Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- దేశవాళీ క్రికెట్ సీజన్పై బీసీసీఐ
- రాష్ట్ర క్రికెట్ సంఘాలకు లేఖ
ముంబయి : కరోనా వైరస్ మహమ్మారితో ఆగిపోయిన దేశవాళీ క్రికెట్ సీజన్ను పున ప్రారంభించేందుకు భారత క్రికెట్ నియంతణ్ర మండలి (బీసీసీఐ) ప్రణాళిక సిద్ధం చేస్తోంది. దేశవాళీ క్రికెట్ సీజన్ నిలిచిపోవటంతో రంజీ క్రికెటర్లు మ్యాచ్ ఫీజుల రూపంలో విలువైన ఆదాయం కోల్పోయారు. లాక్డౌన్లో ఆర్థికంగానూ దేశవాళీ క్రికెటర్లు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఐపీఎల్ 2020ని విజయవంతంగా నిర్వహించి విలువైన రూ. 4000 కోట్లు ఆదాయం సంపాదించిన బీసీసీఐ.. తర్వలోనే దేశవాళీ సీజన్కు పచ్చజెండా ఊపనుంది. కరోనా వైరస్ మహమ్మారి ప్రమాదం నుంచి ఇంకా బయటపడకపోవటంతో దేశవాళీ సీజన్ను బయో సెక్యూర్ బబుల్ వాతావరణంలోనే నిర్వహించాల్సి ఉంటుంది. దీంతో ఏ టోర్నీలను నిర్వహించాలనే అంశంపై దేశవాళీ క్రికెట్ నిర్వహణకు బోర్డు ఆలోచన చేసింది. ఈ మేరకు దేశవాళీ క్రికెట్ షెడ్యూల్కు నాలుగు నగరాలను ఆప్షన్లుగా ఎంచుకోమని రాష్ట్ర క్రికెట్ సంఘాలకు తాజాగా రాసిన లేఖలో కోరింది. ' దేశవాళీ క్రికెట్ నిర్వహణకు రాష్ట్ర సంఘాల నుంచి అభిప్రాయాలను కోరుతున్నాను. 1. రంజీ ట్రోఫీ మాత్రమే, 2. సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ, 3. రంజీ ట్రోఫీ, సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ 4. సయ్యద్ ముస్తాక్ అలీ, విజరు హజరే ట్రోఫీ' అని బీసీసీఐ నాలుగు ఆప్షన్లు ఇచ్చింది. రాష్ట్ర క్రికెట్ సంఘాల అభిప్రాయాల ప్రకారం దేశవాళీ సీజన్లో ఏ టోర్నీలు నిర్వహించాలనేది బోర్డు తేల్చనుంది. దేశవాళీ క్రికెట్ సీజన్కు బీసీసీఐ ఆరు నగరాల్లో ఆరు బయో సెక్యూర్ బబుల్స్ను సృష్టించనుంది. రంజీ ట్రోఫీ నిర్వహణకు 67 రోజులు, సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీకి 22 రోజులు, విజరు హజారే ట్రోఫీకి 28 రోజులు పట్టనుంది. జనవరి 11-మార్చి 18 వరకు రంజీ ట్రోఫీ, డిసెంబర్ 20-జనవరి 10 వరకు సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ, జనవరి 11- ఫిబ్రవరి 7 వరకు విజరు హజారే ట్రోఫీల షెడ్యూల్లను సైతం రాష్ట్ర క్రికెట్ సంఘాలకు పంపిన లేఖలో బీసీసీఐ ఉంచినట్టు సమాచారం.