Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- వన్డే, టీ20ల్లో రోహిత్ లేని ప్రభావం
- ఆసీస్ గడ్డపై అతడిది తిరుగులేని రికార్డు
2013 నుంచి ఆస్ట్రేలియాలో అత్యధిక పరుగులు (వన్డే) చేసిన పర్యాటక జట్టు ఆటగాడు ఎవరు? ఆస్ట్రేలియాలో కంగారూ జట్టుపై అత్యధిక సెంచరీలు బాదిన బ్యాట్స్మన్ ఎవరు? 2013 నుంచి ఆస్ట్రేలియాపై ఎక్కువ శతకాలు సాధించిన క్రికెటర్ ఎవరు? ఈ ప్రశ్నలకు మీ సమాధానం విరాట్ కోహ్లి అయితే, మీరు పొరపడినట్టే. నిజమే, విరాట్ కోహ్లికి బ్రాడ్మన్ తరహా గణాంకాలు ఉన్నాయి. కానీ ఆసీస్ గడ్డపై కంగారూలను చితక్కొట్టడంలో రోహిత్ శర్మ సూపర్ హిట్ అయ్యాడు.
నవతెలంగాణ క్రీడావిభాగం
ఆస్ట్రేలియాలో భారత పర్యటన. ఐపీఎల్ ఫామ్లో ఉన్న ఆటగాళ్లు ఈ శుక్రవారం నుంచి వన్డే సవాల్కు సిద్ధమవుతున్నారు. వన్డే, టీ20 సిరీస్ల ఫలితాలపై పెద్దగా చర్చ కనిపించటం లేదు. కానీ బోర్డర్-గవాస్కర్ టెస్టు సిరీస్ ఫలితంపైనే అందరి దృష్టి నెలకొంది. ఆడిలైడ్లో తొలి టెస్టు అనంతరం విరాట్ కోహ్లి స్వదేశానికి తిరిగి రానున్నాడు. సూపర్స్టార్ సేవలు కోల్పోనున్న టీమ్ ఇండియాపై పడనున్న ప్రతికూల ప్రభావం, ఆతిథ్య ఆస్ట్రేలియాకు లభించే ఆయాచిత లబ్దిపైనే ఎక్కువగా ఫోకస్ ఉంది. కానీ అంతకముందు వన్డే, టీ20ల్లో టీమ్ ఇండియా హిట్మ్యాన్ సేవలు కోల్పోయింది. టెస్టు సిరీస్లో విరాట్ కోహ్లి లేని లోటు టీమ్ ఇండియాకు ఎంత పెద్ద దెబ్బ కానుందో.. వన్డే, టీ20 సిరీస్ల్లో రోహిత్ శర్మ లేకపోవటం సైతం అంతే లోటుగా మిగలనుంది. రోహిత్ శర్మ లేకపోవటం ఆస్ట్రేలియాకు కలిసిరానుంది. మరి, టీమ్ ఇండియా హిట్మ్యాన్ లేని లోటును ఏ విధంగా భర్తీ చేయనుందో చూడాలి.
ఆసీస్ పై అరాచకం : విరాట్ కోహ్లికీ ఆసీస్పై ఎదురులేని గణాంకాలు ఉన్నప్పటికీ.. వన్డేల్లో రోహిత్ శర్మ కంగారూ జట్టుపై కండ్లుచెదిరే ఇన్నింగ్స్లు నమోదు చేశాడు. ఆసీస్లో ఆసీస్పై రోహిత్ శర్మ ఏకంగా నాలుగు సెంచరీలు సాధించాడు. ఆ నాలుగు మ్యాచుల్లో భారత్ పరాజయం పాలైనా.. బ్యాట్స్మన్గా రోహిత్ శర్మకు ఆసీస్ బౌలర్ల నుంచి సవాల్ ఎదురు కాలేదు. ఆసీస్లో ఆసీస్పై ద్వైపాక్షిక సిరీస్లో అత్యధిక పరుగులు చేసిన రికార్డు సైతం రోహిత్ సొంతం. ఆధునిక వైట్బాల్ క్రికెట్లో రోహిత్ శర్మ ఓ దిగ్గజం. ఐపీఎల్లో తొడ కండరం గాయానికి గురైన రోహిత్ శర్మ ప్రస్తుతం బెంగళూర్లోని జాతీయ క్రికెట్ అకాడమీ (ఎన్సీఏ)లో రిహాబిలిటేషన్లో ఉన్నాడు.
