Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- విమర్శలకు తావిస్తోన్న పిచ్
- ప్రమాణాలు పాటించని ధోరణి
'క్రికెటర్ల ప్రదర్శన, జట్ల వ్యూహలపై చర్చలు చేయండి. పిచ్లపై కాదు. ఆతిథ్య జట్టు అనుకూలత అంటేనే అది. అటువంటప్పుడు తటస్థ పిచ్లు ఏర్పాటు చేయవచ్చు!' అహ్మదాబాద్లో పింక్ బాల్ టెస్టుకు ముందు భారత ఓపెనర్ రోహిత్ శర్మ వాదన ఇది. చెన్నైలో స్పిన్ పిచ్లు ఎదురైనా.. అవి పోటీతత్వంగానే ఉన్నాయనే భావన. మొతెరాలో పింక్ బాల్ టెస్టు ముగిసిన తర్వాత.. చర్చ మరోసారి పిచ్లపైకి వెళ్లక తప్పలేదు. అందుకు కారణం.. భారత్, ఇంగ్లాండ్లు డే నైట్ టెస్టును రెండో రోజుల్లోనే ముగించాయి. టెస్టు క్రికెట్కు ఇది ఆరోగ్యకర సంకేతం కాదు.
నవతెలంగాణ క్రీడావిభాగం :
టెస్టు మ్యాచ్ పిచ్లపై చర్చ ఇప్పుడు కొత్తగా వచ్చింది కాదు. ఉపఖండంలో విదేశీ పర్యటనలు జరిగిన ప్రతిసారీ ఏదో ఒక రూపంలో పిచ్లపై చర్చ నడుస్తూనే ఉంటుంది. అదే విధంగా ఇప్పుడూ ఆ చర్చ తెరపైకి వచ్చింది. ఇంగ్లాండ్ జట్టు భారత పర్యటనకు రావటం.. తొలి టెస్టులో విజయానంతరం వరుసగా రెండు ఓటములు చవిచూడటం తాజా పరిస్థితికి తక్షణ కారణం. టెస్టు మ్యాచ్ పిచ్లపై ప్రత్యేకంగా కొన్ని నియమాలు అంటూ ఏమీ లేవు. బ్యాట్కు, బంతికి సమాన పోటీ ఉండేలా పిచ్ రూపకల్పన చేయటం ఒక్కటే మౌళిక నియమం. ఆతిథ్య జట్లు తమ బలం, బలహీనతలను బేరీజు వేసుకుని.. పిచ్లను అనుకూలంగా రూపొందించుకుంటాయి. ఆడలేక మద్దెల ఓడు అన్న చందంగా.. ఉపఖండంలో ఓటమి ఎదురైన ప్రతిసారి విదేశీ జట్లు పిచ్లను ప్రధాన బూచీగా చూపిస్తూనే ఉన్నాయి. పిచ్ల గోలను ఒకే పార్శ్యం నుంచి చూడలేం. అహ్మదాబాద్లో భారత్, ఇంగ్లాండ్ టెస్టు మ్యాచ్ పిచ్ ఇప్పుడు విమర్శలు వస్తున్నాయి.
ద్వంద్వ వైఖరి : ఆస్ట్రేలియా పర్యటనలో భారత్ తొలి టెస్టులోనే దారుణంగా ఓడింది. ఆడిలైడ్లో గులాబీ బంతితో కోహ్లిసేన 36 పరుగులకు కుప్పకూలింది. ఆడిలైడ్లో భారత్ బ్యాట్స్మెన్ విఫలమైన చోట ఎవరూ పిచ్ గురించి మాట్లాడలేదు. అందరూ ఆస్ట్రేలియా పేసర్ల గొప్పతనం గురించే ప్రశంసలు గుప్పించారు. అహ్మదాబాద్లో ఇంగ్లాండ్ 81 పరుగులకు ఆలౌట్ అయ్యింది. ఇక్కడ ఎవరూ బ్యాట్స్మెన్ వైఫల్యం గురించి పెదవి విప్పటం లేదు. స్పిన్నర్ల ప్రతిభ గురించీ చర్చ లేదు. అందరూ పిచ్ వైపే వేలు చూపిస్తున్నారు. ఇంగ్లాండ్, దక్షిణాఫ్రికా, న్యూజిలాండ్, ఆస్ట్రేలియా, వెస్టిండీస్ పిచ్లు సహజసిద్ధంగానే పేస్, స్వింగ్కు స్వర్గధామం. భారత్, పాకిస్థాన్, బంగ్లాదేశ్, శ్రీలంక పిచ్లు స్పిన్కు సహకరిస్తాయి. ఉపఖండపు జట్లు విదేశీ పర్యటనల్లో విఫలమైనప్పుడు నాణ్యమైన పేస్ బౌలింగ్ను ఎదుర్కొనేందుకు బ్యాట్స్మెన్ సన్నద్ధం కాలేదని తీర్మానించేస్తారు. అదే ఉప ఖండం పిచ్లపై ఆ జట్ల బ్యాట్స్మెన్ విఫలమైతే.. ఆ నెపం పిచ్పైకి నెట్టేస్తారు. టెస్టు క్రికెట్ ఆరంభం నుంచీ ఇదే ధోరణి కొనసాగుతోంది. ఇంగ్లాండ్, ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా, న్యూజిలాండ్లలో స్వల్ప స్కోర్లకు ఆలౌట్ అయినప్పుడు, టెస్టు మ్యాచ్ మూడు రోజుల్లోనే ముగిసినప్పుడు పిచ్పై స్పందించని వారు.. ఉప ఖండంలో అదే ఫలితాలకు స్పందించినప్పుడు సమస్య ఉత్పన్నం అవుతోంది. అక్కడి జట్లు వారి అనుకూలతలకు అనుగుణంగా పిచ్ను తయారు చేసినట్టే.. ఉప ఖండంలో జట్లు సైతం వారి స్పిన్ అనుకూలతలను సొమ్ము చేసుకునేందుకు పిచ్లు సిద్ధం చేస్తాయి. అందులో ఎటువంటి దోషం లేదు.
టెస్టు క్రికెట్ కు చేటు : పిచ్ లపై ఎవరి వాదన ఎలా ఉందనే విషయాన్ని పక్కనపెడితే.. అంతిమంగా ఇది టెస్టు క్రికెట్కు చేటు తీసుకొస్తుంది. ఐసీసీ ప్రపంచ టెస్టు చాంపియన్షిప్స్ ఫైనల్లో చోటు కోసం సిరీస్ ఆరంభానికి ముందు భారత్, ఇంగ్లాండ్కు సమాన అవకాశాలు ఉండేవి. ఇప్పుడు ఇంగ్లాండ్ రేసు నుంచి నిష్క్రమించింది. భారత్ చివరి టెస్టును కనీసం డ్రా చేసుకున్నా.. లార్డ్స్ ఫైనల్లోకి ప్రవేశించనుంది. 'ఏమైనా చేయండి, అంతిమంగా విజయం సాధించండి' అనే సూత్రాన్ని ఆస్ట్రేలియా దశాబ్దాలు పాటించింది. చివరకు ఆస్ట్రేలియా క్రికెట్ జట్టును అది అధమస్థాయికి తీసుకెళ్లిన తీరు ప్రపంచ క్రికెట్ చూడనే చూసింది. భారత్ సహా ఇతర దేశాలు విజయమే లక్ష్యంగా ఆడుతున్నాయి. అందుకు, అందుబాటులో ఉన్న అన్ని వనరులను వాడుకుంటున్నాయి. సొంతగడ్డపై స్పిన్ పిచ్లను సిద్ధం చేయటం అందులో భాగమే. చెన్నైలో తొలి టెస్టుకు స్పిన్ ట్రాక్ను రెఢ చేసినా.. టాస్ ఓడటం భారత్ను దెబ్బతీసింది. దీంతో రెండో టెస్టుకు టాస్ పాత్ర నామమాత్రం చేసేందుకు తొలి రోజే స్పిన్ను అనుకూలించే పిచ్ను తయారు చేశారు. గులాబీ బంతితో పేసర్లు చెలరేగుతారని.. అహ్మదాబాద్లో తొలి ఓవర్ నుంచే స్పిన్ లభించే పిచ్ను ముందుంచారు. ఇప్పుడు ఈ వ్యవహారంపై భారత మాజీ క్రికెటర్లు సైతం విమర్శలు చేస్తున్నారు.
