Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- జనవరి 17న అపెక్స్ కౌన్సిల్ భేటి
- ఎజెండాలో పలు కీలక అంశాలు
- దేశవాళీ సీజన్ పై స్పష్టతకు అవకాశం
కరోనా మహమ్మారి బూచితో భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) దేశవాళీ క్రికెట్ సీజన్ నిర్వహణ బాధ్యత నుంచి తప్పించుకునే పనిలో నిమగమైందనే విమర్శలు ఎక్కువవుతున్నాయి. కరోనా ప్రమాదకర సమయంలో ఆర్థికంగా నష్టపోయినా... ఇంగ్లాండ్, ఆస్ట్రేలియా సహా ఇతర బోర్డులు దేశవాళీ క్రికెట్కు అప్పుడే పచ్చజెండా ఊపేశాయి. భారత క్రికెట్ బోర్డు మాత్రం ఐపీఎల్ 2020 నిర్వహణ ఆదాయంతో ఆనందం పడుతోంది. సయ్యద్ ముస్తాక్ అలీ టీ20 టోర్నీతోనే సరిపెట్టుకునేందుకు చూస్తోంది. ఈ నేపథ్యంలో ప్రతిష్టాత్మక రంజీ ట్రోఫీ నిర్వహణపై సందిగ్థత నెలకొంది.
నవతెలంగాణ-ముంబయి
భారత జాతీయ జట్టు పటిష్టంగా ఉండాలంటే, నేషనల్ టీమ్కు నాణ్యమైన క్రికెటర్లను అందించేందుకు దేశవాళీ క్రికెట్లో గట్టి పునాదులతో కూడిన ఫస్ట్ క్లాస్ క్రికెట్ సీజన్ ఉండాలి. ఐదు రోజుల ఆటలో రాటుదేలితేనే.. అంతర్జాతీయ స్థాయిలో గట్టి పోటీ ఇచ్చేందుకు నాణ్యమైన ఆటగాళ్లు రూపుదిద్దుకుంటారు. ప్రతి ఏటా దేశవాళీ సీజన్ నుంచి జాతీయ జట్టుకు ఆటగాళ్లు రాకపోవచ్చు!. కానీ, ఎటువంటి పరిస్థితుల్లోనైనా..జాతీయ జట్టుకు ఆటగాళ్లను అందించేందుకు దేశవాళీ క్రికెట్ సదా సిద్ధంగానే ఉంటుంది. జాతీయ జట్టు నిర్మాణానికి పునాది దేశవాళీ క్రికెట్. ఏ కారణంగానైనా దేశవాళీ క్రికెట్ను చిన్నచూపు చూస్తే.. దీర్ఘకాలంలో జాతీయ జట్టుపై ప్రభావం పడుతుంది. అయినా, కరోనా వైరస్ మహమ్మారి కారణం బూచితో భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) ప్రతిష్టాత్మక రంజీ ట్రోఫీ నిర్వహణ బాధ్యత నుంచి తప్పించుకునేందుకు చూస్తోంది. నిర్వహించాల్సిన అవసరం ఏర్పడినా, కుదించిన షెడ్యూల్తో రంజీ ట్రోఫీ నిర్వహణకు బోర్డు సిద్ధమవుతోంది. జనవరి 17న బీసీసీఐ అపెక్స్ కౌన్సిల్ సమావేశం కానుంది. ఈ సమావేశంలో రంజీ ట్రోఫీ భవితవ్యం సహా పలు కీలక అంశాలపై నిర్ణయం తీసుకునే అవకాశం కనిపిస్తోంది.
ఆరు బబుల్స్లోనే?! : బీసీసీఐ దేశవాళీ సీజన్కు సయ్యద్ ముస్తాక్ అలీ టీ20 టోర్నీతో శ్రీకారం చుట్టింది. ఐదు గ్రూపులు, ఒక్కో గ్రూపులో ఆరు జట్లు సహా మరో గ్రూప్లో ఎనిమిది జట్లు ఉన్నాయి. సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ ఇదే ఫార్మాట్లో సాగుతోంది. రంజీ ట్రోఫీని సైతం ఇదే ఫార్మాట్లో నిర్వహించేందుకు బీసీసీఐ ఏర్పాట్లు చేస్తోంది. ముస్తాక్ అలీ టీ20 టోర్నీ కోసం బీసీసీఐ ఆరు బయో సెక్యూర్ బబుల్స్ను ఏర్పాటు చేసింది. 38 జట్లతో కూడిన రంజీ ట్రోఫీ నిర్వహణకు సైతం ఇప్పుడు కొనసాగుతున్న పద్దతిలోనే జరపటం.. నిర్వహణ భారం తగ్గేందుకు తోడ్పడుతుందని బోర్డు వర్గాలు అంటున్నాయి. 'ప్రస్తుతానికి రంజీ ట్రోఫీ నిర్వహణకు 90 శాతం అవకాశాలు ఉన్నాయి. అన్నీ కుదరితే ఫిబ్రవరిలో రంజీ ట్రోఫీ ఆరంభమయ్యే అవకాశం ఉంది. సయ్యద్ ముస్తాక్ అలీ టీ20 టోర్నీ జరుగుతున్న ఆరు బయో బబుల్స్లోనే రంజీ ట్రోఫీ జరుపుతారు. గ్రూపుల విభజన సైతం అలాగే ఉండనుంది' అని బీసీసీఐ సీనియర్ అధికారి ఒకరు తెలిపారు.
