Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- టీ20 నాయకత్వంపై గంభీర్, పార్దీవ్ పటేల్
- 2021 వరల్డ్కప్కు ముందు ఆసక్తికర చర్చ
2017 చాంపియన్స్ ట్రోఫీ. చాంపియన్లతో కూడిన జట్టుతో టైటిల్ సాధించలేకపోయాడు విరాట్ కోహ్లి. 2019 వన్డే వరల్డ్కప్. సూపర్స్టార్స్తో కూడిన బృందంతో వేటకు వెళ్లినా, సెమీస్లోనే ఆశలు ఆవిరయ్యాయి. జట్టులో ఎటువంటి లోపాలు కనిపించటం లేదు. కానీ తుది జట్టు ఎంపికలో, మైదానంలో తీసుకునే నిర్ణయాల్లోనే పలుమార్లు తప్పులు దొర్లుతున్నాయి. గెలుపు గుర్రాలతో వేటకు వెళ్లి, ఒట్టి చేతులతో రావటం విరాట్ కోహ్లికి పరిపాటి అయిపోయిందనే విమర్శ ఇప్పుడు కాస్త గట్టిగానే వినిపిస్తోంది. ఉత్తమ బ్యాట్స్మనే నాయకుడు కావాలనుకోవటం తెలివి తక్కువ చర్య అవుతుంది. ఉత్తమ నిర్ణయాలు తీసుకుని, జట్టును గెలుపు దిశగా నడిపించే సమర్థుడు నాయకుడుగా ఉండాలి. అటువంటి సత్తా, సామర్థ్యాలు పుష్కలంగా ఉన్న రోహిత్ శర్మను భారత టీ20 కెప్టెన్ను చేయాలని విశ్లేషకులు, మాజీ క్రికెటర్లు డిమాండ్ చేస్తున్నారు. 2021 టీ20 ప్రపంచకప్కు ముందు, భారత క్రికెట్ నాయకత్వంలో మార్పు అనివార్యమేనా?!, ఆసక్తికరం.
న్యూఢిల్లీ : ద్వంద్వ కెప్టెన్సీ భారత క్రికెట్ డ్రెస్సింగ్ రూమ్ కు సరిపడదనే అపవాదును మిస్టర్ జెంటిల్మెన్ అనిల్ కుంబ్లే, మిస్టర్ కూల్ ఎం.ఎస్ ధోనిలు చెరిపేశారు. అనిల్ కుంబ్లే కెరీర్ ముగింపులో టెస్టు కెప్టెన్గా కొనసాగగా.. ఎం.ఎస్ ధోని వన్డే, టీ20 సారథ్యం వహించాడు. టెస్టు క్రికెట్ నుంచి ఎం.ఎస్ ధోని నిష్క్రమణతో.. విరాట్ కోహ్లి ఐదు రోజుల ఆటలో సారథ్య పగ్గాలు అందుకున్నాడు. సుదీర్ఘకాలం ధోని వన్డే, టీ20 నాయకుడిగా ఉండగా.. విరాట్ కోహ్లి టెస్టు సారథిగా కొనసాగాడు. భారత క్రికెట్ విజయవంతమైన ద్వంద్వ కెప్టెన్సీలో ఎం.ఎస్ ధోని ఉన్నాడు. అదే సమయంలో విరాట్ కోహ్లి సైతం పాలు పంచుకున్నాడు. అయితే, ఇక్కడ కుంబ్లే నుంచి కెప్టెన్సీ బ్యాటన్ అందుకోవటం ధోనికి అనివార్యం, అదే సమయంలో ధోని నుంచి కెప్టెన్సీ పగ్గాలు స్వీకరించటం కోహ్లిని అనివార్యం. ద్వంద్వ నాయకత్వంలో ఈ రెండు సందర్భాల్లోనూ వ్యక్తిగత స్వార్థాలు పని చేయలేదు. సీనియర్ క్రికెటర్ నుంచి నాయకత్వ మార్పిడి ఆశించటం తొలి రెండు సందర్భాల్లో కనిపించింది. కానీ ఒకే తరం ఆటగాళ్లు ద్వంద్వ కెప్టెన్సీలో విజయవంతమైన చరిత్ర భారత డ్రెస్సింగ్రూమ్లో కనిపించదు. పరిమిత ఓవర్ల ఫార్మాట్లో విరాట్ కోహ్లితో సమానంగా చెలరేగుతున్నాడు రోహిత్ శర్మ.
