Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఇంగ్లాండ్తో పింక్ సమరానికి భారత్ సై
- నేటి నుంచి డే నైట్ టెస్టు పోరు
- మ. 2.30 నుంచి స్టార్స్పోర్ట్స్లో ప్రసారం...
- స్పిన్కు అనుకూలించనున్న గులాబీ టెస్టు
36/10, 58/10. ఇవి గల్లీ క్రికెట్ స్కోర్లు కావు. భారత్, ఇంగ్లాండ్లు చివరగా ఆడిన గులాబీ బంతి డే నైట్ టెస్టుల్లో సాధించిన స్కోర్లు. ఫ్లడ్లైట్ల వెలుతురులో గులాబీ బంతితో దారుణంగా భంగపడిన ఈ రెండు జట్లు నేడు ముఖాముఖి సమరానికి సై అంటున్నాయి. అత్యాధునిక మోతెరా స్టేడియంలో భారత్, ఇంగ్లాండ్ సిరీస్ ఫలితాన్ని శాసించనున్న డే నైట్ టెస్టులో అమీతుమీ తేల్చుకోనున్నాయి. ఐసీసీ ప్రపంచ టెస్టు చాంపియన్షిప్స్ ఫైనల్లో చోటు కోసం భారత్ రానున్న రెండు టెస్టుల్లోనూ విజయాలు సాధించటం ప్రధానం. తొలిసారి స్పిన్నర్లు కీలక పాత్ర పోషించబోతున్న పింక్ బాల్ టెస్టుపై ఆసక్తి నెలకొంది. నేటి నుంచి భారత్, ఇంగ్లాండ్ మూడో టెస్టు సమరం ఆరంభం.
ప్రపంచవ్యాప్తంగా ఇప్పటివరకు ఆడిన 15 డే నైట్ టెస్టుల్లో పేసర్లదే పైచేయి అయ్యింది. 24.47 సగటుతో పేసర్లు 354 వికెట్లు తీసుకోగా.. స్పిన్నర్లు 35.38 సగటుతో 115 వికెట్లకే పరిమితం అయ్యారు.
నవతెలంగాణ-అహ్మదాబాద్
భారత్తో సిరీస్లో ఇంగ్లాండ్ విజయం సాధించడానికి అవకాశం ఉన్న ఏకైక టెస్టు మ్యాచ్ డే నైట్ టెస్టు. డే నైట్ టెస్టులో పేసర్లు చెలరేగటం అందుకు కారణం. కానీ అహ్మదాబాద్కు వచ్చేసరికి ఇంగ్లాండ్ ఓ టెస్టులో గెలుపొందింది. సిరీస్లో 1-1 సమవుజ్జీగా నిలిచింది. సమీకరణాలను, అంచనాలను తలకిందులు చేసింది. సిరీస్ ఫలితాన్ని శాసించేది డే నైట్ టెస్టు అని ఇరు జట్లకు తెలుసు. ఆస్ట్రేలియాలో భారత్ చేసిన ప్రదర్శనే భారత్లో పునరావృతం చేయాలని ఇంగ్లాండ్ జట్టు ఊహల్లో విహరిస్తోంది. ఇదే సమయంలో పింక్ బాల్ టెస్టులో ఓడినా, రానున్న నాల్గో టెస్టులో ఓడినా ఐసీసీ ప్రపంచ టెస్టు చాంపియన్షిప్స్ ఫైనల్స్ రేసు నుంచి భారత్ నిష్క్రమించనుంది. ఐసీసీ ప్రపంచ టెస్టు చాంపియన్షిప్స్ ఫైనల్స్ రేసు ఆతిథ్య జట్టుపై కాస్త ఒత్తిడికి కారణం అవుతోంది. గెలుపే లక్ష్యంగా బరిలోకి దిగుతున్న ఆతిథ్య భారత్ను మరోసారి ఆశ్చర్యపరిచేందుకు ఇంగ్లాండ్ తయారవుతోంది. చివరగా ఇక్కడ జరిగిన టెస్టులో ఇంగ్లాండ్ను ఓడించిన భారత్.. కొత్త స్టేడియంలో పాత ఫలితాన్ని రిపీట్ చేయాలని ఉవ్విళ్లూరుతోంది. మోతెరాలో డే నైట్ గులాబీ బంతి టెస్టు సమరం నేటి మధ్యాహ్నాం 2.30 గంటలకు ఆరంభం కానుంది. మూడో సెషన్ పూర్తిగా ఫ్లడ్ లైట్ల వెలుతురులో జరుగుతుంది.
