Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఛేదనలో హార్దిక్, ధావన్ పోరాటం వృథా
- 375 పరుగుల ఛేదనలో భారత్ ఓటమి
- సెంచరీలతో చెలరేగిన స్మిత్, అరోన్ ఫించ్
- రాణించిన మాక్స్వెల్, జంపా, హజిల్వుడ్
సుదీర్ఘ నిరీక్షణ, విరామం అనంతరం క్రికెట్ స్టేడియంలో మళ్లీ సందడి కనిపించింది. క్రికెట్ విన్యాసాలు చూసేందుకు అభిమానులకు స్టేడియానికి తరలి వచ్చారు. అభిమాన క్రికెటర్ల జోరుతో ఉప్పొంగిపోయారు, ప్రత్యర్థి జట్ల ఆటగాళ్లను ఆటపట్టించే ప్రయత్నం చేశారు. నిరీక్షణ అనంతరం మైదానంలో అడుగుపెట్టినా..విరామం వచ్చిన ఊసే లేకుండా ప్రేక్షకులు సిడ్నీలో సందడి చేశారు. కరోనా మహ్మమారి పరిస్థితుల్లో ప్రపంచ క్రికెట్కు ఇది అతి పెద్ద ఊరట!. మన క్రికెట్ మళ్లీ మన ముందుకు ఎప్పట్లాగే వచ్చేసింది!.
సిడ్నీలో టీమ్ ఇండియా వ్యథ కొనసాగింది. ఈ గ్రౌండ్లో దారుణ రికార్డున్న భారత్కు శుక్రవారం తొలి వన్డేలోనూ అదే చేదు అనుభవం తప్పలేదు. 375 పరుగుల రికార్డు ఛేదనలో హార్దిక్ పాండ్య (90), శిఖర్ ధావన్ (74)లు పోరాడినా భారత్కు ఓటమి తప్పలేదు. 66 పరుగుల తేడాతో కోహ్లిసేన పరాజయం చవిచూసింది. స్టీవ్ స్మిత్ (105), అరోన్ ఫించ్ (105)లు శతకాలతో చెలరేగారు. మూడు మ్యాచుల వన్డే సిరీస్లో ఆస్ట్రేలియా 1-0 ఆధిక్యం సాధించింది.
సిడ్నీ (ఆస్ట్రేలియా)
ఆతిథ్య ఆస్ట్రేలియా సొంతగడ్డపై అదరగొట్టింది. అగ్రజట్టు భారత్పై తొలి వన్డేలో 66 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. వన్డే సిరీస్లో 1-0 ఆధిక్యంతో దూసుకెళ్లింది. స్టీవ్ స్మిత్ (105, 66 బంతుల్లో 11 ఫోర్లు, 4 సిక్స్లు), అరోన్ ఫించ్ (114, 124 బంతుల్లో 9 ఫోర్లు, 2 సిక్స్లు)లు సెంచరీలతో చెలరేగారు. ఓపెనర్ డెవిడ్ వార్నర్ (69, 76 బంతుల్లో 6 ఫోర్లు) అర్థ సెంచరీతో రాణించగా, గ్లెన్ మాక్స్వెల్ (45, 19 బంతుల్లో 5 ఫోర్లు, 3 సిక్స్లు) ధనాధన్ ఇన్నింగ్స్ ఆడాడు. టాప్ ఆర్డర్ జోరుతో తొలుత బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా 374/6 పరుగుల భారీ స్కోరు చేసింది. భారీ లక్ష్య ఛేదనలో హార్దిక్ పాండ్య (90, 76 బంతుల్లో 7 ఫోర్లు, 4 సిక్స్లు), శిఖర్ ధావన్ (74, 86 బంతుల్లో 10 ఫోర్లు) పోరాటం వృథా అయ్యింది. నిర్ణీత ఓవర్లలో భారత్ 308/8 పరుగులే చేయగల్గింది. స్పిన్నర్ ఆడం జంపా (4/54), పేసర్ జోశ్ హజల్వుడ్ (3/55) భారత్ను దెబ్బతీశారు. 62 బంతుల్లోనే శతకబాదిన స్టీవ్ స్మిత్ ' మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్'గా నిలిచాడు. సిరీస్లో రెండో వన్డే ఆదివారం సిడ్నీ క్రికెట్ మైదానంలోనే జరుగనుంది.
