Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- 112కే కుప్పకూలిన ఇంగ్లాండ్
- రోహిత్ శర్మ అజేయ అర్థ సెంచరీ
- భారత్ తొలి ఇన్నింగ్స్ 99/3
- మోతెరా డేనైట్ టెస్టు తొలి రోజు
అక్షర్ పటేల్ (6/38) సిక్సర్ కొట్టాడు. వరుసగా రెండు ఇన్నింగ్స్ల్లో ఐదు వికెట్ల ప్రదర్శనతో ఆకట్టుకున్నాడు. మోతెరా మైదానంలో పింక్ బాల్తో మాయజాలం ప్రదర్శించిన అక్షర్ పటేల్.. సొంత మైదానంలో ఇంగ్లాండ్కు సింహస్వప్నం అయ్యాడు. అనుకున్న నెమ్మదిగా లేని మోతెరా పింక్ పిచ్పై స్పిన్ను క్రీజులో నిలిచి ఎదుర్కొన్న ఇంగ్లాండ్ భారీ మూల్యం చెల్లించింది. వికెట్ల మీదుగా బ్యాట్స్మెన్పై దాడి చేసిన అక్షర్ పటేల్ ఆరు వికెట్లతో అదరగొట్టాడు. అక్షర్ పటేల్కు తోడు ట్రంప్కార్డ్ రవిచంద్రన్ అశ్విన్ (3/26) మెరవటంతో తొలి ఇన్నింగ్స్లో ఇంగ్లాండ్ 112 పరుగులకే కుప్పకూలింది. తొలి ఇన్నింగ్స్లో భారత్ 99/3తో మెరుగైన స్కోరు దిశగా సాగుతోంది.
నవతెలంగాణ-అహ్మదాబాద్
పింక్ బాల్, తొలి రోజు ఆట. తొలి పది ఓవర్లలోపే స్పిన్నర్లు చెలరేగుతారని ఎవరూ ఊహించలేదు. లోకల్ హీరో అక్షర్ పటేల్ (6/38) అంచనాలను మార్చేశాడు. ఇన్నింగ్స్ ఏడో ఓవర్లోనే మాయ మొదలెట్టాడు. మోతెరా పింక్ పిచ్పై ఇంగ్లాండ్ బ్యాట్స్మెన్ను స్పిన్తో వణికించాడు. ఆరు వికెట్లు కూల్చి ఆ జట్టు పతనాన్ని శాసించాడు. జానీ బెయిర్స్టో (0), బెన్ స్టోక్స్ (6), బెన్ ఫోక్స్ (12), జోఫ్రా ఆర్చర్ (11), జాక్ క్రావ్లీ (53), స్టువర్ట్ బ్రాడ్ (3)లు అక్షర్ మాయలో చిక్కుకున్నారు. ఇంగ్లాండ్ కెప్టెన్ జో రూట్ (17, 37 బంతుల్లో 2 ఫోర్లు) సైతం తేలిపోయాడు. ఓపెనర్ జాక్ క్రావ్లీ (53, 84 బంతుల్లో 10 ఫోర్లు) ఆకట్టుకునే ప్రదర్శన చేశాడు. అక్షర్ పటేల్, అశ్విన్ మాయజాలానికి ఇంగ్లాండ్ తొలి ఇన్నింగ్స్లో 48.4 ఓవర్లలో 112 పరుగులకు కుప్పకూలింది. రోహిత్ శర్మ (57 బ్యాటింగ్, 82 బంతుల్లో 9 ఫోర్లు) అజేయ అర్థ సెంచరీతో భారత్ తొలి ఇన్నింగ్స్లో మెరుగైన స్కోరు దిశగా నడుస్తోంది. శుభ్మన్ గిల్ (11) ఇబ్బందిపడగా, విరాట్ కోహ్లి (27, 58 బంతుల్లో 3 ఫోర్లు) తొలి రోజు ఆటలో ఆఖరు ఓవర్లో వికెట్ కోల్పోయాడు. అజింక్య రహానె (1 బ్యాటింగ్) తోడుగా రోహిత్ శర్మ అజేయంగా క్రీజులో కొనసాగుతున్నాడు. నేడు తొలి రెండు సెషన్లలో భారత బ్యాట్స్మెన్ మెరిస్తే.. కోహ్లిసేన కనీసం 100కు పైగా పరుగుల ఆధిక్యంపై కన్నేయనుంది.