బలంగానే భారత్ : స్వదేశీ గులాబీ టెస్టులో భారత్ తన మార్క్ ప్రణాళికలను అమలు చేయనుంది. తొలుత బ్యాటింగ్ చేసి భారీ స్కోరు సాధించటం.. 20 వికెట్లు తీసేందుకు బౌలర్లకు సహకరించటం. భారత బ్యాటింగ్ లైనప్లో ఆరుగురు బ్యాట్స్మెన్ ప్రస్తుత సిరీస్లో 50 ప్లస్ పరుగులు చేసిన వారే. బ్యాటింగ్ లైనప్లో అందరూ టచ్లో ఉన్నారు. రెండో టెస్టులో రోహిత్ శర్మ శుభారంభాన్ని భారీ ఇన్నింగ్స్గా మలచుకున్నాడు. ఇప్పుడూ అటువంటి ప్రదర్శన టాప్ ఆర్డర్ నుంచి జట్టు మేనేజ్మెంట్ కోరుకుంటోంది. మోతెరా టెస్టులో భారత్ బలమైన పేస్ దళాన్ని బరిలోకి దింపుతోంది. రెండో టెస్టుకు విశ్రాంతి తీసుకున్న స్టార్ సీమర్ జశ్ప్రీత్ బుమ్రా నేడు తుది జట్టులోకి రానున్నాడు. కెరీర్ వందో టెస్టు ఆడుతున్న ఇషాంత్ శర్మతో కలిసి బుమ్రా పేస్ బాధ్యతలు పంచుకోనున్నాడు. మూడో పేసర్ రేసులో మహ్మద్ సిరాజ్తో ఉమేశ్ యాదవ్ పోటీపడుతున్నాడు. స్పిన్ విభాగంలో రవిచంద్రన్ అశ్విన్, అక్షర్ పటేల్ తుది జట్టులో ఉండటం ఖాయమే. కానీ గులాబీ బంతి నుంచి మణికట్టు స్పిన్నర్లు చురుకైన టర్న్ రాబట్టుకుంటారు, దీంతో కుల్దీప్ యాదవ్ ఆడే అవకాశాన్ని కొట్టిపారేయలేము.
దీటుగా ఇంగ్లాండ్ : రెండో టెస్టులో కీలక పేసర్ జేమ్స్ అండర్సన్, జోఫ్రా ఆర్చర్ సేవలు కోల్పోయిన ఇంగ్లాండ్ జట్టు.. పింక్ బాల్ పోరుకు ఆ ఇద్దరినీ తుది జట్టులోకి తీసుకురానుంది. వీరికి అదనంగా టాప్ ఆర్డర్లోకి జానీ బెయిర్స్టో రానున్నాడు. ఈ ముగ్గురి చేరికతో ఇంగ్లాండ్ జట్టు మళ్లీ బలంగా తయారైంది. ప్రాక్టీస్ సెషన్లో ఇంగ్లాండ్ పేసర్లు ఎస్జీ పింక్ బాల్తో గొప్పగా రాణించారు. మ్యాచ్ పిచ్పై పచ్చిక తక్కువగా ఉండటం పేసర్లకు గులాబీ బంతితో కొత్త అనుభవం నేర్పనుంది. బెన్ స్టోక్స్ బెన్ ఫోక్స్, ఒలీ పోప్ సహా ఓపెనర్లు సిబ్లే, క్రావ్లీ నుంచి మెరుగైన ప్రదర్శన రావాల్సి ఉంది. కెప్టెన్ జో రూట్ ప్రదర్శనే ఇంగ్లాండ్ గమనాన్ని నిర్దేశించనుంది. అతడి వికెట్ భారత బౌలర్లకు కీలకం కానుంది.
