Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- భారత్, ఆస్ట్రేలియా తొలి వన్డే నేడు
- విజయ ఆరంభంపై ఇరు జట్లు దృష్టి
- ఉ.9.10 నుంచి సోనీ నెట్వర్క్లో..
క్రికెట్ మైదానంలో మళ్లీ సాధారణ పరిస్థితులు కనిపించబోతున్నాయి. అగ్రజట్టు భారత్ బరిలోకి దిగుతుండగా.. కరోనా మహమ్మారి అనంతరం తొలిసారి అభిమానులూ స్టేడియంలోకి అడుగుపెట్టనున్నారు. శుక్రవారం సిడ్నీలో భారత్, ఆస్ట్రేలియాలు తొలి వన్డేలో తలపడనున్నాయి. సిడ్నీ మైదానంలో 50 శాతం సామర్థ్యంతో అభిమానులకు ప్రవేశం లభించనుంది. సుదీర్ఘ పర్యటనలో విలువైన ఆత్మవిశ్వాసంతో పాటు ఆరంభ ఆధిక్యత సాధించేందుకు విరాట్, ఫించ్ గ్యాంగ్లు నేడు విజయమే లక్ష్యంగా బరిలోకి దిగుతున్నాయి.
సిడ్నీ (ఆస్ట్రేలియా)
భారత్, ఆస్ట్రేలియాలో సిరీస్లో రెండు కీలక లక్ష్యాలు కనిపిస్తున్నాయి. 2021 టీ20 వరల్డ్కప్కు ముందు జట్టు నిర్మాణం, ఐసీసీ టెస్టు చాంపియన్షిప్స్ ఫైనల్లో బెర్త్ ఖాయం చేసుకోవటం రెండు జట్లకు ప్రధానంగా కనిపిస్తున్నాయి. అలాగని వన్డే సిరీస్ను సైతం తేలిగ్గా తీసుకోవడానికి వీల్లేదు. మూడు వన్డేల సిరీస్ నూతన వన్డే సూపర్ లీగ్లో భాగం. టెస్టు సిరీస్లో ఆడనున్న ఆటగాళ్లకు వన్డే సిరీస్ కీలకం కానుంది. ఐపీఎల్ విరామం తర్వాత గాడిలో పడేందుకు వన్డే సిరీస్ ఉపయోగపడనుంది. తొలి వన్డే నేడు సిడ్నీలో ఉదయం 9.10 గంటలకు ఆరంభం కానుంది.
సొంతగడ్డ అనుకూలత : ఆస్ట్రేలియా సొంతగడ్డపై ఫేవరేట్గా కనిపిస్తోంది. సిడ్నీలో భారత్కు పేలవ రికార్డు ఆతిథ్య జట్టుకు మరింత కలిసి రానుంది. ఇంగ్లాండ్తో సిరీస్కు దూరమైన స్టీవ్ స్మిత్ నేడు బరిలోకి దిగనున్నాడు. డెవిడ్ వార్నర్, అరోన్ ఫించ్లతో కలిసి స్మిత్, లబుషేన్ బ్యాటింగ్ బాధ్యతను పంచుకోనున్నారు. మార్కస్ స్టోయినిస్తో మిడిల్ ఆర్డర్ సైతం బలోపేతంగా కనిపిస్తోంది. ఇంగ్లాండ్తో వన్డే సిరీస్లో వరుసగా 59 బంతుల్లో 77 పరుగులు, 90 బంతుల్లో 108 పరుగులు చేసిన గ్లెన్ మాక్స్వెల్.. ఐపీఎల్లో దారుణంగా ఆడాడు. 13 మ్యాచుల్లో 15.42 సగటుతో 106 బంతుల్లో 103 పరుగులు చేశాడు. తొలిసారి ఐపీఎల్ సీజన్ను ఒక్క సిక్సర్ కూడా కొట్టకుండానే ముగించాడు. ఐపీఎల్ పేలవ ఫామ్ మాక్స్వెల్పై ప్రభావం చూపితే.. లోయర్ ఆర్డర్లో ఆసీస్కు ఇబ్బందులు తప్పవు. జడేజా, చాహల్లపై మాక్స్వెల్ ఏ విధంగా ఆడతాడో చూడాలి. బంతితో జోశ్ హజిల్వుడ్, పాట్ కమిన్స్, మిచెల్ స్టార్క్ త్రయం పదునైన పేస్తో కోహ్లిసేన సవాల్ విసరనుంది.