ఆస్ట్రేలియా పిచ్లపై, ఆస్ట్రేలియా బౌలర్లపై రోహిత్ శర్మ అద్భుతమైన ఇన్నింగ్స్లు ఆడాడు. లెంగ్త్ బంతులను మిడ్ వికెట్ మీదుగా భారీ సిక్సర్లు.. పాయింట్ దిశగా కట్ షాట్ ఆడగల బ్యాట్స్మన్ రోహిత్ శర్మ. హిట్మ్యాన్ అలవోకగా బాదే రెండు షాట్లు ఇవే. అందుకే లాక్డౌన్ సమయంలో ఐసీసీ ట్వీట్టర్లో పుల్ షాట్ను బాగా ఆడేవారెవరు? అంటూ విరాట్ కోహ్లి, రికీ పాంటింగ్, వివ్ రిచర్డ్స్, హర్షలె గిబ్స్ పేర్లను ఉంచగా.. రోహిత్ శర్మ స్పందిస్తూ ' ఇందులో ఎవరిదో పేరు లేదు? ఇంటి నుంచి పని చేయటం అంత సులువు కాదనుకుంటా' అని ఐసీసీ వ్యంగ్యాస్త్రం సంధించాడు. కేవలం పుల్ షాట్తోనే రోహిత్ శర్మ వందకు పైగా సిక్సర్లు బాదాడు. 2019 సిడ్నీ వన్డేలో లెంగ్త్ బంతులను రోహిత్ శర్మ అలవోకగా స్టాండ్స్లోకి పంపిస్తుంటే పీటర్ సిడిల్, జేసన్ బెహాన్డార్ఫ్లు ప్రేక్షక పాత్రకు పరిమితం అయ్యారు. వన్డే క్రికెట్లో అరుదైన ఘనతలు సొంతం చేసుకున్న రోహిత్ శర్మ... ఆస్ట్రేలియాపై డబుల్ సెంచరీ బాదిన ఏకైక బ్యాట్స్మన్. ఆసీస్తో ద్వైపాక్షిక సిరీస్లో 122.75 సగటుతో ఆరు మ్యాచుల్లోనే 491 పరుగులు చేశాడు. మరో బ్యాట్స్మన్ ఆసీస్ ఇంతలా చెలరేగలేదు.
విరాట్ తర్వాతి స్థానమే..! : 2013లో మొహాలీలో ఇంగ్లాండ్ వన్డేకు కెప్టెన్ ఎం.ఎస్ ధోని సంచలన నిర్ణయం తీసుకున్నాడు. రోహిత్ శర్మను మిడిల్ ఆర్డర్ నుంచి ఓపెనర్గా ప్రమోట్ చేశాడు. అక్కడి నుంచి మొదలైన రోహిత్ మేనియా.. విరాట్ కోహ్లితో సమవుజ్జీగా వన్డే క్రికెట్ లెజెండ్గా ఎదగటంలో పోటీపడుతున్నాడు. . జీవం కలిగిన ఆస్ట్రేలియా పిచ్లపై రోహిత్ శర్మ బ్యాక్ఫుట్ గేమ్, ఇన్నింగ్స్లో అమాంతం వేగం పెంచగలిగే ప్రదర్శనలు ఈ సిరీస్లో చూడలేం. రోహిత్ శర్మ ఓపెనర్గా ప్రమోట్ అయినప్పటి నుంచి వన్డే క్రికెట్ గణాంకాలో తనకంటూ ఓ చోటు పదిలం చేసుకున్నాడు. 2013 జనవరి నుంచి జరిగిన మ్యాచుల్లో విరాట్ కోహ్లి 151 ఇన్నింగ్స్ల్లో 7981 పరుగులు చేసి.. 30 శతకాలు, 37 అర్థ సెంచరీలు బాదాడు. అతడి తర్వాతి స్థానంలో రోహిత్ శర్మ నిలిచాడు. 136 ఇన్నింగ్స్ల్లో 7137 పరుగులు చేశాడు. ఇందులో 27 సెంచరీలు, 31 అర్థ సెంచరీలు ఉన్నాయి. ఆధునిక క్రికెట్ మేటి బ్యాట్స్మన్ జో రూట్ సైతం రోహిత్ శర్మ తర్వాతి స్థానంలోనే ఉన్నాడు. అతడు 140 మ్యాచుల్లో 5962 పరుగులు చేశాడు. 