Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- స్వీయ ప్రదర్శనపై శార్దుల్ ఠాకూర్
- సిరాజ్కు ఐదు వికెట్లు సంతోషకరం
న్యూఢిల్లీ : భారత జట్టులో పేస్ ఆల్రౌండర్పై జోరుగానే చర్చ నడిచింది. హార్దిక్ పాండ్య రాకతో ఆ చర్చకు బ్రేక్ పడింది. పరిమిత ఓవర్ల ఫార్మాట్ (వన్డే, టీ20)లలో హార్దిక్ పాండ్య ప్రపంచ శ్రేణి ఆల్రౌండర్గా నిరూపించుకున్నాడు. కానీ ఐదు రోజుల ఆటలో ఆల్రౌండర్గా హార్దిక్ పాండ్య పాత్రపై అనుమానాలు ఉత్పన్నం అవుతూనే ఉన్నాయి. వెన్నుపూసకు శస్త్రచికిత్స అనంతరం హార్దిక్ పాండ్య బౌలింగ్ చేయటం లేదు. అందుకే ఆస్ట్రేలియాతోనూ సిరీస్లోనూ వన్డే, టీ20ల్లోనే కనిపించాడు. పాండ్య లేకపోవటంతో విదేశాల్లో నాణ్యమైన పేస్ ఆల్రౌండర్ లోటు కనిపించింది. ఆఖరు టెస్టులో ఆ లోటును శార్దుల్ ఠాకూర్ పూడ్చివేశాడు. ఇర్ఫాన్ పఠాన్ తర్వాత సిసలైన పేస్ ఆల్రౌండర్గా సత్తా చాటాడు. ప్రధాన పేసర్గా కొనసాగుతూనే ఠాకూర్ బ్యాట్తో అద్భుత ప్రదర్శన చేశాడు. దీంతో టెస్టు జట్టులో పేస్ ఆల్రౌండర్గా హార్దిక్ పాండ్య నుంచి దూరం జరిగి ఆలోచన చేసే సమయం ఆసన్నమైందని చెప్పవచ్చు. ఆస్ట్రేలియాలో చారిత్రక విజయం అనంతరం స్వగ్రామం చేరుకున్న శార్దుల్ ఠాకూర్ మీడియాతో మాట్లాడాడు. ఆ విషయాలు అతడి మాటల్లోనే...!.
' అవును, నన్ను బౌలింగ్ ఆల్రౌండర్గా పిలువవచ్చు. నాకు అవకాశం లభించినప్పుడు, భవిష్యత్లోనూ బ్యాటింగ్ చేయగల సామర్థ్యం నాకుంది. జట్టుకు ఉపయోగపడే పరుగులు నేను చేయగలను. బ్రిస్బేన్లో ఐదు వికెట్ల రికార్డు తృటిలో చేజారినందుకు ఎటువంటి బాధ లేదు. ఐదు వికెట్లు తీస్తే ఆనందమే కానీ సిరాజ్కు ఐదు వికెట్లు వచ్చినందుకు సంతోషంగా ఉంది. నిజానికి సిరాజ్కు ఐదు వికెట్లు దక్కాలని కోరుకున్నాను. ఎందుకంటే అతడు ఎంతో కిష్లమైన పరిస్థితుల్లో ఉన్నాడు. ఈ సిరీస్ సిరాజ్కు ఎంతో భావోద్వేగంతో కూడుకున్నది. సిరాజ్ ఇటీవల ఆయన తండ్రిని కోల్పోయాడు. క్రికెట్ ఏ విధంగా ఆడాలో సిరాజ్ తండ్రి చెప్పిన మాటలను అతడు గుర్తు చేసుకున్నాడు. సిరాజ్ తండ్రి భౌతికంగా ఈ ప్రపంచంలో లేకపోయినా.. అతడి ఐదు వికెట్ల ప్రదర్శన పట్ల మరో లోకం నుంచి చూస్తూ గర్వపడతాడు. నేను ఆ క్యాచ్ అందుకోగానే ఎంతగానో సంతోషించాను. సిరాజ్కు ఐదు వికెట్లు దక్కినందుకు దేవుడికి ధన్యవాదాలు చెప్పుకున్నాను. ఆస్ట్రేలియాతో బ్రిస్బేన్లో ఆడటం అంత సులువు కాదు. బ్రిస్బేన్లో కంగారూ జట్టు రికార్డు గురించి అందరికీ తెలుసు 1988 నుంచి అక్కడ ఆస్ట్రేలియా ఓటమెరుగదు. గబ్బాలో అర్థ సెంచరీ సహా ఏడు వికెట్ల ప్రదర్శన చేశాను. జట్టు విజయంలో నాదీ ముఖ్యమైన భూమిక కావటం పట్ల ఎంతో సంతోషంగా ఉన్నాను. తొలి ఇన్నింగ్స్లో 186/6 వంటి క్లిష్టమైన పరిస్థితుల్లో క్రీజులోకి వచ్చినప్పుడు.. సాధ్యమైనంత ఎక్కువ సేపు బ్యాటింగ్ చేయాలి, వీలైనన్ని పరుగులు చేయాలని అనుకున్నాను. వాషింగ్టన్ సుందర్, నేను క్రీజులో కమ్యూనికేషన్ ఎక్కువగా ఉండేలా చూసుకున్నాం. స్కోరు బోర్డును అసలు పట్టించుకోలేదు. క్రీజులో అర గంట, ఇంకో అర గంట, మరో అర గంట అలా పొడగించుకుంటూ పోయాం. ఆవలి ఎండ్లో ఎక్కువగా షాట్లు ఆడేందుకు ప్రయత్నిస్తుంటే వెంటనే మాట్లాడుకునేవాళ్లం. అటువంటి భాగస్వామ్యాలకు కమ్యూనికేషన్ ఎంతో కీలకం' అని శార్దుల్ ఠాకూర్ అన్నాడు. బ్రిస్బేన్ టెస్టు తొలి ఇన్నింగ్స్లో శార్దుల్ ఠాకూర్ 67 పరుగుల అర్థ శతకమే భారత్కు అత్యధిక వ్యక్తిగత స్కోరు. ఆ టెస్టులో ఠాకూర్ ఏడు వికెట్లు పడగొట్టాడు. రెండో ఇన్నింగ్స్లో నాలుగు వికెట్లు తీసుకున్నాడు. వాషింగ్టన్ సుందర్తో కలిసి ఠాకూర్ తొలి ఇన్నింగ్స్లో 123 పరుగుల భాగస్వామ్యం నమోదు చేయటంతో గబ్బా టెస్టు రేసులో భారత్ నిలువగలిగింది.