Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- పకోస్కీ, లబుషేన్ అర్థ సెంచరీలు
- ఆశలు రేపుతున్న స్టీవ్ స్మిత్ ఇన్నింగ్స్
- ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్ 166/2
- భారత్, ఆసీస్ సిడ్నీ టెస్టు తొలి రోజు
పచ్చికతో కూడిన పిచ్. మేఘావృతమైన వాతావరణం. తొలి రెండు సెషన్లలో చిరు జల్లుల విరామమే అధికం. ఈ పరిస్థితులు కచ్చితంగా భారత పేస్ బృందానికి ఉత్సాహాన్ని ఇచ్చేవే. కానీ ఆస్ట్రేలియా టాప్ ఆర్డర్ను కట్టడి చేయటంలో బుమ్రా బృందం తొలి రోజు నిరాశపరిచింది. ఆరంభంలో చూపిన తెగువ.. మ్యాచ్ సాగుతున్న కొద్దీ లోపించింది. చెత్త బంతులు సంధించి బ్యాట్స్మెన్పై ఒత్తిడి లేకుండా చేసింది!. ఫలితంగా అరంగేట్ర ఓపెనర్ విల్ పకోస్కీ (62), మార్నస్ లబుషేన్ (67 నాటౌట్) అర్థ సెంచరీలతో చెలరేగారు. సిడ్నీ టెస్టు తొలి రోజు ఆటలో ఆస్ట్రేలియాను ముందంజలో నిలిపారు.
సిడ్నీ (ఆస్ట్రేలియా)
అరంగేట్ర బ్యాట్స్మన్, యువ ఓపెనర్ విల్ పకోస్కీ (62, 110 బంతుల్లో 4 ఫోర్లు), నం.3 బ్యాట్స్మన్ మార్నస్ లబుషేన్ (67 బ్యాటింగ్, 149 బంతుల్లో 8 ఫోర్లు) అర్థ సెంచరీలు సాధించారు. ప్రమాదకర ఓపెనర్ డెవిడ్ వార్నర్ (5) ఆరంభంలోనే నిష్క్రమించినా, ఆ లోటు ఎక్కడా కనిపించలేదు. విలక్షణ టెస్టు బ్యాట్స్మన్ స్టీవ్ స్మిత్ (31 బ్యాటింగ్, 64 బంతుల్లో 5 ఫోర్లు) సిడ్నీలో తిరిగి ఫామ్ సాధించినట్టు కనిపిస్తున్నాడు. ఆస్ట్రేలియా టాప్ ఆర్డర్లో ముగ్గురు బ్యాట్స్మెన్ మెరవటంతో ఆ జట్టు తొలి ఇన్నింగ్స్లో 166/2తో భారీ స్కోరు దిశగా పయనిస్తోంది. భారత బౌలర్లలో మహ్మద్ సిరాజ్ (1/46), నవదీప్ సైని (1/32)లు చెరో వికెట్ పడగొట్టారు. వర్షం తీవ్ర అంతరాయం కలిగించిన మూడో టెస్టులో ఆస్ట్రేలియా తొలి రోజును సంతృప్తికరంగా ముగించింది. నేడూ కంగారూ బ్యాట్స్మెన్ జోరు ఇలాగే కొనసాగితే.. తొలి ఇన్నింగ్స్లో ఆ జట్టు భారీ స్కోరు బాదటం లాంఛనమే!.
తొలి సెషన్ : డెవిడ్ వార్నర్ నిష్క్రమణ
టాస్ గెల్చుకున్న ఆస్ట్రేలియా తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది. యువ ఓపెనర్ విల్ పకోస్కీ అరంగేట్ర అవకాశం దక్కించుకున్నాడు. వంద శాతం ఫిట్నెస్ లేకపోయినా, డెవిడ్ వార్నర్ సిడ్నీలో బరిలోకి దిగాడు. కానీ వార్నర్ను క్రీజులో ఏమాత్రం సౌకర్యవంతంగా ఉంచలేదు భారత పేసర్లు. మహ్మద్ సిరాజ్ ఇన్నింగ్స్ నాల్గో ఓవర్లోనే ప్రమాదకర డెవిడ్ వార్నర్ (5)ను అవుట్ చేశాడు. డ్రైవ్కు ప్రయత్నించిన వార్నర్ ఎడ్జ్తో రెండో స్లిప్స్లో పుజారా చేతికి చిక్కాడు. 2016, నవంబర్ తర్వాత సొంతగడ్డపై వార్నర్ అతి తక్కువ స్కోరుకు అవుట్ కావటం ఇదే తొలిసారి. ఆ తర్వాత సింగిల్ డిజిట్ స్కోరుకే వికెట్ కోల్పోవటం సైతం ఇదే ప్రథమం. ఆరంభంలోనే డెవిడ్ వార్నర్ వికెట్తో భారత్ బ్రేక్ సాధించింది. అరంగేట్ర ఓపెనర్ పకోస్కీ (14), మార్నస్ లబుషేన్ (2) మరో మూడు ఓవర్లు ఆడగానే.. వర్షం అంతరాయం కలిగించింది. తొలి సెషన్లో కేవలం 30 నిమిషాల ఆట మాత్రమే సాధ్యపడింది. 7.1 ఓవర్లలో 21/1తో ఆస్ట్రేలియా లంచ్ విరామానికి వెళ్లింది.
