Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- టెస్టు చాంపియన్షిప్స్ పై ఐసీసీ
దుబాయ్ (యుఏఈ) : ఐసీసీ టెస్టు ప్రపంచ చాంపియన్షిప్స్. జీవం కోల్పోతున్న టెస్టు క్రికెట్కు నూతన నిర్వచనం, ఐదు రోజుల ఆటకు ఆదరణ తీసుకొచ్చిన సరికొత్త ఆలోచన. 2019 ఇంగ్లాండ్, ఆస్ట్రేలియా యాషెస్ సిరీస్తో ప్రపంచ టెస్టు చాంపియన్షిప్స్ ఘనంగా ఆరంభమైంది. ప్రపంచ క్రికెట్లో ఫ్రంట్ సీటులో దూసుకెళ్తోన్న టెస్టు క్రికెట్ చాంపియన్షిప్స్కు కరోనా వైరస్ మహమ్మారి బ్రేక్ వేసింది. అన్ని క్రీడలపై పడిన ప్రభావమే దీనిపైనా పడింది. 2021 జూన్లో లార్డ్స్ వేదికగా టెస్టు చాంపియన్షిప్స్ ఫైనల్స్ నిర్వహించేందుకు ఐసీసీ సిద్దంగా ఉంది. కానీ కరోనా కారణంగా చాలా జట్ల మధ్య జరగాల్సిన టెస్టు సిరీస్లు వాయిదా పడ్డాయి. బయో బబుల్ వాతావరణంలో ఇంగ్లాండ్, వెస్టిండీస్.. పాకిస్థాన్, ఇంగ్లాండ్లు టెస్టు చాంపియన్షిప్స్లో పోటీపడ్డాయి. త్వరలోనే బారత్, ఆస్ట్రేలియాలు సైతం బయో బబుల్లోనే టెస్టు సిరీస్లో ఆడనున్నాయి. మరికొన్ని జట్లు బయో బబుల్లో టెస్టు సిరీస్ల నిర్వహణకు మొగ్గుచూపుతున్నా.. ఆర్థిక భారంతో పలు బోర్డులు వెనకడుగు వేస్తున్నాయి. దీంతో కరోనా కారణంగా వాయిదా పడిన సిరీస్లలో పాయింట్లను రెండు జట్లకు సమానంగా పంచటం లేదా ఆడిన మ్యాచుల్లో సాధించిన పాయింట్ల ప్రకారం మిగిలిన మ్యాచుల్లో పాయింట్లను కేటాయించటం అనే అంశంపై ఐసీసీ ఆలోచన చేస్తోంది. త్వరలోనే ఐసీసీ ఎగ్జిక్యూటివ్ సమావేశం జరుగనుంది. దీంతో నవంబర్ రెండో వారంలోగా ఈ అంశంపై స్పష్టత ఇచ్చేందుకు ఐసీసీ సిద్ధమవుతోంది.
ఐసీసీ టెస్టు చాంపియన్షిప్స్ను వాయిదా వేసేందుకు సుముఖంగా లేని ఐసీసీ..ఈ రెండింటిలో ఏదో ఒక పద్దతికి ఓటేసే అవకాశం కనిపిస్తోంది. కరోనా కారణంగా భారత జట్టు టెస్టు చాంపియన్షిప్స్ షెడ్యూల్కు ఎటువంటి ఆటంకం ఏర్పడలేదు. ఆస్ట్రేలియాతో యథావిథిగా సిరీస్ ఆడనుండగా.. స్వదేశంలో ఇంగ్లాండ్తో ఐదు టెస్టుల సిరీస్ను బీసీసీఐ లైన్ క్లియర్ చేసిన సంగతి తెలిసిందే.