టెస్టు మ్యాచ్లో 600, 700 పరుగులు నమోదై ఐదు రోజుల్లో ఫలితం తేలకపోవటం ఎంత నిరుత్సాహకరమే.. తొలి 2-3 రోజుల్లోనే టెస్టులు ముగియటం అంతే దురదృష్టకరం. ఆధునిక క్రికెట్లో వన్డేలకే ప్రాధాన్యం తగ్గుతూ వస్తోంది. అభిమానులను అలరించేందుకు ఆడుతున్న తరుణంలో క్రికెట్ అత్యుత్తమ రూపం టెస్టు ఫార్మాట్ను కాపాడుకోవటం ఎంతో కీలకం. ఆస్ట్రేలియా, భారత్ టెస్టు సిరీస్ ప్రపంచ క్రికెట్ అభిమానులను ఊపేసింది. సవాళ్లతో కూడిన పరిస్థితుల్లో భారత జట్టు అద్వితీయ విజయాలు సాధించింది. ప్రపంచ క్రికెట్ ప్రశంసలు పొందింది. వేగవంతమైన పిచ్లపై ఆడేందుకు ఆసియా బ్యాట్స్మెన్ కఠోరంగా శ్రమిస్తున్నప్పుడు.. నెమ్మదైన పిచ్లపై ఆడేందుకు ఇంగ్లాండ్, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, దక్షిణాఫ్రికా బ్యాట్స్మెన్ ఎందుకు చెమటోడ్చరు?. ఆ బ్యాట్స్మెన్ ఆ పని చేస్తే అప్పుడు స్పిన్ పిచ్లు రూపొందించేందుకు ఆసియా జట్లు జంకుతాయనటంలో సందేహం లేదు. తొలి రెండు-మూడు రోజులు ఫాస్ట్ బౌలర్లకు అనుకూలించాలి, చివరి రెండు రోజులు స్పిన్నర్లు, రివర్స్ స్వింగ్కు పిచ్ సహకరించాలి అనే నియమాలు ఏమీ లేవు. తొలి రెండు రోజులు పేసర్లకే ఎందుకు? స్పిన్నర్లకూ అనుకులించవచ్చు అంటే కాదనేందుకు సహేతుక కారణాలు ఎవరి దగ్గరా లేవు. బంతిని ఎదుర్కొనేందుకు బ్యాట్స్మెన్ ఇబ్బంది పడటం, అనూహ్య బౌన్స్, మరీ ఎక్కువ స్వింగ్, అంచనా వేయలేని పరిస్థితుల్లోనే పిచ్ ప్రమాణాలు చెత్తగా ఉన్నాయని తేల్చుతారు. తొలి రోజే స్పిన్కు వికెట్లు పడినంత మాత్రాన అది చెత్త పిచ్ అయిపోదు. బ్యాట్స్మన్ సన్నద్ధత సైతం ఇక్కడ ప్రశ్నార్థకం చేయాలి. అంతిమంగా విజయమే లక్ష్యంగా బరిలోకి దిగుతున్న ఆధునిక క్రికెట్లో పిచ్ల రూపకల్పన ఐసీసీ తటస్థం చేస్తేగానీ.. పిచ్లపై పిచ్చి గోల సద్దుమణగదు.
' రెండు రోజుల్లోనే టెస్టు మ్యాచ్ ముగిసింది. ఇది టెస్టు మ్యాచ్ ప్రామాణిక పిచ్ అనుకోవటం లేదు. ఇలాంటి పిచ్లపై ఆడితే అనిల్ కుంబ్లే, హర్భజన్ సింగ్లు 800 వికెట్ల క్లబ్లో కూర్చుకునేవారు'
- యువరాజ్ సింగ్
'టెస్టు మ్యాచ్లో బ్యాట్కు, బంతికి సరసమైన పోటీ ఉండటాన్ని నేను ఇష్టపడతాను. టెస్టు మ్యాచ్ తొలి రోజే స్పిన్ తిరగడాన్ని ఏ విధంగా సమర్థించలేము. చెన్నై టెస్టుకు సిద్ధం చేసిన పిచ్ ప్రమాణాలను అందుకోలేదు. రవీంద్ర జడేజా లేకుంటే ఇంగ్లాండ్ జట్టు స్కోర్లు మరింత తక్కువగా నమోదయ్యేవి. జో రూట్ 5 వికెట్ల ప్రదర్శన పిచ్ నాణ్యతను తెలియజేస్తుంది'
- మార్క్ వా
' ఇటువంటి (మొతెరా) పిచ్లనే చూడాల్సి వస్తే, నా దగ్గర ఓ పరిష్కార మార్గం ఉంది. టెస్టులో ప్రతి జట్టుకు మూడు ఇన్నింగ్స్లు ఇవ్వాలి.రెండో రోజు మొతెరా పిచ్పై బ్యాటింగ్ పూర్తిగా లాటరీ. అత్యంత వికారమైన పిచ్ ఇది'
- మైకల్ వాన్