Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- విమర్శకులకు సెలక్టర్ గాంధీ ప్రశ్న
కోల్కత : దేశవాళీ, ఐపీఎల్లో అద్భుతంగా, నిలకడగా రాణించినా జాతీయ జట్టులో చోటు దక్కకపోతుండటం.. గెలుపు గుర్రాలకు టీమ్ ఇండియాలో స్థానం కల్పించకపోవటంతో సీనియర్ సెలక్షన్ కమిటీపై పదునైన విమర్శలు వినిపిస్తున్నాయి. 2019 వన్డే వరల్డ్కప్కు అంబటి రాయుడిని దూరం పెట్టిన ప్రసాద్ కమిటీ.. ప్రపంచకప్లో భారత్ విజయావకాశాలను ప్రభావితం చేసింది. తాజాగా ఐపీఎల్లో ఇరగదీసిన సూర్యకుమార్ యాదవ్కు భారత టీ20 జట్టులో స్థానం లేకపోవటంతో మరోసారి విమర్శకులు సెలక్షన్ కమిటీపై విరుచుకుపడ్డారు. సెలక్షన్ కమిటీపై వస్తున్న విమర్శలకు సీనియర్ సెలక్టర్ దేవాంగ్ గాంధీ బదులిచ్చారు. ' విశ్లేషకులకు నాదో విన్నపం. సూర్యకుమార్ యాదవ్ను పక్కనపెట్టడంపై మాట్లాడేవారు.. జట్టులోకి ఎంపిక చేసిన వారిలో ఎవరిని తప్పించాలనే విషయాన్ని సైతం చెప్పాలి. భారత్కు పెద్ద బెంచ్ బలం ఉంది. కొన్నిసార్లు సెలక్షన్ ప్రక్రియ పక్కనపెట్టడమే!. ఒక్క స్థానానికి సమవుజ్జీలైన నలుగురు పోటీపడుతున్నారు. తప్పనిసరి పరిస్థితుల్లో ప్రతిభావంతులైన క్రికెటర్లు పక్కనపెట్టబడుతున్నారు. సూర్యకుమార్ యాదవ్ తెలివైన ఆటగాడు. కానీ అతడు సహనంతో ఎదురుచూడాలి. నిలకడగా రాణిస్తూ సహనంతో ఎదురుచూస్తూ మయాంక్ అగర్వాల్ జాతీయ జట్టులోకి వచ్చాడు. 2019 ప్రపంచకప్ జట్టు నుంచి అంబటి రాయుడిని తప్పించటం పొరపాటే. కానీ సెలక్షన్ కమిటీలో ఉండేది మనుషులే, వాళ్లూ కొన్ని తప్పులు చేస్తారు. ప్రపంచకప్లో ఒక్క మ్యాచ్ మినహా భారత్ గొప్పగా ఆడింది. ఆ వైఫల్యంతోనే అందరూ రాయుడి గురించి మాట్లాడుతున్నారు. సెలక్షన్ కమిటీలో, కెప్టెన్ విరాట్ కోహ్లితో భిన్నాభిప్రాయాలు ఉంటాయి. మేము సూచించిన క్రికెటర్ భారత జట్టులో ఆడేందుకు తగిన వాడని కెప్టెన్కు నచ్చజెప్పుతాం. కమిటీలో మాలోమాకే ఎంపిక విషయంలో చర్చ సాగుతది' అని గాంధీ తెలిపాడు.