Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- బంగ్లా ప్రాబబుల్స్లో చోటు
ఢాకా : బంగ్లాదేశ్ స్టార్ ఆల్రౌండర్, మాజీ కెప్టెన్ షకిబ్ అల్ హసన్ అంతర్జాతీయ క్రికెట్లోకి పునరాగమనం చేసేందుకు రంగం సిద్ధం చేసుకున్నాడు. జనవరి 20 నుంచి స్వదేశంలో వెస్టిండీస్తో బంగ్లాదేశ్ వన్డే, టెస్టు సిరీస్లో పోటీపడనుంది. వెస్టిండీస్తో సిరీస్కు బంగ్లాదేశ్ ఎంపిక చేసిన ప్రిలిమినరీ జట్టులో షకిబ్ అల్ హసన్కు చోటు లభించింది. ఐసీసీ అవినీతి నిరోధక విభాగం క్రమశిక్షణ చర్యల్లో భాగంగా షకిబ్ అల్ హసన్పై 12 నెలల సస్పెన్షన్ విధించింది. మ్యాచ్ ఫిక్సింగ్కు పాల్పడేందుకు ఉద్దేశించి బుకీలు సంప్రదించిన విషయాన్ని షకిబ్ అల్ హసన్ దాచిపెట్టాడు. విచారణలో వాస్తవం అంగీకరించిన షకిబ్ అల్ హసన్ ఏడాది శిక్షతో బయటపడ్డాడు. కరోనా వైరస్ మహమ్మారి కారణంగా ఏడాదిగా అంతర్జాతీయ క్రికెట్ అయోమయంలో పడింది. దీంతో షకిబ్ పెద్దగా క్రికెట్ను కోల్పోకుండానే పునరాగమనం చేయనున్నాడు. బంగ్లాదేశ్ ప్రాబబుల్స్లో చోటుచేసుకున్న క్రికెటర్లు జనవరి 14, 16న జరిగే అంతర్గత మ్యాచుల్లో ఆడాల్సి ఉంది. ఆ మ్యాచుల అనంతరం మూడు వన్డేలు, రెండు టెస్టులకు జట్లను బంగ్లాదేశ్ సెలక్షన్ కమిటీ ఎంపిక చేయనుంది. 24 మంది ప్రాబబుల్స్లో మాజీ కెప్టెన్, స్టార్ పేసర్ మష్రఫె మొర్తాజాకు చోటు దక్కలేదు. బంగ్లాదేశ్కు సుదీర్ఘ కాలం నాయకత్వం వహించటంతో పాటు వన్డేల్లో అత్యధిక వికెట్ల రికార్డు అతడి పేరిట ఉంది.