ఐపీఎల్ ముందు, ఆ తర్వాత! : రంజీ ట్రోఫీ నిర్వహణకు అపెక్స్ కౌన్సిల్ ఆమోదం తెలిపితే.. ఫస్ట్ క్లాస్ మ్యాచుల సమరం ఫిబ్రవరిలో ఆరంభం కానుంది. ఫిబ్రవరి తొలి వారం నుంచే స్వదేశంలో ఇంగ్లాండ్తో భారత్ టెస్టు సిరీస్ ఆడనుంది. అదే సమయంలో భారత్లో దేశవాళీ ఫస్ట్ క్లాస్ సీజన్ ఆరంభం కానుంది. ఐపీఎల్ 2021 సీజన్ మార్చి ఆఖరు వారం, ఏప్రిల్ మొదటి వారంలో మొదలయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. రంజీ ట్రోఫీలో మ్యాచులను ఈ సీజన్లో గణనీయ స్థాయిలో తగ్గించే ప్రమాదం ఉంది. ఈ నేపథ్యంలో ఐపీఎల్ సీజన్ ఆరంభానికి ముందు లీగ్ దశ మ్యాచులను నిర్వహించేందుకు బోర్డు ఏర్పాట్లు చేయనుంది. ఐపీఎల్ సీజన్ ముగిసిన అనంతరం రంజీ ట్రోఫీ నాకౌట్ మ్యాచులు.. క్వార్టర్ఫైనల్స్, సెమీఫైనల్స్, ఫైనల్స్ నిర్వహించనుంది. దీంతో ఏ రాష్ట్ర జట్టూ తమ కీలక ఆటగాళ్లను కోల్పోయే అవకాశం ఉండదు.
మహిళల క్రికెట్పైనా చర్చ : అపెక్స్ కౌన్సిల్ సమావేశంలో రంజీ ట్రోఫీ నిర్వహణ సహా మహిళల క్రికెట్, అండర్ ఏజ్ గ్రూప్ క్రికెట్ నిర్వహణపైనా చర్చించనున్నారు. ప్రస్తుతానికి భారత దేశవాళీ సీజన్లో మెన్స్ టీ20 టోర్నీ మాత్రమే నిర్వహిస్తున్నారు. మహిళల క్రికెట్, జూనియర్ క్రికెట్ ఆరంభం కాలేదు. బయో సెక్యూర్ బుబల్స్లో మహిళల క్రికెట్, జూనియర్ క్రికెట్ను సైతం నిర్వహించేందుకు అపెక్స్ కౌన్సిల్ నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. మ్యాచుల సంఖ్య తగ్గించినా.. పూర్తిగా ఓ ఏడాది సీజన్ను కోల్పోయే ప్రమాదం నుంచి వర్థమాన క్రికెటర్లను తప్పించేందుకు బోర్డు అపెక్స్ కౌన్సిల్ నిర్ణయం తీసుకుంటేదేమో చూడాలి.
పన్నుపై పట్టువిడుపులే : జనవరి 17న అపెక్స్ కౌన్సిల్ సమావేశంలో దేశవాళీ క్రికెట్ నిర్వహణ సహా ఇతర అంశాలపైనా చర్చించనున్నారు. ఏడు అంశాలతో కూడిన అజెండాను బోర్డు సిద్ధం చేసింది. ఇందులో, 2023-31 ఐసీసీ ఎఫ్టీపీ క్యాలెండర్, ఐసీసీ ఈవెంట్లకు పన్ను మినహాయింపు, ఐపీఎల్ సీజన్ కోసం మరింత షెడ్యూల్ను వదిలేందుకు ప్రస్తావనలు ఉన్నాయి. 2022 ఐపీఎల్ సీజన్ నుంచి పది జట్లతో కూడిన ఐపీఎల్కు బీసీసీఐ ప్లాన్ చేస్తోంది. ఇప్పుడు ఐపీఎల్ కోసం రెండు మాసాలు అవసరం అవుతున్నాయి. పది జట్లతో కూడిన ఐపీఎల్కు బోర్డుకు కాస్త అధిక సమయం అవసరం. అందుకోసం ఐసీసీ రానున్న ఎఫ్టీపీలో సమయం ఇస్తుందని బోర్డు నమ్మకంగా ఉంది. భారత్లో నిర్వహించే ఐసీసీ ఈవెంట్లకు కేంద్ర ప్రభుత్వం వినోదం పన్ను మినహాయింపు ఇవ్వటం లేదు. ప్రభుత్వం మినహాయింపు ఇవ్వకుంటే, ఐసీసీ ఆదాయంలో బీసీసీఐకి దక్కాల్సిన వాటా నుంచి మినహాయించుకోవాలని బీసీసీఐ కోరనుంది. ఇదే సమయంలో పన్ను మినహాయింపుపై ప్రభుత్వంతో సంప్రదింపుల ప్రక్రియ వేగవంతం చేయాలని బోర్డు సిద్ధమవుతోంది.