16 సెంచరీలు, 33 అర్థ సెంచరీలు సాధించాడు. స్ట్రయిక్రేట్ విషయంలోనూ రోహిత్ శర్మ (92.54) విరాట్ కోహ్లి (97.03) తర్వాతి స్థానంలోనే ఉన్నాడు. ఇక జట్టు విజయాలు సాధించిన మ్యాచుల్లో సైతం రోహిత్ శర్మ ప్రదర్శన అమోఘం. 88 ఇన్నింగ్స్ల్లో 5256 పరుగులు చేశాడు. అందులో 21 సెంచరీలు, 22 అర్థ సెంచరీలు ఉన్నాయి. విరాట్ కోహ్లి 93 ఇన్నింగ్స్ల్లో 23 శతకాలు, 24 అర్థ సెంచరీలతో 5751 పరుగులు చేసి అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు. శిఖర్ ధావన్ 81 ఇన్నింగ్స్ల్లో 3999 పరుగులు సహా 13 సెంచరీలు, 21 అర్థ సెంచరీలు సాధించాడు. ఇక ఛేదనల్లో రోహిత్ శర్మ 52 ఇన్నింగ్స్ల్లో 2774 పరుగులు సహా 10 శతకాలు, 16 అర్థ శతకాలు సాధించాడు. విరాట్ కోహ్లి 52 ఇన్నింగ్స్ల్లో 3397 పరుగులతో 14 సెంచరీలు, 13 అర్థ సెంచరీలు బాదాడు.
ప్రత్యామ్నాయం ఎవరు? : 2013 చాంపియన్స్ ట్రోఫీలో శిఖర్ ధావన్తో జట్టుకట్టిన రోహిత్ శర్మ ఓపెనింగ్ జోడీ భాగస్వామ్యాలను కొత్త పుంతలు తొక్కించాడు. ధావన్తో కలిసి 107 సార్లు ఇన్నింగ్స్ ఆరంభించిన రోహిత్ శర్మ 4802 పరుగులు జోడించాడు. ఇందులో 16 సెంచరీ భాగస్వామ్యాలు ఉన్నాయి. ధావన్, రోహిత్ ఓపెనింగ్ సగటు 45.30 కావటం విశేషం. కుడి, ఎడమ కాంబినేషన్ అనే కాదు, మంచి బంతులను సైతం బౌండరీలకు తరలించే ఈ జోడీ భారత విజయాలో ముఖ్య భూమిక వహించింది. ఆస్ట్రేలియాతో సిరీస్కు శిఖర్ ధావన్ అందుబాటులో ఉన్నప్పటికీ.. రోహిత్ శర్మ స్థానంలో అతడికి తోడుగా ఓపెనింగ్ చేసే ఆటగాడు ఎవరు అంశంలోనే స్పష్టత లేదు. ఆస్ట్రేలియా జట్టు భారత్లో పర్యటించినప్పుడు కెఎల్ రాహుల్ వికెట్కీపర్ కమ్ ఫినిషర్ పాత్రలో ఐదో స్థానంలో బ్యాటింగ్ చేశాడు. ఈ ఏడాది తొలి రెండు సిరీస్ల్లో కెఎల్ రాహుల్ మెప్పించాడు. న్యూజిలాండ్లోనూ రాహుల్ రాణించాడు. ఈ సిరీస్లో రాహుల్ కొత్తగా వైస్ కెప్టెన్సీ బాధ్యత అందుకున్నాడు. రోహిత్ నుంచి వైస్ కెప్టెన్సీతో పాటు ఓపెనర్ రోల్నూ తనే తీసుకుంటాడా? లేదా మయాంక్ అగర్వాల్, శుభ్మన్ గిల్లలో ఒకరు ధావన్ తోడుగా ఇన్నింగ్స్ను మొదలుపెడతారా అనేది శుక్రవారం జరుగనున్న తొలి వన్డేలోనే తెలియాలి.