అదనంగా ఐపీఎల్లో ఐదు టైటిళ్లు గెల్చుకున్న సారథిగా రోహిత్ కితాబు అందుకున్నాడు. ఐపీఎల్లో రోహిత్ శర్మ కెప్టెన్సీ సక్సెస్తో భారత టీ20 జట్టులో సైతం నాయకత్వ మార్పిడి అవసరమని మాజీ క్రికెటర్లు అభిప్రాయపడుతున్నారు. 2021 టీ20 ప్రపంచకప్కు భారత్ ఆతిథ్యం ఇవ్వనుంది. రానున్న వరల్డ్కప్కు ముందే టీ20 నాయకత్వంలో మార్పు అవసరమని గౌతం గంభీర్, పార్దీవ్ పటేల్ అభిప్రాయపడగా.. ఆకాశ్ చోప్రా భిన్నంగా స్పందించాడు. భారత టీ20 జట్టు కెప్టెన్సీ మార్పుపై ఈ ముగ్గురు ఏమన్నారో చూద్దాం.
గౌతం గంభీర్ : విరాట్ కోహ్లి కెప్టెన్సీ బాగాలేదని కాదు. విరాట్ కోహ్లి కెప్టెన్సీ గురించి కాదు ఈ చర్చ. ఎవరు ఉత్తమ సారథి అనేది చర్చ. దానికి సరైన సమాధానం రోహిత్ శర్మ. కేవలం ఉత్తమ కెప్టెన్ కాదు.. విరాట్ కోహ్లికి అతడికి సారథ్యంలో అంతరం అంతులేనిది. ఐపీఎల్ ప్రదర్శన ఆధారంగా భారత జట్టులోకి ఆటగాళ్లను తీసుకుంటున్నాం. మరి ఐపీఎల్ కెప్టెన్లను భారత సారథిగా చేయటంలో తప్పేముంది? అలాంటప్పుడు, ఐపీఎల్లో బౌలింగ్, బ్యాటింగ్ ప్రదర్శన ఆటగాళ్ల సత్తాకు కొలమానం కాకూడదు. మరి, ఆటగాళ్లను మాత్రం ఐపీఎల్ ప్రదర్శన ఆధారంగా ఎందుకు ఎంపిక చేయాలి? టి.నటరాజన్ ఎంపిక తప్పు, వాషింగ్టన్ సుందర్ ఎంపిక తప్పు. యుజ్వెంద్ర చాహల్, కుల్దీప్ యాదవ్ ఇలా అందరి ఎంపిక తప్పే అవుతుంది. ఎందుకంటే వీరందరూ ఐపీఎల్ ప్రదర్శనతోనే భారత జట్టులోకి వచ్చారు. ఐపీఎల్ ప్రదర్శన ఆధారంగా ఆటగాళ్లను ఎంపిక చేసినప్పుడు, కెప్టెన్ ఎంపికలో ఐపీఎల్ ప్రదర్శన పరిగణనలోకి తీసుకోవాలి కదా? ఎవరు ఉత్తమ కెప్టెన్ అనేది ప్రశ్న?.
ఆకాశ్ చోప్రా : నాయకత్వ మార్పిడికి ఇది సమయం కాదు. ఇప్పుడు ఓ కొత్త జట్టును నిర్మించే సమయం లేదు. జట్టుపై నూతన ఫిలాసఫీ, నూతన పద్దతులు పెట్టేందుకు కొన్ని మ్యాచుల గడువు ఉండాలి. టీ20 వరల్డ్కప్కు ముందు ఓ 5-6 మ్యాచులే ఉన్నప్పుడు ఇటువంటి ప్రయోగం అవసరం లేదు. అసలు దెబ్బతినని దాన్ని రిపేర్ చేయడాన్ని నేను ఇష్టపడను. నిజమే, ఐపీఎల్ ప్రదర్శలు ముఖ్యం. అదే సమయంలో అంతర్జాతీయ స్థాయిలో ప్రదర్శనకు ఆ స్థాయి గుర్తింపు ఉంటుంది. ఓ ఆటగాడు భారత జట్టుకు బాగా ఆడి, ఐపీఎల్లో విఫలమైతే ఫర్వాలేదు. ఈ చర్చ అంతా నాయకత్వం మార్పు కోసమే అయితే.. భారత క్రికెట్ జట్టు కెప్టెన్ విరాట్ కోహ్లి ఎటువంటి పొరపాటు చేయలేదు.
పార్దీవ్ పటేల్ : ఇక్కడ మన చర్చ పూర్తిగా.. ఎవరు మెరుగైన నిర్ణయాలు తీసుకుంటారు? ఎవరు గేమ్ను గొప్పగా అర్ధం చేసుకుంటారు? తీవ్ర ఒత్తిడిలో ఎవరు మ్యాచులు గెలిచే నిర్ణయాలు తీసుకుంటారు? అనేది. అందుకు నా సమాధానం రోహిత్ శర్మ. ఈ అన్ని అంశాల్లో రోహిత్ శర్మ ముందున్నాడు. అతడు నాయకుడిగా అత్యుత్తమ ఎంపిక.