టారు. ఇద్దరూ అర్ధ సెంచరీలతో చెలరేగటంతో పంజాబ్ గెలుపు లాంఛనమైంది. కానీ ఆఖరు ఓవర్లో రెండు పరుగులు చేయాల్సిన దశలో పంజాబ్ తడబడింది. తొలి రెండు బంతులకు పరుగులేమీ రాలేదు. ఇన్నింగ్స్ ఐదో బంతికి క్రిస్ గేల్ రనౌట్ కావటంతో పంజాబ్ ఒత్తిడిలో పడింది. నికోలస్ పూరన్ (6 నాటౌట్, 1 బంతికి ఓ సిక్సర్) చివరి బంతిని స్టాండ్స్లోకి పంపి పంజాబ్ విజయాన్ని పూర్తి చేశాడు.
విరాట్, మోరీస్ మెరుపులు : టాస్ నెగ్గిన విరాట్ కోహ్లి తొలుత బ్యాటింగ్ ఎంచుకున్నాడు. ఓపెనర్లు అరోన్ ఫించ్ (20), దేవ్దత్ పడిక్కల్ (18) తొలి వికెట్కు 38 పరుగులు జోడించారు. పంజాబ్ బౌలర్లు కట్టుదిట్టమైన బౌలింగ్తో బ్యాట్స్మెన్ స్వేచ్ఛగా ఆడేందుకు సహకరించలేదు. స్పిన్నర్ మురుగన్ అశ్విన్ మిడిల్ ఓవర్లలో పరుగుల పొదుపు పాటించాడు. ఫామ్లో ఉన్న విరాట్ కోహ్లి (48) సైతం ధనాధన్ షాట్లు ఆడలేకపోయాడు. వికెట్లు చేతిలో ఉన్నా బెంగళూర్ వేగంగా పరుగులు చేయలేకపోయింది. ఆఖరు ఐదు ఓవర్లలో దూకుడుకు రంగం సిద్ధం చేసుకోగా ఏబీ డివిలియర్స్ (2), కోహ్లిలను ఒకే ఓవర్లో అవుట్ చేశాడు షమి. ఈ ఇద్దరి నిష్క్రమణతో బెంగళూర్ స్వల్ప స్కోరుకే పరిమితం అవుతుందని అనిపించింది. కానీ ఆఖర్లో క్రిస్ మోరీస్ (25 నాటౌట్), ఇసురు ఉదాన (10 నాటౌట్) అద్భుతం చేశారు. పంజాబ్ స్టార్ పేసర్ మహ్మద్షమిపై ఆరు బంతుల్లో 24 పరుగులు పిండుకున్నారు. బెంగళూర్కు 171 పరుగుల భారీ స్కోరు అందించారు. పంజాబ్ బౌలర్లలో మహ్మద్ షమి, మురుగన్ అశ్విన్లు రెండేసి వికెట్లు పడగొట్టారు. క్రిస్ జోర్డాన్, అర్షదీప్ సింగ్లు తలా ఓ వికెట్ తీసుకున్నారు.
స్కోరు వివరాలు :
బెంగళూర్ ఇన్నింగ్స్ : 171/6 (విరాట్ కోహ్లి 48, క్రిస్ మోరీస్ 25, అశ్విన్ 2/23, షమి 2/45)
పంజాబ్ ఇన్నింగ్స్ : 177/2 ( కెఎల్ రాహుల్ 61, క్రిస్ గేల్ 53, మయాంక్ 45, చాహల్ 1/35)