పాండ్య పోరాటం వృథా : 375 పరుగుల ఛేదనలో టాప్ ఆర్డర్ వైఫల్యం భారత్ను దెబ్బతీసింది. రికార్డు ఛేదనలో హార్దిక్ పాండ్య (90), శిఖర్ ధావన్ (74) పోరాడినా టాప్ ఆర్డర్ నుంచి సహకారం లభించలేదు. మయాంక్ అగర్వాల్ (22), విరాట్ కోహ్లి (21), శ్రేయాస్ అయ్యర్ (2), కెఎల్ రాహుల్ (12)లు విఫలమయ్యారు. ఆరంభం నుంచే ఎదురుదాడి చేయాలనే వ్యూహంతో కనిపించిన కోహ్లిసేన.. భారీ లక్ష్యాన్ని ఛేదించేందుకు వికెట్లు అవసరం అవుతాయనే విషయాన్ని మరిచింది!. జోశ్ హజిల్వుడ్ దెబ్బకు టాప్ ఆర్డర్లో ముగ్గురు కీలక బ్యాట్స్మెన్ వికెట్ కోల్పోయారు. ఆఖర్లో బ్యాట్ ఝులిపించాల్సిన సమయంలో స్పిన్నర్ జంపా.. వికెట్ల పండుగ చేసుకున్నాడు. 101/4తో కష్టాల్లో ఉన్న టీమ్ ఇండియాను పాండ్య, ధావన్ నిలబెట్టారు. ఐదో వికెట్కు 128 పరుగుల కీలక భాగస్వామ్యం నెలకొల్పారు. పాండ్య మూడు ఫోర్లు, నాలుగు సిక్సర్లతో 31 బంతుల్లోనే అర్థ సెంచరీ సాధించి జోరుమీద కనిపించాడు. శిఖర్ ధావన్ మరో ఎండ్లో 55 బంతుల్లో అర్థ సెంచరీతో సహకారం అందించాడు. వీరిద్దరూ క్రీజులో ఉన్నంతసేపు భారత్ రేసులో నిలిచింది. వేగంగా పరుగులు రాబట్టే క్రమంలో ఇద్దరూ జంపాకు వికెట్ కోల్పోయారు. ఇక ఆ తర్వాత జరిగిన ఆట కేవలం ఓటమి అంతరాన్ని తగ్గించడానికే అన్నట్టు సాగింది. నిర్ణీత ఓవర్లలో భారత్ 308 పరుగులే చేసింది. రవీంద్ర జడేజా (25), నవదీప్ సైని (29 నాటౌట్) జట్టు స్కోరును 300 దాటించారు. హార్దిక్ పాండ్య వన్డేల్లో తన వ్యక్తిగత అత్యధిక స్కోరు నమోదు చేశాడు.
చెలరేగిన స్మిత్ : సంప్రదాయ క్రికెటర్ స్టీవ్ స్మిత్.. పరిధులు దాటి చెలరేగాడు. ఎనిమిది ఫోర్లతో 36 బంతుల్లో అర్థ సెంచరీ సాధించిన స్మిత్.. మరో రెండు ఫోర్లు, నాలుగు సిక్సర్లతో 62 బంతుల్లో శతకబాదాడు. స్మిత్ కెరీర్లో ఇదే వేగవంతమైన శతకం. టాస్ నెగ్గి తొలుత బ్యాటింగ్ ఎంచుకున్న ఆస్ట్రేలియాకు ఓపెనర్లు డెవిడ్ వార్నర్ (69, 76 బంతుల్లో 6 ఫోర్లు), అరోన్ ఫించ్ (114, 124 బంతుల్లో 9 ఫోర్లు, 2 సిక్స్లు) తొలి వికెట్కు 156 పరుగులు జోడించారు. ఓపెనర్లు భారీ భాగస్వామ్యం నెలకొల్పినా.. భారత బౌలర్లు ధారాళంగా పరుగులు ఇవ్వలేదు. కెప్టెన్ అరోన్ ఫించ్ శతకబాదినా.. స్ట్రయిక్రేట్ వంద దాటలేదు. ఈ పరిస్థితుల్లో స్మిత్ సహజ శైలికి భిన్నమైన ఇన్నింగ్స్తో కదం తొక్కాడు. నాలుగు సిక్సర్లతో మెరిసిన స్మిత్.. మహ్మద్ షమి బంతికి వికెట్ కోల్పోయాడు. ఐపీఎల్లో పేలవ ప్రదర్శన చేసిన గ్లెన్ మాక్స్వెల్, జాతీయ జట్టు తరఫున ఆకాశమే హద్దుగా ఆడాడు. 19 బంతుల్లో 5 ఫోర్లు, 4 సిక్సర్లతో ధనాధన్ ఆటతో ఔరా అనిపించాడు. ఆఖర్లో మాక్స్వెల్ 45 పరుగుల ఇన్నింగ్స్తో ఆసీస్ భారీ స్కోరు సాధించింది. భారత బౌలర్లు అదనంగా 21 పరుగులు ఇవ్వటం సైతం ఆసీస్కు కలిసొచ్చింది. మహ్మద్ షమి (3/59) రాణించగా.. జశ్ప్రీత్ బుమ్రా (1/73), నవదీప్ సైని (1/83), చాహల్ (1/89), జడేజా (0/63) ధారాళంగా పరుగులు ఇచ్చుకున్నారు.