తొలి సెషన్ : వేట మొదలుపెట్టిన ఇషాంత్
కెరీర్ వందో టెస్టు ఆడుతున్న ఇషాంత్ శర్మ మైలురాయి మ్యాచ్లో వికెట్ల వేటను ఆరంభించాడు. కీలక టాస్ నెగ్గిన ఇంగ్లాండ్ తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది. తొలి ఏడు ఓవర్లలోనే స్పిన్నర్ చేతికి బంతి అందించిన భారత కెప్టెన్.. ఇంగ్లాండ్ను ఇరకాటంలో పడేశాడు. ఇన్నింగ్స్ మూడో ఓవర్లో మూడో బంతికి ఫామ్లో ఉన్న ఓపెనర్ డామినిక్ సిబ్లీ (0)ని ఇషాంత్ అవుట్ చేశాడు. అదనపు బౌన్స్ రాబట్టిన ఇషాంత్ రెండో స్లిప్స్లో రోహిత్ క్యాచ్తో వేట మొదలెట్టాడు. విరామం అనంతరం ఆడుతున్న జానీ బెయిర్స్టో (0)కు లోకల్ బారు అక్షర్ పటేల్ తన తొలి బంతితోనే షాక్ ఇచ్చాడు. ఉపఖండపు పిచ్లపై మంచి రికార్డున్న జానీ బెయిర్స్టోను అక్షర్ పటేల్ డకౌట్ చేశాడు. స్పిన్ బంతిని ఆడేందుకు చూసిన బెయిర్స్టోకు అక్షర్ నేరుగా సంధించాడు. కండ్లుచెదిరే బంతికి బెయిర్స్టో వికెట్ల ముందు అడ్డంగా దొరికిపోయాడు. అప్పటికి ఇంగ్లాండ్ స్కోరు 27/2. కెప్టెన్ జో రూట్ (17)తో కలిసి ఓపెనర్ జాక్ క్రావ్లీ (53, 84 బంతుల్లో 10 ఫోర్లు) మూడో వికెట్కు నిర్మాణాత్మక భాగస్వామ్యం నమోదు చేశాడు. భారత బౌలర్లను దూకుడుగా ఎదుర్కొన్న జాక్ క్రావ్లీ పది ఫోర్లతో 68 బంతుల్లోనే అర్థ సెంచరీ సాధించాడు. మరో ఎండ్లో బ్యాట్స్మెన్ ఇబ్బంది పడుతున్న వేళ క్రావ్లీ ఆకట్టుకున్నాడు. మూడో వికెట్కు 47 పరుగులు జోడించిన ఈ జోడీని ట్రంప్కార్డ్ స్పిన్నర్ అశ్విన్ వెనక్కి పంపించాడు. అశ్విన్ బంతిని బ్యాక్ఫుట్తో ఆడాల్సిన రూట్... ఫ్రంట్ఫుట్తో ఆడి మూల్యం చెల్లించుకున్నాడు. రూట్ను వికెట్ల ముందు బుక్ చేసిన అశ్విన్ ఇంగ్లాండ్ ఆశలను ఆవిరి చేశాడు. అర్థ సెంచరీ ఉత్సాహంలో ఉన్న క్రావ్లీని సైతం అక్షర్ పటేల్ ఎంతో సేపు క్రీజులో నిలువనీయలేదు. తొలి సెషన్లో ఇషాంత్, అక్షర్, అశ్విన్ వేటతో ఇంగ్లాండ్ 81/4తో పీకల్లోతు కష్టాల్లో కూరుకుంది.