రెండో సెషన్ : పకోస్కీ, లబుషేన్ ప్రతాపం
వార్నర్ను అవుట్ చేసిన ఆనందం భారత శిబిరంలో ఎంతోసేపు నిలువలేదు. వర్షం విరామం అనంతరం, వికెట్లు ఆశించినా అదీ దక్కలేదు. రిషబ్ పంత్ ఇచ్చిన రెండు జీవనదానాలతో అరంగేట్ర ఓపెనర్ విల్ పకోస్కీ కెరీర్ తొలి అర్థ సెంచరీ బాదేశాడు. 97 బంతుల్లో 4 ఫోర్లతో 50 పరుగుల మైలురాయిని అందుకున్నాడు. మరో ఎండ్లో మార్నస్ లబుషేన్ నిలకడగా పరుగులు సాధించాడు. 14వ ఓవర్లోనే అశ్విన్ను ప్రయోగించిన రహానె మరో బ్రేక్ రాబట్టలేకపోయాడు. పకోస్కీ, లబుషేన్లు స్కోరింగ్ రేటును పెంచారు. తొలి 50 పరుగులకు 140 బంతులు తీసుకున్న ఆస్ట్రేలియా.. రెండో 50 పరుగులను 58 బంతుల్లోనే పిండుకుంది. దీంతో రెండో సెషన్లో ఆసీస్ వేగంగా పరుగులు సాధించింది. టీ విరామ సమయానికి పకోస్కీ (54), లబుషేన్ (34)లు ఆసీస్ను ముందంజలో నిలిపారు. ఈ సెషన్లో భారత బౌలర్లకు ఒక్క వికెట్ సైతం దక్కలేదు.
మూడో సెషన్ : పట్టు బిగించిన ఆస్ట్రేలియా
టీ విరామం అనంతరం, అర్థ సెంచరీ హీరో విల్ పకోస్కీ (62)ని నవదీప్ సైని పడగొట్టాడు. సైని బంతికి పకోస్కీ వికెట్ల ముందు ఎల్బీగా అవుటయ్యాడు. మార్నస్ లబుషేన్ 108 బంతుల్లో ఆరు ఫోర్లతో అర్థ సెంచరీ సాధించాడు. స్టీవ్ స్మిత్ క్రీజులోకి రాగానే అశ్విన్ చేతికి బంతిని అందించిన రహానె.. అతడిని ఒత్తిడిలో పడేసేందుకు చూసింది. కానీ స్మిత్ అశ్విన్పై ఎదురుదాడి చేశాడు. క్రీజు వదిలి బటయకొచ్చి అశ్విన్ను ఎదుర్కొన్నాడు. దీంతో అశ్విన్ ఎటాకింగ్ నుంచి డిఫెన్సివ్లోకి వెళ్లకతప్పలేదు. బుమ్రా ఓవర్లో స్మిత్ మూడు ఫోర్లు బాదగా.. లబుషేన్ సిరాజ్ను బౌండరీలుగా మలిచాడు. ఈ జోడీ మరింత వేగంగా 63 బంతుల్లోనే మరో 50 పరుగులు జోడించింది. భారత్పై వన్డేల్లో సిడ్నీలో మెరుపు శతకాలు బాదిన స్మిత్.. అదే సిడ్నీలో తిరిగి ఫామ్ సాధించినట్టు కనిపిస్తున్నాడు. 64 బంతుల్లో ఐదు ఫోర్లతో అజేయంగా 31 పరుగులు చేశాడు. సిరీస్లో నిలకడగా పరుగులు రాబడుతున్న మార్నస్ లబుషేన్ 67 పరుగులతో క్రీజులో కొనసాగుతున్నాడు. ఈ జోడీ మూడో వికెట్కు 125 బంతుల్లో 60 పరుగులు జోడించింది. ఓపెనర్లను మాత్రమే కోల్పోయిన ఆస్ట్రేలియా సిడ్నీలో భారీ స్కోరుకు గట్టి పునాది వేసుకుంది. నేడు భారత బౌలర్లు పుంజుకుంటే ఆట ఆసక్తికరంగా మారనుంది. లేదంటే, కంగారూ జోరును ఆపటం కష్టమే.