ఆ సమయం కీలకం! : డే నైట్ పింక్ బాల్ టెస్టులో బ్యాట్స్మెన్కు సవాల్ విసిరే తరుణం ట్విలైట్ సమయం. టెస్టులు ఓడేది, గెలిచేది ఇక్కడే. సహజసిద్ధ సూర్యకాంతి నుంచి కృత్తిమ వెలుగులో ఆడేందుకు బ్యాట్స్మెన్ సర్దుబాటు చేసుకునే విలువైన సమయం ఇది. ఫ్లడ్లైట్ల వెలుతురులో పింక్ బాల్ ఎక్కువగా స్వింగ్ అవుతుంది. ఈ సమయంలో తొలి 20 బంతులను జాగ్రత్తగా ఎదుర్కొవటం ముఖ్యం. లేదంటే, వరుసగా వికెట్లు కోల్పోవటం క్షణాల్లో జరిగిపోతుంది. భారత్, ఇంగ్లాండ్లకు పింక్ బాల్ టెస్టులో ఈ పేకమేడ పతనం చివరి టెస్టుల్లో అనుభవమే. అందుకే ఈ టెస్టులోనూ ఈ ట్విలైట్ను అధిగమించటం ఇరు జట్లకు సవాలే.
పిచ్, పరిస్థితులు : మోతెరా పిచ్పై నామమాత్రపు పచ్చిక ఉండనుంది. రెండు, మూడు రోజుల్లోనే స్పిన్నర్లకు ఇక్కడ టర్న్ లభించే అవకాశం ఉంది. ఫ్లడ్ లైట్ల వెలుతురులో గులాబీ బంతితో సీమర్ల సానుకూలత ఇక్కడా ఉంటుంది. 1,10,000 సామర్థ్యంతో కూడిన ఆధునాతన స్టేడియంలో కోవిడ్-19 నిబంధనల కారణంగా సగం సీట్లలోనే అభిమానులు కనువిందు చేయనున్నారు. టెస్టు మ్యాచ్ ఐదు రోజులలో ఉష్ణోగ్రత 30-35 డిగ్రీల వరకు ఉండనుంది. మూడో సెషన్లో మంచు ప్రభావం పడనుంది. టాస్ నెగ్గిన జట్టు తొలుత బ్యాటింగ్కు మొగ్గుచూపనుంది.
తుది జట్లు (అంచనా) :
భారత్ : రోహిత్ శర్మ, శుభ్మన్ గిల్, చతేశ్వర్ పుజారా, విరాట్ కోహ్లి (కెప్టెన్), అజింక్య రహానె, రిషబ్ పంత్ (వికెట్ కీపర్), రవిచంద్రన్ అశ్విన్, అక్షర్ పటేల్, ఇషాంత్ శర్మ, ఉమేశ్ యాదవ్, జశ్ప్రీత్ బుమ్రా.
ఇంగ్లాండ్ : డామినిక్ సిబ్లే, జాక్ క్రావ్లీ, జానీ బెయిర్స్టో, జో రూట్ (కెప్టెన్), బెన్ స్టోక్స్, ఒలీ పోప్, బెన్ ఫోక్స్ (వికెట్ కీపర్), క్రిస్ వోక్స్, జోఫ్రా ఆర్చర్, జాక్ లీచ్, జేమ్స్ అండర్సన్.
34:భారత సూపర్స్టార్ విరాట్ కోహ్లి శతకం లేకుండానే 34 ఇన్నింగ్స్లు లాగించేశాడు. చివరగా 2019 ఈడెన్గార్డెన్స్ పింక్ బాల్ టెస్టులో బంగ్లాదేశ్పై కోహ్లి వంద మార్క్ దాటాడు. అంతర్జాతీయ కెరీర్లో సెంచరీ చేయకుండా ఇన్ని ఇన్నింగ్స్లుఆడటం విరాట్కు ఇదే తొలిసారి.
100 :భారత సీనియర్ పేసర్ ఇషాంత్ శర్మ మోతెరా పింక్ టెస్టులో కెరీర్ వందో టెస్టు ఆడనున్నాడు. కపిల్ దేవ్ (131) తర్వాత వంద టెస్టులు ఆడిన భారత పేస్ బౌలర్గా ఇషాంత్ శర్మ రికార్డు సృష్టించనున్నాడు. ఇషాంత్ శర్మ 99 టెస్టుల్లో 302 వికెట్లు పడగొట్టాడు