రెండో సెషన్ : ఇంగ్లాండ్ 112 ఆలౌట్
గులాబీ బంతితో తొలి ఇన్నింగ్స్లో ఇంగ్లాండ్ పూర్తిగా రెండు సెషన్లు కూడా ఆడలేకపోయింది. టీ విరామం అనంతరం అక్షర్ పటేల్ రెట్టించిన ఉత్సాహంతో వికెట్ల వేట సాగించాడు. అక్షర్ పటేల్ మాయకు బెన్ స్టోక్స్ (6), జోఫ్రా ఆర్చర్ (11), స్టువర్ట్ బ్రాడ్ (3) సహా వికెట్ కీపర్ బ్యాట్స్మన్ బెన్ ఫోక్స్ (12) దాసోహం అయ్యారు. ఒలీ పోప్ (1), జాక్ లీచ్ (3) కథ అశ్విన్ ముగించాడు. రెండో సెషన్లో 31 పరుగులకే ఇంగ్లాండ్ చివరి ఆరు వికెట్లను కోల్పోయింది. స్పిన్నర్ల మాయాజాలంతో విలవిల్లాడిన ఇంగ్లాండ్ 48.4 ఓవర్లలోనే చేతులెత్తేసింది. లోకల్ హీరో అక్షర్ పటేల్ (6/38) ఆరు వికెట్ల ప్రదర్శన చేశాడు. చెన్నై రెండో టెస్టులో అరంగేట్రం చేసిన అక్షర్ పటేల్ ఆ మ్యాచ్ రెండో ఇన్నింగ్స్లో ఐదు వికెట్ల ప్రదర్శన చేశాడు. మోతెరాలో ఇప్పుడు ఏకంగా ఆరు వికెట్లు ఖాతాలో వేసుకున్నాడు. చివరగా ఆడిన డే నైట్ గులాబీ టెస్టులో 58 పరుగులకు ఆలౌటైన ఇంగ్లాండ్.. మోతెరాతో మెరుగ్గా 112 పరుగులకు కుప్పకూలింది.
రెండో సెషన్లో ఐదు ఓవర్లు బ్యాటింగ్ చేసిన భారత్ వికెట్ నష్టపోకుండా జాగ్రత్త వహించింది. అరివీర భయంకర పేసర్లు జేమ్స్ అండర్సన్, స్టువర్ట్ బ్రాడ్లు పింక్ బాల్తో హడలెత్తించారు. పదునైన పేస్తో బంతులు సంధించిన అండర్సన్, స్టువర్ట్బ్రాడ్లు ఈ సెషన్లో ఓ వికెట్ సాధించినట్టే సాధించి విఫలమయ్యారు. బ్రాడ్ ఓవర్లో శుభ్మన్ గిల్ ఆడిన బంతిని రెండో స్లిప్స్లో బెన్ స్టోక్స్ అందుకున్నా.. బంతి నేలకు తాకినట్టు రిప్లేలో తేలింది. దీంతో శుభ్మన్ గిల్ బతికిపోయాడు. బ్రాడ్ ఓవర్లో బౌండరీ సాధించిన రోహిత్ శర్మ సెషన్ను సంతృప్తికరంగా ముగించాడు. రెండో సెషన్ ముగిసినప్పటికి భారత్ 5/0 వద్ద నిలిచింది.
మూడో సెషన్ : రోహిత్ శర్మ అర్థ సెంచరీ
కొత్త బంతితో అదనపు బౌన్స్, స్వింగ్ రాబట్టిన జేమ్స్ అండర్సన్, స్టువర్ట్ బ్రాడ్లు ఇంగ్లాండ్కు బ్రేక్ ఇవ్వలేకపోయారు. యువ ఓపెనర్ శుభ్మన్ గిల్ (11, 51 బంతుల్లో 2 ఫోర్లు) ఆరంభంలో ఎంతో అసౌకర్యంగా కదిలాడు. రెండు ఫోర్లు బాదిన గిల్ తనదైన శైలిలో క్రీజులో కుదురుకున్నట్టే కనిపించాడు. భీకర పేసర్ జోఫ్రా ఆర్చర్పై ఎదురుదాడికి వెళ్లిన గిల్.. గాల్లోకి క్యాచ్ లేపాడు. దీంతో 33 పరుగుల వద్ద భారత్ తొలి వికెట్ కోల్పోయింది. టెస్టు స్పెషలిస్ట్ చతేశ్వర్ పుజారా (0) పరుగుల ఖాతా తెరువలేదు. నాలుగు బంతులు ఆడిన పుజారా.. జాక్ లీచ్ బంతికి వికెట్ల ముందు దొరికిపోయాడు. వరుసగా రెండు వికెట్లు కోల్పోయిన భారత్ కాస్త వెనుకంజ వేసింది. ఇంగ్లాండ్ శిబిరంలో ఉత్సాహం కనిపించింది.
