Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- పాకిస్థాన్ మాజీ కెప్టెన్ ఇంజమామ్
కరాచీ : పిచ్ గోల చర్చలోకి తాజాగా పాకిస్థాన్ మాజీ కెప్టెన్ ఇంజమామ్ ఉల్ హాక్ వచ్చాడు. సహచర ఆసియా దేశ క్రికెట్ బోర్డుకు మద్దతుగా కాకుండా.. కరోనా వైరస్ మహమ్మారి సమయంలో పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ)ని ఆర్థికంగా ఆదుకున్న ఇంగ్లాండ్ అండ్ వేల్స్ క్రికెట్ బోర్డు (ఈసీబీ)ను వెనకేసుకొచ్చాడు. అహ్మదాబాద్ నూతన స్టేడియంలో భారత్, ఇంగ్లాండ్ డే నైట్ టెస్టు రెండు రోజుల్లోనే ముగిసింది. రెండు రోజుల్లోనే ముగిసిన టెస్టు మ్యాచ్ పిచ్పై మాజీ క్రికెటర్లు మైకల్ వాన్, గౌతం గంభీర్, డెవిడ్ లాయిడ్, షోయబ్ అక్తర్, వివ్ రిచర్డ్స్లు ఇప్పటికే తమ వాదన వినిపించారు. ' టెస్టు మ్యాచ్ పిచ్ టెస్టు ప్రమాణాలకు అనుగుణంగానే ఉండాలి. జో రూట్ ఆరు ఓవర్లలో ఐదు వికెట్ల ప్రదర్శన చేసినప్పుడు.. అక్షర్ పటేల్, రవిచంద్రన్ అశ్విన్ ప్రదర్శనలను ఎలా పొగడాలి? భారత్ గొప్పగా ఆడిందా లేక పిచ్ అలా ప్రవర్తించిందా? ఆస్ట్రేలియాను ఓడించిన భారత్.. చెన్నైలో అద్భుతంగా పుంజుకున్నది. మొతెరాలో ఇటువంటి పిచ్ను తయారు చేస్తారని అనుకోలేదు. ఆస్ట్రేలియాపై విజయం సాధించినప్పుడు పొందిన సంతృప్తి.. మొతెరాలో కోహ్లిసేన పొందిందని నేను అనుకోవటం లేదు. ఇటువంటి పిచ్లను ప్రోత్సహించకూడదు. ఉపఖండానికి వచ్చినప్పుడు స్పిన్ సవాల్కు సిద్ధమై రావాలి. కానీ మరి ఇంతలా ర్యాంక్ టర్నర్లు సముచితం కాదు. ఐసీసీ మొతెరా పిచ్పై చర్యలు తీసుకోవాలి' అని ఇంజమామ్ ఉల్ హాక్ తన యూట్యూబ్ చానల్లో పేర్కొన్నాడు.