పంత్.. ఇలా చేశాడే! : ఆస్ట్రేలియా అరంగేట్ర ఆటగాడు విల్ పకోస్కీ కెరీర్ తొలి ఇన్నింగ్స్లోనే అర్థ సెంచరీతో రాణించాడు. భారత యువ వికెట్ కీపర్ రిషబ్ పంత్ రెండు సార్లు అతడి క్యాచ్ను నేల పాలు చేసి, తొలి రోజు ఆటలో భారత్ను రేసులో వెనక్కి నెట్టాడు. తొలుత అశ్విన్ ఓవర్లో పకోస్కీ అవుట్ సైడ్ ఎడ్జ్తో దొరికిపోవాల్సింది. కానీ రిషబ్ పంత్ నేరుగా చేతిలోకి వచ్చిన క్యాచ్ను నేలపాలు చేశాడు. మరో నాలుగు ఓవర్ల తర్వాత, మహ్మద్ సిరాజ్ ఓవర్లో షార్ట్ బాల్కు పకోస్కీ వికెట్ల వెనకాల క్యాచ్ ఇచ్చాడు. రిషబ్ పంత్ తొలి ప్రయత్నంలో జారవిడిచినా.. డైవ్ చేసి మరోసారి ప్రయత్నించాడు. అయినా, క్యాచ్ను అందుకోలేకపోయాడు. తొలి సారి క్యాచ్ను వదిలేసినప్పుడు పకోస్కీ స్కోరు 26 కాగా, రెండో సారి 32 పరుగులు. పకోస్కీ 62 పరుగుల ఇన్నింగ్స్తో ఆసీస్ను ఆధిక్యంలో నిలిపాడు. రిషబ్ పంత్ క్యాచులు అందుకుంటే, తొలి రోజు ఆటలో భారత్ సైతం రేసులో నిలిచేది.
స్కోరు వివరాలు :
ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్ : విల్ పకోస్కీ (ఎల్బీ) నవదీప్ సైని 62, డెవిడ్ వార్నర్ (సి) చతేశ్వర్ పుజారా (బి) మహ్మద్ సిరాజ్ 5, మార్నస్ లబుషేన్ బ్యాటింగ్ 67, స్టీవ్ స్మిత్ బ్యాటింగ్ 31, ఎక్స్ట్రాలు : 01, మొత్తం : (55 ఓవర్లలో 2 వికెట్లకు) 166.
వికెట్ల పతనం : 1-6, 2-106.
బౌలింగ్ : జశ్ప్రీత్ బుమ్రా 14-3-30-0, మహ్మద్ సిరాజ్ 14-3-46-1, రవిచంద్రన్ అశ్విన్ 17-1-56-0, నవదీప్ సైని 7-0-32-1, రవీంద్ర జడేజా 3-2-2-0.
ఏ సెషన్లో ఎన్ని?
తొలి సెషన్
పరుగులు : 21
వికెట్లు : 01
ఓవర్లు : 7.1
రెండో సెషన్
పరుగులు : 72
వికెట్లు : 00
ఓవర్లు : 23.5
మూడో సెషన్
పరుగులు : 73
వికెట్లు : 01
ఓవర్లు : 24
దూకుడుగా ఆడానని అనలేను. అశ్విన్ను కొంత సానుకూల దృక్పథంతో ఎదుర్కొన్నాను. అతడిని ఒత్తిడిలో పడేయాలని అనుకున్నాను, ఈ సిరీస్లో ఆ పని ఇప్పటివరకు చేయలేదు. బ్యాట్ను మరింత బలంగా పట్టుకోవటం వంటి విషయాలపై దృష్టి సారించాను. మంచి పొజిషన్లలో ఆడుతున్నాననే విశ్వాసం కలుగుతోంది. మార్నస్ లబుషేన్తో భాగస్వామ్యం, ఆత్మవిశ్వాసంతో బౌండరీలు సాధించటం బాగుంది'
- స్టీవ్ స్మిత్, ఆసీస్ బ్యాట్స్మన్