స్కోరు వివరాలు :
ఆస్ట్రేలియా ఇన్నింగ్స్ : డెవిడ్ వార్నర్ (సి) రాహుల్ (బి) మహ్మద్ షమి 69, అరోన్ ఫించ్ (సి) రాహుల్ (బి) జశ్ప్రీత్ బుమ్రా 114, స్టీవ్ స్మిత్ (బి) మహ్మద్ షమి 105, మార్కస్ స్టోయినిస్ (సి) రాహుల్ (బి) యుజ్వెంద్ర చాహల్ 0, గ్లెన్ మాక్స్వెల్ (సి) రవీంద్ర జడేజా (బి) మహ్మద్ షమి 45, మార్నస్ లబుషేన్ (సి) శిఖర్ ధావన్ (బి) నవదీప్ సైని 2, అలెక్స్ కేరీ నాటౌట్ 17, పాట్ కమిన్స్ నాటౌట్ 1, ఎక్స్ట్రాలు : 21, మొత్తం :( 50 ఓవర్లలో 6 వికెట్లకు) 374.
వికెట్ల పతనం : 1-156, 2-264, 3-271, 4-328, 5-331, 6-372.
బౌలింగ్ : మహ్మద్ షమి 10-0-59-3, జశ్ప్రీత్ బుమ్రా 10-0-73-1, నవదీప్ సైని 100-83-1, యుజ్వెంద్ర చాహల్ 10-0-89-1, రవీంద్ర జడేజా 10-0-63-0.
భారత్ ఇన్నింగ్స్ : మయాంక్ అగర్వాల్ (సి) మాక్స్వెల్ (బి) హజిల్వుడ్ 22, శిఖర్ ధావన్ (సి) మిచెల్ స్టార్క్ (బి) ఆడం జంపా 74, విరాట్ కోహ్లి (సి) అరోన్ ఫించ్ (బి) హజిల్వుడ్ 21, శ్రేయాస్ అయ్యర్ (సి) అలెక్స్ కేరీ (బి) హజిల్వుడ్ 2, కెఎల్ రాహుల్ (సి) స్టీవ్ స్మిత్ (బి) ఆడం జంపా 12, హార్దిక్ పాండ్య (సి) మిచెల్ స్టార్క్ (బి) ఆడం జంపా 90, రవీంద్ర జడేజా (సి) మిచెల్ స్టార్క్ (బి) ఆడం జంపా 25, నవదీప్ సైని నాటౌట్ 29, మహ్మద్ షమి (బి) మిచెల్ స్టార్క్ 13, జశ్ప్రీత్ బుమ్రా నాటౌట్ 0, ఎక్స్ట్రాలు : 20, మొత్తం :(50 ఓవర్లలో 8 వికెట్లకు) 308.
వికెట్ల పతనం : 1-53, 2-78, 3-80, 4-101, 5-229, 6-247, 7-281, 8-308.
బౌలింగ్ : మిచెల్ స్టార్క్ 9-0-65-1, జోశ్ హజిల్వుడ్ 10-0-55-3, పాట్ కమిన్స్ 8-0-52-0, ఆడం జంపా 10-0-54-4, మార్కస్ స్టోయినిస్ 6.2-0-25-0, గ్లెన్ మాక్స్వెల్ 6.4-0-55-0.
21:ఆస్ట్రేలియాలో ఘనమైన రికార్డున్న విరాట్ కోహ్లి సిడ్నీలో ఆరు ఇన్నింగ్స్ల్లో చేసిన అత్యధిక స్కోరు 21. తాజా మ్యాచ్లోనూ విరాట్ కోహ్లి అదే స్కోరు వద్ద వికెట్ కోల్పోయాడు.
3:సంప్రదాయ క్రికెటర్ స్టీవ్ స్మిత్ ఆస్ట్రేలియా తరఫున మూడో వేగవంతమైన సెంచరీ సాధించాడు. సిడ్నీలో భారత్తో మ్యాచ్లో స్మిత్ 62 బంతుల్లోనే వంద పరుగుల మైలురాయి చేరుకున్నాడు.
15 :సిడ్నీ క్రికెట్ స్టేడియంలో భారత్కు ఇది ఏకంగా 15వ పరాజయం. ఇక్కడ ఆస్ట్రేలియా, భారత్లు 17 మ్యాచుల్లో తలపడగా.. టీమ్ ఇండియా కేవలం రెండు మ్యాచుల్లోనే విజయం సాధించింది. ఆస్ట్రేలియాలో భారత్కు అత్యంత చెత్త రికార్డు ఇక్కడే ఉంది.