Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- భారత కెప్టెన్ విరాట్ కోహ్లి
అహ్మదాబాద్ : ఐసీసీ ప్రపంచ టెస్టు చాంపియన్షిప్స్ ఫైనల్స్ రేసు ఆసక్తికరంగా మారింది. కరోనా వైరస్ మహమ్మారికి ముందు పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో కొనసాగిన భారత్.. కోవిడ్-19 అనంతరం ఐసీసీ తీసుకొచ్చిన పాయింట్ల పద్దతితో లార్డ్స్ ఫైనల్లో ఆడేందుకు ఆపసోపాలు పడుతోంది. ఇంగ్లాండ్తో చివరి రెండు టెస్టుల్లో ఏ మ్యాచ్లో ఓడినా టెస్టు చాంపియన్షిప్స్ ఫైనల్స్ రేసు నుంచి భారత్ నిష్క్రమించనుంది. పాయింట్లు ప్రకారం ముందంజలో నిలిచినా.. పాయింట్ల శాతం ఆధారంగా భారత్ ఫైనల్స్కు దూరం కానుంది. దీంతో రక్షణాత్మక ధోరణిలో ఓ టెస్టులో విజయం, మరో టెస్టులో డ్రా కోసం భారత్ ఆడనుందా? అని కెప్టెన్ విరాట్ కోహ్లిని విలేకరులు ప్రశ్నించగా సూపర్స్టార్ ఇలా బదులిచ్చాడు. ' అటువంటి కారణాలతో క్రికెట్ ఆడలేం. ఓ టెస్టులో విజయం కోసం, మరో టెస్టులో డ్రా కోసం ఆడటం లేదు. రెండు టెస్టుల్లోనూ విజయాలు సాధించేందుకు ఆడుతున్నాం. మాకు సంబంధించి, మా ముందు రెండు మ్యాచులున్నాయి. మా ఫోకస్ పూర్తిగా వాటిపైనే. ఈ రెండు మ్యాచులు జరిగేది వేరు. ఈ రోజు ఆట పైనే పూర్తి దృష్టి పెట్టాలనే ఫార్ములాతో కొన్నేండ్లుగా ఆడుతున్నాం. ఇప్పుడూ అదే కొనసాగుతుంది. జట్టుగా మేము చేసేది మేం చేస్తాం. ఫలితాల ఆధారంగా ఏం జరుగుతుంది, ఎలా జరుగుతుందనే సమీకరణాలను ఇతరులకు వదిలేస్తాం' అని విరాట్ కోహ్లి అన్నాడు.