Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మరో రెండురోజులు ఆస్పత్రిలోనే...
కోల్కతా: బీసీసీఐ అధ్యక్షులు సౌరవ్ గంగూలీ శనివారం గుండెపోటు గురయ్యారు. కోల్కతాలోని ఇంట్లో ఉదయం వ్యాయామం చేస్తుండగా గుండెపోటు రావడంతో వెంటనే దగ్గర్లోని ఓ ఆస్పత్రికి తరలించినట్టు కుటుంబ సభ్యులు తెలిపారు. గంగూలీకి మూడు స్టెంట్లు వేయనున్నట్టు వుడ్ల్యాండ్స్ ఆస్పత్రి డాక్టర్లు వెల్లడించారు. ఇప్పటికే యాంజియోప్లాస్టీ నిర్వహించి ఒక స్టెంట్ వేశామని, మరో రెండు ఆది, సోమవారాల్లో వేయాల్సి ఉందని వారు తెలిపారు. మరో రెండురోజులు గంగూలీ ఆస్పత్రిలోనే ఉంటారని, కూతురు సనాతోనూ మాట్లాడారని డాక్టర్లు పేర్కొన్నారు. గంగూలీకి చికిత్స కోసం ముగ్గురు డాక్టర్లతో ఒక టీమ్ను ఏర్పాటు చేసినట్టు తెలిపింది. మొత్తంగా మరో వారం రోజుల పాటు గంగూలీకి చికిత్స కొనసాగుతుందని వుడ్ల్యాండ్స్ ఆసుపత్రి డాక్టర్లు పేర్కొన్నారు.
నిలకడగానే.. : జే షా
సౌరవ్ గంగూలీ ఆరోగ్యం నిలకడగానే ఉందని, చికిత్సకు బాగానే స్పందిస్తున్నారని బోర్డు కార్యదర్శి జే షా వెల్లడించారు. ప్రస్తుతం గంగూలీ ఐసీయూలో చికిత్స పొందుతున్నారని, తాను గంగూలీ కుటుంబంతో మాట్లాడానని, దాదా త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నట్టు జే షా, బీసీసీఐ ఉపాధ్యక్షులు రాజీవ్ శుక్లా ట్వీట్ చేశారు. టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లి, అజింక్య రహానే కూడా గంగూలీ త్వరగా కోలుకోవాలంటూ ట్వీట్లు చేశారు.
త్వరగా కోలుకోవాలి: మమతా బెనర్జీ
గుండెపోటుకు గురైన గంగూలీ త్వరగా కోలుకోవాలని పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఆకాంక్షించారు. గంగూలీకి గుండెపోటు వచ్చిందన్న వార్త తెలిసి చాలా బాధపడ్డానని, ఈ సమయంలో గంగూలీతో పాటు ఆయన కుటుంబ సభ్యులకు దేవుడు ధైర్యం ఇవ్వాలని ప్రార్థిస్తున్నట్టు మమతా ట్వీట్ చేశారు.