రోహిత్ లేని లోటు పూడ్చగలరా? : ఆస్ట్రేలియాలో ఆ జట్టుపై సూపర్ శతకాలు సాధించిన రోహిత్ శర్మ వన్డే సిరీస్కు దూరమయ్యాడు. టాప్ ఆర్డర్లో రోహిత్ లేకపోవటం భారత్కు ఎదురుదెబ్బే. కానీ భీకర ఫామ్లో ఉన్న మయాంక్ అగర్వాల్ నేడు శిఖర్ ధావన్కు తోడుగా రానున్నాడు. ఆత్మవిశ్వాసంతో ఉన్న అతడిని నిలువరించటం అంత సులువు కాదు. విరాట్ కోహ్లి, శ్రేయాస్ అయ్యర్ క్లాస్ జోరుతో మిడిల్ ఆర్డర్ బాగుంది. వికెట్ కీపర్, బ్యాట్స్మన్ కెఎల్ రాహుల్ ఐదో స్థానంలో ఫినీషర్ పాత్రలో కనువిందు చేయనున్నాడు. ఐపీఎల్లో అత్యధిక పరుగులు బాదిన రాహుల్, ఆసీస్లోనూ అదే జోరు చూపిస్తే భారత్కు ఎదురుండదు. ఆల్రౌండర్ హార్దిక్ పాండ్య బ్యాట్తో జోరు మీదున్నాడు. కానీ అతడు ఐపీఎల్లో బంతి పట్టుకోలేదు. ముంబయి ఇండియన్స్కు అది పెద్ద సమస్య కాలేదు కానీ, భారత్కు ఓ అదనపు పేసర్ అవసరం. 2019 వరల్డ్కప్ సెమీఫైనల్స్ అనంతరం తొలి వన్డే ఆడనున్న హార్దిక్ పాండ్య ఏ మేరకు రాణిస్తాడనేది ఆసక్తికరం. జశ్ప్రీత్ బుమ్రా, మహ్మద్ షమిలు ఇద్దరూ నేడు ఆడితే.. నవదీప్ సైని, షార్దుల్ ఠాకూర్లలో ఒకరు మాత్రమే తుది జట్టులో నిలువనున్నారు. రవీంద్ర జడేజాతో కలిసి యుజ్వెంద్ర చాహల్ స్పిన్ బాధ్యతలు తీసుకోనున్నాడు.
పిచ్, వాతావరణం : కరోనా మహమ్మారికి ముందున్నట్టే పిచ్ స్పందిస్తే నేడు తొలి వన్డేలో భారీ స్కోర్లు నమోదు కానున్నాయి. ఇక్కడ ఆడిన చివరి ఏడు వన్డేల్లో ఆరు మ్యాచుల్లో తొలుత బ్యాటింగ్ చేసిన జట్టే విజయం సాధించింది. ఈ మ్యాచుల్లో సగటు తొలి ఇన్నింగ్స్ స్కోరు 312. తొలి వన్డేకు వాతావరణం ఆహ్లాదకరంగా ఉండనుంది. టాస్ నెగ్గిన జట్టు తొలుత బ్యాటింగ్ ఎంచుకునేందుకు మొగ్గుచూపనుంది.
తుది జట్లు (అంచనా) :
ఆస్ట్రేలియా : డెవిడ్ వార్నర్, అరోన్ ఫించ్ (కెప్టెన్), స్టీవ్ స్మిత్, మార్నస్ లబుషేన్, మార్కస్ స్టోయినిస్, అలెక్స్ కేరీ (వికెట్ కీపర్), గ్లెన్ మాక్స్వెల్, పాట్ కమిన్స్, మిచెల్ స్టార్క్, ఆడం జంపా, జోశ్ హజిల్వుడ్.
భారత్ : శిఖర్ ధావన్, మయాంక్ అగర్వాల్, విరాట్ కోహ్లి (కెప్టెన్), శ్రేయాస్ అయ్యర్, కెఎల్ రాహుల్ (వికెట్ కీపర్), హార్దిక్ పాండ్య, రవీంద్ర జడేజా, షార్దుల్ ఠాకూర్, యుజ్వెంద్ర చాహల్, మహ్మద్ షమి, జశ్ప్రీత్ బుమ్రా.
9 : ఆస్ట్రేలియాలో విరాట్ కోహ్లికి అద్భుతమైన రికార్డు ఉంది. 50.17 సగటుతో 1154 పరుగులు చేశాడు అక్కడ. కానీ సిడ్నీలో కోహ్లికి అన్ని చేదు అనుభవాలే. ఇక్కడ ఆడిన ఐదు ఇన్నింగ్స్ల్లో విరాట్ సగటు 9. అత్యధిక స్కోరు 21.
2 : ఆస్ట్రేలియాలో టీమ్ ఇండియాకు చెత్త రికార్డున్న స్టేడియం సిడ్నీ. ఇక్కడ ఆసీస్తో 14-2తో భారత్ వెనుకంజలో ఉంది.
3 : ఆస్ట్రేలియాలో ఆడిన చివరి నాలుగు వన్డేల్లో టీమ్ ఇండియా మూడు వన్డేల్లో విజయాలు సాధించింది.