Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- బ్రిస్బేన్ లో యుకె స్ట్రెయిన్ నమోదు
బ్రిస్బేన్ : బోర్డర్-గవాస్కర్ టెస్టు సిరీస్లో చివరి టెస్టుపై నీలినీడలు కమ్ముకుంటున్నాయి. బ్రిస్బేన్లో లాక్డౌన్ విధింపు, నాల్గో టెస్టుకు ముందు భారత క్రికెట్ జట్టు కఠిన క్వారంటైన్ ఎదుర్కొవాల్సి రావటం వంటి అంశాలు ఇప్పటికే బ్రిస్బేన్ టెస్టును ప్రమాదంలో పడేశాయి. తాజాగా బ్రిస్బేన్లో కరోనా వైరస్ మహమ్మారి నూతన రకం యుకె స్ట్రెయిన్ వెలుగు చూడటంతో.. అక్కడికి ప్రయాణించేందుకు భారత జట్టు గట్టిగా నిరాకరిస్తోంది. ఈ మేరకు ఇదే విషయాన్ని క్రికెట్ ఆస్ట్రేలియా (సీఏ)తో భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) తెలియజేసినట్టు సమాచారం.
స్వదేశంలో క్వారంటైన్ భయం?
సిడ్నీ నుంచి బ్రిస్బేన్కు చేరుకున్న అనంతరం అక్కడ బయో సెక్యూర్ బబుల్లోనూ భారత జట్టు క్రికెటర్లు కఠిన క్వారంటైన్ నిబంధనలు పాటించాల్సి రావటం భారత జట్టు మేనేజ్మెంట్ ఫిర్యాదుకు కారణమైంది. బయో సెక్యూర్ బబుల్ లోపల నిబంధనలు మరీ కఠినంగా ఉండబోవని, ఐపీఎల్ తరహాలోనే ఆటగాళ్లు కలిసి తిరగవచ్చని సీఏ అనధికారికంగా బీసీసీఐకి తెలిపింది. అక్కడితో ఆ వివాదం ముగిసిందనుకునే లోపే.. బ్రిస్బేన్లో యుకె స్ట్రెయిన్ కరోనా వైరస్ కేసు నమోదు కావటం కలకలం సృష్టిస్తోంది. ప్రస్తుతం బ్రిస్బేన్ మూడు రోజుల లాక్డౌన్లో ఉంది. యుకె స్ట్రెయిన్ కేసు నమోదుతో బీసీసీఐ ఆందోళన వ్యక్తం చేస్తుంది. కొత్త స్ట్రెయిన్ కేసుల కారణంగా యుకె నుంచి ప్రయాణాలపై భారత్ ఆంక్షలు విధించింది. బ్రిటన్ నుంచి వచ్చే ప్రయాణికులు కోవిడ్19 నెగెటివ్ రిపోర్టుతో భారత్లో అడుగుపెట్టినా.. కచ్చితంగా 14 రోజుల పాటు క్వారంటైన్లో ఉండాల్సిందేనని ప్రభుత్వం నిబంధనలు కఠినతరం చేసింది. ప్రస్తుతానికి ఆస్ట్రేలియా ప్రయాణికులపై భారత్లో ఎటువంటి ఆంక్షలు లేవు. సాధారణంగా కోవిడ్19 నెగెటివ్ రిపోర్టు చూపిస్తే చాలు. కానీ ఆస్ట్రేలియాలో యుకె స్ట్రెయిన్ కేసులు పెరిగితే, కంగారూ ప్రయాణికులపైనా భారత్లో ఆంక్షలు విధించే ప్రమాదం కనిపిస్తోంది. భారత్, ఆస్ట్రేలియా నాల్గో టెస్టు జనవరి 15 నుంచి ఆరంభం కావాల్సి ఉంది. జనవరి 19తో ఆస్ట్రేలియా పర్యటన ముగియనుంది. స్వదేశంలో ఫిబ్రవరి 5 నుంచి ఇంగ్లాండ్తో టెస్టు సిరీస్ షురూ కానుంది. ఈ సమయంలో భారత ప్రభుత్వం ఆస్ట్రేలియా ప్రయాణికులకూ క్వారంటైన్ తప్పనిసరి చేస్తే.. భారత క్రికెట్ జట్టు 14 రోజుల పాటు క్వారంటైన్లో గడపాల్సి ఉంటుంది. అప్పుడు ఇంగ్లాండ్తో టెస్టు సిరీస్ షెడ్యూల్ ప్రమాదంలో పడనుంది.
నాల్గో టెస్టు ఆడేందుకు భారత్ సుముఖంగానే ఉన్నప్పటికీ టెస్టు వేదికను బ్రిస్బేన్ నుంచి మార్చాలని కోరింది. ప్రస్తుతం ఆస్ట్రేలియాలో టెస్టు వేదికల్లో బిగ్బాష్ లీగ్ నడుస్తోంది. మూడో టెస్టు అనంతరం సైతం భారత జట్టు సిడ్నీలోనే ఉండేందుకు సీఏ ప్రస్తుతం ఏర్పాట్లు చేసింది. అలాగని సిడ్నీలోనే నాల్గో టెస్టు నిర్వహణకు మరో పిచ్ సిద్ధం చేసేందుకు ఎటువంటి ఆదేశాలు మైదాన సిబ్బందికి అందలేదు. దీంతో నాల్గో టెస్టుపై నీలినీడలు తొలగటం లేదు. త్వరలోనే క్రికెట్ ఆస్ట్రేలియా నాల్గో టెస్టుపై స్పష్టత ఇచ్చే అవకాశం కనిపిస్తోంది.