కెప్టెన్ విరాట్ కోహ్లితో జట్టుకట్టిన రోహిత్ శర్మ మూడో వికెట్కు అర్ధ సెంచరీ భాగస్వామ్యం నమోదు చేశాడు. ఇంగ్లాండ్ బౌలర్లపై ఎదురుదాడి చేసిన రోహిత్ శర్మ స్కోరు బోర్డును ముందుకు కదిలించాడు. 8 ఫోర్లతో 63 బంతుల్లోనే రోహిత్ శర్మ అర్థ సెంచరీ సాధించాడు. బెన్ స్టోక్స్ ఓవర్లో వరుసగా 4, 1 బాదిన రోహిత్ 50 పరుగుల మార్క్ను చేరుకున్నాడు. జాక్ లీచ్ ఓవర్లో రోహిత్ శర్మ, అండర్సన్ ఓవర్లో విరాట్ కోహ్లిలు జీవనదానాలు పొంది మరింత ప్రమాదకరంగా మారారు. అండర్సన్ బంతిని ఆడవద్దని ఆలస్యంగా అనుకున్న కోహ్లి.. తన బ్యాట్ ఎడ్జ్ తీసుకుని గల్లీలో క్యాచ్ లేచింది. అక్కడ ఒలీ పోప్ జారవిడిచాడు. తొలి రోజు మూడో సెషన్ ఆఖర్లో జాక్ లీచ్కు విరాట్ కోహ్లి (27) వికెట్ కోల్పోయాడు. దీంతో 64 పరుగుల మూడో వికెట్ భాగస్వామ్యానికి తెరపడింది. తొలి రోజు భారత్ 99/3తో ముగించింది.
స్కోరు వివరాలు :
ఇంగ్లాండ్ తొలి ఇన్నింగ్స్ : జాక్ క్రావ్లీ (ఎల్బీ) అక్షర్ పటేల్ 53, డామినిక్ సిబ్లీ (సి) రోహిత్ శర్మ (బి) ఇషాంత్ శర్మ 0, జానీ బెయిర్స్టో (ఎల్బీ) అక్షర్ పటేల్ 0, జో రూట్ (ఎల్బీ) రవిచంద్రన్ అశ్విన్ 17, బెన్ స్టోక్స్ (ఎల్బీ) అక్షర్ పటేల్ 6, ఒలీ పోప్ (బి) రవిచంద్రన్ అశ్విన్ 1, బెన్ ఫోక్స్ (బి) అక్షర్ పటేల్ 12, జోఫ్రా ఆర్చర్ (బి) అక్షర్ పటేల్ 11, జాక్ లీచ్ (సి) పుజారా (బి) రవిచంద్రన్ అశ్విన్ 3, స్టువర్ట్ బ్రాడ్ (సి) జశ్ప్రీత్ బుమ్రా (బి) అక్షర్ పటేల్ 3, జేమ్స్ అండర్సన్ నాటౌట్ 0, ఎక్స్ట్రాలు : 06, మొత్తం : (48.4 ఓవర్లలో ఆలౌట్) 112.
వికెట్ల పతనం : 1-2, 2-27, 3-74, 4-80, 5-81, 6-81, 7-93, 8-98, 9-105, 10-112.
బౌలింగ్ : ఇషాంత్ శర్మ 5-1-26-1, జశ్ప్రీత్ బుమ్రా 6-3-19-0, అక్షర్ పటేల్ 21.4-6-38-6, రవిచంద్రన్ అశ్విన్ 16-6-26-3.
భారత్ తొలి ఇన్నింగ్స్ : రోహిత్ శర్మ బ్యాటింగ్ 57, శుభ్మన్ గిల్ (సి) క్రావ్లీ (బి) జోఫ్రా ఆర్చర్ 11, చతేశ్వర్ పుజారా (ఎల్బీ) జాక్ లీచ్ 0, విరాట్ కోహ్లి (బి) లీచ్ 27, అజింక్య రహానె బ్యాటింగ్ 1, ఎక్స్ట్రాలు : 03, మొత్తం :(33 ఓవర్లలో 3 వికెట్లకు) 99.
వికెట్ల పతనం : 1-33, 2-34, 3-98.
బౌలింగ్ : జేమ్స్ అండర్సన్ 9-6-11-0, స్టువర్ట్ బ్రాడ్ 6-1-16-0, జోఫ్రా ఆర్చర్ 5-2-24-1, జాక్ లీచ్ 10-1-27-2, బెన్ స్టోక్స్ 3-0-19-0.